Tuesday, May 3, 2011

అత్యంత అరుదైన పవిత్రమైన శుభకర గురువారము.

పుష్కరమంటే తీర్థమని, సరస్సుఅని అర్థము. పుష్కరుడు అంటే వారున దేవుడని, మహా పుణ్యపురుషుడని భారతీయ పురాణాలు వర్ణించాయి. పుష్కరుడిని బ్రహ్మ దేవుడు సృష్టించినట్లుగా, బ్రహ్మ శివుని కోసం తపస్సు చేసినట్లుగా పురాణ కధనం. పుష్కరుడినే తీర్థరాజు అని కూడా పిలుస్తారు. ఈ లోకంలో ఉన్న నదులన్నీ తమలో స్నానం చేసిన వారి వద్ద నుంచి వివిధములైన పాపములను స్వీకరించిన కారణంగా వాటి యొక్క పవిత్రత క్షీణించుచున్నదని పుష్కరుడు ఆవేదనతో చింతించేవాడు. అప్పుడు పుష్కరుడు పరమశివుడు కోసం తపస్సు చేసి నదులలో ఏర్పడిన పాపమంతటిని ప్రక్షాళన చేసే మార్గం కోసం అర్ధించాడు. అంతేకాక శివుని గల అష్ట మూర్తిత్వములలో, ఒకటైనటువంటి జలరూపమైన దేహాన్ని తనకు అనుగ్రహించమని పుష్కరుడు కోరాడు. పరమ శివుడు ఆ విధంగానే వరమిచ్చాడు. అట్టి వర ప్రభావంచే పుష్కరుడికి అనంతమైన శక్తి ప్రాప్తించి తద్వారా నదులలో ఏర్పడే పాపా ప్రక్షాళనను తొలగించే ప్రభావాన్ని పుష్కరుడు పొందగలిగాడు.

ఆపైన నదులన్నీ పుష్కరుడిని ఆహ్వానించి తమలో నివసించవలసిందిగా అభ్యర్థించ సాగాయి. ఆ పిమ్మట పన్నెండు పుణ్య నదులలో పుష్కరుడు ఉండేలా ఏర్పాటు జరిగింది. ఈ ఏర్పాటును దేవతల గురువైన బృహస్పతి అనగా ఖగోళంలోని గురుగ్రహ సంచారాన్ని అనుసరించి నిర్ణయమవుతుంది. ఈ ప్రకారంగా మేషరాశి మొదలు మీనరాశి వరకు గల పన్నెండు రాశులలో గురుగ్రహం ద్వాదశరాశి సంచారం ప్రకారం పుష్కరుడు కూడా ఆయా నదులలో నివసించేలా ఈర్పాటు అయినది.

ప్రతి నదికి పన్నెండు సంవత్సరములకొకసారి పుష్కరుని యొక్క ఆగమనం సంభవించిన కారణంగా ఆయా నదులకు పుష్కరాలు వస్తాయి. ఈ పరంపరలో గురుగ్రహము పన్నెండు రాశులలో సంచారం చేస్తున్నపుడు, ధను రాశి మరియు మీనా రాశి గురుగ్రహానికి జ్యోతిష శాస్త్ర ప్రకారం స్వక్షేత్రాలు అగును. ఈ స్వక్షేత్రాలలో మీనరాశి అనేది జల రాశి. కనుక గురుగ్రహము, తన స్వగృహంగా భావించే జలరాశిగా ఉన్న మీనరాశి లోనికి 2010 డిసెంబర్ 6 అనగా వికృతి నామ సంవత్సర శుద్ద పాడ్యమి సోమవారం మధ్యాహ్నం పదకొండు గంటల ముప్పై నిముషాలకి జలరాశి ఐన మీనరాశి లోనికి ప్రవేశించాడు. తిరిగి 2011 మే 8 శ్రీ ఖర నామ సంవత్సర వైశాఖ శుద్ద పంచమి ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల పద్నాలుగు నిముషాలకి తన స్వగృహ జల రాశి ఐన మీనరాశిని విడిచి, మేష రాశి లోకి ప్రవేశించటంతో గంగానదికి పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి.

పుష్కర రాజే గురుడు. గురుగ్రహ వారము గురువారము. గురుగ్రహము జలరాశి ఐన మీనరాశిలో విడిది చేసిన మొత్తం.. రోజులలో కేవలం 22 గురువారాలు మాత్రమే వచ్చాయి. అందులో మొదటి గురువారము 2010 డిసెంబర్ 9 ఉత్తరాషాడ నక్షత్రంలో వచ్చింది. అలాగే చివరి గురువారం 2011 మే 5 రోహిణి నక్షత్రంలో వచ్చింది. అతి తక్కువ గురువారాలతో మీనరాశి సంచారంతో గురువు ఉండటము, సూర్య నక్షత్రమైన ఉత్తరాషాడతో మొదటి గురువారము రావటము, చంద్ర నక్షత్రమైన రోహిణితో చివరి గురువారము రావటము అత్యంత అరుదుగా వచ్చే ఖగోళ సంఘటనలు.

ఇంత వివరణకు కారణమేమిటని ఆలోచిస్తున్నారా ? 2011 మే 5 గురువారం నాడు రోహిణి నక్షత్రంలో చివరి గురువారంతో గురువు జలరాశి మీనంలో వుండగా శుభ ముహూర్తాలు జరుగనున్నాయి. ఆ రోజున ఉదయం నుంచి మరుసటి రోజు ఉదయం వరకు మిధున, కర్కాటక, ధను, మకర, కుంభ లగ్నాలలో ముహూర్తాలు వున్నవి. కుంభ లగ్నము చివరి లగ్నం కావటము విశేషం.

కనుక పుష్కర రాజు, శుభ గ్రహమైన గురువు, జలరాశి లో వుండగా చివరి గురువారం, చివరి లగ్నం కావటం మరింత విశేషం కాగా తిరిగి ఈ గురుగ్రహమే మరల 2022 ఏప్రిల్ 13 శుభకృత్ నామ సంవత్సర చైత్ర శుద్ద ద్వాదశి, బుధవారం రోజున తిరిగి జల రాశి ఐన మీనరాశి లోకి గురుగ్రహం ప్రవేశిస్తాడు.

ఇటువంటి మహా పవిత్రమైన గురువారం రోజున గురు మహాదశ జరిగే జాతకులు, పునర్వసు, విశాఖ, పూర్వాషాడ నక్షత్ర జాతకులతో పాటు మిగిలిన అందరు కూడా తమ తమ ఇష్ట దైవాలను స్మరించటమే కాక గురుగ్రహ స్తోత్ర పారాయణ కూడా చేసి, గురుగ్రహ అనుగ్రహానికి పాత్రులు కండి.

Friday, April 8, 2011

శ్రీ ఖర సంవత్సర గ్రహసంచార విశ్లేషణలు - ఫలితాలు

వేలాది సంవత్సరాల తర్వతా, ఇంతకాలానికి అంటే 4 ఏప్రిల్ 2011 ఉదయానికి 19 డిగ్రీల 51 నిమిషాల ఒకే కేంద్ర బిందువులతో రవి శని గ్రహములు సమసప్తక స్థితులతో ఉండి ఎదురెదురు వీక్షణలు వున్న సమయంలో స్వస్తిశ్రీ "ఖర" నామ సంవత్సర వసంత ఋతువు చైత్రమాస శు.పాడ్యమి ప్రారంభపు రోజుకావటం గమనార్హం. దీని ప్రభావంచే దాదాపు 21 మాసాల పాటు ప్రతికూల ఫలితాలు పలు దేశాలపై ఉండును.

వైశాఖమాస ప్రారంభం నుంచి మాసమంతయూ త్రిగ్రహ, చాతుర్గ్రహ, పంచగ్రహ కూటములు జరుగుచూ, రాహువుపై కుజగ్రహ శనిగ్రహ వీక్షణలు వుండటం, అమావాశ్యకు గ్రహణ మేర్పడటం తీవ్రవాద దుశ్చర్యలకు ఊతమిస్తుంది. జ్యేష్ఠమాసంలో పూర్ణిమ అమావాస్యలకు గ్రహణాలు రావటం స్వల్ప సమస్యలకు హేతువగును. ఆషాడమాసం ఆది అంత్యాలలో గురువారాలు రావటం, మాసం మశ్యలో దక్షిణాయనం గురువారమే రావటంచే
ఉత్తరభారతంలో నదులు పొంగి పోరలించును. దక్షిణభారతంలో వ్యవసాయ పనులు ప్రారంభం కాకపోవటం గమనార్హం.

శ్రావణమాసంలో ఆగస్టు 5 ఉదయం 7 . 27 గంటల నుంచి 7 వ తేది ఉదయం 10 .29 గంటల వరకు 50 గంటలపాటు మేషరాశి నుంచి వృశ్చికరాశి వరకు రాహువు గురు గ్రహాల మధ్యన మిగిలిన గ్రహములన్నియూ 8 రాశులపై ఆచ్చాదనగా ఓ గ్రహమాలిక యోగంగానూ తిరిగి భాద్రపదమాసంలో సెప్టెంబర్ 1 మ 2 .35 గంటల నుంచి 3 సా 4 .22 గంటల వరకు 51 గంటలపాటు రాహు గురుగ్రహాల మధ్య మిగిలిన గ్రహాలన్నీ 8 రాశులపై అచ్చాదనగా ఓ గ్రహమాలికాయోగంగా ఏర్పడటం అరిష్టం.

ఆశ్వీయుజమాసం కన్యారాశి పంచగ్రహ, చాతుర్గ్రహ, త్రిగ్రహ, ద్విగ్రహ కూటమిగా రూపాంతరం చెందుతూ అనేక అనేక నష్టాలతో మాసం నడుచును. కార్తికమాసంలో కుజగ్రహం సింహరాశిలో అధికకాల స్తంభనకు సిద్ధం కాబోతూ, శుక్ర రాహువుల కలయుకతో, అమావాస్యకు పాక్షిక సూర్యగ్రహణం సంభవించనుంది. మార్గశిరమాసంలో ప్రారంభ అంత్యాలలో చంద్రుడు నీచస్తితిలోనూ, పూర్ణిమకు ఉచ్చస్థితిలోనూ ఉండి. పూర్ణిమ రోజున కేతుగ్రస్తంగా చంద్రునకు సంపూర్ణ గ్రహణం రావటం విశేషం.

మూలా నక్షత్ర ఆదివారంతో పుష్యమాసం ప్రారంభమై, మకరసంక్రమణ ఉత్తరాయణ పుణ్యకాలం ఆదివారం వచ్చి విశేష ముఖ్యఫలితాలు అందించుటకు సిద్ధమవుతున్నది. మాఘమాస శు.పాడ్యమి పూర్ణిమ అమావాస్యలు మూదూనూ మంగళవారం వచ్చి గ్రహాల ఆచ్ఛాదన సరియైన క్రమంలో లేకపోవటం అన్నదాతలకు కంటతడిపెట్టించే వాతావరణ పరిస్థితులు ఎదురగును. ఎదుర్కోలచే శుభాలకు గొడ్డలిపెట్టు.
ఏప్రిల్ 18 , 19 , 20 తేదీలలో ఉగ్రవాద తీవ్రవాద చర్యలు, సౌర సమస్యలు, వైమానిక ప్రమాదములు, బాంబు దాడులుండును. ఏప్రిల్ 28 , 29 , 30 మే 1 ,2 ,3 తేదీలలో సముద్ర కెరటాలు సునామీలా ఎగసిపడు సూచనుంది. సముద్రం వైపు వెళ్లకూడదని జ్యోతిష్య హెచ్చరిక. మే 11 , 12 , 13 తేదీలలో అగ్ని ప్రమాదములు, అలజడులు, బాంబుదాడులు, రాజకీయ ప్రతిఘటనలుండి శాంతిభద్రతలకు దెబ్బతగులును.మే 29 , 30 , 31 , జూన్ 1 , 2 , 3 తేదీలలో భూకంపములు మరియు జూన్ 10 ,11 ,12 ,13 తేదీలలో తీవ్రవాదుల దాడులు, వైమానిక ప్రమాదములు, అగ్ని ప్రమాదాలు, ప్రేలుళ్ళు, సౌర సంబంధ నష్టాలు, ముఖ్యనేతలపై దాడులు జరుగు సూచన.
జూన్ 14 ,15 ,16 తేదీలలో భూకంపములు, జూన్ 29 ,30 , జూలై 1 ,2 తేదీలలో హిందూమహాసముద్రంలో సునామీ అలజడి కెరటాలు, సముద్ర కంపనములు జులై 5 ,6 ,7 తేదీలలో ఉగ్రవాద దాడులు,భూకంపములు, మారణకాండలు ఉండగలవు. జులై 22 ,23 , 24 , 25 , 26 తేదీలలో రాజకీయ ప్రకంపనలు, తీవ్రవాదుల ముప్పు, చొరబాటుదారుల దారుణాలు, అగ్నిప్రమాదాలు, వైమానిక ప్రమాదాలు తదితర సమస్యలు మరియు సరిహద్దులలో కాల్పులు. మొత్తానికి జూన్ జూలై మాసాలలో దేశారిష్ట గ్రహస్తితులేక్కువని చెప్పవచ్చు.

జూన్ లో వృశ్చికలగ్నంలో ఆరుద్రకార్తె రావటంచే, రైతాంగానికి విశేష వర్షం. సముద్రంలో అల్ప పీడనాలు, ద్రోణులు తరచుగా ఉత్పన్నమవుతూ సకాల తొలకరికి అవకాశములున్నవి. నైరుతీ ఋతుపవనాలు ఆంధ్రరాష్ట్రంలో ఆశలు చిగుర్చును. నవమేఘ నిర్ణయానుసారం సంవర్తన అను మేఘం ఉత్తరదిక్కిలో ఏర్పడి 3 తూముల వర్షం, 4 తూములు గాలి ఉండును. 7 భాగముల వర్షం సముద్రముల పైనా, 9 భాగముల వర్షం పర్వతాలపైనా, కేవలం 4 భాగాల వర్షం భూమిపైననూ వర్షించును. 11 వీసముల పంట ఫలించును. అన్ని పంటలు, అన్ని రకముల నేలాలు ఫలించును.

సెప్టెంబర్ 4 వ వారం, అక్టోబర్ 1 వ వారంలో రాజకీయ, సినీరంగాలలో అశ్లీలతలు, సమస్యలు బట్టబయలై ప్రజలు ఇబ్బందులకు గురి కాగలరు. అక్టోబర్ 12 ,13 ,14 ,15 తేదీలలో తుఫాను సూచనలు. భారీ వర్షాలు, ఇతర ప్రకృతి వైపరిత్యాలు పర్యావరణానికి నష్టాలు. అక్టోబర్ 3 వ వారంలో సెన్సెక్స్ సూచికలో పెనుమార్పులు. నవంబర్ 12 ,13 ,14 , 15 తేదీలలో సినీ, కంప్యూటర్, తేలీకమ్యునికేషన్స్, మద్యపాన, స్వర్ణ, వస్త్ర రంగాలలో సమస్యలు. నవంబర్ 3 ,4 వారాలలో సాఫ్ట్ వేర్ రంగానికి సమస్యలు. నవంబర్ 23 నుంచి డిసెంబెర్ 14 వరకు భూకంపభయం పెరుగును. మొత్తం మీద గ్రహస్థితులను విశ్లేషించగా దేశంలోనూ, రాష్ట్రంలోనూ, శాంతి భద్రతలు దెబ్బతినును. పాలకులు కఠినచర్యలు తీసుకొనలేరు. పరిపాలనలో చిత్తశుద్ధిఉన్ననూ, సూక్ష్మ పరిశీలన లేనందున ఉగ్రవాదులు చాపకింద నీరులా, తమ చర్యలను సాగిస్తారు. ఆర్ధికస్థితి అంతంత మాత్రం. జలాశయ అంశాలపైననూ, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు వాదం పైననూ రాజకీయ రగడలు అధికమై, అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవుదురు. పరిపాలనా విభాగాలలోనూ, ప్రసిద్ధినొందిన ఆలయాలలోనూ అశ్లీలత, కుంభకోణాలు అధికమగును, పాలకులు చూడనట్లు వెళ్ళే మనస్తత్వంతో వుంటారు.

సనాతన మార్గంలో నడిచేవారు కూడా సంప్రదాయ విలువలను గాలికి వదిలేస్తారు. పాలకులు మనసువిప్పి ప్రజలతో మాట్లాడుతారనుకోవటం భ్రాంతి మాత్రమే. తాము చేసిన పాపం తమకు తగలకుండా ఉండుటకై పాలకులు అధికంగా యజ్ఞయాగాది క్రతువులలో పాల్గొంటారు.

శత్రుదేశాలతోనూ, రాష్ట్రాలతోనూ స్నేహాన్ని ఎలా చేయాలనే విషయంలో విజ్ఞులిచ్చే సలహాలు పాలకులు స్వీకరించలేరు. ఆర్ధిక రాజకీయ సామాజిక స్థితి స్తబ్దతను సమర్ధవంతమైన శక్తియుక్తులతో తొలగించే ప్రయత్నాలు చేస్తుంటారు. పరిపాలనలో ఆధిపత్యపోరు అధికమగును. భారీ కాంట్రాక్టులు, ఒప్పందాలు, విద్యా, వైద్య వ్యవస్థలు కలుషితమగును. మత్తు పదార్ధాల దొంగరవాణాను అరికట్టలేరు. పాలకులే ఆలయసంపదను దోపిడీ చేయాలనే దౌర్భాగ్యపు ఆలోచనతో వుంటారు. శుభకార్యాలలో పసిడి వినియోగం తగ్గక, మోజుపడే వారి సంఖ్య పెరుగును. అంతర్జాతీయ మార్కెట్లో బంగారు కుంభకోణంలో కీలకవ్యక్తులు భారతీయులుగా వుండే అవకాశం ఉంది.

బూటకపు ఎన్కౌంటర్లు పెరుగును. రాజకీయ రంగ స్త్రీలకున్న ఉగ్రవాద ముప్పును పసిగట్టలేరు. రసాయన ఆయుధాలతో సరిక్రొత్త పోకడలతో దుష్టులు చేపట్టే చర్యలతో శాంతి మార్గం కరువగును. మావోయిష్టుల ప్రాబల్యం పెరిగి కొన్ని రాష్ట్రాలలో నేతలు హతమవుదురు. మతతత్వ చాందసవాదుల విధ్వంసకర కార్యకలాపములు అధికమగును.

ప్రకృతి వైపరీత్యా సమయాలలో బుద్దిబలంతో రక్షణశాఖ వారు యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపట్టి ప్రాణనష్టాన్ని అరికట్టుదురు. బుద్ధిబలంతో రక్షణశాఖవారు శత ప్రయత్నాలు చేసినా, శత్రువులను ఎదుర్కొనలేరు. ముఖ్యనేతలపై జరిగే విద్రోహచర్యలను సమర్ధవంతంగా అరికట్టలేరు. రౌడీయిజంపై ధైర్యసాహసాలతో పరిపాలనాపర నిర్ణయాలను తీసుకొనలేరు.

సస్యాధిపతి శని, ధాన్యాధిపతి శుక్రునకు పరస్పర మిత్రత్వం ఉన్నందున నిత్యావసర వస్తు నిల్వదారులపై చర్యలు తీసుకునే నాధులుండరు. రైతాంగం కల్తీ సస్యాలను వినియోగించి నష్టపోవుదురు. నకిలీ వాణిజ్యం చేయు మేధావులు తయారగుదురు. స్టాక్ మార్కెట్ పలుమార్లు పతనం కావటంతో, భారీ కంపెనీల షేర్ మార్కెట్ విలువలు పడిపోవటంతో, కొంతమంది దారుణంగా దెబ్బతిని ఆత్మహత్యలకు గురికాగల సూచన వుంది. మాయలతో మోసాలతో వాణిజ్య రంగాన్ని దెబ్బతీయాలనే దుష్ట శక్తుల కుట్ర రట్టగును.

ఫోనుబాంబులు, టిఫిన్ బాక్స్ బాంబులు అధికమగును. రైలు రోడ్డు ప్రయాణీకులకు దోపిడీ బాధలు తప్పవు. భారతీయ విమానానికి బాంబు బెదిరింపు లేక హైజాకింగ్ జరిగే సూచన. ప్రసారమాధ్యమాలపై దాడులు జరుగును. స్త్రీ రాజకీయ నేతలపై జరిగే ప్రత్యక్ష దాడులను ఆపలేరు. ఉగ్రవాద, మావోయిష్టుల చిట్టాలో ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు రాష్ట్రానికి చెందిన ముఖ్య రాజకీయ నేతలు చేరుదురు.

ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి శివాలయంలో ధూప, దీప, నైవేద్య, కర్పూర హారతులు సక్రమంగా నిర్వర్తించేలా... ప్రతి ఒక్కరు దయచేసి పాటుపడేది. ఋతు ధర్మానుసారం వర్షించాలనే విశ్వాసంతో వరుణ జపాలు, యాగాలను పండితులు అధిక దక్షిణ ఫలాపేక్షణ లేకుండా లోక కల్యాణం కొరకై చేసేది. పుష్యమి, ఆశ్లేష, శ్రవణం, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రములు పూర్తిగా ఉన్న సమయాలలోనే ఈ వరుణ జపాలు, యాగాలు చేయటానికి ప్రయత్నించాలి.

ప్రజలందరూ యజ్ఞయాగాది శాంతి క్రతువులు ఆచరిస్తూ, యనలేని సంయమనంతోను, ఓర్పుతోను, మానవతా దృష్టితో వుండాలని భగవంతుని కోరుకుంటూ... సర్వేజన సుఖినోభవంతు సమస్త సన్మంగళాని భవంతు.

ప్రజాకర్షక పధకాలకు ఆర్ధికమాంద్యం ఏర్పడును. కీర్తి ప్రతిష్టలు పెంపొందులాగున నిజనేరస్తులను పల్లకీలలో ఊరేగించుదురు. మాజీ ముఖ్యమంత్రులపై న్యాయస్థానాల ప్రతికూలతీర్పులు. భారతావనిలో ఓ మత ధర్మచార్యుని వివాదంతో తలనొప్పి. పలుమార్లు స్టాక్ మార్కెట్ కుదుపులతో భారీగా నష్టాలు. ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాలలో రాజకీయ అస్థిరతలు పెరగటంతో పాలకులకు గడ్డురోజులు.


Thursday, January 13, 2011

దశాబ్దాల తరువాత అరుదైన భోగి


ప్రతి సంవత్సరం ఆంగ్ల నెలల ప్రకారం జనవరి నెలలోనూ, తెలుగు నెలల ప్రకారం పుష్య మాసంలోనూ శ్రద్ధతో ఆచరించే పెద్దల పండుగగా పేరొందిన పెద్ద పండగే మకర సంక్రాంతి. దక్షిణాయనానికి ఆఖరి రోజు, ధనుర్మాసానికి ఆఖరిరోజు, మకర సంక్రాంతి కి ముందు రోజు భోగి పండుగ. నిఘంటువు ప్రకారం భోగి అంటే తొలిరోజు అని అర్ధం. పెద్ద పండుగగా పిలువబడే మూడు రోజుల సంబరాల సంక్రాంతికి తొలిరోజును భోగిగా పిలుస్తారు.

వ్యవసాయ పనుల రద్దీ తగ్గి అన్నదాతలు సుఖంగా కాలక్షేపం చేయటానికి, చేతికందిన పంటను అనుభవానికి తెచ్చుకొని భోగభాగ్యాలు అనుభవించటానికి వీలు కలిగించే పండుగ భోగి పండుగ అని పెద్దలు అంటారు. భోగి రోజున రైతులందరూ సంవత్సరం పొడవునా వ్యవసాయ పనులు చేయగా వచ్చిన చెత్త చెదారం అంతా ఈరోజు వేకువజామునే మంటలుగా వేసుకుంటారు.

గృహంలో వున్న పాత కర్ర సామాను, పనికిరాని వస్తువులు అన్నింటిని మంటలలో వేస్తారు. పరోక్షంగా ఈ మంటలనే వరుణయాగాలుగా పిలవాలసి వుంటుంది. ఎందుకంటే వరుణ దేవుని కరుణ కటాక్షాలతో అన్నదాతల ముంగిళ్ళలోకి దాన్యం రావటం, ఆనందంతో వుండటం, తరువాత సంవత్సరం కూడా ఎలాంటి సమస్యలు లేకుండా వ్యవసాయానికి వరుణుడు అనుగ్రహించాలనే దృక్పదంతో ఈ మంటలను వేయటం అంతర్గత రహస్యం. మేఘాలకు అధిపతైన వరుణ దేవుడిని గ్రామీణులు మంటల రూపంలో ప్రార్ధిస్తారు. ద్వాపర యుగంలో ఈ భోగి పండుగరోజు వేసే మంటలు మేఘాదిపతిని ప్రార్ధించటానికని పురాణాలు చెబుతున్నాయి.

ఈ 2011 సంవత్సరంలో అరుదైన భోగి రానున్నది. శుక్రవారం భోగి పండుగ రావటం విశేషమేమికాదు కానీ శుక్రగ్రహ నక్షత్రమైన భరణి నక్షత్రంతోనూ, శుక్ర గ్రహ వారమైన శుక్రవారంతోనూ భోగి రావటంమాత్రం అత్యంత అరుదైనది. పదమూడు దశాబ్దాల క్రితం అంటే 130 సంవత్సరాల క్రితం శుక్రవారం భరణి నక్షత్రంలో భోగి పండుగ వచ్చింది. తిరిగి ఇంత కాలానికి ఈ జనవరి 14 శుక్రవారం భరణి నక్షత్రంతో భోగి పండుగ రానున్నది. ఈ భరణి నక్షత్ర శుక్రవారంతో కూడిన భోగి రోజున మహాలక్ష్మి దేవిని మనసారా భక్తితో కొలిస్తే భోగభాగ్యాలతో తులతూగుతారని పెద్దలు చెబుతారు.

గృహాలలో శ్రీ చక్ర మేరు వున్నవారు ఈ భరణి నక్షత్ర భోగి రోజున ఈ క్రింది మంత్రంతో మహాలక్ష్మిని ఆరాధించండి.

ఓం శ్రీం హ్రీం ధ్ర్రాం క్లీం ధన్యే ధనవర్ధిని సుమేరు మధ్య శృంగస్తా శ్రీమన్నగరనాయికా నమః ( లలితా సహస్రనామ స్తోత్రంలో 22 వ సంఖ్యలో వున్న రెండు పంక్తులలో మొదటి పంక్తి ) అంటూ 108 పర్యాయములు జపించి తీపి పదార్ధ నివేదనతో శ్రీమహాలక్ష్మిని సేవించాలి.

భూ ప్రస్తార మేరు వున్నవారు ఈ భరణి నక్షత్ర భోగి రోజున ఈ క్రింది మంత్రంతో మహాలక్ష్మిని ఆరాధించండి.

ఓం శ్రీం హ్రీం ధ్ర్రాం క్లీం ధన్యే ధనవర్ధిని ధరాధరసుతా ధన్యా ధర్మిణీ ధర్మవర్ధినీ నమః ( లలితా సహస్రనామ స్తోత్రంలో 176 వ సంఖ్యలో వున్న రెండు పంక్తులలో మొదటి పంక్తి ) అంటూ 108 పర్యాయములు జపించి తీపి పదార్ధ నివేదనతో శ్రీమహాలక్ష్మిని సేవించాలి.

శ్రీ చక్ర మేరు, భా ప్రస్తారములు లేనివారు మహాలక్ష్మి దేవి చిత్రపటాన్ని వుంచి ఓం శ్రీం హ్రీం ధ్ర్రాం క్లీం ధన్యే ధనవర్ధిని శ్రీమహాలక్ష్మి దేవతాభ్యో నమః అంటూ 108 పర్యాయములు జపించి తీపి పదార్ధ నివేదనతో శ్రీమహాలక్ష్మిని సేవించాలి.