Friday, November 5, 2010

అర్దరాత్రి లక్ష్మీ పూజ ఉత్తమోత్తమం

శ్రీ వికృతి నామ సంవత్సర ఆశ్వీయుజ అమావాశ్య 5 డిసెంబర్ 2010 శుక్రవారం నాడు జరుపుకుంటున్నాం. చిత్త, స్వాతి నక్షత్రాలలోనే దీపావళి పర్వదినం వస్తూ వుంటుంది. స్వాతి కార్తెలో, స్వాతి నక్షత్రంలో, శుక్రవారం నాడు అరుదుగా దీపావళి వస్తూ వుంటుంది. కొంతమంది 6 వ తేదీ దీపావళి అనుకుంటున్నారు. ధర్మశాస్త్రాల నిర్ణయానుసారం 5 వ తేదే దీపావళి.

ఈరోజున జరిగే లక్షీ పూజ సమయం విషయంలో కొంతమంది ప్రసార మాధ్యమాలలో అర్దరాత్రి సమయం చేయకూడదని, సాయంకాలమే చేయవలెనని తెలియచేస్తున్నారు. వర్షక్రియా కౌముది, నిర్ణయ సింధు, భవిష్య పురాణం మొదలైన గ్రంధాల ప్రకారం సాయంకాల సమయంలో లక్ష్మీ పూజ ఆచరించిననూ తప్పు కాదు. కానీ అర్దరాత్రి సమయంలో లక్ష్మీ పూజ ఆచరించినచో ఉత్తమోత్తమం అని శాస్త్ర వచనం. ఈ రోజు రాత్రి కర్కాటక లగ్న సమయంలో 11 .30 నిమిషాల నుంచి 12 గంటల వరకు లక్ష్మీ పూజను ఆచరించి, జ్యేష్టా దేవినీ తరిమికొట్టండి. భవిష్య పురాణం ప్రకారం చేట మీద చప్పుల్లతోనూ, డక్కా వాయుద్యంతోనూ దరిద్ర దేవతను తరమాలని వచనం. లక్ష్మీ దేవి చంచల మనస్కురాలు. చంచలత్వానికి కారకుడు చంద్రుడు. కనుకనే జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఆశ్వీయుజ అమావాశ్య కర్కాటక లగ్నమే అర్దరాత్రి అవుతుంది. ఈ లగ్నానికి చతుర్ధం అనే తులా రాశి గృహస్థానం అవుతుంది. అలాగే ఏకాదశమైన తులారాశి లాభ స్థానమవుతుంది. ఈ రెండు రాశులకు అధిపతి శుక్రగ్రహము. బంగారు ఆభరణాలకు, అష్టైశ్వర్యములకు ప్రతీక శుక్రుడు. కనుక ఆ శుక్రుని అనుగ్రహం కూడా కలగటానికి కర్కాటక లగ్నాన్ని మనం స్వీకరించాలి.

నువ్వుల నూనెలో లక్ష్మీదేవి నివాసమని శాస్త్ర వచనం. కనుక ఈ రోజు నువ్వుల నూనె వెలిగించిన జ్యోతితో లక్ష్మీదేవిని ఆరాధిస్తూ, మధుర పదార్ధాన్నిఆ తల్లికి నివేదించాలి. ఈ మధుర పదార్ధాలలో ముఖ్యంగా తెల్ల నువ్వులు, బెల్లము, పాలు, నెయ్యి, బియ్యం అను వాటితో పొంగలిని (శ్వేత తిల ఘ్రుత పాయసాన్నం) నివేదన చేయండి. అర్దరాత్రి లక్ష్మీ దేవినీ ఆరాధించకూడదు అని చెప్పే శాస్త్ర వచనాలు లేవు. తెలిసీ తెలియని వారు ప్రసార మాధ్యమాల ద్వారా చెప్పటంతో చాలా మంది అయోమయంలో పడుతున్నారు.

కేదార వ్రతాన్ని నూతనంగా ఆచరించేవారు స్వాతి కార్తె స్వాతి నక్షత్ర అమావాశ్య రోజున వ్రతాన్ని ఆచరించాలి. ఈ విధంగా 3 లేక 4 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే స్వాతి కార్తె స్వాతి నక్షత్ర అమావాశ్య వస్తుంటుంది. ఎప్పటినుంచో కేదార వ్రతాన్ని ఆచరించేవాళ్ళు ఈరోజూ చేయవచ్చు అలాగే రేపూ ఆచరించవచ్చు. నిబంధన లేదు. దీపావళి రోజున మాష పాత్ర భక్షణము చేయవలెనని శాస్త్ర నిర్దేశము. మాష పత్రమనగా మినప ఆకు. నవధాన్యాలలో రాహు గ్రహ సంబంధిత ధాన్యమే మినుములు. దీపావళి రాహు నక్షత్రమైన స్వాతిలో వచ్చిన రోజున మినప ఆకులను తింటే శుక్ర లోపములు పూర్తిగా పోగలవని శాస్త్ర వచనం.

ఉగాదికి వేప పూవు పచ్చడి, శ్రీరామనవమి ముందు రోజు ఆశోకాష్టమికి ఆశోక చెట్టు మొగ్గలు, ఆషాడ మాసంలో మునగాకు కూర, ఏకాదశి వెళ్ళిన ద్వాదశి పారణంలో అవిశాకు కూర, అలాగే దీపావళిన మినపాకు సేవించవలెనని శాస్త్ర వచనాలు ఉన్నవి.

Saturday, October 23, 2010

అక్టోబర్ 29 శుక్రవారం బంగారం కొనవద్దు

అక్షయ తదియ రాగానే బంగారం కొనుగోలు చేయటం గత దశాబ్ద కాలంగా ఆనవాయితీ అయింది. అక్షయ తదియ రోజున బంగారం కొంటే, సంవత్సరం అంతా బంగారం ఎక్కువగా కొంటారనే ఉద్దేశ్యంతో వ్యాపార సంస్థలు భారీ ప్రకటనలతో చాటటం మనకి తెలిసిన విషయమే. ఆనాడు బంగారం కొని, తదుపరి రోజులలో అప్పుల పాలై, కొన్న బంగారంతో పాటు అంతకుముందున్న బంగారాన్ని కూడా అమ్మివేసిన వారు ఎంతో మంది వున్నారు. అక్షయ తదియ నాడు బంగారం కొనుగోలు చేయాలని చెప్పే శాస్త్ర ప్రమాణాలు లేనేలేవు. ఇది ఒక సెంటిమెంటల్ గోల్డ్ ఫెస్టివల్. కానీ ఇందుకు భిన్నంగా నేను చెప్పబోతున్న మరొక అంశం ఏమిటంటే.....

2010 అక్టోబర్ 29 శుక్రవారం రోజున బంగారము, పట్టు, సిల్క్ ఇతర వస్త్రాలు, గృహాలంకరణ వస్తువులు, సౌందర్యాలంకరణ సామగ్రి, టెలివిజన్, సెల్ ఫోన్, కంప్యూటర్ తదితర ఎలక్ట్రానిక్ ఉపకరణములను కొనుగోలు చేయకండి. ఆరోజు కొనుగోలు చేయాలనుకున్నవారు ముందు రోజైన 28 గురువారం లేక తరువాత రోజు 30 శనివారం గానీ కొనుగోలు చేయండి. 29 శుక్రవారం మాత్రం వద్దు.

అక్షయ తదియ నాడు కొనుగోలు చేయమని చెప్పే శాస్త్ర ప్రమాణాలు లేవు కదా ! మరి 29 కొనుగోలు వద్దని చెప్పే కారణాలు ఏమిటని అనుకోవచ్చు. ఆశ్వీజ పూర్ణిమ నుంచి అమావాశ్య వరకు కన్యా, తుల, వృశ్చిక, ధను రాశులపై షడ్గ్రహ, సప్తగ్రహ ఆచ్చాదనలుండి, శుక్రుడికి మౌద్యమి సంభవించిన తదుపరి వచ్చే మొదటి శుక్రవారం నాడే ఓ గ్రహస్థితి వుంది. అదేమంటే అసలే వక్ర శుక్రుడు. దానికి తోడు మౌద్యమి. పైగా రాహు నక్షత్రమైన స్వాతిలో ఒకే బిందువులో నీచ రవితో శుక్ర కలయిక, కించిత్ వైరమున్న వక్ర గురువు యొక్క దిన నక్షత్రం పునర్వషు... ఇన్నింటి కారణంగా శుక్ర గ్రహ సంబంధమైనవి కొనుగోలు చేయకూడదు. కొనుగోలు చేస్తే సమస్యలు రాగల అవకాశాలు చాలా వున్నవి. కనుక జ్యోతిశ్శాస్త్రంపై విశ్వాసం వున్నవారు దయచేసి కొనుగోలు చేయకండి. బంగారం ధర తగ్గితే కొందామని కూడా అనుకోకండి.

Tuesday, September 28, 2010

కుజదోషంపై నిజానిజాలు - 2

కుజదోషం అని పండితులు చెప్పగానే వధూవరుల తల్లితండ్రులు కుమిలి కుమిలి పోతుంటారు. అలా బాధపడే వారందరూ సంతోషంగా ఉండాలనే ఉద్దేశ్యంతోనే..."కుజదోషంపై నిజానిజాలు" రెండవ భాగమును ఇవ్వటము జరిగింది

జాతకాలలో కుజగ్రహం జన్మలగ్నము నుంచి 2, 4, 7, 8, స్థానాలలో వుంటే కుజదోషముండునని మొదటి భాగం లో తెలుసుకున్నాము. మరి ఈ కుజదోషం కొందరికి వర్తించదని శాస్త్రాలు చెబుతున్నాయి. ఎవరెవరికి ఈ కుజదోషం వర్తించదో ముందు తెలుసుకుందాం.

జ్యోతిశ్శాస్త్రం ప్రకారం కుజగ్రహం తన నీచస్థానమైన కర్కాటక రాశిలో వుండి వుంటే, అట్టివారికి కుజదోషం వర్తించదని భావం. అలాగే కుజుడికి తన స్వక్షేత్రములైన మేష వృశ్చిక రాశులలో గానీ, ఆయా లగ్నాలలో గానీ జన్మించి వుంటే కుజదోషం వర్తించదు. కుజగ్రహానికి మిత్రులైన రవి గురుల రాశులైన సింహ, ధనుస్సు, మీన రాశులలో గానీ, లగ్నాలలో గానే జన్మించివుంటే కుజదోషము వర్తించదు. కుజగ్రహానికి ఉచ్చస్థానమైన మకరరాశి యందు లేక మకరలగ్న మందు జన్మించిన వారికి కుజదోషము వర్తించదు.

మేష, వృశ్చిక, కర్కాటక, సింహ, ధనుస్సు, మకర, మీన రాశులలో గానీ, లగ్నాలలో జన్మించిన వారికి కుజదోషం భంగమగునని, భయపడవలసిన అవసరం లేదని........ పైన పేర్కొన్న పేరా సారాంశం. మొత్తం 12 రాశులలో 7 రాశుల జాతకులు పోనూ..... మిగిలిన అయిదు రాశుల జాతకులకు కుజదోషం వుంటే భంగం కాదనే కదా సారాంశం. మరి ఆ రాశులు ఏమిటంటే... వృషభ, మిధున, కన్య, తుల, కుంభ రాశులు... మరి ఈ రాశులలో మాత్రమే గాక మొత్తం 12 రాశులలో ఏ రాశివారికైన కుజదోషం వుండి వుంటే, వారి జాతకంలో కుజుడిని, గురుగ్రహం విశేష దృష్టులతో చూస్తూవుండిననూ కుజదోషం వర్తించదనే శాస్త్ర నిర్ణయములున్నవి.

పై నిర్ణయములు గాక రెండవ స్థానంలో కుజుడు దోషరూపంలో వుండి... వారు మిధున కన్యారాశులలో గానీ, మిధున కన్యాలగ్నాలలోవుండిన కుజదోషం వర్తించదనే శాస్త్రప్రమాణమున్నది. అనగా 4, 7, 8 స్థానాల దోషం భంగపడదు. కేవలం రెండవ స్థాన దోషం భంగమగునని ఉద్దేశ్యం. మరి ఈ విషయం 2 వ స్థాన దోషం వారికి ఊరట నిచ్చే మాట.

నాల్గవ స్థాన కుజదోషం వున్నవారు మేష వృశ్చిక రాశులలో గానీ, మేష వృశ్చిక లగ్నాలలో గానీ జన్మించి వుంటే కుజదోషం వర్తించదు. అంటే 2, 7, 8 స్థానాల లోపం ఉంటుందని భావం. అలాగే సప్తమ స్థానంలో కుజదోషం వున్నవారు మకర కర్కాటక రాశులలో గానీ, మకర కర్కాటక లగ్నాల యందు గానీ జన్మించి వుంటే 7 వ స్థాన కుజదోషం భంగమగునని, రెండు, నాలుగు, ఎనిమిది స్థానాలలో భంగం కాదని శాస్త్ర నిర్దేశం.

ఇక అష్టమ స్థాన కుజదోషం వున్నవారు ..... ధను, మీన రాశులలో లేక లగ్నాలలో జన్మించి వుంటే.... వారికి అష్టమ స్థాన కుజదోషం వర్తించదు. ఈ కుజదోషమనేది జన్మ లగ్నం నుంచే వుంటుంది. జనం లగ్నం నుంచే లెక్కించాలి. చంద్రుడు ఉన్న రాశి నుంచి, శుక్రుడు ఉన్న రాశి నుంచి, కుజ దోష స్థానాన్ని చూడవలసిన అవసరం లేదు. ఆ విధంగా చూస్తే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి జన్మ లగ్నం నుంచి, చంద్రుడి నుంచి శుక్రుడి నుంచి కుజదోషం వుండి తీరుతుంది. ఇది సరియిన సక్రమమైన వివరం కాదు. కేవలం జన్మ లగ్నం నుంచి మాత్రమే కుజదోషాన్ని లెక్కించాలి. అశ్విని, మృగశిర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, ఉత్తర, స్వాతి, అనూరాధ, పూర్వాషాడ, ఉత్తరాషాడ, శ్రవణం, ఉత్తరాభాద్ర, రేవతి అను పదమూడు నక్షత్రములలో జన్మించిన వారికి కుజగ్రహం... ఏ స్థానంలో ఉన్ననూ.. కుజదోషం ఉండదని శాస్త్ర నిర్దేశము. ఇరవై ఏడు నక్షత్రాలలో జన్మించిన ఏ ఒక్కరూ కుజదోషం గురించి బెంగ పడాల్సిన అవసరం లేనేలేదు. కుజదోషం ఉన్ననూ.. దైర్యంగా వుండండి... ఎలా ఉంటాము దైర్యంగా ? అని అనుకుంటున్నారా.... నిజమే మరి అసలుసిసలైన వాస్తవాలను తదుపరి కుజదోషంపై నిజానిజాలు - 3 అను పోస్టింగ్ కొరకు వేచి చూడండి... నగ్న సత్యాలను తెలుసుకోండి.

Tuesday, September 21, 2010

కుజదోషంపై నిజానిజాలు - 1


వివాహ ప్రయత్నాలు ఆలశ్యమవుతున్నా, వివాహమైన తదుపరి సమస్యలు తలెత్తుతున్నా, అందరికీ వెంటనే గోచరించేది కుజదోషం. కుజదోషం వున్నవారు కుజదోషం వున్న వారినే వివాహమాడాలని అంటాము. మరి ఈ కుజదోషం ఎవరెవరికి వుంటుంది ? నిజంగా కుజదోషమున్నవారికి లేదని, కోజదోషం లేనివారికి వున్నదని చెప్పే పండితులు కూడా ఈమధ్యకాలంలో సిద్ధమవుతున్నారు. ఏ చిన్నపాటి సమస్యకైనా, ఓ పండితుడిని దంపతులు గానీ, దంపతుల తల్లితండ్రులు గానీ విచారించగానే, ముందుగా ఆ పండితుల వారు సెలవిచ్చేది కుజదోషం వుందని లేక కాలసర్పదోషముందని, ఈ కుజదోషం వలన భార్య భర్తలలో ఒకరికి మరణం త్వరలో వుందని, భయభ్రాంతులయ్యే సంభాషణలతో పండితుడు చెప్పగానే, ఆ మాటలు విన్న దంపతులకో లేక వారి తల్లితండ్రులకో ప్రాణాలు అప్పుడే గాలిలో కలిసిపోయే విధంగా వుంటాయి.


ఈ కుజదోషం గురించిన సంపూర్ణ చరిత్రను గురించి తెలుసుకుంటే ఎవరు... ఏ మాట చెప్పినా భయపడాల్సిన అవసరము వుండదు. రాశి చక్రములో మేష, వృశ్చిక రాశులకు అధిపతి కుజుడు. అగ్నితేజో సంపన్నుడు. ఇట్టి కుజుడు జాతక చక్రములో జన్మ లగ్నము నుంచి 2, 4, 7, 8, 12 స్థానాలలో వుంటే కుజదోషం వుందని భావం. మరి 2 వ స్థానంలో కుజుడు వుంటే... కుటుంబ ధన సంపత్తులు కొన్ని కొన్ని కారణాల వలన హరించుకుపోతాయని భావం. ఇక 4 వ స్థానంలో కుజుడు వుంటే గృహలక్ష్మి భాగ్యములు దెబ్బతినటం, వాహన సంభందిత ప్రమాదములు, ఆరోగ్య లోపములు ఏర్పడునని గ్రహించాలి. 7 వ స్థానంలో కుజుడు వుంటే కళత్ర సుఖ భోగ భాగ్యములు తగ్గిపోవునని, భార్యాభర్తల మధ్య భేదాభిప్రాయములు ప్రారంభమగునని భావం. 8 వ స్థానంలో కుజుడుంటే ఆయుర్భాగ్యం తగ్గునని, పూర్ణ ఆయుర్దాయమునకు దూరమని భావం. 12 వ స్థానంలో కుజుడు వుంటే మోక్షలక్ష్మీ భాగ్యములు అంతరించి పోతాయని విశ్వసించాలి. కుజుడు ఆయా స్థానాలలో వుండిన పురుషునికి భార్య వియోగము, భార్యకు భర్త వియోగము కల్గును.


ఈ వియోగం ఎప్పుడు కలుగుతుంది ? వివాహం కాగానేనా ? లేక కొన్ని సంవత్సరాలు దాంపత్యం జరిగిన తదుపరా ? ఖచ్చితమైన సమాధానం ఏమిటంటే... ఏ జాతకులైన కుజదోషం వుంటే.... దాని ప్రభావం, కుజ మహాదశ జరిగే సమయంలోనే సమస్యలు వస్తాయి. ముందు రానే రావు. ఈ నగ్న సత్యాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా వుందని మొట్ట మొదట గ్రహించాలి. ఇక 27 నక్షత్రాలలో జన్మించిన వారి వివరాలలోకి వెడితే అందరికీ తెలియని ఆసక్తికర అంశాలెన్నో రేపటి రెండవ భాగంలో తెలుసుకుందాము.

Monday, September 20, 2010

చీకటిలేని రాత్రులతో గురుగ్రహ సందర్శనంతో మహాలయ పక్ష ప్రారంభం

ప్రస్తుతం గురుగ్రహం మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. ప్రతి 13 మాసాలకొకసారి సూర్యునికి గురువుకి మధ్యలోకి భూమి వస్తుంది. ఈ పరంపరలో భూమికి గురువు చేరువలో వుంటే...... గురుగ్రహ దర్శనం కల్గుతుంది. వచ్చిన ప్రతిసారి దర్శనం కల్గవచ్చు, కలుగపోవచ్చు. 1967 లో గురుగ్రహం భూమికి చాలా దగ్గరగా రావటం, తిరిగి 2010 సెప్టెంబర్ 20 నుంచి గురుగ్రహానికి, సూర్యునికి మధ్యలోకి భూమి వచ్చి, గురువు భూమికి చేరువ కావటంచే ప్రకాశవంతమైన నక్షత్రంలాగా గురుగ్రహం కనువిందు చేయబోతున్నది.

సెప్టెంబర్ 20 అనగా నేటి రాత్రి నుంచే సూర్యుడు పశ్చిమాన అస్తమించగానే...... గురువు తూర్పు దిశలో ఉదయించటం, శుక్రగ్రహం కంటే దేదీప్యమాన వెలుగుతో దర్శనం ఇచ్చి....... తెల్లవారేసరికి గురువు పడమరలోకి వెళ్ళటం........ సూర్యుడు తూర్పున ఉదయించటం జరగనుంది. ఈప్రకారంగా గురువు సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ మధ్య వరకు భూమి మీద ప్రజలందరికీ దర్శన భాగ్యాన్ని కలిగించబోతున్నాడు. మరొక విశేషం ఏమనగా సెప్టెంబర్ 23 న భాద్రపద పూర్ణిమ రోజు రాత్రి వరుసగా 3 రోజులు చీకటిలేని రాత్రులు కావటం ఒక విశేషమైతే, మీనరాశిలో చంద్రుని ప్రక్కనే గురువును కూడా దర్శించబోతున్నాము.

23 వ తేది భాద్రపద పూర్ణిమ గురువారం కావటం, ఆరోజు రాత్రి నుంచే వరుసగా మూడు రోజులు వరుసగా చీకటి లేకపోవటం విశేషం. ఏలయనగా 23 సాయంత్రం సూర్యుడు అస్తమించకముందే పూర్ణ చంద్రుడు ఉదయించటం, మరునాడు సూర్యోదయం తదుపరి పూర్ణ చంద్రుడు అస్తమించటం జరుగుతుంది. ఆవిధంగా 23, 24, 25 తేదీలలో పగటి సమయంలో సూర్యవెలుగుతో, రాత్రి సమయంలో చంద్రకాంతితో మహాలయ పక్షములు ప్రారంభం కానున్నవి.

ఈ సెప్టెంబర్ 20 నుంచి దర్శనం ఇచ్చే గురువు, తిరిగి 2022 లో మనకు దర్శనం ఇస్తాడు. ఈ గురు దర్శన సమయంలో లలితా సహస్ర నామ స్తోత్రంలో 129 వ శ్లోకం... "అదృశ్యా దృశ్య రహితా విజ్జ్ఞాత్రి వేద్యవర్జితా" అను పంక్తిని చదివి, ఆపైన గురు శ్లోకమైన "దేవానాంచ ఋషీణాంచ గురుకాంచన సన్నిభం బుద్దిమంతం త్రిలోకేశం తం నమామి బృహసృతిం" అను శ్లోకాన్ని ఉచ్చరించి, ఆ పిదప శ్రీ దత్తాత్రేయిడుని ధ్యానం చేయండి.

మరి ముందుగా శ్రీ లలితాదేవిని ఎందుకు స్మరించాలి అని అనుకుంటారేమో ! ఇంద్రియములకు గోచారము కానిది అదృశ్యము. దృశ్యమనగా జగత్తునందలి సర్వవస్తు సముదాయము. చూస్తూ కూడా బయట వస్తువుని చూడని స్థితిని దృశ్యరహిత స్థితి అంటారు. ఏదైతే తెలుసుకోవాలనుకుంటామో దానిని వేద్యమైనది అంటాము. ఇక తెలుసుకోవాల్సింది ఏమిలేదు అనుకుంటే... దానిని వేద్యవర్జిత అంటారు... ఎవరైతే సర్వము తెలిసి ఉంటారో, అలాంటి విజ్ఞానమూర్తులనే విజ్ఞాత్రులు అంటారు.

గనుక లలితాదేవి తనకు బయటా లోపల అనుబేధం లేక సర్వము తానగుటచే తనకు తెలియవలసినదేమీ లేదు. అందుచే ఆమె వేద్యవర్జిత. అట్టి విజ్ఞానమూర్తి గనుకనే ఆమె విజ్ఞాత్రి అనబడింది.... ఇటువంటి దేవతను, ఆయా నామాల అనుష్ఠానం వలన, ఇంతవరకు అదృశ్యంగావుండి, ఇప్పుడు దర్శనం ఇచ్చే గురువుని దర్శించటానికి తగిన సమర్ధతను, శక్తిని మనకు అనుగ్రహం కల్గటానికే... ఆ తల్లిని ముందు.. ఆయా నామాలతో ధ్యానించుకుందాం.

ధ్యానించండి... అనుగ్రహాన్ని పొందండి..

Thursday, September 9, 2010

గణేశ చతుర్ధిన వినువీధిలో అరుదైన తారా శాశాంకం


విఘ్నాలను తొలగించి, సకల శుభాలను అందించే గణనాధుడిని భక్తి ప్రపత్తులతో అర్పించే భాద్రపద శు. చవితి "గణేశ చతుర్ధీ" పర్వదినాన రాత్రి సమయములలో చంద్ర దర్శనము చేసిన వారాలకు నిందలు తప్పవని పురాణ వచనము. కానీ గణపతి పూజను చక్కగా ఆచరించుకొని, వ్రతకధను విని, అక్షతలను శిరస్సు మీద ఉంచుకొన్న వారు చంద్ర దర్శనము చేసినచో దోషము కాదు. నిందలు వుండవు. కొతమంది వ్రతం ఆచరించి, కధ విని, అక్షతలు శిరస్సున వేసుకున్ననూ..... చంద్ర దర్శనం చేయరు. ఎందుకంటే....... నిందలు పడతాయనే భయం వెంటాడుతుంది. ఇది మన అందరికీ తెలిసిన విషయమే.

కానీ శ్రీ వికృతి నామ సంవత్సరంలో భాద్రపద శు.చవితి శనివారం 11 సెప్టెంబర్ 2010 వినువీధిలో మహాద్భుతమైన అపురూప అరుదైన దృశ్యం చూడబోతున్నాము. అదే తారా శాశాంకుల సయ్యాట, దోబూచులాట.... నెలవంక పక్కనే ధగధగమెరిసే నక్షత్రం కనువిందుచేయనుంది. ఇది వినాయక చతుర్ధి పర్వదినం నాడే దర్శనం అవుతుంది. ప్రతి 8 సంవత్సరములకొకసారి గణేశ చతుర్ధిన సాయంకాల సమయములలో శుక్ర గ్రహం, చంద్రుడు స్వాతి నక్షత్రంలో కలిసిన కారణంగా, నెలవంక ప్రక్కన శుక్ర నక్షత్రం మిలమిల మెరుస్తూ వుంటుంది. గతంలో 2002, 1996, 1988, 1980, సంవత్సరాలలో దర్శనం అయింది.

మరి ఈ వినాయక పర్వదినం రోజున హైదరాబాద్ నగరంలో చంద్రుడు రాత్రి 6 గంటల 57 నిమిషాలకు అస్తమిస్తాడు. సూర్యుడు 6 గంటల 5 నిమిషాలకు అస్తమిస్తాడు. ఈ మధ్యకాలంలో చవితి చంద్రుడు శుక్రగ్రహం పక్కనే ఉంటాడు. దాదాపు 2 ఘడియలు ఈ దృశ్యాన్ని తిలకించవచ్చు. భక్తి ప్రపత్తులతో సేవించవచ్చు. ఇతర మతస్తులు ఇష్ట దైవంగా కూడా భావిస్తారు. మన గణనాయకుని జన్మదినాన వినాయక వీధిలో ఏర్పడే తారా శాశాంకాన్ని కనులవిందుగా చూసి తరించండి. తిరిగి రాబోయే విళంబి నామ సంవత్సర భాద్రపద శు.చవితి గురువారం 2018 సెప్టెంబర్ 13 న వచ్చే గణేశ చతుర్ధి రోజున, ఆపై రాబోయే పరాభవ నామ సంవత్సర భాద్రపద శు.చవితి మంగళవారం 2026 సెప్టెంబర్ 15 న వచ్చే గణేశ చతుర్ధి రోజున శుక్రగ్రహం, చంద్రుడు స్వాతి నక్షత్రంలో కలిసినందున కనువిందుచేసే తారా శాశాంకుల సయ్యాట వుంటుంది.

ఆకాశంలో ఆసమయంలో మేఘాలు కమ్ముకోనకుండావుంటే అదృష్టమే మరి.... ఇంతటి అరుదైన, అద్భుత, అదృష్ట దృశ్యాన్ని తిలకించే మహాభాగ్యం ఎంతమందికి వుంటుందో వేచి చూడాలి మరి.

Sunday, June 13, 2010

భూకంప తేదిని సంవత్సరం ముందుగానే తెలియచేశాం

సముద్రంలో ఏర్పడే అల్పపీడనాలు, వాయుగుండాలు తద్వారా తుఫానుల వివరాలను వాతావరణశాఖ వారు ఒక వారం రోజుల ముందుగా తెలియచేస్తుంటారు. కాని భూకంపములను మాత్రం ఒక సెకను ముందుగా కూడా తెలియచేయలేదు. ఇటువంటి ప్రకృతి వైపరీత్యములను జ్యోతిష్యరీత్యా తెలుసుకోవచ్చు.

ఈ విషయంలో మా కాలచక్ర పంచాంగం మరియు గ్రహభుమి పంచాంగాలలో ప్రకృతి వైపరీత్యములను ప్రకటించటం జరిగింది. హైదరాబాద్ లో పలు టీవీ చానల్స్ లో హేతువాదులతో భూకంప సమయాలను తెలపటం జరిగింది. వికృతి నామ సంవత్సర కాలచక్ర పంచాంగంలో 41 పేజిలో 2 పేరాలో ఈ రోజు సంభవించిన వివరాలను ఇచ్చాము. అలాగే గ్రహభూమి బ్లాగ్ లో కూడా 2010 మార్చ్ నెల 19 నాటి శ్రీ వికృతి నామ సంవత్సర లఘు ఫలితాలు - 2లో 8వ పేరాలో ముందుగానే తెలియచేయటం జరిగింది. ఇప్పటికైనా హేతువాదులు సిగ్గుతో తలవంచుకొనవలసిన అవసరం వుందని తెలియచేస్తున్నాను. - శ్రీనివాస గార్గేయ

Friday, June 11, 2010

2013 లో భయంకర సౌర తుఫాను రానుందా ?

ఇప్పటివరకు 2012 డిసెంబర్ .21 వ తేది ప్రపంచం అంతా వినాశానమవుతుందని, యుగాన్తమవుతుందని కల్ల బొల్లి కబుర్లు ఇంటర్నెట్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ప్రజలందరినీ భయబ్రాంతులను చేసాయి. ఇప్పుడు 2013 లో భారీ సౌర తుఫానుతో భూమి స్తంభించి కొత్త ఉపద్రవం ముందుకు రాబోతుందని నాసా వారి తాజా నివేదిక వెల్లడించింది. సూర్యుడిలో భారి ఎత్తున ఎగిసిపడే ఈ సౌర తుఫాను, వినాశకరమైన రేడియో ధార్మికతను, విద్యుత్తుతో నిండిన శకలాలను భారీ మొత్తంలో అంతరిక్షంలోకి వెదజల్లుతుందని, ఇవి అయస్కాంత క్షేత్రాలతో అనుసంధానమై పని చేసే ఉపగ్రహాలకు అంతరిక్ష కేంద్రాలకు అడ్డంకులు సృష్టించనున్నవని నాసా తెలిపింది. గతంలో 1859 లో భూమి మీద కల్లోలమే సృష్టించింది. ఈ ఊహే ప్రస్తుతం శాస్త్రవేత్తలను కలవరపరుస్తోంది.

శాస్త్రవేత్తలు చెప్పినట్లు అలా జరిగితే ప్రపంచ వ్యాప్తంగా సెల్ ఫోన్లు, ఇంటర్నెట్, జీపీఎస్ వ్యవస్థ వంటి అధునాతన సమాచార వ్యవస్థ అంతా చిన్నాభిన్నం కానుంది. ఉపగ్రహాల సమాచార వ్యవస్థతో ముడిపడే సకలమైన అధునాతన సౌకర్యాలన్నీ మట్టికొట్టుకుపోతాయని, దీనితో బ్యాంకు సేవలు, విమాన ప్రయాణాలు, అత్యవసర రేడియో సమాచార వ్యవస్థ సకలం దెబ్బతింటాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఒక్కసారిగా ఇలాంటి సమాచార వ్యవస్థ అంతా ఉలుకు పలుకు లేకుండా పోతే ఎలా ? .. 2013 లో భారీ సౌర జ్వాల మూలంగా భూమయస్కాంత తుఫాను అల్లకల్లోలం చేయబోతోందా ? అగ్ని పర్వతాల పగుళ్లతో వినాశకరమా ? భూతాపంతో ప్రపంచ విద్వంసమా ? ఇవన్ని మన ముందు వున్న ప్రశ్నలు.

ఇక జ్యోతిశ్శాస్త్రరీత్యా పరిశీలిస్తే రాబోయే 2013 లో శ్రీ విజయ నామ సంవత్సర చైత్ర మాసం 11 ఏప్రిల్ 2013 న ఉగాది తో ప్రారంభం కానుంది. ఈ చైత్రమాసంలో పూర్ణిమకు పాక్షిక సూర్య గ్రహణము, అమావాస్యకు కంకణ సూర్యగ్రహణము సంభవించనుంది. ఇందులో మొదటగా ఏప్రిల్ 25 పూర్ణిమ రోజున రాత్రి భారత కాలమానం ప్రకారం ఒంటి గంట ఇరవై నాలుగు నిమిషాలకు చంద్ర గ్రహణం ప్రారంభమై, కేవలం ఇరవై ఏడు నిమిషాలతో ఒంటి గంట యాబై ఒక్క నిమిషాలకు పాక్షిక గ్రహణంగా ముగియనుంది. తిరిగి మే 10 చైత్ర అమావాశ్య శుక్రవారం నాడు ఆరు నిమిషాల మూడు సెకన్లపాటు స్థిరంగా వుండే కంకణ సూర్యగ్రహణం ఏర్పడనుంది.

ఈ రెండు గ్రహణాల మధ్యలో 29 ఏప్రిల్ 2013 విజయ నామ సంవత్సర చైత్ర బహుళ చవితి సోమవారం నాడు కేతు గ్రహ నక్షత్రమైన మూల నుంచి విజయ నామ సంవత్సర బహుళ దశమి శనివారం రాహు గ్రహ నక్షత్రమైన శతభిషం వరకు ఆరు రోజులపాటు మేష రాశిలో సూర్యుడు ఉచ్చ స్థానంలో ఉంటూ.. అదే రాశిలో మరో నాలుగు గ్రహాలతో పంచ గ్రహ కూటమి ఏర్పడటం, ఈ గ్రహ కూటమికి ఖచ్చిత ఎదురు స్థానంలో ఉచ్చ స్థితితో తులారాశిలో శని గ్రహం రాహువుతో కలసి ఉండుట ఓ ప్రపంచారిష్టం.

రాహుగ్రస్త చంద్ర గ్రహణము ఉచ్చ శనితో వుండి..... కేతు గ్రస్త కంకణ గ్రహణం ఉచ్చ సూర్యునికి సంభవించటం... కేతు నక్షత్రమైన మూల నుంచి రాహు నక్షత్రమైన శతభిషం వరకు పంచ గ్రహ కూటమి రెండు గ్రహణాల మధ్య ఏర్పడటం, ఉచ్చ శని దృష్టి , ఉచ్చ స్థానంలో వున్న సూర్యునిపై స్వక్షేత్ర గ్రహమైన కుజునిపై ఉండటము .... పరస్పర తీక్షణ వీక్షనలతో గ్రహ స్థితులు ఉండటము ఒక అరిష్టాన్ని తెలియజేస్తున్నాయి.

Wednesday, June 9, 2010

వరుసగా కూలుతున్న ధ్వజ స్తంభాలు అరిష్టానికి సంకేతాలా ?

మే ఇరవై ఆరవ తేదీన శ్రీ కాళహస్తి గాలి గోపురం కూలిపోవటం తదుపరి ఆంద్ర రాష్ట్రానికి అరిష్టాలుగా ధ్వజ స్తంభాలు శివాలయాలలో నేలకొరిగిపోతున్నాయి. లయకారకుడైన ముక్కంటికి కోపం వచ్చిందా ? ఆంద్ర రాష్ట్రానికి రాబోయే రోజులలో సమస్యలు ఎదురుకానున్నాయా? కేవలం శివాలయాలలోనే ధ్వజాలు ఎందుకు పడిపోతున్నాయి ? గుంటూరు జిల్లా ఎడ్లపాడు గ్రామంలో శివాలయంలోని నంది స్పష్టంగా కంట తడిపెట్టడం రెండు రోజుల క్రితం మీడియాలో విసువల్స్ చూసిన వారికి బాగా తెలిసి వుంటుంది.

జూన్ మూడవ తేది వరంగల్ జ్కిల్లాలో ఓ ధ్వజ స్థంభం ఒరిగిపోవటం, ఆపై రెండు రోజుల్లకు విశాఖ జిల్లాలో మరో ధ్వజం పడిపోవటం, ఈరోజు ఏకంగా మూడు ధ్వజాలు నేలకొరగటం జరిగింది. ఆశ్చర్యమేమిటంటే ప్రకాశం జిల్లాలో ఈరోజే ప్రతిష్ట చేస్తున్న ఓ రాతి ధ్వజ స్థంభం అనుకోకుండానే రెండు ముక్కలు కావటం ప్రజల మనసులను కలవర పెడుతున్నాయి. మే ఇరవై ఆరు నుంచి పదిహేను రోజుల వ్యవధిలో ఇలా ధ్వజాలు పడిపోవటం ఆంద్ర రాష్ట్రానికి మహా అరిష్టమనేది మరో రకంగా చెప్పనవసరం లేదు.

మే తొమ్మిది 2010 పూర్వాభాద్ర అనే గురు నక్షత్రంతో మొదలై మే ఇరవై ఆరు విశాఖ అనే గురు నక్షత్రం వరకు మీనం అనే జల రాశి నుంచి కర్కాటకం అనే జల రాశి వరకు అయిదు రాశులలో అయుదు గ్రహాలూ వుండి, డిగ్రీలలో చూసినప్పుడు కుజును యొక్క ఆచ్చాదన గురువుపై వుండటం ఓ అరిష్టమనే సంగతి భక్తి టీవీలో ఇరవై అయుదు రోజుల క్రితమే చెప్పటం జరిగినది. ఇకపై రాబోయే రోజులలో ఎలాంటి విపత్తులు రాకుండా ప్రజలందరూ శుభిక్షంగా ఉండటానికి, లయకారకుడైన శుభంకరుడైన ఆ శంభోశంకరుడిని ఆనంద తాండవ మొనర్చే విధంగా ఉండాలంటే ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర దేవదాయ ధర్మదాయ శాఖవారు శివాలయాలలో జరిగే స్వామివారికి అపచారాలు జరగకుండా ఉపచారాలు జరిగేవిధంగా తక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. లేనిచో ఈ అరిష్టాలు పెరిగి మొదటికే మోసం రాగలదు. తస్మాత్ జాగ్రత్త

Monday, June 7, 2010

భద్రాద్రి రాముడు జల సమాధి కానున్నాడా ?

ఆంద్ర రాష్ట్రంలో భద్రాచలంలో నాలుగు శతాబ్దాల క్రితం రామదాసుచే నిర్మితమైన సీతారామ స్వామి ఆలయం భారతదేశంలోనే గుర్తుంపుపొంది చరిత్ర ప్రసిద్ధినొందింది. భద్రాచల చరిత్ర భవిష్య కాలంలో కాల గర్భంలో కలిసే అవకాశాలు అత్యధికంగా వున్నాయి. గోదావరి నదిపై నిర్మితమయ్యే పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేసుకుంటే భద్రాచల రామాలయం పూర్తిగా జల సమాధి కానున్నది. రాబోయే రోజులలో చైత్ర మాసంలో సీతారామ కళ్యాణాలు ఇక జరగవేమో అనే భయం అందరియందు ఉత్పన్నమవుతున్నది. ఖమ్మం జిల్లాలో మూడు వందల గ్రామాలు నీటి ముంపునకు గురికాబోతున్నాయి. లక్ష మంది ప్రజలు నిర్వాసితులు కాబోతున్నారు.

ప్రభుత్వం తరఫున ప్రాజెక్ట్ కి సంబంధించిన నిపుణులు ఇచ్చిన నివేదికల ప్రకారం, భద్రాచల రామాలయం పూర్తిగా జల సమాధి కాబోతున్నది అనే వార్త విని ప్రజలేవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. మరి ఈ పోలవరం ప్రాజెక్ట్ అవసరమా, బద్రాద్రి రామాలయం ముఖ్యమా అనే చర్చలు దేశ వ్యాప్తంగా జరుగుతున్నాయి. పోలవరం ప్రాజెక్ట్ వలన ఆంద్రప్రదేశ్లో నాలుగు జిల్లాలకు పూర్తిగా మంచి నీటి సౌకర్యం ఏర్పడటమే కాకుండా, ఏడు లక్షల ఎకరాలకు నీరు అందనుంది. మరి బద్రాద్రి రాముడు ముంపునకు గురి కాకుండా వుంటే... నాలుగు జిల్లాలకు నీటి సౌకర్యంతో పాటు ఏడు లక్షల ఎకరాలకు.. ఆయన కరుణతో నీరు అందించాగలడా అని వితండ వాదం చేసే వారు కూడా వున్నారు.

ఇంతకీ బద్రాద్రి రామాలయానికి ఈ ముప్పు తప్పుతుందా ? ఎంతో మంది న్యాయవాదులు సర్వోన్నుత న్యాయస్థానానికి వెళ్లి భద్రాద్రి రామున్ని ముంచుకోస్తోన్న ముప్పు నుంచి తప్పించాలని ప్రయత్నాలు చేస్తున్నారు.... వేచి చూడాలి మరి... ధర్మ ప్రభువుగా వున్న బద్రాచల రామునికి 1999 నుంచి అధర్మంగా వివాదంతో కళ్యాణాలు చేయటం మొదలుపెట్టారు ఆలయ అధికారులు మరియు పండితులు. ఈ విధమైన కళ్యాణాలే 26 మార్చ్ 1999 న మొదటిసారి, రెండవసారి 13.4.2000 న, మూడవసారి 4.4.2009 న ధర్మ శాస్త్రాలకు వ్యతిరేకంగా స్వామివారికి అధర్మంగా జరిగాయి. ఇప్పటికైనా కొంతమంది పీటాదిపతులు, ఆలయ అర్చకులు ఉన్నతాధికారులు మేల్కొనాలి.

*గమనిక : బద్రాచలంలో పాంచరాత్ర ఆగమ పండితుల నిర్వాకమే, ఆ స్వామి అరిష్టానికి హేతువు అవుతున్నది. ఈ విషయంలో పూర్తి నగ్న సత్యాలతో తదుపరి పోస్టింగ్ లో చుడండి.

Sunday, June 6, 2010

శ్రీ కాళహస్తి మహారిష్టానికి మహా శాంతి

శ్రీకాళహస్తి కి వందల ఏళ్ళ పాటు చిహ్నంగా అలరారిన గాలి గోపురం 2010 26 మే రాత్రి 7గంటల 50నిమిషాలకు శిధిల రాశిగా మారింది. ప్రపంచ వ్యాప్తంగా భక్తులను కలచి వేస్తోంది. ఆలయ అధికారుల నిర్లక్ష్యం లేదంటూ దేవదయ ధర్మదయ శాఖా మంత్రి గాదె వెంకట రెడ్డి తన అసమర్ధత చాటుకొన్నారు.
గాలి గోపురం క్రింద దాదాపు 270కోతులు, మరో ఇద్దరు మృతి చెందినట్లు ధ్రువీకరించారు. ఓ చిన్న కోతి పిల్ల మాత్రం బతికి బయట పడగలిగింది. గాలి గోపురం కూలడం ఒక అరిష్టానికి ఓ అంచనా. దాని క్రింద కోతులు మృతి చెందటం మరో అరిష్టం. కోతుల మృత కళేబరాలు, మానవ మృతదేహాలు శిధిలాల క్రింద వుండగా, గర్భాలయంలో స్వామి వారికి పూజలు చేయటం మహా అరిష్టం. దీనిపై ప్రభుత్వం గానీ, ఆలయ పాలక మండలి గానీ పెదవి విప్పకపోవడం శోచనీయం.
2009 సంవత్సరం జూన్ 22న ముక్కంటి ఈశ్వరుడు ముందే జాగ్రత్త పడుతున్నాడా ? అనే పోస్టింగ్ లో శ్రీ కాలహస్తీశ్వరునికి అర్ధాష్టమ శని ప్రారంభమైనదని, 2009 జూలై 20న గ్రహణం రోజున దైవ దర్శనమా ? అనే ఆశక్తికరమైన విషయాలు గ్రహభూమి బ్లాగులో వుంచటం జరిగింది.
వాయులింగేశ్వరుడిగా ప్రసిద్ధికెక్కిన శ్రీ కాళహస్తి రాజగోపురం క్రింద వాయు పుత్ర అంశకు చెందిన వానరాలు మృతి చెందడం మహా తప్పిదం. ఈశ్వరుని వీర్యాన్ని వాయుదేవుడు అంజనీదేవి గర్భంలో ఉంచినందున, జననమే వాయుపుత్రుడైన ఆంజనేయ స్వామి. పరోక్షంగా ఈశ్వర పుత్రుడే ఆంజనేయ స్వామి. వాయులింగేశ్వరుడికి ఈ క్షేత్రంలో మహా అరిష్టం ఏర్పడినందుకు, దీనికి ప్రపంచ వ్యాప్తంగా ప్రజలందరూ మహా శాంతి జరపవలసి వుంది. శ్రీ కాళహస్తికి వెళ్ళిన భక్తులందరికీ అక్కడ స్వామిని ఈశ్వరుడిగా భావించరు. రాహు కేతువులుగా దర్శించుకుంటున్నారు. దీనికి ప్రధాన కారణం గత 2దశాభ్దాలుగా దేవస్థాన ఆదాయం కోసం రాహు కేతువుల పూజలు చేయటం, ఇవి కూడా తప్పుల తడికగా చేస్తున్నందున స్వామి వారికి ఈ పూజలు మహా అరిష్టాన్ని తెచ్చిపెడుతున్నాయి.
2010 జూన్ 7 సోమవారం హనుమజ్జయంతి పర్వదినం. అలాగే జూన్ 13వ తేది ఆదివారం ఆరుద్ర నక్షత్రం వచ్చింది. ఆరుద్ర శివుని జన్మనక్షత్రం అందుకే 7వ తేది సోమవారం హనుమజ్జయంతి నుంచి 13వ తేది ఆరుద్ర నక్షత్రం ఆదివారం వరకు ప్రతిరోజు రాహు కాల సమయంలో భక్తులందరూ భక్తి ప్రపత్తులతో హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. ప్రపంచ వ్యాప్తంగా రాహుకాల సమయాలు మారుతూ వుంటాయి.
ఇంతకీ ఏ సమయంలో రాహుకాలం పాటించాలి అంటే..... సూర్యుడు 6గంటలకు ఉదయించి సాయంత్రం 6గంటలకు అస్తమిస్తే, దినప్రమానం 12గంటలు వుంటుంది. దీనిని 8 సమభాగాలు చేయగా, ఒక్కో భాగమునకు ఒకటిన్నర గంట వచ్చును. ఈ 8 సమభాగాలలో మొదటి గంటన్నర భాగాన్ని ఏ వారమునకు కేటాయించలేదు. రెండవ భాగాన్ని సోమవారానికి, మూడవదాన్ని శనివారానికి, నాల్గవదాన్ని శుక్రవారానికి, అయిదవ భాగాన్ని బుధవారానికి, ఆరవదాన్ని గురువారానికి, ఏడవభాగాన్ని మంగళవారానికి, ఎనిమిదవ భాగాన్ని ఆదివారానికి కేటాయించటమైనది. ఇది సూర్యోదయ, సూర్యాస్తమయములు ఉదయం 6గంటలు సాయంత్రం 6గంటలు అయినచో రాహుకాలం ఏ విధంగా వుంటుంది అనే చెప్పే ఓ ఉదాహరణ మాత్రమే.
పై ఉదాహరణ ప్రకారం 7వ తేది సోమవారం నుంచి 13వ తేది ఆదివారం వరకు ప్రతిరోజూ రాహుకాల సమయాలను గణించుకొని.... భక్తులు వ్యక్తిగతంగా గాని సామూహికంగా గాని హనుమాన్ చాలీసా పారాయణ చేసి, శ్రీ కాళహస్తి మహా పుణ్య క్షేత్రానికి ఆపాదింపబడిన మహా అరిష్టానికి తగ్గ మహా శాంతి పారాయణ క్రతువులో పరోక్షంగా పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని విశ్వసిస్తున్నాను..... శ్రీనివాస గార్గేయ.

Friday, March 19, 2010

శ్రీ వికృతి నామ సంవత్సర లఘు ఫలితాలు - 2

ఆహారధాన్యాల దిగుబడులలో క్రమబద్దీకరణ ఉందును. సాఫ్ట్వేర్ రంగానికి స్వల్పంగా ఆశలు చిగురించును. శాహిత్య, విద్య, వైద్య, సినీ రంగాలు ప్రాధాన్యతను సంతరించుకున్నప్పటికీ, ప్రజలు మరువలేని బాధలు సినిమా రంగంలో ఏర్పడు సూచనుంది. వేద, పురాణ, ఉపనిషత్తులకు చక్కని ప్రాధాన్యత కలగే రీతిలో పరిస్థితులు ఉపకరించును.

6 జూన్ ఆదివారం నుంచి 13 ఆదివారం లోపల తొలకరికి అవకాశములేర్పడును. తొలకరి ప్రారంభమైనప్పటికీ నైరుతి ఋతుపవనాలు ప్రజలకు ఆలస్యంగానే పూర్తి ఆశలు చిగురించును.

ఉత్తర భారతంలో వర్షములధికమై నదులు పొంగి ప్రవహించును. మన రాష్ట్రంలో కరువు రాజ్యమేలుతుండును. ఆంధ్రప్రదేశ్లో రైతాంగం తుఫాను కోసం పరితపించే రీతిలో పరిస్థితులు ఉంటాయంటే అతిశయోక్తి కాదు. వికృతి లో ఋతుధర్మానికి వ్యతిరేకంగా వర్షములున్నందున పంటలు ఆలశ్యంగా ఇంటికి చేరును. మినుములు, నువ్వులు, పెసలు పుష్కలంగా పండును. మిరప ఆటుపోట్లకు గురికాగలదు. దక్షిణాయనంలో యందు మిర్చికి అధిక ధరలుండును.

జూలై, ఆగష్టు నెలలలో అధిక ధరలకు కొంత కళ్ళెం పడును. మత్తు పానీయాల తయారీలోనూ, బెల్లం పరిశ్రమపైననూ నిబంధనలు విధించు అవకాశాములున్నవి. టోకు వర్తకులు ప్రజల నుంచి ధాన్యాలను కొనుగోలు చేసి స్వార్ధచిత్తంతో నిల్వవుంచి తద్వారా అధిక రేట్లతో వినియోగదారులను పలు సమస్యలకు గురిచేయుదురు. శుభకార్యాల పరంపరలో బంగారు వినియోగం తగ్గుముఖం చెందును. బంగారు బిస్కెట్ల కుంభకోణం ఆలశ్యంగా వెలుగు చూసే అవకాశముంది. కాస్మోటిక్స్ వ్యాపారాలత్ ప్రజలు మోసపోవుదురు. స్టాక్ మార్కెట్ అనేకమార్లు మదుపరులను నష్టాలబాటలో పయనింపజేయును. నేర ప్రపంచంతో ప్రజలందరూ భీతిల్లుతుందురు.


ఏప్రిల్ 14 నుంచే ఏర్పడే కుంభమేళా పవిత్రామావాస్యపై ఉగ్రవాదుల దుష్టచర్యలు లేకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ప్రభుత్వాలు చేయాల్సి ఉండటమేకాక, ఆరోగ్య సంబంధమైన జాగ్రత్తలతో ప్రజల రక్షణకు బాసటగా నిలవాల్సిన అవసరం వుంది. 2010 లో రాజధాని ఢిల్లీలో కామన్వెల్త్ క్రీడలకు వచ్చే క్రీడాకారులతో సమస్యలు రాగల అవకాశం వుంది. ప్రభుత్వం ముందు చూపుగా చర్యలు గైకోనేది. లేనిచో సమస్య జటిలమగును.


భారత్, పాక్ సరిహద్దులలో స్వల్పంగా కాల్పులు ఉందునేగానీ యుద్ధం రాదు. అయిననూ పాకిస్తాన్ నుంచి ఘర్షణ ఎక్కువగా ఉండును. బంగ్లాదేశ్, ఇరాన్, ఇరాక్,భారత్లలో కారుబామ్బులు అధికమగును. అమెరికా, బ్రిటన్ దేశాలపై రసాయన ఆయుధాలతో సరిక్రొత్త పోకడలతో గురిపెట్టు సూచన వుంది. పాలస్తీనాలో శాంతి మార్గం కరువగును. చైనాకు చెందినా ఓ మత ధర్మాచార్యుని పెత్తనం శ్రుతిమించుతుంది. భారత్ చైనాల మధ్య ఈ ధర్మాచార్యుతో వివాదాలు వచ్చి నష్టంవాటిల్లే సూచనుంది. నేపాల్లో మావోయిష్టు మారణకాండ శ్రుతిమించును.


శ్రీ విరోధిలో దక్షిణాయనం ప్రారంభమైన 7 వరోజునే సంపూర్ణ సూర్యగ్రహణం గోచరించగా, శ్రీ విక్రుతిలో ఆదివారం అమావాస్య సంపూర్ణ సూర్యగ్రహణం జరిగిన 7 వరోజునే దక్షిణాయనం ప్రారంభమవుతున్నది. విక్రుతిలో 2 సార్లు, ఒకే చాంద్రమాన మాసంలో పూర్ణిమ,అమావాస్యకు సంపూర్ణ సూర్యగ్రహణం - మార్గాశిరంలో పూర్ణిమకు సంపూర్ణ చంద్రగ్రహణం, అమావాస్యకు పాక్షిక సూర్యగ్రహణం జరగనున్నవి. ఈ నాల్గు గ్రహణాలు దనూ, మిధున రాశులలో సంభవించనున్నవి. మార్గాశిరంలో సంభవించనున్న పూర్ణిమ, అమావాస్య గ్రహణాలు రెండూనూ మంగళవారాలే వస్తూ, రెండూ గ్రహణాల మధ్యన ధనుస్సు రాశిలో కుజ, రాహువుల కలయిక జరుగుచూ, కన్యారాశి నుంచి ధనస్సువరకు 4 రాశులలో సప్తగ్రహ ఆచ్చాదన ఉండటంచే ప్రపంచ వ్యాప్తంగా ప్రకృతి వైపరీత్యాలకు హేతువగుచున్నది.


జూన్ 5 శనివారం నుంచి 12 శనివారం వరకు, జూన్ 22 మంగళవారం నుంచి 29 మంగళవారం వరకు, జూలై 6 మంగలవ్చారం నుంచి 13 మంగళవారం వరకు ప్రకృతి వైపరిత్యములు జరుగు అవకాశాములున్నవి. సముద్ర సంబంధ కంపనములు అధికముగా ఉండును. సముద్ర కెరటములు విపరీతముగా ఎగిసిపడే సూచనున్నందున, జాలర్లు, విహార యాత్రికులు సముద్ర చెంతకు వెళ్ళవద్దని సలహా ఇవ్వటమైనది.


27 జూలై 2010 మంగళవారం నుంచి 3 ఆగస్టు మంగళవారం వరకు 8 రోజులు ప్రపంచ ప్రజలు అప్రమత్తులై వుండాలి. వైమానిక సంబంధంగా, రాజకీయ సంబంధంగా, ప్రకృతి వైపరీత్యా సంబంధంగా, ఉగ్రవాద సంబంధంగా, సమస్య ఏదైననూ ప్రభుత్వాలు కట్టుదిట్టమైన ఏర్పాట్లలో ఉండాల్సిన అవసరముందని తెలియజేస్తున్నాను.


2010 నవంబర్ 10 నుంచి 20 వరకు పలుచోట్ల ప్రేలుడు పదార్ధాలను విస్పోటనాలకు ఉపయోగించగా, ప్రేలకుండా ఉన్నవాటిని కనుగొను సూచన. 2010 డిశెంబర్ 16 గురువారం నుంచి 23గురువారం వరకు ధనస్సులో రవి, బుధ, రాహు, కుజులు చాతుర్గః కూతమిచే తూర్పు ఆశియా, ఫసిఫిక్, యూరప్ మరియు భారత్ కు ఈశాన్య ప్రాంతాలలో భూ మరియు సముద్ర కంపనముల తీవ్రత వున్నది. 2010 జనవరి 3,4,5 తేదీలలో ధనస్సులో రాహు, కుజ, బుధ, చంద్రుల చాతుర్గ్రహ కూతమిచే ప్రకృతి వైపరిత్యములకు తావు కలదు. ప్రజలు భయపడవలసిన అవసరం లేదు.


నవమేఘ నిర్ణయానుసారం పుష్కర నామమేఘం మేరు పర్వతమునకు ఈశాన్య భాగంలో ఉద్భవించుటచే, ఈ సంవత్సరంలో 2 భాగములు వర్షము, 4 భాగములు గాలి ఉండును. సముద్రములపై 10 భాగముల వర్షము, పర్వతములపై 7 భాగముల వర్షము, భూమిపై కేవలం 2 భాగములే వర్షించును. అందుచేత ఆంధ్రరాష్టంలోని ప్రతి గ్రామ శివాలయాలలో ధూప, దీప, నైవేద్య, కర్పూర హారతులను, సక్రమముగా చేయులాగున ప్రతి ఒక్కరూ పాటుపడేది. అంతేకాక పుష్యమి, ఆశ్లేష, ఉత్తరాషాడ, శ్రవణం, ధనిష్ఠ, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రములు పూర్తిగా వున్న సమయములలోనే వరుణ సంబంధ జపములుగానీ, యాగములుగానీ చేయులాగున ప్రయత్నించేది. భూమిపై 2 భాగములే వర్షమున్నదని పంచాంగాలలో వుంటే వరుణయాగాలు చేస్తే వర్షం పెరుగుతుందా? అనే ఆలోచనలో ఎంతోమంది ఉండవచ్చు. ఆ 2 భాగాల వర్షమే... స్వల్ప, స్వల్పంగా సంవత్సరమంతా వర్షించకుండా... అన్నదాతకు అవసరమైన సమయంలోనే వర్షిస్తే .... చాలు. ఇందుకోసమే ఋతుధర్మానుసారం వర్షించాలనే విశ్వాసంతో వరుణ సంబంధ జపాలు, యాగాలను దక్షిణ సంబంధ ఫలాపేక్ష లేకుండా చేసేది.


ప్రజలందరూ యజ్ఞయాగాది శాంతి క్రతువులు ఆచరిస్తూ, ఎనలేని సంయనంతో, ఓర్పుతో, మానవతాదృష్టితో ఉండాలని భగవంతుని కోరుకుంటూ.. సర్వేజనా సుఖినోభవంతు సమస్త సన్మంగళాని భవంతు ... శ్రీనివాస గార్గేయ



Tuesday, March 16, 2010

శ్రీ వికృతి నామ సంవత్సర లఘు ఫలితాలు

శ్వేతవరాహకల్పము నందలి ఏడవదైన వైవస్వత మన్వంతరము నందలి 28వ మహా యుగములోని కలియుగ ప్రధమ పాదములో 5111 వది, ప్రభవాది 60 సంవత్సరములలో 24 దైన, ఈ సంవత్సరమునకు చాంద్రమానముచే " శ్రీ వికృతి " నామ సంవత్సరమని పేరు. త్వష్ట్ర ( విశ్వకర్మ ) దేవతాధీన పంచయుగాంతర్గత, ' ప్రజాపతి' దేవతాధీన 'అనువత్సర'మను నాల్గవదే శ్రీ వికృతి .

శ్లో : వికృతౌ ప్రకృతిర్యాతి వికృతిం వికృతి స్తథా
తథాపిమోదతేలోక శ్చాస్మి వికృతివత్సరే

శ్రీ వికృతి సంవత్సరంలో ప్రకృతి వికృతి అగును. వికృతి ప్రకృతి అగును. అయిననూ ప్రజలు సంతోషంతో వుండురని భావము. ఋతుధర్మాలకు వ్యతిరేకంగా స్థితిగతులు ఉండగలవని యోచించాలి. శ్రీ వికృతి సంవత్సరంలో రాజ్యాధిపత్యము, సేనాధిపత్యము, అర్ఘాదిపత్యము, మేఘాదిపత్యమను నాలుగు ఆదిపత్యములు కుజ గ్రహానికి రాగా, మంత్రిత్వము బుధ గ్రహానికి, దాన్యాదిపత్యము గురు గ్రహానికి, సస్య, నీరసాదిపత్యములు శుక్ర గ్రహానికి, రాసాదిపత్యము సూర్యునికి వచ్చి ఈ ఖగోళ రాజ్యాన్ని పాలించుటకు సంవత్సరాది నుండి కుజ, బుధ, గురు, శుక్ర, రావులు సంసిద్ధులగుచున్నారు. శని గ్రహం మరియు చంద్రులకు ఏఒక్క ఆధిపత్యము లభించలేదు.

గ్రహస్థితులను పరిశీలించగా అధిక వైశాఖ మాసముతో 384రోజులు జరిగే శ్రీ వికృతి సంవత్సరానికి రాజు కుజుడు. సంవత్సర ప్రారంభంలోనే నీచ సంచారంతో 72రోజులు, కార్తిక మాసం నుంచి అస్తమయ స్థితిలో 132రోజులు, కన్యా రాశిలో శత్రుగ్రహ శనితో సంఘర్షణ 43 రోజులు పోగా,రాజైన కుజునకు వికృతి సంవత్సర పరిపాలనకు అర్హత కలిగిన రోజులు కేవలం 137మాత్రమె. గణాంకాలు ఇలా వుంటే రాజ్యాదిపత్యం కైవసం చేసుకొన్న రోజు నుంచే శత్రుగ్రహ నక్షత్రమైన పుష్యమిలో కుజుడు ఉండి, సంవత్సరాంతంలో కూడా శత్రుగ్రహ నక్షత్రమైన ఉత్తరాభాద్రలో సంచారం చేయటం గమనార్హం.శత్రు నక్షత్రంలో నీచ స్థితిలో పదవిని అలంకరించి, మధ్యలో శత్రువుతోనే పోరాడి, అధిక కాలం అస్తమయదశలో శత్రు నక్షత్రంతోనే సంవత్సరం ముగియటం అనేది అరుదుగా జరిగే గ్రహస్థితి.

వికృతి సంవత్సర రాజు కుజుని పరిపాలనచే రాష్ట్రాల నడుమ, దేశాల నడుమ విరోధాలు అధికమగును. వింత రోగాలు ప్రబలి, అగ్నిభయములుండి, వ్యవసాయ రంగం తిరోగామనములో ఉంటూ ఉగ్రవాద చర్యలు మితిమీరుతూ అధిక ప్రాంతాలలో అనావృష్టి రాజ్యమేలుతూ, ఋతుధర్మ మార్పులతో ప్రజలకు అసౌకర్యముంటూ ప్రజలు భయపడే అవకాశం వుంది.

నిజ నేరస్తులు రాజాలుగా పల్లకిలో ఊరేగుదురు. హోంశాఖ ఉన్నతాధికారులు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేయుదురు. దేశ వ్యాప్త సచివాలయాలలో అవినీతిమయముతో లొసుగులు ఏర్పడి పాలకుల గుట్టురట్టగును. ప్రజల అవసరాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి సమన్వయపాత్ర పోషించే ప్రసార మాద్యమాలపై దాడులు జరిగే అవకాసం కలదు. ప్రభత్వ ప్రజాకర్షక పధకాలు సక్రమంగా ప్రజలకు అందనందున సరిక్రొత్త ప్రభువుల కొరకు ప్రజలందరూ వెంపర్లాడుతుండురు.

పాలకులు దైర్య సాహసాలతో పరిపాలన పరమైన నిర్ణయాలను తీసుకోనలేరు. రాజకీయ అస్తిరతలు యేర్పడును. పరిపాలనలో బుద్ధిబలమును ఉపయోగించిననూ శత్రువులను పాలకులు ఎడుర్కొనలేరు. దేశ వ్యాప్త రాజకీయాలలో స్త్రీలకు ఉగ్రవాదుల నుంచి ముప్పు వాటిల్లే అవకాశము వున్నది. భారీ వ్యాపార రంగములు అనుకోకుండా ఆటుపోటులను ఎదుర్కొనటంతో, దాని ప్రభావంతో కొన్ని రాష్ట్రాల భవితవ్యం బీటలువారును.

తరువాయి భాగం మరు పోస్టింగ్ లో

Monday, January 11, 2010

గురు కుజుల రెండవ షష్టాష్టక ప్రభావము

షష్టాష్టక చతుష్టయములో రెండవ షష్టాష్టకం గురుగ్రహము కుజగ్రహము మధ్య ఏర్పడినది. ఈ రెండు గ్రహాలూ -5 అక్టోబర్ 2009 నుంచి 20 డిశంబర్ 2009 వరకు, వాటి వాటి నీచ స్థానాల నుంచి ఎదురెదురు వీక్షణలు కల్గి వున్నాయి. ఇలా ఎదురెదురు వీక్షనలనే సమసప్తక స్థితి అంటారు. ప్రస్తుతం ఈ సమసప్తక స్థితి షష్టాష్టకస్థితి కానున్నది.

మేష వృశ్చిక రాశులకు, చిత్త, ధనిష్ఠ, మృగశిర నక్షత్రాల అధిపతి కుజుడు 2009 అక్టోబర్ 5 న తన నీచ స్థానమైన కర్కాటక రాశిలోనికి ప్రవేశించటం జరుగుతుంది. అలాగే ధనూ మీనా రాశులకు , పునర్వషు, విశాఖ, పూర్వాభాద్ర నక్షత్రాలకు అధిపతి గురువు 20 డిశంబర్ 2009 న కుంభ రాశిలోనికి ప్రవేశం జరుగుతుంది.

ఈ రెండవ షష్టాష్టకం కుజ గురుల మధ్య 156 రోజుల పాటు కొనసాగుచున్నది. ఈ 156 రోజులలో జంట గ్రహణాలు ఆయాస్థానాలకు వ్యయ ( 12 ) స్థానంలో రావటం విశేషం. డిశంబర్ 20 నుంచి షష్టాష్టకం ప్రారంభం కాగానే, డిశంబర్ 22 నుంచి మార్చి 9 వరకు వక్ర స్థితిలో కుజుడు ఉండటము, వక్ర ప్రారంభపు రోజు, వక్ర త్యాగమైన రోజు, రెండు కూడా మంగళవారాలే రావటము గమనించతగిన అంశము.

ఈ కుజ గురు షష్టాష్టక ప్రభావము మృగశిర, చిత్త, ధనిష్ఠ, పునర్వషు, విశాఖ, పూర్వాభాద్ర నక్షత్ర జాతకులపైననూ, ప్రస్తుతం కుజ మహర్దశ, గురు మహర్దశ జరిగే జాతకులపై ప్రభావం పరోక్షంగా ఉండుటకు అవకాశం వున్నది.

మృగశిర 1,2 పాదాల వృషభ రాశి జాతకులు సోదర సోదరి విషయాలపై శ్రద్ధ తీసుకోవాలి. భూ సంబంధ లావాదేవీలలో జాగ్రత్తలు వుండాలి. నిత్యం వున్న దినచర్యలో జాగ్రత్తగా మార్పులు చేసుకుంటూ వుండాలి. తొందరపాటు నిర్ణయాలు వద్దు.

మృగశిర 3,4 పాదాలు, పునర్వశు 1,2,3 పాదాల మిధున రాశి జాతకులు ఆర్ధిక లావాదేవీలు, కళత్ర విషయాలపై దృష్టి ఎక్కువగా ఉంచాలి. నేత్ర సంబంధ రుగ్మతలకు వకాశామున్నది. ఎదుటి వారితో సంభాషించే ముందు సంయమనం పాటించాలి. దుర్భాష మాట్లాడుట తగ్గించుకోవాలి. పితృ సంబంధ విషయాలపై ఆలోచనలను అధికం చేయండి.

పునర్వసు నక్షత్ర 4 వ పాద కర్కాటక రాశి జాతకులు వ్యక్తిగత విషయాలపై తొందరపడి నిర్ణయాలు తీసుకోనవద్దు. మీ వ్యక్తిగత విషయాలపై ఇతరులతో చర్చించవద్దు. ప్రాణ భయం వెంటాడే అవకాశం ఉండును. దిగులు చెందవద్దు.

చిత్త నక్షత్ర 1,2 పాదాల కన్యారాశి జాతకులు రుణ విషయాలలో ఆలోచనలకు పదును పెట్టాలి. శత్రు భయం పెరిగే అవకాశం వుంది. కొన్ని రుగ్మతలచే అనారోగ్య వ్యాప్తి నొందవచ్చు. దాచుకున్న డబ్బుకు గండం కలిగే అవకాశముంది. లాభ సంబంధ లావాదేవీలు నష్టాల బాటన నడిచే అవకాశముంది.

చిత్తా నక్షత్ర 3,4 పాదాలు, విశాఖ 1,2,3 పాదాల తులా రాశి జాతకులు సంతాన విషయాలలో ఆలోచనలను కట్టుదిట్టం చేయాలి. దినచర్యలో మార్పులను గమనించాలి. వ్యత్రేకంగా వుండే పరిస్థితులలో నిర్ణయాలు తీసుకోనవద్దు. విశాఖ నక్షత్ర 4 వ పాద వృశ్చిక రాశి జాతకులు వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వాహన, ఆరోగ్య విషయాలలో అధిక జాగ్రత్తలు తీసుకుంటూ, లాభ సంబంధ లావాదేవీలపై ఓ దృష్టి ఉంచుతూ మాతృమూర్తి విషయాన్ని కూడా ఆలోచిస్తూ శ్రద్ధ తీసుకోనాలి.పితృ నిర్ణయాలలో తొందరపాటు వద్దు.

ధనిష్టా నక్షత్ర 1,2 పాదాల మకర రాశి జాతకులకు ఆర్ధిక లావాదేవీలు, కళత్ర విషయాలపై దృష్టి ఎక్కువగా ఉంచాలి. నేత్ర సంబంధ రుగ్మతలకు అవకాశమున్నది. ఎదుటివారితో సంభాషించే ముందు సంయమనం పాటించాలి. దుర్భాష మాట్లాడుట తగ్గించాలి. కళత్ర విషయాలలో ప్రతికూలతలు ఉండగలవు, బేధాబిప్రాయములు ఉండగలవు. వ్యక్తిగత విషయాలపై తొందరపడి నిర్ణయాలు తీసుకోనవద్దు. మీ వ్యక్తిగత విషయాలపై ఇతరులతో చర్చించవద్దు. దాచుకున్న డబ్బుకు గండం కలిగే అవకాశముంది.
పూర్వాబాద్రా నక్షత్ర 4 వ పాద మీనా రాశి జాతకులకు సంతాన విషయాలలో ఆలోచనలు చేయాలి.ముఖ్య నిర్ణయాలు కట్టుదిట్టం చేయాలి. అనవసర ఖర్చు పెరిగే అవకాశం వుంది. పొదుపును పాటించండి. లోభత్వాన్ని అలవాటు చేసుకోండి.

ఈ షష్టాష్టక ప్రభావము వలన ఫలితాలు తెలుసుకోనటమే గాక, కొన్ని జాగ్రత్తలు తీసుకోనాల్సి వుంటుంది. గ్రహ సంబంధమైన శాంతి పరిహారములను కూడా ఆచరించేది. ఈ శాంతి పరిహారములు తగిన రీతిలో తగిన సమయములో మా ఓంకార మహాశక్తి పీఠంలో వేద క్రియల ద్వారా శాంతి పరిహారములు జరుపబడును. వేద క్రియలు జనవరి 25 తదుపరి మాత్రమే జరుపుకోనాలి. అలాంటి వివరాలు కూడా తదుపరి పోస్టింగ్ లలో చెప్పగలము.

Wednesday, January 6, 2010

కుజ రాహువుల మొదటి షష్టాష్టక ప్రభావము

2009 నవంబర్ 2 న ధనూరాశిలోకి రాహుప్రవేశం జరిగింది. దీనికి ముందు నుంచే 5 అక్టోబర్ 2009 న కుజగ్రహము తన నీచ స్థానమైన కర్కాటక రాశిలోనికి ప్రవేశించటం జరిగింది. నవంబర్ 2 నుంచి రాహు ధనూప్రవేశంతో కుజ రాహువుల మధ్య షష్టాష్టక స్థితి ఏర్పడినది. అంటే అంతకు ముందు 2009 ఆగస్టు 16 ఆదివారం నుంచి 5 అక్టోబర్ వరకు 51 రోజుల పాటు రాహు కుజుల షస్టాష్టక స్థితి ఏర్పడినది. ఈ సమయములోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఘోర ప్రమాదంలో మరణించటం, ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సంక్షోభం ఏర్పడటానికి 51 రోజుల షష్టాష్టక స్థితి ప్రధాన కారణమైంది.

కేవలం పై ఒక్క షష్టాష్టక స్థితి మాత్రమే గాక, దీనికితోడు 22 జూలై కర్కాటక రాశిలో జరిగిన సంపూర్ణ సూర్య గ్రహణం రాజశేఖరరెడ్డి జన్మ రాశి ధనస్సుకు, అష్టమ స్థానం కావటం కూడా గమనార్హం. ఈ విషంపై హైదరాబాద్ నుంచి మహా టీవీలో గ్రహణం పై చర్చ జరిగినప్పుడు, రాజశేఖరరెడ్డికి అష్టమ స్థానంలో ( ప్రాణ స్థానం ) గ్రహణం జరగనుంది. గనుక వాహన సంబంధంగా అనేక జాగ్రత్తలు తీసుకోనవలసి ఉంటుందని లైవ్ లో చెప్పటం జరిగింది.

ప్రస్తుతం షష్టాష్టక చతుష్టయంలో మొదటిదైన కుజ రాహువుల ప్రధమ షష్టాష్టకం 2009 నవంబర్ 2 నుంచి 2010 మే 26 వరకు 206 కొనసాగుతుంది. ఈ 206 రోజులలో జంట గ్రహణాలు రావటము జరిగినది. కర్కాటక రాశి కుజ గ్రహానికి నీచ స్థితి. ఈ కర్కాటకంలో కుజుడు డిసెంబర్ 22 నుంచి మార్చి 2 వరకు వక్ర స్థితిలో వుండటం విశేషం. వక్ర ప్రారంభపు రోజైన డిసెంబర్ 22, వక్ర త్యాగమైనా రోజు మార్చి 9 , రెండూను మంగళ వారాలే కావటం గమనించతగిన అంశం. కుజ రాహువుల షష్టాష్టక ప్రభావం వలన చిత్ర, ధనిష్ఠ, మృగశిర, ఆరుద్ర, స్వాతి, శతభిషం నక్షత్ర జాతకులపై పరోక్షంగా వుంటుంది. ఎందుచేతనంటే కుజగ్రహ నక్షత్రాలు చిత్ర, ధనిష్ఠ, మృగశిర. రాహు గ్రహ నక్షత్రాలు ఆరుద్ర, స్వాతి, శతభిషం. పై ఆరు నక్షత జాతకులే గాక, ప్రస్తుతం కుజ మహర్దశ, రాహు మహర్దశ జరిగే జాతకులపై ప్రభావం పరోక్షంగా వుంటుంది.

మృగశిర నక్షత 1,2 పాదాల వృషభ రాశి జాతకులు సోదర సోదరి విషయాలపై శ్రద్ధ తీసుకోనాలి. భూ సంబంధ లావాదేవీలలో జాగ్రత్తలు వుండాలి. ప్రాణ సంబంధ భయం వెంటాడే అవకాశం ఉండును.

మృగశిర నక్షత్ర 3,4 పాదాలు మరియు ఆరుద్రా నక్షత్ర జాతకులు ఆర్ధిక లావాదేవీలు, కళత్ర విషయాలపై దృష్టి ఎక్కువగా ఉంచాలి. నేత్ర సంబంధ రుగ్మతలకు అవకాశమున్నది. ఎదుటివారితో సంభాషించే ముందు సంయమనం పాటించాలి. దుర్భాష మాట్లాడుట తగ్గించాలి. కళత్ర విషయాలలో ప్రతికూలతలు ఉండగలవు, బెదాబిప్రాయములు ఉండగలవు.

చిత్ర నక్షత్ర 1,2 పాదాల కన్యా రాశి జాతకులు వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వాహన, ఆరోగ్య విషయాలలో అధిక జాగ్రత్తలు తీసుకుంటూ, లాభ సంబంధ లావాదేవీలపై ఓ దృష్టి ఉంచుతూ మాతృమూర్తి విషయాన్ని కూడా ఆలోచిస్తూ శ్రద్ధ తీసుకోనాలి. లాభ విషయాలలో పదే పదే ఆలోచనలు చేయాలి.

చిత్ర నక్షత్ర 3,4 పాదాలు, స్వాతి నక్షత్ర తులారాశి జాతకులు భూ లావాదేవీలలో జాగ్రత్తగా వుండాలి. భూమి కొనుగోలు అమ్మకాలలో కొంత సమయం ఆగాల్సి వుంటుంది. సోదర, సోదరిలతో తొందరపాటు వద్దు. మీ దినచర్యలో అనుకోకుండా అవాంతరాలు ఏర్పడటానికి అవకాశాలు వుంటాయి. మనసును అదుపులో వుంచుకొని గుండె దిటవు చేసుకోవాలి. తోదరపాటు నిర్ణయాలు వద్దు.

ధనిష్టా నక్షత్ర 1,2 పాదాల మకర రాశి జాతకులు దాంపత్య విషయాలలో తొందరపాటు చర్యలు వద్దు. ప్రేమికుల మధ్య అభిప్రాయ బేధాలు ఉండగలవు. అనవసర ఖర్చు పెరిగే అవకాశం వుంది. వివాహ నిర్ణయ విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి. కళత్ర వర్గం ద్వారా సమస్యలు జటిలమయ్యే అవకాశాలున్నవి.

ధనిష్టా నక్షత్ర 3,4 పాదాలు, శతభిషా నక్షత్ర కుంభ రాశి జాతకులు ఋణ విషయాలలో ఆలోచనలకు పదును పెట్టాలి. శత్రు భయం పెరిగే అవకాశం వుంది. కొన్ని రుగ్మతలచే అనారోగ్య వ్యాప్తి నొందవచ్చు. దాచుకున్న డబ్బుకు గండం కలిగే అవకాశముంది. లాభ సంబంధ లావాదేవీలు నష్టాల బాటన నడిచే అవకాశముంది.

మృగశిర, ధనిష్ఠ, చిత్ర నక్షత్ర జాతకులకు రెండవ షష్టాష్టకమైన గురు కుజుల వలన కూడా సమస్యలు రాగల సూచనలున్నవి. గనుక గురు కుజుల రెండవ షష్టాష్టక ప్రభావము అని మరో శీర్షిక త్వరలో పోస్టింగ్ కానున్నది. అంచేత దానిలోని ఫలితాలు కూడా చదవగలరు.

ఈ షష్టాష్టక ప్రభావము వలన ఫలితాలు తెలుసుకోనటమే గాక, కొన్ని జాగ్రత్తలు తీసుకోనాల్సి వుంటుంది. గ్రహ సంబంధమైన శాంతి పరిహారములను కూడా ఆచరించేది. ఈ శాంతి పరిహారములు తగిన రీతిలో తగిన సమయములో మా ఓంకార మహాశక్తి పీఠంలో వేద క్రియల ద్వారా శాంతి పరిహారములు జరుపబడును. వేద క్రియలు జనవరి 25 తదుపరి మాత్రమే జరుపుకోనాలి. అలాంటి వివరాలు కూడా తదుపరి పోస్టింగ్ లలో చెప్పగలము.

Monday, January 4, 2010

సప్త అమాసంక్రాంతుల మాలిక

ప్రతినెలా ఓ అమావాస్య వస్తుంటుంది. అలాగే ప్రతినెలా ఓ సంక్రమణం జరుగుతూ వుంటుంది. సంక్రమణం అంటే సూర్యుడు ఒక రాశిలోకి ప్రవేశించటం. దీనినే సంక్రాంతి అని కూడా పిలుస్తారు. మకర రాశిలోనికి సూర్య ప్రవేశాన్ని మకర సంక్రమణం లేక మకర సంక్రాంతి అంటాము. మరి ఈ సంక్రమణం ఏదో ఒక తిధి లో జరుగుతూ వుంటుంది.

మరి సంక్రమణం అమావాశ్య తిధిలో జరిగితే ఎలా వుంటుంది ? ఒకసారి కాదు, రెండుసార్లు కాదు. వరుసగా ఏడు నెలలపాటు అమావాశ్య తిదిలోనే రవి రాశిప్రవేశాలు చేయటం జరిగినది. మరి ఇలా ఏడు సార్లు రాశిప్రవేశాలు అమావాస్యన జరిగితే అరిష్టమా? అదృష్టమా?

వివరాలలోకి వెళితే గత 2009 సంవత్సరంలో ఆశ్వీయుజ అమావాశ్య శనివారం తే 17.10.2009 దిన దీపావళి పర్వదినం జరుపుకున్నాము. ఆరోజే రవి తన నీచ స్థానమైన తులారాశిలోకి సంక్రమించాడు. దీనిని తులా సంక్రాంతి అంటారు. అమావాస్య తిధిలో సంక్రమణం జరిగిన మాలికలో ఇది మొదటిది.

తదుపరి కార్తిక అమావాశ్య సోమవారం తే 16.11.2009 దిన రవి వృశ్చిక రాశిలోనికి సంక్రమించాడు. దీనిని వృశ్చిక సంక్రాంతి అంటారు. దీనిని రెండవ అమాసంక్రాంతి దినముగా పరిగణించాలి. ఆ తరువాత మూడవదైన మార్గశిర అమావాస్య తే 15.12.2009 దిన మంగళవారం రాత్రి రవి ధనస్సులోనికి ప్రవేశించుటచే ధనుర్మాసం ఏర్పడినది. ఈ ధనుర్మాసం కూడా అమావాశ్య తిధిలో వచ్చినది. దీనినే ధనుస్సంక్రాంతి అంటారు. ఇక నాల్గవదైన పుష్య అమావాస్య తే 14.01.2010 గురువారం మకరరాశిలోకి రవి సంక్రమణం చెందాడు. దీనితో మకర సంక్రమణ ఉత్తరాయణ పుణ్య కాలం ప్రారంభమైనట్లు. ఇది కూడా అమావాస్య తిదిలోనే జరిగినది.

పిదప రాబోవు ఫిబ్రవరిలో మాఘ అమావాస్య తే 13.2.2010 ది రోజున కుంభ సంక్రాంతి జరుపుకొనబోతున్నాము. ఇది 5 వ అమావాస్య తో కూడిన సంక్రాంతి అన్నమాట. ఆ తదుపరి తే 15.3.2010 దిన పాల్గుణ అమావాస్య రోజున మీనా సంక్రాంతి జరుపుకోవాలి. ఇది ఆరవ అమావాస్య తిదితో కూడిన సంక్రాంతి. ఇక మాలికలో చివరిదైన ఎదవా అమావాస్య. స్వస్తిశ్రీ వికృతి సంవత్సర చైత్ర అమావాస్య తే 14.4.2010 రానుంది. ఆరోజే మేష సంక్రమణం జరుగుచూ మహా కుంభ మేలా హరిద్వార్ లో జరగనున్నది.

వరుసగా ఏడు అమావాస్య తిధులలో సంక్రమణాలు జరగాతము మహా అరుదుగా వచ్చీ ఘట్టం. ఇంత అరుదుగా వచ్చే ఘట్టానికి మధ్య బిందువు అంటే 4 వ అమావాస్య తిధిలో సంక్రమణం. మకర సంక్రమణం జరిగిన ఈ పుష్య అమావాశ్య తిధిలో కనకన సూర్య గ్రహణం జరగటం అత్యంత అరుదైన మహోన్నత ఘట్టం.

ఇక ఈ జనవరి 15 కనుమ పండుగ రోజున మకర సంక్రమణం వచ్చిన అమావాస్య, దానికి తోడు గ్రహణం జరగనున్నవి. అమావాశ్య తిధిలో పితృదేవతలకు తర్పణాదులు ఇస్తాము. దీనికి సంక్రమణం కలిసి, గ్రహణం కలిస్తే, ఎంతటి అదృష్టమో ఆలోచించండి. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇదే రోజు మహా కుంభ మేలా రెండవ పవిత్ర స్నానం కావటం మహద్భాగ్యం. మహాద్భాగ్యమైన మహోన్నత రోజున పితృదేవతలకు పిండ ప్రదానాదులను, తర్పణాదులను ఇవ్వాల్సి వుంటుంది. అవకాశం వున్నవారు సముద్రస్నానం ఆచరించవచ్చు. మకర రాశిలో జరిగే గ్రహణం ఒక అరిష్ట యోగంలో భాగామైనప్పటికీ, దాని ప్రభావం గూర్చి ప్రస్తుతం మనం ఆలోచించటం లేదు. గ్రహణం జరిగే రోజును మహా పవిత్రదినంగా హైందవ జాతి అంతా కొనియాడి తీరాలి.

మహా కుంభ మేళా పవిత్రస్నాన వివరాలు :

శ్రీ విరోధి నామ సంవత్సరంలో గురు గ్రహము 19 డిశంబర్ 2009 రాత్రి 1 గం. 08 ని.లకు కుంభరాశి ప్రవేశం చేయును. అలాగే శ్రీ సూర్య భగవానుడు రాబోవు వికృతి నామ సంవత్సరంలో 14 ఏప్రిల్ 2010 న మేష రాశిలోకి ప్రవేశించును. ఈ కారణంగా హరిద్వార్ లోని గంగానదిలో పవిత్ర స్నానాలతో మహా కుంభ మేళా జరుగును.

ఈ పవిత్ర స్నానాలకు దేశ విదేశాల నుంచి యోగిణులు, యోగులు, సాధువులు, ఇతరులు, కలిసి దాదాపు 60 మిలియన్ల మంది స్నానమాచారిన్చేదారు. ఈ పరంపరలో 2010లో జనవరి 14 మకర సంక్రాంతి రోజున ప్రధమ పవిత్ర సంక్రమణ స్నానముండును. ఈరోజే పుష్య అమావాశ్య పవిత్ర స్నానం కూడా. (స్నానానికి అమావాశ్య నిశీధిలో వుండాలి. ) జనవరి 15 సంపూర్ణ సూర్య గ్రహణం రోజున ద్వితీయ పవిత్ర స్నానముండును. జనవరి 20 వసంత పంచమి రోజున తృతీయ పవిత్ర స్నానముండును. జనవరి 30 మాఘ పూర్ణిమ రోజున చతుర్ధ పవిత్ర స్నానముండును. ఫిబ్రవరి 12 మహా శివరాత్రి రోజున పంచమ పవిత్ర స్నానముండును. ఫిబ్రవరి 13 మాఘ అమావాశ్య రోజున షష్టమ పవిత్ర స్నానముండును. ఏప్రిల్ 14 మేష సంక్రమణం రోజున చిట్టచివరిదైన మహా కుంభ మేలా పవిత్ర సంక్రమణ స్నానంతో హరిద్వార్ మహా కుంభ మేళా ముగియును.

ఆంధ్రప్రదేశ్ పై జన్మశని ప్రభావం

1 నవంబర్ 1956 దుర్ముఖి నామ సంవత్సరం ఆశ్వీయుజ బ. చతుర్దశి రోజున చిత్రా నక్షత్రంలో ఆంధ్రప్రదేశ్ అవతరణ జరిగినది. ఆంధ్రప్రదేశ్ జన్మ నక్షత్రం చిత్రానక్షత్రం కన్యా రాశి. 2007 జూలై నుంచి ఏలినాటి శని జరుగుచూ 2014 నవంబర్ తో ముగియనుంది. ఈ ఏలినాటి శని మూడు భాగాలు మొదటి భాగాన్ని ద్వాదశ శని లేక వ్యయ శని అంటారు. ఇది 2009 ఆగస్టు చివరితో ముగుసిపోయింది. 2009 సెప్టెంబర్ నుంచి 2012 ఆగస్టు వరకు జన్మ శని భాగం జరుగుతున్నది. మూడవ భాగ శని సెప్టెంబర్ 2012 నుంచి నవంబర్ 2014 వరకు జరుగును.

ప్రస్తుతం ఏలినాటి శని రెండవ భాగం జరుగుచున్న ఈ రోజులలో తెలంగాణా ఉద్యమం అధికమైంది. ప్రజలలో ప్రస్తుతం ఒక వినికిడి వుంది. అది ఏమంటే... రాజశేఖరరెడ్డి బ్రతికుంటే...... కే.సి.ఆర్ ఇలా విజృంభించే వాడు కాదని. కానీ జ్యోతిష్యపరంగా వారి ఆలోచన మాత్రం తప్పు. ఎందుచేతనంటే... కే.సి.ఆర్ ఆశ్లేష నక్షత్ర కర్కాటక రాశి జాతకుడు. వారికి 2002 జూన్ నుంచి 2009 ఆగస్టు వరకు ఏలినాటిశని భాగం జరిగింది. మూడు భాగాల శని పూర్తి చేసుకొని కే.సి.ఆర్ దేనికైనా సిద్ధంగా వున్నాడు.

కే.సి.ఆర్ కు ఏలినాటిశని పూర్తి అయిన ఘడియ నుంచే ఆంధ్రప్రదేశ్ జన్మశని భాగం మొదలైంది. అందుచేతనే ... సెప్టెంబర్ లో ముఖ్యమంత్రిని కోల్పోవటం, తరువాత జరిగిన వరుస పరిణామాలను చూస్తూనే ఉన్నాము.

ఇక్కడ ఒక విషయం గమనించాలి. కే.సి.ఆర్ కు జన్మ రాశిలోనికి కుజుడు 5 అక్టోబర్ నుంచి ప్రవేశించి 2010 మే 26 వరకు 234 రోజులు స్తంభించటం జరిగినది. అందుచేత కే.సి.ఆర్ కు లగ్నంలో నీచ కుజ స్తంభన ఉండటంచే ప్రత్యేక తెలంగాణా కోసం, గతం కంటే ఇంకా హడావిడి చేయటం జరుగుచున్నది. మే 26 తదుపరి కుజుడు కే.సి.ఆర్ కు వాక్ స్థానంలోకి ప్రవేశించి జూలై 20 వరకు ఉంటాడు. గనుక 5 అక్టోబర్ 2009 నుంచి 20 జూలై 2010 వరకు కే.సి.ఆర్ విజృంభణతో రాష్ట్రంలో శాంతి భద్రతలు మరికొంత దెబ్బతినే అవకాశముంది.

ప్రస్తుతం ఒక విషయం గమనించాలి. ఆంధ్రప్రదేశ్ జన్మ నక్షత్రం చిత్ర. చిత్రా నక్షత్రానికి అధిపతి కుజుడు. జరిగేది జన్మ శని. పైగా ఈ సంవత్సరం లో 20 జూలై నుంచి 31 ఆగస్టు వరకు ఆంధ్రప్రదేశ్ జన్మ రాశి కన్యలో కుజగ్రహం, శనిగ్రహం కలయికలు జరుగుచున్నవి. అందువలన శాంతిభద్రతలు ఇంకా విషమించే అవకాశం వున్నది.

దీనికితోడు చిదంబరం గారు డిశంబర్ 9 తేదీన మొదటి స్టేట్మెంట్ ఇచ్చారు. కుజ సంఖ్య అయిన తొమ్మిదవ తేదీన, తొమ్మిదవ తిది అయిన నవమిలో రాత్రి సమయములో స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ సమయములో వున్న గ్రహస్థితి ఎవరికీ అనుకూలం కానేకాదు. ఇక రేపటి రోజున 5 జనవరి మంగళవారం రోజున డిల్లీలో ఎనిమిది రాజకీయ పార్టీలతో చర్చలకు ఆహ్వానించారు. రేపటి రోజు కుజవారం. 8 సంఖ్య శనికి సంబంధం. శని కుజులు పరస్పర శత్రువులు. రేపటి నక్షత్రం ఆంధ్రప్రదేశ్ జన్మ నక్షత్రమైన చిత్రకు నైధనతార ( ప్రమాద తార ) అవుతున్నది. దీనినిబట్టి రేపటి చర్చలు పూర్తిగా విఫలమై, శాంతిభద్రతలు ఘోరంగా దెబ్బతిననున్నవి. దీనికి తోడు జనవరి 1 నుంచి జనవరి 15 వరకు గ్రహ సంచారరీత్యా రవాణా రాకపోకలకు పూర్తి అంతరాయాలుంటాయి. ఆంధ్రప్రదేశ్లోనే కాక దేశవ్యాప్తంగా విమాన సర్వీసులు కూడా మంచు కారణంచే ఆగిపోతున్నవి.

రాజశేఖరరెడ్డి గారు మరణించకుండా ఉన్నప్పటికీ, ఆంధ్రప్రదేశ్ యొక్క పరిస్థితి ఇలానే కొనసాగుతుంటుంది. కే.సి.ఆర్ గారికి ప్రస్తుతం అష్టమ స్థానంలో గురువు సంచారం చేస్తూ, కుజునిచే అష్టమ వీక్షణ ఉన్నందున ఆరోగ్య విషయాలపై కే.సి.ఆర్ దృష్టి ఉంచాల్సిన అవసరం వుంది.

ఆంధ్రప్రదేశ్ కు జన్మషని ప్రభావం 2009 సెప్టంబర్ నుంచి 2012 ఆగస్టు వరకు కొనసాగుతుంది. గనుక పైసమయంలో ప్రజలందరూ సంయమనం పాటిస్తూ, భగవతారాధనకు అధిక సమయం కేటాయించాలి.

Saturday, January 2, 2010

ఖగోళంలో షష్టాష్టక చతుష్టయం

వందల సంవత్సరాల తరువాత ఏర్పడే ఖగోళ గ్రహస్థితే షష్టాష్టక చతుష్టయము. అరిష్ట యోగములతో ఈ షష్టాష్టకం ద్వాదశ రాశులపై ప్రభావము చూపుతున్నది. గ్రహ సంబంధ షష్టాష్టకములు మూడు, గ్రహణ షష్టాష్టకము ఒకటి కలిసి మొత్తం నాలుగు షష్టాష్టక స్థితులు ఏర్పడినవి.

1. 2009 నవంబర్ 2సోమవారం నాడు రాహువు ధనుస్సు రాశి ప్రవేశం చేయడంతో, కర్కాటక రాశిలో నీచ స్థితి లో ఉన్న కుజ గ్రహంతో షష్టాష్టకము ఏర్పడినది. అంటే కర్కాటక కుజునికి ఆరవ స్థానమైన ధనస్సులో రహువుండటము, రాహువుకు ఎనిమిదవ స్థానమైన కర్కాటకంలో కుజుడుండటము మొదటి షష్టాష్టక గ్రహస్థితిగా పేర్కొనాలి.

2. 2009 డిశంబర్ 20ఆదివారం నాడు గురుగ్రహము కుంభరాశి ప్రవేశము చేయటంతో, కన్యా రాశి లో ఉన్న శని గ్రహంతో, షష్టాష్టకము ఏర్పడినది. అంటే కన్యా రాశిలోని శని గ్రహానికి ఆరవ స్థానమైన కుంభ రాశిలో గురువుండటము, కుంభ రాశికి ఎనిమిదవ స్థానమైన కన్యలో శని సంచారం చేయటము రెండవ షష్టాష్టకము.

3. 2009 డిసంబర్ 20ఆదివారం నుంచే గురుగ్రహం, కుజ గ్రహం మధ్య షష్టాష్టకము ఏర్పడినది. ఏవిధంగానంటే, కుంభ రాశిలోని గురుగ్రహానికి ఆరవ రాశియైన కర్కాటకలోని కుజుడు, అలాగే కుజ గ్రహానికి ఎనిమిదవ రాశిలో గురుగ్రహం ఉండటము మూడవ షష్టాష్టక గ్రహస్థితి.

ఇంతవరకు గ్రహాల సంచారంలో మూడు షష్టాష్టకములు ఏర్పడ్డాయి. గ్రహాలు కాక గ్రహణాలలో కూడా మరో షష్టాష్టకం ఏర్పడనున్నది.....ఎప్పుడు ? ఎక్కడ ?

4. మిధున రాశిలో భారత కాల మాన తేది ప్రకారం 2010జనవరి 1న పుష్య పూర్ణిమన ఆరుద్రా నక్షత్రంలో పాక్షిక చంద్ర గ్రహణం ఏర్పడినది. జనవరి 15పుష్య అమావాస్య రోజున మకర రాశిలో ఉత్తరాషాడ నక్షత్రంలో కంకణ సూర్య గ్రహణం ఏర్పడనుంది. మకర రాశికి మిధున రాశి ఆరవ రాశి. మిధున రాశికి మకర రాశి అష్టమ రాశి. అనగా షష్టాష్టక రాశులలో గ్రహణాలు ఏర్పడుతున్నాయి. ఇది నాల్గవ షష్టాష్టకం.

జనవరి 15తో నాల్గవ షష్టాష్టక అవయోగం ప్రారంభం కానున్నది. దీని ప్రభావం దాదాపు నాలుగు మాసాలు కొనసాగుతుంది. కానీ గ్రహాల నడుమ ఏర్పడిన షష్టాష్టకములు 25 మే 2010 వరకు కొనసాగుతుంది.
దాదాపు నాలుగు నెలలకు పైగా వుండే షష్టాష్టక చతుష్టయ ప్రభావములు ఎలా వుంటాయి అనే ఆసక్తికర వివరాలు తదుపరి పోస్టింగ్ లో తెలుసుకుందాం.... శ్రీనివాస గార్గేయ