Tuesday, September 2, 2014

అంతర్లీన దోషాలు - 3

కొన్ని కొన్ని ప్రత్యేక అంతర్లీన గ్రహస్థితులు అనేక రకాలుగా జాతకాలలో అంతర్లీనంగా దాగి ఉంటాయి. ఇట్టి గ్రహస్థితులను జ్యోతిష పండితులు ప్రత్యక్షంగా గ్రహించలేరు. జాతకంలోని పన్నెండు భావాలలో, సమస్యలు ఎక్కడా లేనే లేవని, పండితులు బల్ల గుద్ది చెప్పినప్పటికీ, ఈ జాతకులు మాత్రం సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. పితరులు చేసిన పుణ్య కార్యాల ఫలిత ప్రభావం ఉన్ననూ, అది జాతకులలో  అదృష్ట , ఆకర్షిత గ్రహస్థితిగా ఉంటే మంచిదే. కాని ఇట్టి అదృష్ట , ఆకర్షిత గ్రహస్థితి ప్రతివారి జాతకాలలో ఉండదు. కొంత మందికి మాత్రమే పరిమితము. అలా కాక తమ పితరులు చేసిన పాప కార్యాల ఫలితాల ప్రభావాన్ని వారి సంతానం అందుకొనే గ్రహస్థితి ఉంటే దానిని దురదృష్ట ఆకర్షిత గ్రహస్థితిగా భావించాలి. ఇట్టి దురదృష్ట ఆకర్షిత గ్రహస్థితి కూడా అందరికీ ఉండదు. కొంత మందికి మాత్రమే పరిమితము.

పితరులు చేసిన కార్యాల ప్రభావం అదృష్ట, దురదృష్ట ఆకర్షిత గ్రహస్థితులుగా జాతకాలలో ఉంటుంటాయి. ఇవి అందరి జాతకాలలో ఉంటాయనుకోవటం పొరపాటు. నూటికి 85 శాతం వరకు మాత్రం ఆకర్షిత గ్రహస్థితులు ఉంటున్నట్లుగా మా పరిశోధనలో వెల్లడైనది.

ప్రతి వ్యక్తి జీవితంలో వైఫల్యాలు, మానసిక వ్యధలు అప్పుడప్పుడూ ఎదురవుతుంటాయి. ఈ జీవితమే ఓ పెద్ద చలన చిత్రముగా భావించాలి. ఈ జీవితమనే సినిమా ఎప్పుడూ నడుస్తూనే ఉంటుంది. ప్రతి మనిషి ఇందులో ఒక పాత్ర పోషిస్తూ ఉంటాడు. గడిచిన కాలము, జరిగే కాలము, రేపటి కాలము.... అంతయూ ఈ సినిమా రీల్ లో ముందుగానే బంధించబడి ఉంటుంది. ఈ మూడు కాలాలలోనూ ఒక పనిని ఫలాని సమయంలో చేయాలని ముందే నిర్దేశింపబడి ఉంటుంది. ప్రస్తుతం ఈ అంతర్లీన దోషాలను పఠించాలని కూడా మీ జీవిత సినిమాలో నిర్దేశింపబడింది కనుకనే.... మీరు చదువుతున్నారు.

కాలం గడుస్తున్న కొద్దీ భవిష్యత్ వల్ల కలిగే సుఖ దుఖాలను అనుభవిస్తుంటాం. మన పూర్వ జన్మ కర్మానుసారంగానే ఈ జన్మలో ఆ కర్మకు ఆధారభూతమైన కధగా మన జీవితం రూపుదిద్దుకుంటుంది. కాబట్టి మన జీవన స్థితిని మార్చజాలము.

కర్మ సిద్ధాంతం ప్రకారం అవకాశం రావటం లేదా అనుకోనిది సంభవించటం కేవలం మిథ్య. మనం ఊహించే అవకాశాలు గాని ఊహించని సంఘటనలు గాని మనం ముందుకు తెలుసుకోలేకపోయినప్పటికీ... అవి కొన్ని విస్పష్టమైన కారణాల వలన జనించినవే. యాదృశ్చికంగా కావచ్చు, లేదా దైవ సంకల్పం వలన జరిగిందేమో అని సాధారణ వ్యక్తులు భావించినప్పటికీ సశాస్త్రీయ దృష్టితో ఆలోచించే జ్యోతిష్కుడు మాత్రం ముందుగా పసిగట్టగలడు, అంతేకాక వాటిని సహజమైనవిగా, జరుగవలసిఉన్నవిగా, కర్మకు అనుసరణీయములని ముందుగా చెప్పగలడు.   

మరికొంత విశ్లేషిస్తే విత్తనం నుంచి ఓ చెట్టు మొలకెత్తి, పెరిగి పెద్దదై తాను కాసేటటువంటి పండ్ల నుంచి తిరిగి విత్తనాలను అందించే ఓ వృక్షం వంటిదే మన కర్మ, జన్మ, జీవితం. విత్తనం కర్మ, పెరిగే వృక్షం జీవితం. విత్తనం ఎలాంటిదో... దాని నుంచి మొలకెత్తి పైకి వచ్చే మొక్క కూడా అలాంటిదే మరి. మిరప చెట్టుకు వంకాయ కాయదు, నారింజ చెట్టుకు ఆపిల్స్ లభించవు.

ప్రతి జీవి తన గమ్యాన్ని తానే సాధించుకుంటుంటాడు. కర్మ కొద్దీ కష్టాలు ప్రాప్తిస్తాయని తాను అర్థం చేసుకోవాలి. కర్మ సిద్ధాంతం మాత్రమే జీవితానికి జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ, దానిని ఏ విధంగా ఎదుర్కోవాలనే మానసిక సంసిద్ధతను వ్యక్తికి కల్గిస్తుంది. ఇటువంటి జ్ఞానం వ్యక్తి జీవితాన్ని గాని, తోటి వారిని గాని, దైవాన్ని గాని నిందించకుండా చేస్తుంది. వ్యక్తుల జీవితాలలో ఏ తప్పులు జరగనప్పటికీ, వారు ఎందుకు బాధలు పడతారో... ఓ భగవత్ సంబంధమైన కర్మ సిద్ధాంతం మాత్రమే వివరించగలదు, విశ్లేషించగలదు.

కనుక ప్రజలకు అనవసరమైన సమస్యలు, బాధలు రాకూడనివి అయినప్పటికీ, గ్రహ దోషాల వలన కలిగాయేమో అనుకుంటారు. గ్రహాలూ అదృష్టాన్ని గాని, దురదృష్టాన్ని గాని కలిగించవని చాలా మంది అనుకుంటుంటారు. మన జీవన గమనాలను, సంఘటనలను మాత్రమే గ్రహాలు సూచిస్తాయని, అసలు కారణం కర్మ అని ఇది  దైవ సంకల్పంగానే జరుగుతుందని పురాతన తాళపత్ర గ్రంధాలు తెలియచేస్తాయి.

మనం భగవంతుడిని వర్షపు నీరుగా కాసేపు పోల్చుకుందాం. ఈ వర్షపు నీరులో విత్తనాలను నానబెడితే.... కొన్ని మాత్రమే మొలకెత్తి పెరిగి పెద్దవవుతాయి. మరికొన్ని మొలకెత్తి స్వల్ప కాలంలోనే నశిస్తాయి. మరికొన్ని మొలకెత్తకుండానే నశిస్తాయి. ఇలా ఎందుకు జరుగుతున్నది ? దానికి సమాధానం మీ అందరికీ తెలిసే ఉంటుంది.... ఏమిటంటే విత్తనపు సారాన్ని బట్టి ఇలా జరుగుతుంటుంది. అలాగే ఒక వ్యక్తి గత జన్మలో ఏ కర్మ చేసి ఉంటాడో, వాటి ఫలితాలను ఈ జన్మలో ఎప్పుడెప్పుడు ఎలా అనుభవిస్తాడో... వివరించేదే జ్యోతిష్యం. కాని గ్రహాల గమనాలను బట్టి తయారయ్యే జాతక చక్రంలో ఆకర్షిత అదృష్ట గ్రహస్థితి ఉందా లేక దురదృష్ట ఆకర్షిత గ్రహస్థితి ఉందా తెలుసుకోవాలి. ఒకవేళ ఉంటే అది మనలను అనుకూలం వైపు ఆకర్షిస్తున్నదా లేక వికర్షిస్తున్నదా గమనించాలి. అలా కాక దురదృష్ట గ్రహస్థితి ఉంటే అది కూడా జాతకులను ఆకర్షిస్తుందా లేక వికర్షిస్తున్నదా గమనించాలి.    

ఈ గమనింపులో కొన్ని అంశాలను పరిగణనలోనికి తీసుకోవాలి. అవి ఏమిటంటే చనిపోయిన పితరులు, మన ప్రారబ్దం, మన మనోబలం, భగవంతునిపై అపారమైన నమ్మకం ఉంటూ జ్యోతిష విలువలు కూడా పెద్ద పీట వేయాలి. ఈ పరంపరలో చాలా మంది జ్యోతిష్యులను సంప్రదిస్తూ వివిధ రకములైన హోమాలను, జపతపాదుల వంటి శాంతి క్రియలను ఆచరిస్తుంటారు. మరి శాంతి క్రియలను ఆచరించినంత మాత్రాన వరుస విజయాలతో ఆనందమైన జీవితం లభిస్తుందా.... మరి పితరులు చేసిన పాప పుణ్యాల సంగతేమిటి... ఈ శాంతి క్రియల వలన పితరులు చేసిన పాపక్రియ కొట్టుకొని పోతుందా... ఒకవేళ పితరులు పాప కార్యాలు ఆచరించి ఉంటే శాంతి క్రియలచే అవి సరిక్రొత్త రీతిలో పుణ్య ప్రభావాలను జీవించి ఉన్నవారికి అందిస్తాయా... మొదలైన ఆసక్తికర అంశాలు అంతర్లీన దోషాలు - 4 లో చదువగలరు.                           - శ్రీనివాసగార్గేయ

Saturday, August 30, 2014

2014 ఆగష్టు 31 ఆదివారం రాత్రి ఆకాశంలో శని, కుజ, చంద్రుల దర్శనం

ఆగష్టు 31 ఆదివారం షష్టి తిథి వచ్చినందున దీనిని భానుషష్టి అంటారు. ఇదే రోజున తులారాశిలో శని గ్రహం, కుజ గ్రహాలతో పాటు చంద్రుడు కూడా వున్నారు. ఈ మూడు గ్రహాలు ఓ ముక్కోణాకారంగా ఆదివారం సాయంత్రం సూర్యాస్తమం తరువాత ఆకాశంలో నైరుతి దిశలో కనపడతారు. ఈ మూడు గ్రహాలలో శని గ్రహం మాత్రం బంగారు రంగులో దర్శనమిస్తాడు. కుజుడు అరుణ వర్ణంతో ఉంటాడు. జ్యోతిష శాస్త్ర రీత్యా భాను షష్టి పర్వదినాన ప్రదోష కాలంలో త్రిగ్రహ దర్శనం కలగటం, దానిని వీక్షించటము శుభ ప్రదం. ముక్కోణాకారంగా కనపడతాయి అంటే.... శని కుజ చంద్రుల నుంచి ఓ రేఖను గీచినట్ట్లుగా భావిస్తే, ఈ మూడు గ్రహాలూ ఒక త్రికోణానికి మూడు బిందువులుగా ఉంటాయి.
 

శని ఈ తులా రాశినుంచి 2014 నవంబర్ 2 వ తేదిన వృశ్చిక రాశిలోనికి పయనిస్తాడు. శని గ్రహానికి ఇది ఉచ్చ స్థానము. తిరిగి ఈ స్థానంలోకి శని రావాలంటే మరో 30 సంవత్సరాల సమయం పడుతుంది. అప్పుడు శనితో కుజుడు కలవాలి, చంద్రుడు కలావాలి.... భాను షష్టి అయివుండాలి, దీనికి తోడు గణపతి నవరాత్రులు కలిసి రావాలి. ఇలాంటి అవకాశం రావటం కొంత కష్టమే మరి.
 

కనుక ఈ సమయంలో ద్వాదశ రాశులవారు అవకాశం ఉన్నంతవరకు ఈ మూడు గ్రహాలను వీక్షించటానికి ప్రయత్నించటమే కాకుండా.... ఆ సమయంలో దేవి ఖడ్గమాలా స్తోత్ర పఠనమ్ చేయటం ఎంతో శ్రేయోదాయకం. ఇక్కడ కుజుడు, చంద్రుడు మిత్రులు. కుజుడు, శని శత్రువులు. చంద్రుడు శనికి అంతర్గత శత్రువు. అయితే ప్రస్తుతం జరిగే గ్రహ స్థితుల ప్రకారం ద్వాదశ రాశుల వారు ఆరోగ్య అంశాలపై ఈ ఆదివారం నుంచి 5 రోజుల పాటు కొంత అధిక శ్రద్ధ చూపించటం ఎంతైనా మంచిది. కనుక ప్రతి వారు ఈ త్రిగ్రహ దర్శనాన్ని చేసుకొనవలసినది. ఈ సమయంలో ఆకాశం మేఘావృతం కాకుండా వుంటే విశేష స్థితిని వీక్షించగల అవకాశం ఉంటుంది.

Tuesday, August 26, 2014

అంతర్లీన దోషాలు - 2

జన్మించిన ప్రతివారూ తాము మరణించే లోపు ఇతరులకు హాని చేయకుండా మరియు తలపెట్టకుండా, ప్రతి వారికి శుభం కలగాలనే, సమాజంలో అందరూ కలసి మెలసి ఉండాలని కోరుకుంటూ ఉంటుండాలి. కాని కాలగమనంలో వచ్చే మార్పుల వలన గాని లేదా సమాజంలో ఉండే స్థితి గతుల వలన గాని లేదా వ్యక్తిగత స్థితుల వలన గాని, లేదా ఆర్ధిక పరమైన అంశాల వలన గాని మనిషిలో అనేక రకాల మార్పులు రావటం, వాటిచే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములనే అరిషడ్వర్గాల ప్రభావం అధికం కావటంచే వ్యక్తి మనస్సులో నూతన అంశాలు చోటు చేసుకొని, వాటి వ్రేళ్ళు లోపలకి పాతుకుని పోతున్నాయి. సత్త్వగుణం తగ్గటం, రజో తమో గుణాలు పెరిగి పోవటం జరుగుతున్నది.

పై కారణాలచే వ్యక్తులలో వర్గ వైషమ్యాలు తారాస్థాయిలో ఉండటము, దాని వలన వ్యక్తిలో క్రొత్త ఆలోచనలు రావటం, అవి తనకే కాకుండా ఇతరులకు కూడా హాని తలపెట్టేవిగా ఉండటం జరుగుతున్నది. ఈ అంశాలు ఇటీవల నుంచే వచ్చినవి కానే కావు. అనాదిగా జన్మించిన వారందరిలో దాదాపు 80 శాతం వరకు ఈ కోవలోనే ఉంటుంటారు.

ఇక వారి యొక్క జీవన విధానంలో న్యాయబద్దత లోపించటము, మానవతా భావము అడుగంటటము, ఆవేశంతో చేయకూడని పనులు చేస్తూ ఇతరులను బాధ పెట్టి హింసా మార్గానికి పరోక్షంగా పెద్ద పీట వేస్తుంటారు. ఇట్టి వారి గుణ గణాలు ఇతరులకు ఎట్టి పరిస్థితిలోను నచ్చవు. ఓ కుటుంబంలోని ఓ వ్యక్తి ఇలాంటి హింసా మార్గంలో ఉంటూ... ఏదో ఒకనాడు తనువు చాలిస్తాడు. ఆ వ్యక్తికి కల్గిన సంతానంపై... ఈ తండ్రి చేసిన హింసాయుత చర్యల ప్రభావం తప్పకుండా ఉండి తీరుతుంది. దీనిని బట్టి మనకు తేటతెల్లమయ్యేది ఏమిటంటే... వ్యక్తులు చేసే కార్యాల ప్రభావం, తప్పక సంతతిపై ఫలితాలను చూపిస్తూనే ఉంటాయి. 


కొంతమంది తాము జీవించినంత కాలం ఎదుటివారికి ఎట్టి సమస్యలు రాకుండా జాగ్రత్త పడుతూ, అందరితో స్నేహ సంబంధాలు మెరుగు పరచుకుంటూ, మానవతా భావంతో ఉంటూ రాగ, ద్వేషాలను విడిచి, భూత దయ కల్గి, కీర్తి శిఖరాలను అధిరోహించినవారు ఉంటుంటారు. ఇట్టి వారు చేసిన సమాజానికి చేసిన ఘనమైన సేవల ప్రభావానికి తగినట్లుగానే... దాని ప్రభావం సంతతిపై ఆనందదాయకంగానే ఫలితాలను అందిస్తూ ఉంటుంది.

వ్యక్తులు చేసే కార్యాకార్యాల ప్రభావం... వారు మరణించిన తదుపరి సంతతికి ఫలితాలను చూపుతూనే ఉంటాయి. అయితే ఇక్కడొక విషయాన్ని గమనించాలి. ఒక వ్యక్తికి నలుగురు సంతానం ఉన్నారనుకుందాం, ఆ వ్యక్తి చనిపోయే లోపు ఎవ్వరికీ ఎలాంటి సమస్యలను ఇవ్వకుండా మంచి భావంతో దాన ధర్మాలు చేసి కాలం చేశాడు. మరి ఈ దాన ధర్మాలు చేసిన వ్యక్తి చనిపోయిన తదుపరి... వారి సంతతిపై వారికున్న నలుగురు సంతానంపై అనుకూలమైన ఫలితాలను ఇస్తాయని అనుకోవాలి. కాని ఈ నలుగురు సంతానంలో తమ చనిపోయిన తండ్రి చేసిన విశేష కార్యాల ప్రభావ ఫలితాలు.... తాను తన జాతకరీత్యా పొందే అవకాశము గల గ్రహస్థితి ఉన్నప్పుడే.... ఆ సంతతికి పూర్ణ ఫలాలు లభిస్తాయి. దీని అర్ధం ఏమిటంటే చనిపోయిన వారి వలన వచ్చే విశేష ఫలితాలను అందుకునే స్థితి జాతకంలో ఉన్నప్పుడే సాధ్యము.

అలా కాకుండా ఒక వ్యక్తి అందరినీ హింస పెడుతూ, దాన ధర్మాలు చేయకుండా, నేరాలు కుట్రలు కుతంత్రాలు, హత్యా రాజకీయాలు మొదలైనవాటిని ప్రేరేపిస్తూ కాలం చేశాడని అనుకుందాం. ఈ వ్యక్తికి కూడా నలుగురు సంతానం ఉన్నారనుకుందాం. మరి ఇప్పుడు ఈ దుర్మార్గపు లక్షణాలు గల వ్యక్తి చనిపోయిన తదుపరి... వాటి ప్రభావ ఫలితాలు నలుగురు సంతతిపై ఉంటుందా ? ఒక్కోసారి ఈ నలుగురు సంతతిపై వాటి ఫలితాలు ఉండవచ్చు లేక ఉండకపోవచ్చు లేక కొంతమందికే ఉండవచ్చు. దీని అర్థం ఏమిటంటే, ఆ వ్యక్తికి కలిగిన సంతానం జన్మ జాతకాల ప్రకారం... తమ చనిపోయిన తండ్రి చేసిన దుర్మార్గపు కార్యాల ప్రభావ ఫలితాలు సంతతికి ప్రాప్తించే గ్రహ స్థితి ఉండవచ్చు లేక ఉండకపోవచ్చు.

కనుక ప్రతి వారి జాతకాలలో పితరులు (చనిపోయినవారు) చేసిన కార్యాల ప్రభావంచే అనుకూల లేక ప్రతికూల ఫలితాలు వారి వారి సంతానంపై ఉండటానికి కొన్ని ప్రత్యేక గ్రహస్థితులు ఉంటుంటాయి. ఈ ప్రత్యేక గ్రహస్థితులు గనుక ఎవరి జాతకాలలోనైనా ఉండి ఉంటే వారు తమ పితరులు చేసిన కార్యా కార్య ప్రభావ ఫలితాలను, ప్రస్తుతం పొందుతుంటారు.

ఇంతకూ ఆ ప్రత్యేక గ్రహస్థితులు అనేక రకాలుగా ప్రతి వారి జాతకాలలో అంతర్లీనంగా దాగి ఉంటాయి. ఇట్టి గ్రహస్థితులను జ్యోతిష పండితులు ప్రత్యక్షంగా గ్రహించలేరు. జాతకంలోని పన్నెండు భావాలలో, సమస్యలు ఎక్కడా లేనే లేవని, పండితులు బల్ల గుద్ది చెప్పినప్పటికీ, ఈ జాతకులు మాత్రం సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. కనుక పితరులు చేసిన పుణ్య కార్యాల ఫలితాల ప్రభావాన్ని జాతకులు అందుకొనే గ్రహస్థితి ఉంటే దానిని అదృష్టం గా భావించాలి. ఇట్టి అదృష్ట , ఆకర్షిత గ్రహస్థితి ప్రతివారి జాతకాలలో ఉండదు. కొంత మందికి మాత్రమే పరిమితము.

అలా కాక తమ పితరులు చేసిన పాప కార్యాల ఫలితాల ప్రభావాన్ని వారి సంతానం అందుకొనే గ్రహస్థితి ఉంటే దానిని దురదృష్ట ఆకర్షిత గ్రహస్థితిగా భావించాలి. ఇట్టి దురదృష్ట ఆకర్షిత గ్రహస్థితి కూడా అందరికీ ఉండదు. కొంత మందికి మాత్రమే పరిమితము.

చిట్ట చివరిగా ఒక మాటలో చెప్పాలంటే పితరులు చేసిన కార్యాల ప్రభావం అదృష్ట, దురదృష్ట ఆకర్షిత గ్రహస్థితులుగా జాతకాలలో ఉంటుంటాయి. ఇవి అందరి జాతకాలలో ఉంటాయనుకోవటం పొరపాటు. నూటికి 85 శాతం వరకు మాత్రం ఆకర్షిత గ్రహస్థితులు ఉంటున్నట్లుగా మా పరిశోధనలో వెల్లడైనది.

పితరులు అంటే ఎవరు ? ఈ ఆకర్షిత గ్రహస్థితులు ఏ విధంగా ఉంటాయి ?... తల్లి తండ్రులు జీవించి ఉన్నప్పుడు బిడ్డలకు ఎవరి ద్వారా మంచి చెడు ప్రాప్తిస్తుంటాయి? ..... ఒకవేళ దురదృష్ట, అదృష్ట గ్రహస్థితులు ఉంటే, ఏ ఏ దశలలో ప్రభావాలు ఉంటుంటాయి... అసలు ఇలాంటి జాతక స్థితులను ఏమంటారు... అనేక ఆసక్తికర అంశాల కోసం అంతర్లీన దోషాలు మూడవ భాగంలో తెలుసుకుందాం.     - శ్రీనివాస గార్గేయ

భాద్రపదమాస మహాలయపక్షము

భాద్రపదమాసం ప్రారంభమైనది. ఈ మాసంలోని రెండవ పక్షాన్నే పితృ పక్షము అంటారు. పితృ దేవతలకు విశేషంగా ప్రీతికరమైన మాసమని భావము. భాద్రపద బహుళ పాడ్యమి నుంచి అమావాస్య వరకు ఉన్న 15 రోజులను పరిశీలిస్తే ఖగోళంలో సూర్యుడు కొద్ది రోజులు సింహ రాశిలోను, కొద్ది రోజులు కన్యా రాశిలోను ఉంటుంటాడు. ఒక్కోసారి ఒక రాశిలో ఉండగానే భాద్రపద మాస పితృపక్షం గడిచిపోతుంది. సూర్యుడు కన్యా, తులా రాశులలో సంచారం చేసి వృశ్చిక రాశి ప్రవేశం జరిగేవరకు ప్రేతపురి శూన్యంగా ఉంటుందని శాస్త్ర వచనం. అంచేత కన్య, తులా రాశులలో సూర్య సంచారం జరిగే షుమారు 60 రోజుల కాలమంతయూ... పితృ దేవతలు తమ ప్రేతపురిలో భోజన పానీయాలు లేకుండా ఉంటారు. ఇట్టి సమయంలో వారందరూ కూడా భూ లోకానికి వచ్చి వారి వారి గృహాల చుట్టూ తిరుగుతుంటారని మహా భారత గ్రంధం చాటి చెప్తుంది.

అందుచేతనే మనిషి చనిపోయిన తర్వాత చేసే కర్మ కాండలకు చాల కీలక ప్రాధాన్యత ఏర్పడింది. మానవులు గతించిన తర్వాత శ్రాద్ధ కర్మలు ఆచరించటం మన సంప్రదాయం. కాని ప్రతిఫలం ఆశించకుండా ఇట్టి శ్రాద్ధ కర్మలను ఆచరించాలి. వంద యజ్ఞాలు చేసే కన్నా పితృ దేవతలకు తర్పణాలు అందించటం ఎంతో ముఖ్యమని మన మహర్షులు తెలియచేస్తున్నారు. గతించిన తల్లి తండ్రులకు, ఇతరులకు తద్దినాలు, తర్పణాలు, పిండప్రదానాలు ప్రతి సంవత్సరము వారు మరణించిన రోజున ఆచరిస్తుంటారు.

కొంతమంది అయితే వారు మరణించిన రోజునే అన్నదానం చేసినట్లయితే పితృ దేవతలకు ఉత్తమ గతులు కల్గుతాయనే నమ్మకంతో అన్నదానంతో పాటు విశేష దానాలను చేస్తుంటారు. ఇలా చేసినందున పితృ దేవతల ఆశీస్సులు లభించి సకల శుభాలు కల్గుతాయని విశ్వాసం. కొంత మంది ఆర్ధిక స్తోమత లేనివారు ఇలాంటి విధానానికి బదులుగా ఆలయ అర్చకులకు, లేక సమీపంలో ఉండే పురోహిత పండితులకు దక్షిణ తాంబూలాలతో వారికి స్వయంపాకం సమర్పిస్తుంటారు. పితృ దేవతల ఆత్మకు శాంతి కల్గినప్పుడే ఇహ లోకంలో ఉన్న మనకు కూడా ప్రశాంతత చేకూరి సుఖ సంతోషాలతో వంశాభి వృద్ధి ఉంటుందని ధర్మశాస్త్రాలు తెలియచేస్తున్నాయి.

దానశీలిగా పేరుగాంచిన కర్ణుడు మరణానంతరము స్వర్గ లోకానికి వెళ్తుండగా మార్గ మధ్యంలో ఆకలి, దప్పిక కలగటంతో, తాను సమీపంలోని ఫల వృక్షానికి ఉన్న పండును కోసుకొని.. తినాలనుకునే సమయంలో, ఆ పండు కాస్తా బంగారు పండుగా మారిపోయింది. ఆ విధంగా సమీపంలో ఉన్న ఏ ఫల వృక్షం నుంచి ఫలాన్ని కోసిననూ, అవి కూడా స్వర్ణ ఫలాలుగానే మారిపోతున్నాయి. దప్పిక తీర్చుకుందామని సమీప సెలయేటిలోని నీటిని దోసిలిలో తీసుకున్నప్పటికీ, ఆ నీరు స్వర్ణ జలంగా మారటం జరిగింది. స్వర్గానికి వెళ్ళిన తర్వాత కూడా ఇలాగే పరిస్థితి పునరావృత మైనది.

ఈ విధంగా జరగటానికి ప్రధాన కారణమేమిటని కర్ణుడు వాపోతుంటే... కర్ణా... ధన, కనక, వస్తు, వాహనాలన్నీ దానం చేసావు గాని ఏ ఒక్కరికి కూడా పట్టెడు అన్నం పెట్టి ఆకలి తీర్చలేదు. అందుకే నీకీ స్థితి ప్రాప్తించింది అని అశరీరవాణి పలుకులు వినిపించాయి. వెంటనే కర్ణుడు తన తండ్రి అయిన సూర్యదేవుని ప్రాధేయ పూర్వకంగా ప్రార్ధించగా, సూర్య దేవుని యొక్క అనుగ్రహం మేరకు ఇంద్రుడు ఓ అపురూపమైన అవకాశాన్ని కర్ణునికి ఇచ్చాడు.

అదేమిటంటే తక్షణమే భూ లోకానికి వెళ్లి అక్కడ వారందరికీ అన్న పానీయాలను అందచేసి, మాతా పితరులందరికీ తర్పణాలు వదిలి తిరిగి స్వర్గానికి రావటము. ఇంద్రుని అవకాశం మేరకు కర్ణుడు భాద్రపద మాసంలో బహుళ పాడ్యమి రోజున భూలోకానికి రావటము, ఇక్కడ పేదలకు అన్న సంతర్పణలు, పితరులకు తర్పణ, పిండ ప్రదానాలు వదిలి తిరిగి భాద్రపద అమావాస్య రోజున స్వర్గానికి వెళ్ళాడు. ఇట్టి అన్న సంతర్పణలు, పితృ తర్పణాలు చేసినందున స్వర్గ లోకంలో కర్ణుడు సుఖంగా ఉండటానికి అవకాశం లభించింది.

కర్ణుడు భూలోకానికి వచ్చి, ఇక్కడ కొద్ది రోజులు ఉండి తిరిగి స్వర్గానికి వెళ్ళిన ఈ పక్షం రోజులకే మహాలయ పక్షమని పేరు. ఈ మహాలయ పక్షంలోని చివరి రోజునే మహాలయ అమావాస్య అంటారు.

ప్రస్తుత యాంత్రిక యుగంలో పితృ దేవతలకు శ్రాద్ధ కర్మలు (తద్దినాలు) పెట్టటము మానుతున్నారు. సమయం లేక కొంతమంది, బ్రాహ్మణులు దొరకక ఇంకొంతమంది, గృహంలో అనారోగ్య కారణాలచే శుచితో (మడి) వంట చేసేవారు లేక అలాగే వంట వారు దొరకక, మరికొన్ని సందర్భాలలో శ్రాద్ధ కర్మలు ఆచరిస్తే పితృ దేవతలకు చేరతాయా అనే హాస్యాస్పద ధోరణితో.... ప్రస్తుత కాలంలో తద్దినాలు తగ్గిపోతున్నాయి. ఈ కారణాల వలన వంశాభివృద్ధి జరగటంలేదనేది అక్షర సత్యము.

ఆచార వ్యవహారాల మీద మహా విశ్వాసం ఉన్న వారికి కూడా, తమ తమ ఉద్యోగ వ్యాపారాల వలన కాని ఇతర అనారోగ్యాల వలన కాని ఒక్కోసారి సమయం దొరక్క, ఆ రోజున వారి పితృ దేవతలను స్మరిస్తూ, ఆ యా రోజులలో కొన్ని పుణ్యక్షేత్రాలలోని నిత్యాన్నదాన సత్రాలలో తమ పెద్దల పేరుతో, తమ శక్తికి తగినట్లుగా అన్నసంతర్పణ గావిస్తున్నారు. ఏమి చేయలేని ఆర్ధిక దుస్థితి లో ఉన్నవారు... సమీపంలో ఉన్న వృక్ష సముదాయాల దగ్గరకు వెళ్లి, ఆ వృక్షాన్ని హత్తుకొని పితరులను ఉద్దేశించి కన్నీరైన కార్చవలెనని ధర్మ శాస్త్రం తెలియచేస్తుంది.

వైదిక పరమైన ఆచారాలు, సంప్రదాయాల మీద నమ్మకం లేని వారు కూడా సంవత్సరంలో ఒక్కరోజైనా చనిపోయిన వారిని తలుచుకొని పేదలకు వస్త్ర, ధన, అన్నదానాలు చేస్తూ ఉంటారు. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. వస్త్ర దానం గాని, ధన దానం గాని చేసిన తర్వాత స్వీకరించిన వారు పూర్తిగా తృప్తి పడలేరు. ఎందుకంటే బాగా ధనవంతులుగా ఉన్నారుగా ! మరికొంత ఎక్కువ ధనం  ఇస్తే బాగుండేది అనుకుంటారు, అలా కాకుండా వారిని కూర్చోపెట్టి కడుపునిండా... తృప్తి పడేలా అన్నదానం చేసినప్పుడు వారు... సంతృప్తి తోనే ఇక చాలు అంటారు. అందుకే అన్నీ దానాల కంటే అన్నదానం గొప్పదని శాస్త్ర వచనం.

కనుక పాఠకులు ఈ ఆర్టికల్ ను చదివి మహాలయ పక్షంలో తమ పితరులకు తర్పణ పిండ ప్రదానాదులు ఆచరిస్తూ, పేదలకు తమ శక్త్యానుసారం అన్నదానం చేయగలరని ఆశిస్తూ.. జ్యోతిష శాస్త్ర ప్రకారం భాద్రపద మాస మహాలయ పక్షము సూర్యుడు సింహ, కన్య రాశులలో సంచారం చేసే సమయంలోనే  వస్తుంది. ఈ సమయంలో విధి విధానంతో ఆచరించినప్పటికీ... పితృ కారకుడైన సూర్య గ్రహము ప్రతి సంవత్సరము సెప్టెంబర్ 16 నుంచి నవంబర్ 17 వరకు కన్యా, తులా రాశులలో సంచరిస్తుంటాడు. కనుక ఈ 60 రోజులలో వచ్చే ఇతర  అమావాస్య  రోజులలో కూడా తమ తమ పితరులను ఉద్దేశించి వైదిక క్రియల ద్వారా గాని అన్న సంతర్పణలు గాని ఆచరించవచ్చును.  ఈ పితృ దేవతలను గురించిన విశేష అంశాలు జాతకాలలో ఏ విధంగా అనుకూల, ప్రతికూల ప్రభావాలు చూపిస్తుంటాయో  అంతర్లీన దోషాలు - 1 నుంచి వరుసగా చదవండి . - శ్రీనివాస గార్గేయ

Friday, August 22, 2014

అంతర్లీన జాతకదోషాలు - 1

పురాతన తాళపత్ర గ్రంధాలలో జ్యోతిష అంశాలు నిక్షిప్తమై ఉన్నాయి. కొన్ని అంశాలు వెలుగులోకి వచ్చినప్పటికీ, ఇంకా ఎన్నో అంశాలు వెలుగులోకి రావలసిన అవసరం ఉన్నది. చాలా మంది జాతక చక్రాలలో పైకి దోషాలు ఏమి కనపడక పోయినప్పటికీ... వారు అనేక బాధలతో, సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. ఉదాహరణకు ఒకరికి జాతక చక్రంలో వివాహ స్థానంలో సమస్య ఎక్కడా గోచరించకపోయినప్పటికీ... ఆ ఒకరికి ప్రధమ వివాహం దెబ్బతిని విడాకులు తీసుకున్నారు. మరి ఎందుకు విడాకులు తీసుకొనవలసి వచ్చింది. ఇలాంటి సందర్భాలలో కేవలం దోషమనేది వివాహ స్థానంలోనే ఉంటుందని కాదు. ఆ దోషాన్ని ఇచ్చే గ్రహ స్థితులు, జాతకంలో మరో స్థానంలో ఉండి, పరోక్షంగా వివాహ అంశం మీద ప్రభావం చూపింది.

అలాగే జాతక చక్రంలోని 12 భావాలలో కనపడని దోష స్థితులు వేరు వేరు రకాలుగా కనపడుతూ ఉంటాయి. ఇలాంటి వాటిని ప్రతి ఒక్కరూ గమనించుకుంటూ, దోష పరిహారం కూడా క్రమం తప్పకుండా చేసుకుంటూ ఉంటుండాలి.  కొన్ని కొన్ని దోషాలకు ఉపశమనంగా చేసే పరిహారాలు కొంతకాలం వరకే ఆచరించాలి.  మరికొన్ని దోషాలకు అతి దీర్ఘ కాలం పరిహారాలు ఆచరిస్తూ ఉండాలి. 

ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి జాతక పరమైన దోషం ఉన్నప్పుడు, ఆ వ్యక్తి మాత్రమే పరిహారం పాటిస్తూ ఉంటే... జీవితం సంతోషమయంగా ఉంటుంది. అలా కాక ఆ వ్యక్తికి బదులుగా మరొక వ్యక్తి పరిహారం పాటిస్తే, ఫలితాలు సజావుగా ఉండవు. 

మన జాతక చక్రాలలో గ్రహ బలా బలాలు ఎలా ఉన్నప్పటికీ దైవబలం కూడా మనకు అనుకూలంగా ఉంటుండాలి. అందుకే చాలా మంది ఆలయ దర్శనాలు చేయటం , వ్రతాలు, నోములు చేపట్టటం , హోమ కార్యక్రమాలలో పాల్గొనటం చేస్తుంటారు. భగవంతుని యొక్క అనుగ్రహం పొందటానికి, ప్రతి ఒక్కరు వారికి తోచిన మరియు తెలిసిన రీతిలో ప్రార్ధనలు సాగిస్తుంటారు.
భారతీయ సనాతన సాంప్రదాయంలో అనేక వైదిక క్రియలు ఉన్నాయి. ఇవి కొంతమందికి అందుబాటులో ఉంటాయి. చాలా మందికి అందుబాటులో కూడా వుండవు. 


మనది కర్మభూమి, వేదభూమి. మనం చేయాల్సిన, ఖచ్చితంగా ఆచరించాల్సిన కర్మలను విసర్జిస్తున్నాం. దీనికి కారణం కూడా లేకపోలేదు. ఎందుకంటే మన నిత్య యాంత్రిక జీవనంలో సమయాభావం వలన ఆచరించాల్సిన కర్మలను ఆచరించలేక, తేలికపాటి అంశంతోనే తూ తూ మంత్రంగా చేయి దులుపుకుంటున్నారు. ఇందుచేతనే క్షణ క్షణం సమస్యలు, మానసిక వత్తిడులు, చెప్పుకోలేని కష్టాలు ఎదురవుతున్నాయి.
 

కొంతమందికి కావలసినంత ధనం ఉంటుంది. కాని తెలియని ఆవేదన, అశాంతి వెంటాడుతూనే ఉంటాయి. ఇంకొంత మందికి సకల భోగాలతో తులతూగే అవకాశాలు ఉన్నప్పటికీ, తనివితీరా భోజనం చేయటానికి అనారోగ్యం అడ్డుపడుతుంటుంది.
 

మరికొన్ని కుటుంబాలను పరిశీలిస్తుంటే అనేక ఆశ్చర్యకరమైన తేటతెల్లమవుతుంటాయి. కుటుంబ సభ్యులలో అధికులకు వివాహం కాకుండా వుండటం లేదా సంతానం కలగకుండా ఉండిపోవటం, ఏదో వంశ పారంపర్యంగా వస్తున్నదన్నట్లుగా కనుచూపు తగ్గిపోవటం, మూగవారుగా ఉండిపోవటం, అంగవైకల్యంతో ఉండటం గాని, న్యాయ స్థానాల చుట్టూ జీవితకాలం తిరగటం కాని, జన్మించిన తర్వాత విద్యా బుద్ధులు రాక మందమతులుగా మిగిలిపోవటము.... ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి.  

ఈ విధంగా ఉండటానికి జాతక చక్రంలో లోపాలా అని ఒకవైపు ఆలోచిస్తుంటాం, కాని జాతకచక్రంలోని 12 భావాలలో... దోషాలు కనపడవు. మరి ఈ సమస్యలు ఏ దోషాల వలన వస్తాయి. అవి జాతకాలలో అంతర్లీనంగా ఉంటుంటాయి కనుక వాటిని గురించి పరిశీలిస్తే అనేక ఆసక్తికరమైన విషయాలు జ్యోతిష తాళపత్రాల గ్రంధాల ద్వారా తేటతెల్లమవుతున్నాయి. అలాంటి జాతకాలలో దాగి ఉన్న దోషాలను తెలుసుకొని, వాటి పరిహారాలను క్రమబద్దంగా, శాస్త్రీయంగా పాటించగలిగినప్పుడే.... మనకు పరిపూర్ణమైన ప్రశాంతత చేకూరుతుంది. తదుపరి ఆర్టికల్ లో మరిన్ని వివరాలు తెలుసుకోగలరు.
                                                                              - శ్రీనివాస గార్గేయ

Saturday, May 31, 2014

హ్రీంకార మహాయజ్ఞ నిర్ణయ తేదిలో మార్పు

అనివార్య కారణములచే హ్రీంకార మహాయజ్ఞం కార్యక్రమం జూన్ 10 మంగళవారం కాకుండా మరొక రోజున జరుపబడును. తేది, వేదిక త్వరలో తెలియచేయబడును. విధి విధానాలను మాత్రం యధావిధిగా బ్లాగ్ లో ఇవ్వబడునని గమనించేది - శ్రీనివాస గార్గేయ

Saturday, May 24, 2014

హ్రీంకార యజ్ఞము - సర్వరక్షాకర చక్ర అవసర సారంశము 9

6. సర్వరక్షాకర చక్రము

పరమేశ్వరి యొక్క యంత్ర రూపాన్నే శ్రీచక్రము అంటారు. ఇందులో మొత్తం 9 ఆవరణలు గల చక్రములు ఉంటాయి. ఇందులో ఆరవచక్రమే సర్వరక్షాకర చక్రము. శ్రీచక్ర మేరులో పీఠంపై  బహిర్దశారం పైన పది కోణాలు కల్గిని ఆవరణ ఉంటుంది.  దీనిని అంతర్దశారం అంటారు.    
 
ఈ శరీరంలో ఉన్న షట్చక్రాలలో ఆరవదిగా ఉన్నఆజ్ఞా చక్రమే. ఇది శరీరంలో రెండు కనుబొమ్మల మధ్య గా స్థానం.  ఈ సర్వరక్షాకర చక్రములో పది మంది నిగర్భయోగినీ దేవతలు ఉంటారు.

సంగీతంలోని సప్త స్వరాలలో ఇది "రిషభ" స్థానము. రిషభం అనగా "రి" స్వరము. వృషభం యొక్క గొంతుకతో "రి" స్వరాన్ని ఉచ్చరించాలి. వృషభం ధర్మానికి ప్రతీక. గురువు మనకు ఏది ధర్మమో, ఏది అధర్మమో ఉపదేశిస్తాడు. శిష్యులను ధర్మమార్గ ప్రవర్తకులను చేస్తాడు. సాధకుడు గురువును ఆశ్రయించిన తరువాత, తన సంగతి గురువే చూసుకుంటాడు. అందుకే దీనిని సర్వరక్షాకర చక్రమన్నారు. లలితా సహస్రనామావళిలో ఈ చక్ర అంశాలను గురించి  521, 522, 523, 524, 525, 526, 527 నామాలలో స్పష్టం చేయటమైనది. 

మనమీద ఎవరికైనా కోపం వస్తే దేవుడు లేక దేవత రక్షిస్తుంది. ఆ దేవుడు లేక దేవతకు మనమీదనే కోపం వచ్చినపుడు గురువు రక్షిస్తాడు. ఎవరిమీదనైనా గురువుకి కోపం వస్తే వారిని ప్రపంచంలోని ఏ శక్తి రక్షించలేదు. భారతీయ సాంప్రదాయంలో గురువుకు అంత విశిష్ట స్థానం ఇచ్చారు. అందుకే ఈ చక్రాన్ని సర్వరక్షాకరచక్రమన్నారు. 

శ్రీ లలితా సహస్రనామాలలో "రక్షాకరీ" అను 317వ నామం కలదు. అనేక రకాలుగా మనకు తెలియకుండానే మనకు రక్షణ కావలసివుంటుంది. ఆకలి నుంచి, వేదన నుంచి, అజ్ఞానం నుంచి కూడా రక్షించగల శక్తి అమ్మవారు. ఎన్నో విధాలుగా తను ఉపాసించిన భక్తులను కాపాడు తల్లి గనుక రక్షాకరీ అన్నారు. ఈ నామాన్ని విడదీస్తే రక్షా+ఆకరీ. ఆకరము అంటే స్థానము. రక్షాకరీ అనగా రక్షణకు స్థానమైనది. దీనికి గుర్తుగా రెండు కనుబొమ్మల మధ్యనుండే ఆజ్ఞా చక్ర స్థానాములో శ్రీమాత కుంకుమను బొట్టు రూపంలో సాధకులు ధరిస్తుంటారు. 
 
సర్వరక్షాకర చక్రానికి అధిష్టాన దేవతే త్రిపురమాలినీ . ఈ చక్రానికి ప్రదర్శించవలసిన ముద్ర పేరే సర్వమహాంకుశా. 

లలితా సహస్రనామావళిలో 875వ నామం త్రిపురమాలినీ. త్రిపురములను మాలగా ఉన్న తల్లి అని అర్ధము. ఈ జగత్తంతా మూడేసి వర్గములుగా, విధములుగా ఉన్నది. కనుక ఈ మూడు అన్నది జగద్వాక్యము. పూలన్నీ ఒక చోట కుప్పగా వేస్తె దానిని మాలా అని పిలవరు. ఒకదానితో ఒకటి కలిపి దారముతో కట్టినప్పుడే మాల అనబడును. మన శరీరము మూడు ముక్కలుగా లేదు. స్థూల, సూక్ష, కారణ శరీరములనబడే మూడు త్రిపురములుగా కలిపి ఉన్నది. స్థూల శరీరం క్రియా శక్తి, సూక్ష శరీరం జ్ఞాన శక్తి, కారణ శరీరం ఇచ్ఛా శక్తి. ఈ మూడు శక్తులనే మనం మహాకాళీ, మహాలక్ష్మీ, మహాసరస్వతిగా ప్రార్థిస్తాము.

కనుక
సర్వరక్షాకర చక్రములోని 10 నిగర్భయోగినుల రుద్ర గాయత్రీ మంత్రములను దిగువ తెల్పిన రీతిలో ముద్రను ప్రదర్శిస్తూ పఠించేది. ప్రతి దేవతకు హ్రీం బీజాక్షరం మూడు మార్లు వచ్చునని గుర్తించాలి. ఈ ముద్ర ఏ విధంగా ఉంటుందో చివరలో ఉండే వీడియోలో ఆరవముద్రను గమనించండి. 
 
1. ఓం హ్రీం సర్వజ్ఞాయై విద్మహే హ్రీం మహామాయాయై ధీమహి హ్రీం తన్నోదేవీ ప్రచోదయాత్।

2. ఓం హ్రీం సర్వశక్త్యై విద్మహే హ్రీం మహాశక్త్యై ధీమహి హ్రీం తన్నోదేవీ ప్రచోదయాత్।

3. ఓం హ్రీం సర్వైశ్వర్యప్రదాయై విద్మహే హ్రీం ఐశ్వర్యాత్మికాయై ధీమహి హ్రీం తన్నోదేవీ ప్రచోదయాత్।

4. ఓం హ్రీం సర్వజ్ఞానమయ్యై విద్మహే హ్రీం జ్ఞానాత్మికాయై ధీమహి హ్రీం తన్నోదేవీ ప్రచోదయాత్।

5. ఓం హ్రీం సర్వవ్యాధివినాశిన్యై విద్మహే హ్రీం ఔషధాత్మికాయై ధీమహి హ్రీం తన్నోదేవీ ప్రచోదయాత్।

6. ఓం హ్రీం సర్వాధారస్వరూపిణ్యై విద్మహే హ్రీం ఆధారాత్మికాయై ధీమహి హ్రీం తన్నోదేవీ ప్రచోదయాత్।

7. ఓం హ్రీం సర్వపాపహరాయై విద్మహే హ్రీం సర్వతీర్థస్వరూపిణ్యై ధీమహి హ్రీం తన్నోదేవీ ప్రచోదయాత్।

8. ఓం హ్రీం సర్వానందమయ్యై విద్మహే హ్రీం మహానందాయై ధీమహి హ్రీం తన్నోదేవీ ప్రచోదయాత్।

9. ఓం హ్రీం సర్వరక్షాస్వరూపిణ్యై విద్మహే హ్రీం సర్వరక్షణాయై ధీమహి హ్రీం తన్నోదేవీ ప్రచోదయాత్।

10. ఓం హ్రీం సర్వేప్సిత ఫలప్రదాయై విద్మహే హ్రీం ఫలాత్మికాయై ధీమహి హ్రీం తన్నోదేవీ ప్రచోదయాత్।
  
 

తదుపరి పోస్టింగ్ లో ఏడవదైన సర్వరోగహర చక్రం గురించి తెలుసుకుందాం.                                                         - శ్రీనివాస గార్గేయ 

Thursday, May 15, 2014

హ్రీంకార యజ్ఞము - సర్వార్థసాధక చక్ర అవసర సారంశము 8

5.  సర్వార్థ సాధకచక్రము  

పరమేశ్వరి యొక్క యంత్ర రూపాన్నే శ్రీచక్రము అంటారు. ఇందులో మొత్తం 9 ఆవరణలు గల చక్రములు ఉంటాయి. ఇందులో ఐదవచక్రమే సర్వార్థ సాధక చక్రము. శ్రీచక్ర మేరులో పీఠంపై  చతుర్దశారం పైన పది కోణాలతో ఉండే చక్రము, దీనిని బహిర్దశారము అంటారు.    

దీనికి 10 కోణాలు ఉంటాయి.  ఈ శరీరంలో ఉన్న షట్చక్రాలలో ఐదవదిగా  ఉన్నవిశుద్ధి చక్రమే. ఇది శరీరంలో కంఠస్థానం దగ్గర ఉండును. ఈ సర్వార్థ సాధక చక్రములో పది మంది కులోత్తీర్ణ యోగినీ దేవతలు ఉంటారు.

వాక్కునకు నాలుగు రూపాలు ఉంటాయి. పరా, పశ్యంతీ, మధ్యమా, వైఖరీ అనే నాలుగు రూపాలు. ఇవి లలితా సహస్రంలోని  366, 368, 370, 371 నామాలలో స్పష్టమవుతుంది. 366 సంఖ్యలో ఉన్న పరాయై అనగా మానవుడు ఏది చేయాలన్నా లేదా పలకాలన్నా అంటే తన ఆలోచన లేక మాట లేక నిర్ణయం మెదడు స్థానంలో ఉన్న సహస్రారమున కల్గును. సహస్రారమందలి పరా దశలో ఉన్న వాక్కే పరా వాక్కు. 

368 సంఖ్యలో ఉన్న పశ్యంత్యై అనగా ఈ వాక్కు లేక శబ్దం లేక నాదం జనించుటకు వాయువు అవసరం. ఎప్పుడైతే సహస్రారంలో ఓ మాట పలకాలి లేక ఓ శబ్దం చేయాలి అనే ఆలోచన రాగానే, పరా నాడి వలన ప్రేరణ పొంది, వాయువు మూలాధార చక్రంలో ఏర్పడును. కనుక ఇట్టి మూలాధార చక్రంలో ఉండే వాక్కు యొక్క దశనే పశ్యంతి దశ అంటారు. 

370 సంఖ్యలో ఉన్న మధ్యమాయై అనే నామానికి అర్థం ఏమిటంటే పై విధంగా మూలాధారంలో జనించిన వాయువు స్వాధిష్టాన, మణిపూరక చక్రములను సుషుమ్న నాడి ద్వారా దాటి అనాహత చక్రమునకు చేరిన దశనే మధ్యమా అంటారు. 

371 సంఖ్యలో ఉన్న వైఖరీరూపాయై అనే నామానికి అర్థం ఏమిటంటే అనాహత చక్రంలో మధ్యమా రూపంలో ఉన్న వాక్కు... విశుద్ధి చక్రాన్ని చేరి, అక్కడ ఆ శబ్దము ఒక స్పష్టమైన అక్షర రూపమును పొంది ఉచ్చరింపబడును. ఇదే వాక్కు యొక్క వైఖరీ రూపము. 

పై నాలుగు నామాలలోని నాల్గు దశలలో వాక్కు అనేది అస్పష్టంగా (వాయురూపంలో) ఉంటుంది. నాల్గవ నామంలో చెప్పిన వైఖరీ రూపంలోనే మాటగా స్పష్టమై ఇతరులకి వినపడుతుంది. అందుకే ఈ నాల్గు రూపాలతో ఉన్న వాక్కుకు సర్వార్థసాధకము అని పేరు.  సమస్త  విద్యలన్నీ కంఠస్థానములో ఉన్న విశుద్ధి చక్రము నుండే వైఖరీ రూపంలో వస్తుంటాయి. 

సర్వార్థసాధక చక్రానికి అధిష్టాన దేవతే త్రిపురాశ్రీ. మూలాధారంలో త్రిపురా అని చెప్పబడ్డ దేవత... ఇక్కడ త్రిపురాశ్రీ అని పిలవబడుచున్నది. శ్రీ అనగా శ్రీవిద్య. శ్రీవిద్య ఒక్కటే మోక్షప్రదము. మిగిలిన విద్యలన్నీ డబ్బు సంపాదించుకొని ఉదర పోషణతో బ్రతకటానికే. 

శ్రీ లలితా రహస్య సహస్ర నామాలలో మొత్తం 12 సార్లు ( 1, 2, 3, 56, 85, 127, 392, 585, 587, 996, 997, 998) మాత్రమే శ్రీ అనే అక్షరంతో నామాలు ఉన్నవి. పరోక్షంగా చెప్పాలంటే పంచదశీ మహామంత్రాన్ని ఈ లోకంలోకి తెచ్చినవారు పన్నెండు మంది. వారికి ప్రతీకగా ఈ నామాలలో పన్నెండు సార్లు శ్రీ ఉన్నది. ఈ పన్నెండు మందే మనువు, చంద్రుడు, కుబేరుడు, లోపాముద్ర, మన్మధుడు, అగస్త్యుడు, నందికేశ్వరుడు, సూర్యుడు, ఇంద్రుడు, విష్ణువు, శివుడు, దుర్వాసుడు.  ఈ పన్నెండు మందే ప్రఖ్యాతి గడించిన దేవి ఉపసాక మహానుభావులు. 

ఈ చక్రంలోని శ్రీ అనే పదానికి పరిపూర్ణమైన భావాలన్నీ హ్రీంకార మహాయజ్ఞ పుస్తకంలో ఉండును. 

ఈ చక్రానికి ప్రదర్శించవలసిన ముద్ర పేరే సర్వోన్మాదినీ.

కనుక సర్వార్థ సాధక చక్రములోని 10 కులోత్తీర్ణ యోగినుల రుద్ర గాయత్రీ మంత్రములను దిగువ తెల్పిన రీతిలో ముద్రను ప్రదర్శిస్తూ పఠించేది. ప్రతి దేవతకు హ్రీం బీజాక్షరం మూడు మార్లు వచ్చునని గుర్తించాలి. ఈ ముద్ర ఏ విధంగా ఉంటుందో చివరలో ఉండే వీడియోలో ఐదవముద్రను గమనించండి.
   
1. ఓం హ్రీం సర్వసిద్దిప్రదాయై విద్మహే హ్రీం శ్వేతవర్ణాయై ధీమహి హ్రీం తన్నోదేవీ ప్రచోదయాత్।

2. ఓం హ్రీం సర్వసంపత్ప్రదాయై విద్మహే హ్రీం మహాలక్ష్మ్యై ధీమహి హ్రీం తన్నోదేవీ ప్రచోదయాత్।

3. ఓం హ్రీం సర్వప్రియంకర్యై విద్మహే హ్రీం కుందవర్ణాయై ధీమహి హ్రీం తన్నోదేవీ ప్రచోదయాత్।

4. ఓం హ్రీం సర్వమంగళకారిణ్యై విద్మహే హ్రీం మంగళాత్మికాయై ధీమహి హ్రీం తన్నోదేవీ ప్రచోదయాత్।

5. ఓం హ్రీం సర్వకామప్రదాయై విద్మహే హ్రీం కల్పలతాత్మికాయై ధీమహి హ్రీం తన్నోదేవీ ప్రచోదయాత్।

6. ఓం హ్రీం సర్వదుఃఖవిమోచన్యై విద్మహే హ్రీం హర్షప్రదాయై ధీమహి హ్రీం తన్నోదేవీ ప్రచోదయాత్।

7. ఓం హ్రీం సర్వమృత్యుప్రశమన్యై విద్మహే హ్రీం సర్వసంజీవిన్యై ధీమహి హ్రీం తన్నోదేవీ ప్రచోదయాత్।

8. ఓం హ్రీం సర్వవిఘ్ననివారిణ్యై విద్మహే హ్రీం సర్వకామాయై ధీమహి హ్రీం తన్నోదేవీ ప్రచోదయాత్।

9. ఓం హ్రీం సర్వాంగసుందర్యై విద్మహే హ్రీం జగద్యోన్యై ధీమహి హ్రీం తన్నోదేవీ ప్రచోదయాత్।

10. ఓం హ్రీం సర్వసౌభాగ్యదాయిన్యై విద్మహే హ్రీం జగజ్జనన్యై ధీమహి హ్రీం తన్నోదేవీ ప్రచోదయాత్।

 

తదుపరి పోస్టింగ్ లో ఆరవదైన సర్వరక్షాకర చక్రం గురించి తెలుసుకుందాం.                                                                          - శ్రీనివాస గార్గేయ   

Monday, May 12, 2014

హ్రీంకార యజ్ఞము - సర్వసౌభాగ్యప్రద చక్ర అవసర సారంశము 7

4.  సర్వసౌభాగ్యప్రద చక్రము 

పరమేశ్వరి యొక్క యంత్ర రూపాన్నే శ్రీచక్రము అంటారు. ఇందులో మొత్తం 9 ఆవరణలు గల చక్రములు ఉంటాయి. ఇందులో నాల్గవచక్రమే సర్వసౌభాగ్యప్రద చక్రము. శ్రీచక్ర మేరులో పీఠంపై  అష్టదళం పైన పధ్నాలుగు కోణాలు గల, చతుర్దశార ఆవరణంగా ఉండినదే సర్వసౌభాగ్యప్రద  చక్రము అంటారు.  

దీనికి 14 కోణాలు ఉంటాయి.  ఈ శరీరంలో ఉన్న షట్చక్రాలలో నాల్గవదిగా ఉన్నఅనాహత చక్రమే. ఇది శరీరంలో హృదయ స్థానం దగ్గర ఉండును. ఈ సర్వసౌభాగ్యప్రద చక్రములో పధ్నాలుగు మంది సంప్రదాయ యోగినీ దేవతలు ఉంటారు.

14 కోణాలు 14 లోకాలకు ప్రతీక.  దీనిలో  అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాళమనే 7 అధోలోకాలు... భూలోక, భువర్లోక, సువర్లోక,  మహాలోక, జనోలోక, తపోలోక, సత్యలోకాలనే 7 ఊర్ధ్వ లోకాలకు ప్రతీకే ఈ చక్రము. 

తెలుగు నిఘంటువు ప్రకారం సౌభాగ్యమంటే భాగ్యవంతము,వైభవము, సౌభాగ్యము, అందము, శుభగత్వము అనే పలు అర్థాలున్నవి.

హిందూ వివాహ వ్యవస్థలో సంప్రదాయాలు చూడటం ఓ ఆనవాయితీ. ఎంత గొప్ప ధనవంతుడు, అధికారి అయినప్పటికీ సంప్రదాయం లేనిచో సంబంధాలు చూడరు. అలాగే సంప్రదాయ బద్ధంగా ఉంటేనే సౌభాగ్యం లభిస్తుందని ఈ నాల్గవ చక్రం ద్వారా ఓ రహస్య సంకేతం తెలుస్తుంది.

మూలాధారానికి  గణపతి, స్వాధిష్టానానికి  బ్రహ్మ, మణిపూరకానికి విష్ణువు అధిదేవతలుగా ఉన్నట్లుగానే అనాహత చక్రానికి రుద్రుడు అధిదేవత కాగా, సర్వ సౌభాగ్యప్రద చక్రానికి అధిష్టాన దేవత పేరే త్రిపుర వాసిని. ఈ చక్రానికి ప్రదర్శించవలసిన ముద్ర పేరే సర్వవశంకరీ. 

కనుక సర్వసౌభాగ్యప్రద చక్రములోని 14 సంప్రదాయ యోగినుల రుద్ర గాయత్రీ మంత్రములను దిగువ తెల్పిన రీతిలో ముద్రను ప్రదర్శిస్తూ పఠించేది. ప్రతి దేవతకు హ్రీం బీజాక్షరం మూడు మార్లు వచ్చునని గుర్తించాలి. ఈ ముద్ర ఏ విధంగా ఉంటుందో చివరలో ఉండే వీడియోలో నాల్గవ ముద్రను గమనించండి.  

1. ఓం హ్రీం సర్వసంక్షోభిణ్యై విద్మహే హ్రీం బాణహస్తాయై ధీమహి హ్రీం తన్నః శక్తిః ప్రచోదయాత్।

2. ఓం హ్రీం సర్వవిద్రావిణ్యై విద్మహే హ్రీం కార్ముకహస్తాయై ధీమహి హ్రీం తన్నః శక్తిః ప్రచోదయాత్।

3. ఓం హ్రీం సర్వాకర్షిణ్యై విద్మహే హ్రీం శోణవర్ణాయై ధీమహి హ్రీం తన్నః శక్తిః ప్రచోదయాత్। 

4. ఓం హ్రీం సర్వాహ్లాదిన్యై విద్మహే హ్రీం జగద్వ్యాపిన్యై ధీమహి హ్రీం తన్నః శక్తిః ప్రచోదయాత్। 

5. ఓం హ్రీం సర్వసమ్మోహిన్యై విద్మహే హ్రీం జగన్మోహిన్యై ధీమహి హ్రీం తన్నః శక్తిః ప్రచోదయాత్।  

6. ఓం హ్రీం సర్వస్తంభిన్యై విద్మహే హ్రీం జగత్స్తంభిన్యై ధీమహి హ్రీం తన్నః శక్తిః ప్రచోదయాత్।  

7. ఓం హ్రీం సర్వజృంభిణ్యై విద్మహే హ్రీం జగత్ జృంభిణ్యై ధీమహి హ్రీం తన్నః శక్తిః ప్రచోదయాత్।  

8. ఓం హ్రీం సర్వవశంకర్యై విద్మహే హ్రీం  జగత్వశంకర్యై ధీమహి హ్రీం తన్నః శక్తిః ప్రచోదయాత్।  

9. ఓం హ్రీం సర్వరంజిన్యై విద్మహే హ్రీం జగద్రంజిన్యై ధీమహి హ్రీం తన్నః శక్తిః ప్రచోదయాత్।  

10. ఓం హ్రీం సర్వోన్మాదిన్యై విద్మహే హ్రీం జగన్మాయాయై ధీమహి హ్రీం తన్నః శక్తిః ప్రచోదయాత్।  

11. ఓం హ్రీం సర్వార్థసాధిన్యై విద్మహే హ్రీం పురుషార్థదాయై ధీమహి హ్రీం తన్నః శక్తిః ప్రచోదయాత్।  

12. ఓం హ్రీం సర్వసంపత్ప్రపూరిణ్యై విద్మహే హ్రీం సంపదాత్మికాయై ధీమహి హ్రీం తన్నః శక్తిః ప్రచోదయాత్।  

13. ఓం హ్రీం సర్వమంత్రమయ్యై విద్మహే హ్రీం మంత్రమాత్రే ధీమహి హ్రీం తన్నః శక్తిః ప్రచోదయాత్।  

14. ఓం హ్రీం సర్వద్వంద్వక్షయంకర్యై విద్మహే హ్రీం కళాత్మికాయై ధీమహి హ్రీం తన్నః శక్తిః ప్రచోదయాత్।  

 

తదుపరి పోస్టింగ్ లో ఐదవదైన సర్వార్థ సాధకచక్రం గురించి తెలుసుకుందాం.                                                                          - శ్రీనివాస గార్గేయ   

Saturday, May 10, 2014

హ్రీంకార యజ్ఞము - సర్వసంక్షోభణ చక్ర అవసర సారంశము 6

3. సర్వసంక్షోభణ చక్రము 

పరమేశ్వరి యొక్క యంత్ర రూపాన్నే శ్రీచక్రము అంటారు. ఇందులో మొత్తం 9 ఆవరణలు గల చక్రములు ఉంటాయి. ఇందులో మూడవచక్రమే సర్వసంక్షోభణ చక్రము. దిగువ కనపడే శ్రీచక్ర మేరులో పీఠంపై  షోడశదళం పైన అష్టదళ పద్మంగా గుండ్రముగా ఉండినదే సర్వసంక్షోభణ చక్రము అంటారు.  



















దీనికి 8 దళాలు ఉంటాయి.  ఈ శరీరంలో ఉన్న షట్చక్రాలలో మూడవదిగా ఉన్నమణిపూరక చక్రమే. ఇది శరీరంలో నాభి స్థానం దగ్గర ఉండును. ఈ సర్వసంక్షోభణ చక్రములో ఎనిమిది మంది గుప్తతర యోగినులనబడే దేవతలు ఉంటారు.

సర్వసంక్షోభణ చక్రానికి ప్రదర్శించవలసిన ముద్ర పేరే సర్వాకర్షిణీ
సర్వసంక్షోభణ చక్రానికి అధిష్టాన దేవత త్రిపుర సుందరీ 

వైదిక కర్మలయందు శ్రద్ధ తగ్గి అవైదిక కర్మలయందు ఆసక్తి పెరిగి, యజ్ఞ యాగాది క్రతువులలో ప్రజలు విముఖులైనప్పుడు సంక్షోభమేర్పడుతుంది. ఇట్టి సంక్షోభాన్ని పార్వతి పరమేశ్వరులు తొలగిస్తారు. అదే శ్రీచక్రంలో మూడవ ఆవరణకు ఉన్న విశిష్టత. అందుచేతనే దీనిని సర్వసంక్షోభణ చక్రమని పిలుస్తారు. (సంక్షోభణాన్ని ఎలా నివారించారో పురాణం గాధలున్నవి.)

తారకాసుర సంహారం తదుపరి ఇంద్రుడు పదవిని అధిష్టించటం, తదుపరి లోకాలలో వైదిక కర్మలు, యజ్ఞ యాగాది క్రతువులు నిర్వహింపబడటం, దేవతలకు వారి వారి హవిర్భాగాలు అందటం ప్రారంభమై లోకాలలో ఏర్పడ్డ సంక్షోభం నివారింపబడింది. మన్మధుడు దహనమై తదుపరి అనంగుడైనాడు. దీనికి సంకేతంగానే సర్వ సంక్షోభణ చక్రంలోని గుప్తతర యోగినులను అనంగనామంతో చెప్పటం సంప్రదాయమైనది. 

లోకాలలో మరియు జీవితాలలో ఏర్పడే సంక్షోభాలను నివారించటానికే ప్రతి ఒక్కరూ హ్రీంకార మహా యజ్ఞాన్ని ఆచరిస్తూ తద్వారా సర్వసంక్షోభణ చక్రాధిదేవత అయిన త్రిపురసుందరిని ఉపాసిస్తే సమస్త సుఖాలను ప్రసాదిస్తుంది. అందుకే శ్రీ లలితా సహస్ర నామావళిలో మణిపూరబ్జనిలయా నుండి  లాకిన్యాంబా స్వరూపిణి వరకు గల పది నామాలలో సర్వసంక్షోభణ చక్రం స్తుతించబడుతున్నది. ఇందులో గల ఓ నామంలో సమస్త భక్తసుఖదా అని ఉండటంలో అంతరార్ధం స్పష్టంగా గోచరమవుతుంది. 

మరొక ముఖ్యమైన రహస్యమేమిటంటే అసలు మణిపూరక చక్రంలో ఉండే దేవత పేరు వయోవస్థావివర్జితా. ఈ నామమే లలితా సహస్రనామంలో కూడా ఉంటుంది. అంటే కాలానికి అతీతురాలు పరమేశ్వరి. వయసుతోను, కాలంతోను వచ్చే మార్పులు ఆమెకి ఉండవు. 

బాల్య, కౌమార, యవ్వన, వృద్ధాప్య దశలు ఏమి లేనటువంటిదని భావము. అంటే కాల వ్యవస్థ పరమేశ్వరి కల్పితము. పరమేశ్వరి కాల కల్పనకు పూర్వమే ఉండినందున, పరమేశ్వరి వయస్సును కాలము నిర్ణయింపజాలదు. 

అందుకే లలితా సహస్ర నామాలలో పరమేశ్వరిని పూర్వజా అని, మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిని అని, మహాప్రళయసాక్షిని అని స్తుతించబడింది. ఈ నవ చక్రాలలో నాభిస్థానంలో ఉన్న సర్వసంక్షోభణ చక్ర విశిష్టత చెప్పనలవికానిది.

కనుక సర్వసంక్షోభణ చక్రములోని 8 గుప్తతర యోగినుల రుద్ర గాయత్రీ మంత్రములను దిగువ తెల్పిన రీతిలో ముద్రను ప్రదర్శిస్తూ పఠించేది. ప్రతి దేవతకు హ్రీం బీజాక్షరం మూడు మార్లు వచ్చునని గుర్తించాలి. ఈ ముద్ర ఏ విధంగా ఉంటుందో చివరలో ఉండే వీడియోలో మూడవ ముద్రను గమనించండి. 

1. ఓం హ్రీం అనంగకుసుమాయై విద్మహే హ్రీం రక్తకంచుకాయై ధీమహి హ్రీం తన్నోదేవీ ప్రచోదయాత్।

2. ఓం హ్రీం అనంగమేఖలాయై విద్మహే హ్రీం పాశహస్తాయై ధీమహి హ్రీం తన్నోదేవీ ప్రచోదయాత్।

3. ఓం హ్రీం అనంగమదనాయై విద్మహే హ్రీం శరహస్తాయై ధీమహి హ్రీం తన్నోదేవీ ప్రచోదయాత్। 

4. ఓం హ్రీం అనంగమదనాతురాయై విద్మహే హ్రీం ధనుర్హస్తాయై ధీమహి హ్రీం తన్నోదేవీ ప్రచోదయాత్।  

5. ఓం హ్రీం అనంగరేఖాయై విద్మహే హ్రీం దీర్ఘకేశిన్యై ధీమహి హ్రీం తన్నోదేవీ ప్రచోదయాత్।  

6. ఓం హ్రీం అనంగవేగిన్యై విద్మహే హ్రీం సృణిహస్తాయై ధీమహి హ్రీం తన్నోదేవీ ప్రచోదయాత్।  

7. ఓం హ్రీం అనంగాంకుశాయై విద్మహే హ్రీం నిత్యక్లేదిన్యై ధీమహి హ్రీం తన్నోదేవీ ప్రచోదయాత్।  

8. ఓం హ్రీం అనంగమాలిన్యై విద్మహే హ్రీం సుప్రసన్నాయై ధీమహి హ్రీం తన్నోదేవీ ప్రచోదయాత్।  



తదుపరి పోస్టింగ్ లో నాల్గవదైన సర్వసౌభాగ్యదాయక చక్రం గురించి తెలుసుకుందాం.  పాఠకులలో అసంఖ్యాకంగా అడిగిన ప్రశ్నలను బట్టి హ్రీంకార యజ్ఞం ఎందుకు చేయాలి ? హ్రీంకారమునకు మూలం ఏమిటి ? శ్రీవిద్యకు, శ్రీ యంత్రానికి ఉన్న సంబంధం ఏమిటి ? పంచదశి మంత్రానికి, శ్రీ యంత్రానికి సంబంధం ఏమిటి ? ఇంకా ఇంకా అనేకనేక ప్రశ్నలకు బ్లాగు ద్వారానే వివరాలను అందిస్తాను. సంపూర్ణ వివరాలన్నీ హ్రీంకార మహా యజ్ఞం అనే పుస్తకంలో పొందుపరుస్తూ... యజ్ఞ కార్యక్రమం నాటికే అందరికీ అందించాలనే తాపత్రయంతో ఉన్నానని తెలియచేస్తున్నాను. 
                                                                          - శ్రీనివాస గార్గేయ  

Friday, May 9, 2014

హ్రీంకార యజ్ఞము - సర్వాశాపరిపూరక చక్ర అవసర సారంశము 5

2. సర్వాశాపరిపూరక చక్రము 
పరమేశ్వరి యొక్క యంత్ర రూపాన్నే శ్రీచక్రము అంటారు. ఇందులో మొత్తం 9 ఆవరణలు గల చక్రములు ఉంటాయి. ఇందులో రెండవ చక్రమే సర్వాశాపరిపూరక చక్రము. దిగువ కనపడే శ్రీచక్ర మేరులో పీఠంపై దిగువన 16 ఆకులుగా గుండ్రముగా ఉండినదే సర్వేశాపరిపూరక చక్రము అంటారు. ఇది సర్వ ఆశలను పరిపూర్ణం చేసే చక్రమని భావించాలి. 

 








దీనికి 16 దళాలు ఉంటాయి. వ్యవహారికంగా పలకటంలో సర్వాశా అనకుండా సర్వేశాపరిపూరక చక్రముగా పలుకుతుంటాము. ఇది అలవాటులో పొరపాటుగా భావించి, సర్వాశాపరిపూరక చక్రము అని మాత్రమే పలకాలి.

శరీరంలో ఉన్న షట్చక్రాలలో రెండవదిగా ఉన్నస్వాధిష్టాన చక్రమే. ఇది మూలాధారానికి పై భాగాన ఉంటుంది. ఈ సర్వాశాపరిపూరక చక్రంలో పంచభూతాలు, పంచజ్ఞానేంద్రియాలు, మనస్సు మొత్తం 16. ఈ పదహారింటికే పదహారు దేవతలు. ఈ చక్రం శ్రీచక్రార్చనలో భోగపాత్ర. 

సర్వాశాపరిపూరక చక్రానికి ప్రదర్శించవలసిన ముద్ర పేరే సర్వవిద్రావిణీ 
సర్వాశాపరిపూరక చక్రానికి అధిష్టాన దేవత త్రిపురేశ్వరి

కనుక సర్వాశాపరిపూరక చక్రంలోని 16 గుప్తయోగినుల రుద్ర గాయత్రీ మంత్రములను దిగువ తెల్పిన రీతిలో ముద్రను ప్రదర్శిస్తూ పఠించేది. ప్రతి దేవతకు హ్రీం బీజాక్షరం మూడు మార్లు వచ్చునని గుర్తించాలి. ఈ ముద్ర ఏ విధంగా ఉంటుందో చివరలో ఉండే వీడియోలో రెండవ ముద్రను గమనించండి.   
1. ఓం హ్రీం కామాకర్షిణ్యై విద్మహే హ్రీం రక్తవస్త్రాయై ధీమహి హ్రీం తన్నః కళా ప్రచోదయాత్। 

2. ఓం హ్రీం బుద్ధ్యాకర్షిణ్యై విద్మహే హ్రీం బుద్ధ్యాత్మికాయై ధీమహి హ్రీం తన్నః కళా ప్రచోదయాత్। 

3. ఓం హ్రీం అహంకారాకర్షిణ్యై విద్మహే హ్రీం తత్త్వాత్మికాయై ధీమహి హ్రీం తన్నః కళా ప్రచోదయాత్। 

4. ఓం హ్రీం శబ్దాకర్షిణ్యై విద్మహే హ్రీం సర్వశబ్దాత్మికాయై ధీమహి హ్రీం తన్నః కళా ప్రచోదయాత్। 

5. ఓం హ్రీం స్పర్శాకర్షిణ్యై విద్మహే హ్రీం స్పర్శాత్మికాయై ధీమహి హ్రీం తన్నః కళా ప్రచోదయాత్।  

6. ఓం హ్రీం రూపాకర్షిణ్యై విద్మహే హ్రీం రూపాత్మికాయై ధీమహి హ్రీం తన్నః కళా ప్రచోదయాత్।  

7. ఓం హ్రీం రసాకర్షిణ్యై విద్మహే హ్రీం రసాత్మికాయై ధీమహి హ్రీం తన్నః కళా ప్రచోదయాత్।  

8. ఓం హ్రీం గంధాకర్షిణ్యై విద్మహే హ్రీం గంధాత్మికాయై ధీమహి హ్రీం తన్నః కళా ప్రచోదయాత్।  

9. ఓం హ్రీం చిత్తాకర్షిణ్యై విద్మహే హ్రీం చిత్తాత్మికాయై ధీమహి హ్రీం తన్నః కళా ప్రచోదయాత్।  

10. ఓం హ్రీం ధైర్యాకర్షిణ్యై విద్మహే హ్రీం ధైర్యాత్మికాయై ధీమహి హ్రీం తన్నః కళా ప్రచోదయాత్।  

11. ఓం హ్రీం స్మృత్యాకర్షిణ్యై విద్మహే హ్రీం స్మృతిస్వరూపిణ్యై ధీమహి హ్రీం తన్నః కళా ప్రచోదయాత్।  

12. ఓం హ్రీం నామాకర్షిణ్యై విద్మహే హ్రీం నామాత్మికాయై ధీమహి హ్రీం తన్నః కళా ప్రచోదయాత్।  

13. ఓం హ్రీం బీజాకర్షిణ్యై విద్మహే హ్రీం బీజాత్మికాయై ధీమహి హ్రీం తన్నః కళా ప్రచోదయాత్।  

14. ఓం హ్రీం ఆత్మాకర్షిణ్యై విద్మహే హ్రీం ఆత్మస్వరూపిణ్యై ధీమహి హ్రీం తన్నః కళా ప్రచోదయాత్।  

15. ఓం హ్రీం అమృతాకర్షిణ్యై విద్మహే హ్రీం అమృతస్వరూపిణ్యై ధీమహి హ్రీం తన్నః కళా ప్రచోదయాత్।  

16. ఓం హ్రీం శరీరాకర్షిణ్యై విద్మహే హ్రీం శరీరాత్మికాయై ధీమహి హ్రీం తన్నః కళా ప్రచోదయాత్।   

 
తదుపరి పోస్టింగ్ లో మూడవదైన సర్వసంక్షోభణ చక్రం గురించి తెలుసుకుందాం.  

Thursday, May 8, 2014

హ్రీంకార యజ్ఞ నవావరణ ముద్రలు - అవసర సారాంశం 4

హ్రీంకార మహాయజ్ఞం జరుగు సమయంలో పండితులు మంత్రోచ్చారణ ఒక వైపు చేస్తుండగా అదే సమయంలో యజ్ఞంలో పాల్గొనేవారు కూడా నవ చక్రాలకు సంబంధించిన రుద్ర గాయత్రిలను ముద్ర పూర్వకంగా పఠిస్తుంటారు.

ఉదాహరణకు గత పోస్టింగ్ లో చెప్పబడిన త్రైలోక్య మోహన చక్రములోని 28 రుద్ర గాయత్రీ మంత్రములను ముద్రా సహితంగా పలుకుతూ ఉంటారు. అనగా ఒకటవదైన త్రైలోక్య మోహన చక్రానికి ముద్ర సర్వ సంక్షోభినిని ప్రదర్శిస్తూ హ్రీం బీజాక్షర పూర్వకంగా 28 రుద్ర గాయత్రిలను భక్తితో పఠిస్తుండాలి. 

మొదటి చక్రం కాగానే రెండవ చక్రానికి ముద్రను ప్రదర్శిస్తూ ఆ చక్ర దేవత రుద్ర గాయత్రిలను పఠించాలి. కనుక ఒక్కో చక్రానికి ముద్రలు ఏ విధంగా ఉంటాయో ఇప్పటినుంచే సాధన చేయాలి. 

అయితే హ్రీంకార మహా యజ్ఞం కాకుండా మామూలు సమయాలలో మీ మీ గృహాలలో కూడా ఖడ్గమాల స్తోత్రాన్ని ముద్రా సహితంగానే పఠిస్తే విశేషమైన ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా ఈ ముద్రలలో 1 నుంచి 9 వరకు వరుసగా వెంటవెంటనే రెండూ చేతులను విడదీయకుండా చేయటం అభ్యాసంతో నేర్చుకోవాలి. 

గమనిక ఏమిటంటే యజ్ఞం జరిగే సమయంలో రుద్ర గాయత్రిలను 9 చక్రాలకి వరుసగా పఠించాలంటే సమయం పడుతుంది. కనుక ఒక చక్ర పఠనానికి, మరో చక్ర పఠనానికి మధ్యలో స్వల్ప పూజా హారతి వుంటుంది గనుక ముద్రలు వేయటంలో విరామం ఉంటుంది. 

అదే మీ మీ గృహాలలో ఖడ్గమాల స్తోత్రాన్ని పఠించాలి అనుకున్నప్పుడు కొద్ది నిమిషాలలోనే పూర్తవుతుంది గనుక చేతులను విడదీయకుండానే ముద్రలను ప్రదర్శించుటకు వీలుగా ఉండుటకై దిగువ వీడియోలో ఇవ్వటం జరిగింది. కనుక వరుసగా ముద్రలను చేతులు విడదీయకుండా సాధన చేయండి. 

ఈ ముద్రలలో సాంప్రదాయ భేదములున్నవి. అందువలన 3 దశాబ్దాల అనుభవంతో దేవి అనుగ్రహంతో నా మనో దృష్టికి అందిన ముద్రలను తెలియచేస్తున్నాను. కనుక ఈ దిగువ రీతిలో చెప్పినట్లుగా ఒక్కో చక్రానికి ఒక్కో ముద్ర ఉండును. 

కనుక వాటిని పూర్తిని అవగాహన చేసుకొనగలరు. 9 ఆవరణలు పూర్తైన తర్వాత మరొక ముద్రను తెలియచేస్తాను. కనుక ఈ పోస్టింగ్ లో చెప్పినట్లుగా ఆచరించగలరని భావిస్తూ తదుపరి పోస్టింగ్ లో సర్వాశాపరిపూరక చక్ర అంశాలను పొందుపరుస్తాను. 

1. త్రైలోక్య మోహన చక్రము  
ముద్ర పేరు - సర్వసంక్షోభిణీ
 

2. సర్వాశాపరిపూరక చక్రము 
ముద్ర పేరు - సర్వవిద్రావిణీ
 

3. సర్వసంక్షోభణ చక్రము 
ముద్ర పేరు - సర్వాకర్షిణీ
 

4. సర్వసౌభాగ్యదాయక చక్రము 
ముద్ర పేరు - సర్వవశంకరీ
 

5. సర్వార్థసాధక చక్రము 
ముద్ర పేరు - సర్వోన్మాదినీ 
 
6. సర్వరక్షాకర చక్రము 

ముద్ర పేరు - సర్వమహాంకుశా
 

7. సర్వరోగహర చక్రము 
ముద్ర పేరు - సర్వఖేచరీ 
 

8. సర్వసిద్ధిప్రద చక్రము
ముద్ర పేరు - సర్వబీజ
 
9. సర్వానందమయ చక్రము 
ముద్ర పేరు - సర్వయోని 

గమనిక : ఖడ్గమాల స్తోత్రాన్ని గృహాలలో పఠించకూడదని, విపరీత నివేదనలను అందించాలని చెప్పేవారి మాటలను పూర్తిగా ఖండిస్తున్నాను. దయచేసి పాఠకులు అటువంటి మాటలపై దృష్టి ఉంచవద్దని మనవి.

Tuesday, May 6, 2014

హ్రీంకార యజ్ఞము - ముద్రలపై ఓ విశ్లేషణ - అవసర సారంశము 3

ఒక వ్యక్తి మాట్లాడకుండా ఎదుటివారికి కొన్ని కొన్ని సైగలతో కొంత విషయాన్ని తెలియచేయగలడు. అంటే మన చేతి వ్రేళ్ళ ద్వారా, కదలికల ద్వారా ముద్రలను ఏర్పరుస్తూ ఉన్నచో, మాట్లాడకుండానే ఎదుటివారికి ముద్రల ద్వారా భావాన్ని తెలియచేసే ఒక భాషగా  ముద్రలు ఉపయోగపడును. 

ఆత్మని పరమాత్మతో చేర్చే ప్రయత్నంలో మౌనంతో ఉన్న ఓ వ్యక్తికి ముద్రలనేవి సాధనాలుగా ఉంటాయి. యోగసాధన చేత పూర్ణ చైతన్యం లభిస్తుంది. ముద్రల ద్వారా ప్రాణాయామ తదితరములు సాధన చేసి విజయాన్ని సాధించవచ్చు. అచేతనావస్థ నుండి చేతనావాస్థకు, అస్థిరతం నుండి స్థిరత్వానికి, అగోచరం నుండి గోచర స్థితికి, అధర్మం నుండి ధర్మానికి, అనారోగ్యం నుండి ఆరోగ్యస్థితికి సునాయాసంగా చేర్చగలిగినదే యోగ విద్య. 

మనిషి అంతర్మధనం చెందుతుంటే ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుచేత మానసిక క్షోభ, శారీరక సమస్యలు తలెత్తుతాయి. ఏ పని పైన నిశ్చలత్వం ఉండక, కకావికలమైన మనస్సుతో జీవితాన్ని సాగిస్తూ... వత్తిడితో నలిగిపోతుంటాడు. కనుక మనిషికి ప్రశాంతత అవసరం. మనసు నిర్మలంగా, నిలకడగా ఉండాలంటే స్వాంతన ముఖ్యం. ఇట్టి పరిపూర్ణ ఉపశమనం పొందాలంటే యోగసాధన అవసరం. యోగసాధనకు మూలం మనము ఆచరించే ప్రత్యేక ముద్రలు.  కొన్ని సార్లు ముద్రలు సంజీవనిగా ఉపయోగపడతాయని పెద్దలు చెబుతారు. 

భౌతిక సుఖాలు మానసిక ఆనందాన్ని కొంతవరకే కలిగిస్తాయి గాని మిగిలినదంతా అసంతృప్తే. మనం అంతరంగాన్ని మలినాలతో, మాలిన్యాలతో నింపుకుని జీవించినంతకాలం ఆనందానుభవం అసాధ్యం. అంతరంగ కాలుష్య ప్రభావంచే చర్మ వ్యాధులు, శ్వాసకోశ రుగ్మతలు మొదలైనవి ప్రబలుతుంటాయి. 

 అజీర్ణ రోగి  రుచులని ఆశ్వాదించలేడు. చంచల స్వభావి యోగి కాలేడు. నిర్మలమైన మనసులేని భోగి రోగి కాగలడు కాని యోగి కాలేడు. అందుకే ఆరోగ్యమే మహా భాగ్యం అన్నారు. నిత్య సంతోషులుగా ఉన్నవారే ఆరోగ్యవంతులు.

భారతీయ సంస్కృతీ, సంప్రదాయాలలో భక్తి సంబంధిత అంశాలలో ముద్రలనేవి ఓ భాగం. ముద్రలు వేయటం ద్వారా మనకు ధ్యానంలో ఏకాగ్రత కుదిరి శరీరాన్ని ఆత్మతో సమన్వయ పరచి ఆనందాన్ని పొందగలం. మన చేతులు విశిష్టమైన శక్తి గల్గినవి. వీటిలో విద్యుత్ తరంగాలవంటి శక్తి నిండి ఉంటుంది. పంచభూతములు చేతులలో అంతర్గతంగా నిండి ఉంటాయి. 

ఋషులు, మునులు, యోగులు నిరంతరం ముద్రల ద్వారా సాధన చేస్తూ తమ తపఃశక్తిని పెంచుకునేవారు. ముద్రలు మానసిక శక్తిని, వైఖరిని, గ్రహణ శక్తిని ,ఏకాగ్రతను పెంపొందించును. ముద్రలకు నాడి మండలానికి సంబంధం ఉంది. వివిధ భంగిమలలో ముద్రల కదలిక ద్వారా మనస్సు స్వాధీన పడుతుంది. మన భావనలు, మన ఆలోచనలు సరియైన రీతిలో నడుస్తాయి. ఓ శక్తి ప్రవాహం మనలో వ్యాపించింది అన్న భావానికి లోనవుతాం. మన ఊహలు, ఆలోచనలు, పరిస్థితులను బట్టి బాహ్య పరిస్థితులు రూపుదిద్దుకుంటాయి. సంకల్ప వికల్పాలలో పెను మార్పులుంటాయి.

భక్తి ముక్తి శక్తిదాయకములైన ఈ ముద్రలతో లలితా రహస్య సహస్ర నామావళిని ఆచరిస్తే విశేష శక్తి లభిస్తుందని పెద్దల అభిప్రాయం. ఈ పరంపరలో ప్రస్తుతం జరిగే హ్రీంకార మహా యజ్ఞంలో ముఖ్యమైన సందర్భాలలో ముద్రలను ప్రదర్శించాలి. అయితే ఈ ముద్రలు వేయటంలో అనేక సంప్రదాయ భేదములున్నవి. 

అందుచే చాలామంది ముద్రల జోలికి వెళ్ళకుండా సాధారణ రీతిలోనే లలితా సహస్ర నామాలను, త్రిశతిని, ఖడ్గమాలను వ్యక్తిగతంగాని లేక సామూహికంగా గాని పఠిస్తుంటారు. అందుచే మూడు దశాబ్దాల అనుభవంతో, ఆ దేవి అనుగ్రహంతో నా మనో దృష్టికి అందిన ముద్రలను ఈ హ్రీంకార యజ్ఞంలో పొందుపరుస్తున్నాను. అనుభవంలో ఇవి విశేషమైన ఫలితాలను ఇస్తాయనటంలో అతిశయోక్తి ఎంతమాత్రం లేదు. 

కనుక ఈ ముద్రలను ఏ విధంగా ప్రదర్శించాలో తదుపరి పోస్టింగ్లో తెలుసుకుందాం.           
                                                                            - శ్రీనివాస గార్గేయ

Monday, May 5, 2014

హ్రీంకార యజ్ఞము - త్రైలోక్యమోహన చక్ర అవసర సారంశము 2

పరమేశ్వరి యొక్క యంత్ర రూపాన్నే శ్రీచక్రము అంటారు. ఇందులో మొత్తం 9 ఆవరణలు గల చక్రములు ఉంటాయి. ఈ ఆవరణలలో వివిధ దేవతలు ఉంటారు. ఈ ఆవరణ చక్రముల వరుస పేర్లు...
త్రైలోక్య మోహన చక్రము 
సర్వాశాపరిపూరక చక్రము 
సర్వసంక్షోభణ చక్రము
సర్వసౌభాగ్యదాయక చక్రము
సర్వార్థసాధక చక్రము 
సర్వరక్షాకర చక్రము 
సర్వరోగహర చక్రము 
సర్వసిద్ధిప్రద చక్రము 
సర్వానందమయ చక్రము 

1. త్రైలోక్య మోహన చక్రము 
మానవదేహంలో షట్చక్రాలు ఉంటాయి. ఇందులో మొదటి చక్రము మూలాధార చక్రము.  మూలాధారంలో ఉండే దేవత గణపతి. గజముఖుడు, వేదస్వరూపుడు. తొండము ఓంకారానికి ప్రతీకగా చెప్తాము. మనం ఏ పూజ మొదలుపెట్టినా, ఏ కార్యక్రమం తలపెట్టినా ప్రధమంగా పూజించి ప్రార్ధించేది గజముఖుడైన గణపతినే. శ్రీచక్ర మొదటి నవావరణముగా చెప్పబడే త్రైలోక్య మోహన చక్రంలో మూడు భూపురాలు (రేఖలు) ఉంటాయి. ఈ మూడింటిలో కలసి 28 మంది ప్రకట యోగినులనే దేవతలు ఉంటారు. ఈ 28 మంది ప్రకటయోగినిలు శ్రీ మహా గణపతి మంత్రానికి సంకేతాలు. (శ్రీ గణపతి మంత్రానికి అక్షరాలు కూడా 28). 

ఈ త్రైలోక్య మోహన చక్రమునకు అధిష్టాన దేవత త్రిపుర. 
త్రైలోక్య మోహన చక్రానికి గల ముద్ర పేరు సర్వసంక్షోభిణి ముద్ర. 
పరమేశ్వరి ఆరాధనలో ముద్రలు ప్రదర్శించాలి. 
ఇలా చేయటం పరమేశ్వరికి మహా ప్రీతి దాయకం. 
మన కుడిచేతి వ్రేళ్ళు శివతత్వము. 
ఎడమచేతి వ్రేళ్ళు శక్తి తత్వము. 
ఈ రెండూ కలపటము అంటే శివ శక్తుల సామరస్యము. 

చేతికి ఉన్న ఐదు వ్రేళ్ళలో బొటనవ్రేలు  (అంగుష్టము) అగ్నితత్వమునకు,
చూపుడువ్రేలు  (తర్జని) వాయుతత్వమునకు, 
నడిమి వ్రేలు (మధ్యమాంగుళి) ఆకాశతత్వానికి, 
ఉంగరపు వ్రేలు (అనామిక) పృథ్వి తత్వమునకు, 
చిటికెన వ్రేలు (కనిష్ఠ) జలతత్వమునకు ప్రతీకలు.
అందుచే ప్రతి ఆవరణలోని దేవతలకు రుద్ర గాయత్రీ మంత్రాలను పఠించునపుడు ప్రత్యేక ముద్రలను ప్రదర్శిస్తూ హ్రీంకార యజ్ఞంలో పాల్గొనాలి. 

కనుక త్రైలోక్య మోహన చక్రంలోని 28 ప్రకటయోగినుల రుద్ర గాయత్రీ మంత్రములను దిగువ తెల్పిన రీతిలో ముద్రను ప్రదర్శిస్తూ పఠించేది. ప్రతి దేవతకు హ్రీం బీజాక్షరం మూడు మార్లు వచ్చునని గుర్తించాలి. ఈ ముద్ర ఏ విధంగా ఉండునో రేపటి రోజున తెల్సుకుందాం.

1. ఓం హ్రీం అణిమాసిద్ధ్యై విద్మహే హ్రీం వరాభయహస్తాయై ధీమహి హ్రీం తన్నఃసిద్ధిః ప్రచోదయాత్। 

2. ఓం హ్రీం లఘిమాసిద్ధ్యై విద్మహే హ్రీం  నిధివాహనాయై ధీమహి హ్రీం తన్నో లఘిమా ప్రచోదయాత్ ।  

3. ఓం హ్రీం మహిమాసిద్ధ్యై విద్మహే హ్రీం  మహాసిద్ధ్యై ధీమహి హ్రీం తన్నో మహిమా ప్రచోదయాత్ ।   

4. ఓం హ్రీం ఈశిత్వసిద్ధ్యై విద్మహే హ్రీం  జగద్వ్యాపికాయై ధీమహి హ్రీం తన్నఃసిద్ధిః ప్రచోదయాత్ ।   

5. ఓం హ్రీం వశిత్వసిద్ధ్యై విద్మహే హ్రీం శోణవర్ణాయై ధీమహి హ్రీం తన్నఃసిద్ధిః ప్రచోదయాత్।  

6. ఓం హ్రీం ప్రాకామ్యసిద్ధ్యై విద్మహే హ్రీం నిధివాహనాయై ధీమహి హ్రీం తన్నఃసిద్ధిః ప్రచోదయాత్।  

7. ఓం హ్రీం భుక్తిసిద్ధ్యై విద్మహే హ్రీం మహాసిద్ధ్యై ధీమహి హ్రీం తన్నఃసిద్ధిః ప్రచోదయాత్।  

8. ఓం హ్రీం ఇచ్చాసిద్ధ్యై విద్మహే హ్రీం పద్మహస్తాయై ధీమహి హ్రీం తన్నఃసిద్ధిః ప్రచోదయాత్।  

9. ఓం హ్రీం ప్రాప్తిసిద్ధ్యై విద్మహే హ్రీం భక్తవత్సలాయై ధీమహి హ్రీం తన్నఃసిద్ధిః ప్రచోదయాత్।  

10. ఓం హ్రీం సర్వకామసిద్ధ్యై విద్మహే హ్రీం మహానిర్మలాయై ధీమహి హ్రీం తన్నఃసిద్ధిః ప్రచోదయాత్। 

11. ఓం హ్రీం బ్రాహ్మీశక్త్యై విద్మహే హ్రీం పీతవర్ణాయై ధీమహి హ్రీం తన్నో బ్రాహ్మీ ప్రచోదయాత్।   

12. ఓం హ్రీం శ్వేతవర్ణాయై విద్మహే హ్రీం శూలహస్తాయై ధీమహి హ్రీం తన్నో మాహేశ్వరీ ప్రచోదయాత్।  

13. ఓం హ్రీం శిఖివాహనాయై విద్మహే హ్రీం శక్తిహస్తాయై ధీమహి హ్రీం తన్నో కౌమారీ ప్రచోదయాత్। 

14. ఓం హ్రీం శ్యామవర్ణాయై విద్మహే హ్రీం చక్రహస్తాయై ధీమహి హ్రీం తన్నో వైష్ణవీ ప్రచోదయాత్। 

15. ఓం హ్రీం శ్యామలాయై విద్మహే హ్రీం హలహస్తాయై ధీమహి హ్రీం తన్నో వారాహీ ప్రచోదయాత్।  

16. ఓం హ్రీం శ్యామవర్ణాయై విద్మహే హ్రీం వజ్రహస్తాయై ధీమహి హ్రీం తన్నో మాహేంద్రీ ప్రచోదయాత్।  
  
17. ఓం హ్రీం కృష్ణవర్ణాయై విద్మహే హ్రీం శూలహస్తాయై ధీమహి హ్రీం తన్నో చాముండీ ప్రచోదయాత్।  

18. ఓం హ్రీం పీతవర్ణాయై విద్మహే హ్రీం పద్మహస్తాయై ధీమహి హ్రీం తన్నో మహాలక్ష్మీ ప్రచోదయాత్।  

19. ఓం హ్రీం సర్వసంక్షోభిణ్యై విద్మహే హ్రీం వరహస్తాయై ధీమహి హ్రీం తన్నో ముద్రా ప్రచోదయాత్।  

20. ఓం హ్రీం సర్వవిద్రావిణ్యై విద్మహే హ్రీం మహాద్రావిణ్యై ధీమహి హ్రీం తన్నో ముద్రా ప్రచోదయాత్।   

21. ఓం హ్రీం సర్వాకర్షిణ్యై విద్మహే హ్రీం మహాముద్రాయై ధీమహి హ్రీం తన్నో ముద్రా ప్రచోదయాత్।  

22. ఓం హ్రీం సర్వవశంకర్యై విద్మహే హ్రీం మహావశ్యాయై ధీమహి హ్రీం తన్నో ముద్రా ప్రచోదయాత్।   

23. ఓం హ్రీం సర్వోన్మాదిన్యై విద్మహే హ్రీం మహామాయాయై  ధీమహి హ్రీం తన్నో ముద్రా ప్రచోదయాత్।  

24. ఓం హ్రీం సర్వమహాంకుశాయై విద్మహే హ్రీం శోణవర్ణాయై ధీమహి హ్రీం తన్నో ముద్రా ప్రచోదయాత్।

25. ఓం హ్రీం సర్వఖేచర్యై విద్మహే హ్రీం గగనవర్ణాయై ధీమహి హ్రీం తన్నో ముద్రా ప్రచోదయాత్।   

26. ఓం హ్రీం సర్వబీజరూపాయై విద్మహే హ్రీం మహాబీజాయై  ధీమహి హ్రీం తన్నో ముద్రా ప్రచోదయాత్।

27. ఓం హ్రీం సర్వయోన్యై విద్మహే హ్రీం విశ్వజనన్యై ధీమహి హ్రీం తన్నో ముద్రా ప్రచోదయాత్।

28. ఓం హ్రీం సర్వత్రిఖండాయై విద్మహే హ్రీం త్రికాలాత్మికాయై ధీమహి హ్రీం తన్నో ముద్రా ప్రచోదయాత్।   

పాఠకులకు ముఖ్య గమనిక : పైన తెల్పిన వివరాలను ముందుగా బాగా పఠించినచో, హ్రీంకార యజ్ఞ సమయంలో ముద్ర సహితంగా ఆచరించి పఠించుటకు సులువుగా ఉండును. రేపటి రోజున ఈ త్రైలోక్య మోహన చక్ర ముద్రా విశేషాలను తెలుసుకుందాం.  
                                                                      - శ్రీనివాస గార్గేయ

హ్రీంకార మహాయజ్ఞంలో పాల్గొనువారికి అవసర సారాంశం -1

శివశక్త్యాత్మకమైన 'హ్రీం' మంత్రాక్షరాలన్నింటికి తలమానికమైనది. పరమేశ్వరికి అత్యంత ప్రియమైన బీజమిది. జగత్ అంతయూ ఆమె హిరణ్య గర్భంలో ఇమిడినట్లే, తంత్ర మంత్రం సూక్ష్మాలన్నీ హ్రీం బీజంలోనే ఉన్నాయి. ఇది త్రిపుటలకు అధిష్టానం. అండ పిండ బ్రహ్మాండాలకి ఆశ్రయం 

లలితా త్రిశతి నామాలు, పంచదశి మంత్రాన్ని ఆశ్రయించి చెప్పబడినవి. ఈ పంచదశి మంత్రం పరాశక్తి యొక్క విశిష్ట రూపం. ఈ పంచదశి మంత్రం మూడు ఖండాలుగా ఉంది.  

మొదటిదైన వాగ్భవ ఖండములోని  5 బీజాలలో చివరి బీజం హ్రీం.  రెండవదైన కామరాజ ఖండములోని ఆరు బీజాలలో చివరి బీజం హ్రీం. మూడవదైన శక్తి ఖండములోని నాలుగు బీజాలలో చివరి బీజం హ్రీం. అక్షరానికి 20 నామాల చొప్పున పంచదశి మంత్రంలోని 15 అక్షరాలకు మొత్తం 300 నామాలు చెప్పబడినవి. అవే లలితా త్రిశతి.  

త్రిశతి నామాలకి పంచదశి మహా మంత్రానికి (శ్రీవిద్య) అవినాభావ సంబంధం ఉంది. హ్రీంకారం పంచదశి మంత్రానికి హృదయంగా భావించే బీజం. జీవన గమనం సమస్యలు లేకుండా నడుచుటకు అందరి హృదయాలలో ఆకాశ దీపశిఖవలె విరాజిల్లుటకు పరాశక్తి బ్రహ్మ స్వరూపిణి హ్రీం బీజం ఎంతో అవసరం.

మంత్ర శాస్త్రంలో స్త్రీ దేవతలను గురించే చెప్పే మంత్రాలను విద్య అంటారు. పరమేశ్వరిని గురించి చెప్పే విద్య కాబట్టి దీనిని శ్రీవిద్య అంటారు. పరదేవతను గురించి చెప్పే మంత్ర యంత్ర తంత్ర శాస్త్రాన్నే శ్రీవిద్య అంటారు. లలితా సహస్రం యంత్ర మంత్ర తంత్రాలే కాకుండా అనేక రహస్య విషయాలు కూడా నిక్షిప్తమై ఉన్నాయి.

శ్రీ లలితా సహస్రనామంలో కొన్ని కొన్ని నామాలను ఒక సమూహంగా చెప్పటం జరిగింది. దీనికి ఒక ప్రత్యేకమైన విశేషత ఉంది. ఈ ప్రకారంగా వేయి నామాలలో అనేకానేక విశేషాలు పొందుపరచబడ్డాయి. ఉదాహరణకు మొదటి ఐదు నామాలలో పరమేశ్వరి ప్రాదుర్భావాన్ని వివరిస్తే.. ఆ తదుపరి ఆ తల్లి స్వరూపాన్ని.. మరో చోట జగన్మాత సూక్ష్మ రూపాన్ని వర్ణించారు. అదే పంచదశి మహా మంత్రం. ఇంకోచోట శ్రీ చక్రాన్ని వివరించారు. 

మరి కొన్ని నామాలలో ఆ పరదేవత యొక్క అర్చనా విధానాలను, ఆచారాలను, చతుషష్టిపూజా విశేషాలను, షట్చక్రాలను వివరించారు. అవస్థా పంచకము, చంద్ర విద్య, భానువిద్య, భువనేశ్వరి విద్య, కాత్యాయనీ విద్య, వాగ్వాదినీ విద్య, శివదూతి విద్య, గాయత్రీ మంత్రం, ఆత్మ విద్య... ఈ విధంగా అనేకానేక అంశాలను లలితా సహస్రంలో పొందుపరచబడినవి. ఒక్క లలితా సహస్రాన్ని పూర్తిగా పరిశీలిస్తే శ్రీ విద్య తెలుస్తుంది. అందుకే లలితా సహస్రము శ్రీ విద్యకు సారధి వంటిది.

1 నుండి 10 అక్షరములు గల మంత్రాలను బీజ మంత్రాలు అంటారు. 11 నుంచి 21 వరకు అక్షరాలు గల వాటిని మంత్రములుగా వ్యవహరిస్తారు. 21 మించి అక్షరములు గల వాటిని మాలా మంత్రాలు అంటారు. ఖడ్గములు అంటే స్తుతి వచనాలు అని అర్థం. 

అందుకే 21 మించిన అక్షరాలు ఉన్నందునే ఖడ్గమాలగా వ్యవహరిస్తాం. లలితా త్రిశతిలో మూడవ హ్రీం కారాన్ని గురించి చెప్పేటప్పుడు పరమేశ్వరి హ్రీంకారకోశాసిలతా అని స్తుతించబడింది. అసి అంటే ఖడ్గము. అసిలతా అంటే ఖడ్గధారి. హ్రీంకారమనే కోశానికి పరమేశ్వరి ఖడ్గధారి . హ్రీంకారమనే కోశంలోనే ఆమె ఖడ్గము (కత్తి). తన భక్తులకు కలిగే రాగ ద్వేషాలను, అరిషడ్వర్గ వైరులను, బాధలను, దుఃఖాలను పరమేశ్వరి తన ఖడ్గంతో చేదిస్తుంది, తొలగిస్తుంది. అందుకే ఆ తల్లిని శ్రీ దేవి ఖడ్గమాలతో స్తుతిస్తాము. 

ముఖ్యంగా హ్రీంకార యజ్ఞం చేసే సమయంలో శ్రీ చక్రంలోని తొమ్మిది ఆవరణలను, ఒక్కో ఆవరణ అధిష్టాన దేవతలను, ఒక్కో ఆవరణలో ఉండే దేవతలను, ఆవరణ ముద్రను, ఆవరణ దేవతల రుద్ర గాయత్రిని రేపటి నుంచి రోజుకో అంశంగా తెలియచేస్తాను. భక్తి పరులు ఆకళింపు చేసుకుని జూన్ 10 మంగళవారం హైదరాబాద్ లో జరిగే హ్రీంకార మహా యజ్ఞంలో పాల్గొనటానికి, రేపటి నుంచి తెలియచేసే వివరాలు ముద్రలు మార్గదర్శిగా ఉండగలవని ఆశిస్తున్నాను. 

హ్రీంకార యజ్ఞంలో పాల్గొనేవారికి ఎలాంటి ప్రవేశ రుసుము లేదు. షుమారు 4 గంటలు సమయం పట్టును. ఆనాడు ఉదయం 8 గంటల నుంచి కార్యక్రమం జరుగును. వేదిక త్వరలో తెలియచేయబడును. మీ బంధు మిత్రాదులందరికీ కార్యక్రమ వివరాలను, హ్రీంకార యజ్ఞ విశేష వివరాలను తెలియచేయగలరని మనసారా ఆశిస్తున్నాను. తిరిగి రేపటి రోజున మొదటి ఆవరణంగా ఉండే త్రిలోక్య మోహన చక్ర వివరాలను తెలుసుకుందాం. 
                                                                                శ్రీనివాస గార్గేయ

Sunday, May 4, 2014

జూన్ 10 మంగళవారం హైదరాబాద్ లో హ్రీంకార మహా యజ్ఞం

2014 జూన్ 10 మంగళవారం స్వాతి నక్షత్రం - శ్రీ ఆది శంకరుల కైలాస గమనం - ఈ రోజున హైదరాబాద్ లో సశాస్త్రీయంగా హ్రీంకార మహా యజ్ఞ కార్యక్రమం శ్రీనివాస గార్గేయ గారి ఆధ్వర్యంలో జరుగును. ప్రవేశం ఉచితం. ఈ యజ్ఞంలో ఆచరించాల్సిన ముద్రా స్వరూపాలను, కార్యక్రమంలో పఠించాల్సిన అంశాలను, విధి విధానాలను రేపటి నుంచి నిత్యం గ్రహభూమి బ్లాగ్లో ఇవ్వబడును. ఆసక్తి ఉన్నవారు గమనించి, పాటించుటకై ప్రయత్నించేది. - ఓంకార మహాశక్తి పీఠం  

Friday, April 4, 2014

ఆదివారం ఆరుద్రా నక్షత్రంలో గురు చంద్రుల సయ్యాట

ద్వాదశాదిత్యులలో 11 వ ఆదిత్యుడైన అయిన పూషుడు మాఘ మాసానికి అదిదేవత. ఈ పూష దేవత ప్రజలందరికీ జయమును చేకూర్చుటకు, ఒక చేతిలో శంఖమును, ఒక చేతిలో చక్రమును కలిగి 'జయ' అనే నామధేయము కలిగిన శ్రీ సూర్య నారాయణుడైన... శ్రీమహా విష్ణువు అధిపతిగా ఉన్న సంవత్సరమే శ్రీ జయ. మాఘమాసానికి అధిపతిగా ఉన్న సూర్యునిపేరే పూష. ద్వాదశాదిత్యులలో 11వ దేవతా స్వరూపం. 

ఆదివారం సప్తమి తిథి వస్తే దానిని భాను సప్తమి అంటారు. అయితే ఆదివారం నాడు శుక్ల సప్తమి వసంతఋతువులో వస్తే దానిని విజయ సప్తమి అని కూడా అంటారు. ఇట్టి విజయసప్తమి 2014 ఏప్రిల్ 6వ తేది ఆదివారం రావటం జరిగింది. వసంత నవరాత్రులలో భాగంగా ఈనాడు సూర్య దమన పూజ చేయటం ఆనవాయితీ. మరొక ముఖ్య విశేషం ఏమిటంటే ఏప్రిల్ 6వ తేది ఆరుద్రా నక్షత్రం రావటం మహా విశేషం. ఇట్టి ఆరుద్రతో కూడిన శుక్ల సప్తమి గల ఆదివారం నాడు భక్తి విశ్వాసాలతో సూర్య వ్రతాన్ని కూడా ఆచరిస్తారు. అవకాశాన్నిబట్టి గోమూత్రం, గోమయం, ఆవుపాలు, పెరుగు, నెయ్యి, కుశజలమ్, తెల్లని మట్టి, నువ్వులు, ఆవాలతో అభ్యంగన స్నానం ఆచరించి సూర్యారాధన చేసేవారు ఉంటారు. ప్రస్తుత రోజులలో ఇవన్నీ ఆచరించే వారు అరుదుగా ఉంటారు. కేవలం ఆదిత్య హృదయం పారాయణం చేస్తూ... సూర్యారాధన చేసేవారే అధికం. 

ఏది ఏమైనప్పటికీ చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటూ ఈ పవిత్రమైన విజయ సప్తమి రోజున నీల వస్త్రాన్ని ధరించరాదు. ఉసిరిక కాయ పచ్చడిని తినరాదు. ఉసిరికతో చేసిన తైలాన్ని (ఆమ్లా ఆయిల్ )కూడా కేశాలకు పూసుకొనవద్దు. జమ్మి చెట్టును స్పర్శించవద్దు. నువ్వుల నూనెను విసర్జించండి. 

సరదాకైనా అబద్దాలాడటం, ఈరోజు పగటి సమయంలో నిద్రించటం, వ్యర్ధంగా నవ్వటం, వీణాదులను వాయించటం, నాట్యం ఆడటం, జూదమాడటం మొదలైనవి ఆదివారం ఉదయం సూర్యోదయం నుంచి రాత్రి నిదురించే వరకు  విసర్జించాలి. 

అత్యంత అరుదుగా వచ్చే మరొక అద్భుత గ్రహస్థితి కూడా ఈరోజే ఆకాశంలో దర్శనం కాబోతున్నది. జయ నామ సంవత్సరానికి రాజైన చంద్రుడు మరియు ఎట్టి ఆధిపత్యము రాని శుభగ్రహమైన గురువు ఆదివారం సాయంత్రం నుంచి అర్థరాత్రి వరకు ప్రక్క ప్రక్కనే ఉండి ప్రజలందరికీ దివ్యాశీస్సులను అందించటానికి సిద్ధం కాబోతున్నారు. 

వసంత ఋతువు నందలి చైత్ర, వైశాఖ మాసాలలో... సంచారంలో ఉన్న సూర్య రధంలో ధాత, అర్యముడు అనే ఆదిత్యులు... పులస్త్య, పులహ అనే ఋషులు... ఖండక, వాసుకిలను నాగులు... నారద, తుంబురులనే గంధర్వులు... క్రతుస్థల, పుంజిక స్థల అనే అప్సరసలు మొదలైన వారందరికీ ఆరుద్రా నక్షత్ర సమయంలో గురు చంద్రులు కలిసి సాదర స్వాగతాలు సప్తమి తిధిలో అందిస్తున్నారు. 

ఇటువంటి విశిష్టమైన శుభవేళలో మనమందరమూ కూడా 6వ తేది ఆదివారం రాత్రి కనపడే చంద్రుడు మరియు నక్షత్ర రూపంలో ఉండే శుభ గ్రహ గురువును భక్తి విశ్వాసాలతో నమస్కరించుకుంటూ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్నిలేక శ్రీ విష్ణు ధ్యాన శ్లోకాన్నిపారాయణ చేయండి. ఆత్మ విశ్వాసంతో ముందుకు కదలండి. 

Sunday, March 30, 2014

శ్రీ జయ విశేషాలు

భగవంతుడు కాలస్వరూపుడు. అన్నీ ఋతువులు, కాలాలు భగవంతుని ఆధీనంలో ఉంటాయి. సృష్టిలోని జీవనవ్యవస్థకు మూలం భగవంతుడే. 6 ఋతువులు, 12 మాసాలు, 365 రోజులు... ఇవన్నీ కాలస్వరూపుని విభాగాలే. ఈ 12 మాసాలలో తొలిమాసం చైత్రం. చైత్ర శుద్ధ పాడ్యమి నాడే బ్రహ్మ సృష్టి ప్రారంభించాడని పురాణోక్తి. కలియుగ ప్రమాణము 4లక్షల 32వేల సంవత్సరములు. శ్వేతవరాహకల్పము నందలి 7వ దైనటువంటి వైవస్వత మన్వంతరములోని 28వ మహాయుగము నందలి కలియుగ ప్రధమ పాదములో 5115 వదియు, ప్రభవాది 60 సంవత్సరాలలో 28వ దైనటువంటి ఈ సంవత్సరమును చాంద్రమానంచే శ్రీ 'జయ' నామ సంవత్సరముగా పేర్కొందురు.
 
ప్రతి ఐదు సంవత్సరాలను ఒక యుగముగా లెక్కించినచో, ప్రభవాది అరవై సంవత్సరాలను పన్నెండు యుగాలుగా భావించాలి. ప్రతి యుగములోని ఐదు సంవత్సరాలను వరుసగా సంవత్సర, పరివత్సర, ఇదావత్సర, అనువత్సర, ఇద్వత్సరములని పిలువబడును. ఈ పరంపరలో ఆరవ యుగములోని 'ఇదావత్సర' మను నామంతో ఉన్న మూడవ సంవత్సరమే శ్రీ జయ నామ సంవత్సరం.   
పూషణం జయ నామాణమ్ జయదం భక్త సన్తతే ।
శంఖ చంక్రాంకిత కరద్వందం హృదిసమాశ్రయే ॥ 
 
 
ద్వాదశాదిత్యులలో 11 వ ఆదిత్యుడైన అయిన పూషుడు మాఘ మాసానికి అదిదేవత. ఈ పూష దేవత ప్రజలందరికీ జయమును చేకూర్చుటకు, ఒక చేతిలో శంఖమును, ఒక చేతిలో చక్రమును కలిగి 'జయ' అనే నామధేయము కలిగిన శ్రీ సూర్య నారాయణుడైన... శ్రీమహా విష్ణువు అధిపతిగా ఉన్న సంవత్సరమే శ్రీ జయ. మాఘమాసానికి అధిపతిగా ఉన్న సూర్యునిపేరే పూష. ద్వాదశాదిత్యులలో 11వ దేవతా స్వరూపం. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ సంవత్సరంలో మాఘమాస ఆది అంత్యాలు శ్రవణా నక్షత్రంలోనే రావటం, ఈ శ్రవణం కలియుగ మహా విష్ణువైన శ్రీ వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం కావటం, శ్రవణా నక్షత్రానికి అధిపతైన చంద్రుడే శ్రీ జయ సంవత్సరానికి రాజు మంత్రి కావటం విశేషం. మాఘమాస శుక్ల ఏకాదశి '"జయ ఏకాదశి" చంద్రుని మరో నక్షత్రమైన రోహిణిలోనే రావటం మరో విశేషం.

355 రోజులు సాగే శ్రీ జయ సంవత్సరానికి రాజ్యాధిపతి, మంత్రిత్వం చంద్రుడికి, సేన అర్ఘ మేఘాదిపత్యములు రవికి, సస్య నీరసాదిపత్యములు బుధునికి, ధాన్యాధిపత్యము కుజునికి, రసాధిపత్యము శుక్రునికి లభించగా గురు, శనులకు ఏ ఒక్క ఆధిపత్యం లభించలేదు.   
 
రాజు, మంత్రి ఒకరే అయినందున నిర్ణయాలు తీసుకొనుటలోను, ఆచరణలోను సమస్యలు ఉండవు. మధ్య మధ్యలో ప్రజలకు వచ్చే కష్టాలు వినటానికి రాజైన చంద్రుడు ఒక్కోసారి అందుబాటులో ఉండకపోవటం శ్రీ జయలో జరుగుతుంది. అందుకే 2014 ఏప్రిల్ నుంచి 2015 మార్చి వరకు, ప్రతినెలా అమావాస్య మరియు దాని ముందు వెనుక రోజులలో ప్రజలు ఎదుటివ్యక్తుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. తమ స్వ విషయాలను ఎదుటివారికి బహిర్గతం చేయవద్దు. గోప్యంగా ఉంచాలి.
రాజైన చంద్రునకు అక్టోబర్ 8న పాక్షిక చంద్రగ్రహణం జరిగినందున, రాజు మంత్రి చంద్రుడే అయినప్పటికీ, అప్పుడప్పుడు తప్పు నిర్ణయాలతో సలహాలిచ్చే వారు కూడా ఉంటుంటారు. అంచేత ప్రజలకు కొన్ని సందర్భాలలో తిప్పలు తప్పవు. కనుక వ్యావహారికంగా తెలుగునాట పాలించే నాయకులకు కూడా తప్పు నిర్ణయాలతో సలహాలిచ్చేవారు ఉంటుంటారు. కనుక విజ్ఞతతో ఆలోచిస్తూ పరిపాలన చేయాల్సిన అవసరం ఉందని పాలకులు గమనించాలి.
 
 
2014 ఏప్రిల్ 15 నుంచి మే 15 వరకు రక్షణశాఖ అధిపతులు అత్యుత్సాహం చూపకూడదు. జూన్ జూలై ఆగష్టు నెలలలో రక్షణశాఖ అప్రమత్తంగా ఉండాలి.  ప్రక్క రాష్ట్రాల నేతలతో సహృద్భావ వాతావరణంలో చర్చలు జరిగిననూ ఫలితాలు అసంపూర్ణం. ఉగ్రవాద దుశ్చర్యలను చేపట్టేవారు అధికము. అంతరిక్ష పరిశోధనా రంగంలో భారత్ విజయపంథాలో దూసుకువెల్లును. ఎలక్ట్రానిక్ వస్తువులు సరసమైన ధరలలో అందుబాటులోకి వచ్చును. టెలి కమ్యునికేషన్ రంగాలు బలపడును. క్రీడా రంగంలో కుంభకోణాలు బయటపడును. పర్యాటకరంగం అభివృద్ధి చెందును.
 
నిరుద్యోగులకు తీపివార్తలు. సాంకేతిక రంగాలలో విప్లవాత్మక మార్పులుండును. చేతి వృత్తులు, చిన్న పరిశ్రమలకు సహాయ సహకారాలుండును. విద్య, వైద్య, ఆరోగ్య రంగాలలో ప్రాధమికంగా ప్రయోజనలుండును. గృహనిర్మాణ రంగం అభివృద్ధి. స్త్రీ, శిశు సంక్షేమ, కార్మిక, కర్షక రంగాలలో అభివృద్ధి గతం కంటే మెరుగగును. సరిహద్దు సమస్యలచే తరచూ ఇబ్బందులు. గ్యాస్, విద్యుత్ సరఫరాలలో సంక్షోభం. విదేశీ మారకం విలువ పెరుగును.

జూలై 13 నుంచి సెప్టెంబరు 4 వరకు శని కుజులు తులారాశిలో కలయికచే వాతావరణం అనుకూలం కాదు. సెప్టెంబరు 25 నుంచి నవంబరు 12 వరకు సినీరంగానికి, కంప్యూటర్, సాఫ్ట్ వేర్ రంగములకు గడ్డురోజులు.  సంగీత, సాహిత్య, కళారంగాలలో పరిస్థితులు వ్యతిరేకంగా ఉండును.

నవమేఘ నిర్ణయానుసారం వాయు నామ మేఘం వాయువ్య భాగంలో ఏర్పడును. ఇందుచే అధిక గాలులచే భారీ వర్షములు, జల ప్రమాదములు ఉత్పన్నమగును.  7 భాగాలు సముద్రమునందు, 9 భాగాలు పర్వతములయందు, 4 భాగాలు భూమియందు వర్షములు పడును. నైరుతి ఈశాన్య ఋతుపవనాలతో పాటు ఉపరితల ఆవర్తనాలు, ద్రోణులు, వాయుగుండాలు అధికంగా ఉన్నందున భారీ వర్షములు అధికము. మేఘాధిపతి రవి కావటంచే అక్టోబర్, నవంబర్ లలో భారీ వర్షాలు ఉన్నందున ముందు జాగ్రత్త చర్యలు ఎంతో అవసరం. సెప్టెంబరు 17 కన్యాసంక్రాంతి వచ్చిన 7వ రోజే మహాలయ అమావాస్య రావటం, అక్టోబరు 17  తులాసంక్రాంతి వచ్చిన 7వ రోజే దీపావళి అమావాస్య రావటంచే జల సంబంధ ప్రకృతి వైపరీత్యాలు ప్రపంచవ్యాప్తంగా అక్కడక్కడ వచ్చుటకు అవకాశములున్నాయి.
 
ధాన్యాధిపతి కుజుడైనందున ఎరుపు ధాన్యాలు, ఎరుపు నెలలు పుష్కలంగా పండుతాయి. కాని 2014 జూలై, ఆగష్టు, సెప్టెంబర్ నెలలు ఎరుపు పంటలకు అనుకూలం కానందున రైతాంగం జాగ్రత్తలు తీసుకోవాలి. అర్ఘాధిపతి రవి అయిన కారణంగా వాణిజ్యం తరచూ మార్పులుంటూ, షేర్ విలువలు మోసపూరితంగా ఉండు సూచన కలదు. అక్టోబర్, నవంబరు మాసాలలో వాణిజ్య రంగానికి అనేక ఒడిదుడుకులు ఎదురవుతుంటాయి. అప్రమత్తతతో వ్యవహరించాలి.  
 
అక్టోబరు 16 నుంచి నవంబరు 16 వరకు మధ్యగల కాలంలో రక్షణశాఖ పనితీరు సమర్ధవంతంగాను, సమయాస్పుర్తితోను ఉండాలి.  అక్టోబరు 17 నుంచి నవంబరు 27 వరకు కుజ, గురులు షష్టాష్టక  స్థితులలో ఉండటము, నవంబరు 28 నుంచి 2015 జనవరి 4 వరకు ఉచ్చస్థితిలో కుజుడు, ఉచ్చస్థితిలో గురువు పరస్పర వీక్షణలతో ఉండి, కుజునిపై శనివీక్షణ కూడా ఉన్నందున ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాలలో దుష్టశక్తులు దుష్ట పన్నాగాలు చేయు సూచన.
 
జయ జ్యేష్ట బహుళ సప్తమి గురువారం 19 జూన్ 2014 ఉదయం 8.47 గం॥ గురువు కర్కాటకరాశి ప్రవేశించే సార్ధ త్రికోటి తీర్థ సహిత యమునా నదికి పుష్కరాలు ప్రారంభమై జూన్ 30తో ముగియును.  పుష్కర రాజైన గురువు ఉచ్చ ప్రవేశం రోజే గురువారం కావటం పైగా గురు నక్షత్రమైన పూర్వాభాద్ర సప్తమి తిదితో ఉండటం అరుదుగా వచ్చే విశేషం. ప్రయాగ, ఢిల్లీ, ఆగ్రా, మధుర, బృందావనం స్నానయోగ్య పుణ్య క్షేత్రాలు. ధృవ, కంసఘాతికా, విశ్రమ ఘట్టములు మధురలో నున్నవి. బృందావనంలో 32 పుణ్య తీర్ధ ఘట్టాలున్నాయి. ఈ తీర్థాలలో స్నానం పవిత్ర పుణ్యప్రదం. 

2015 జనవరి 15 మకర సంక్రాంతి పర్వదినాన మకర సంక్రాంతి పుణ్య పురుషుడు మందాకినీ నామంతో, గజ వాహనంపై స్వాతి నక్షత్రంలో గురువారం రోజున రావటం మహా విశేష శుభప్రదం.

ఈ సంవత్సర ఆదాయం 93 కాగా, సంవత్సర వ్యయం 84 భాగాలు. ఇక ద్వాదశ రాశులకు ఆదాయ, వ్యయ, రాజ్యపూజ్య, అవమానాలను లెక్కిస్తే .... 
మేషరాశి వారికి 14 ఆదాయం, 2 వ్యయం, 4 రాజ్యపూజ్యం, 5 అవమానం
వృషభరాశి వారికి 8 ఆదాయం, 11 వ్యయం, 7 రాజ్యపూజ్యం, 5 అవమానం  
మిధునరాశి వారికి 11 ఆదాయం, 8 వ్యయం, 3 రాజ్యపూజ్యం, 1 అవమానం  
కర్కాటకరాశి వారికి 5 ఆదాయం, 8 వ్యయం, 6 రాజ్యపూజ్యం, 1 అవమానం  
సింహరాశి వారికి 8 ఆదాయం, 2 వ్యయం, 2 రాజ్యపూజ్యం, 4 అవమానం  
కన్యారాశి వారికి 11 ఆదాయం, 8 వ్యయం, 5 రాజ్యపూజ్యం, 4 అవమానం  
తులారాశి వారికి 8 ఆదాయం, 11 వ్యయం, 1 రాజ్యపూజ్యం, 7 అవమానం  
వృశ్చిక రాశి వారికి 14 ఆదాయం, 2 వ్యయం, 4 రాజ్యపూజ్యం, 7 అవమానం  
ధనస్సురాశి వారికి 2 ఆదాయం, 11 వ్యయం, 7 రాజ్యపూజ్యం, 7 అవమానం  
మకరరాశి వారికి 5 ఆదాయం, 5 వ్యయం, 3 రాజ్యపూజ్యం, 3 అవమానం  
కుంభరాశి వారికి 5 ఆదాయం, 5 వ్యయం, 6 రాజ్యపూజ్యం, 3 అవమానం 
మీనరాశి వారికి 2 ఆదాయం, 11 వ్యయం, 2 రాజ్యపూజ్యం, 6 అవమానం

మొత్తం మీద 2014-2015 జయ నామ సంవత్సర ఫలితాలను విశ్లేషిస్తే 68 శాతం ప్రజలందరూ సుఖ శాంతులతో ఉంటారు. మిగిలిన 32 శాతం ప్రజలు సుఖ శాంతులు ఉండే సూచనలు ఉన్నప్పటికీ, అనుభవించే అవకాశాలు తక్కువగా ఉంటాయి. కనుక శ్రీ జయ సంవత్సరానికి దేవతా స్వరూపం శ్రీ మహా విష్ణువు కనుక ప్రతి వారు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం లేక నామాలను లేక భావాన్ని అర్ధవంతంగా తెలుసుకుంటే తప్పక శుభం కలుగుతుంది.

Friday, February 14, 2014

త్వరలో రానున్న తెలుగు టీవీ ఛానల్

త్వరలో నా సారధ్యంలో అన్నీ హంగులతో తెలుగు టెలివిజన్ ఛానల్ టెస్ట్ సిగ్నల్ తో ముస్తాబై రానున్నది. టెస్ట్ సిగ్నల్ లోని స్వల్ప భాగాన్ని వీక్షించటానికి క్లిక్ చేయండి. భక్తిమాల వెబ్ టీవీ కూడా త్వరలోనే అన్నీ హంగులతో కొనసాగుతుంది.