Tuesday, August 26, 2014

భాద్రపదమాస మహాలయపక్షము

భాద్రపదమాసం ప్రారంభమైనది. ఈ మాసంలోని రెండవ పక్షాన్నే పితృ పక్షము అంటారు. పితృ దేవతలకు విశేషంగా ప్రీతికరమైన మాసమని భావము. భాద్రపద బహుళ పాడ్యమి నుంచి అమావాస్య వరకు ఉన్న 15 రోజులను పరిశీలిస్తే ఖగోళంలో సూర్యుడు కొద్ది రోజులు సింహ రాశిలోను, కొద్ది రోజులు కన్యా రాశిలోను ఉంటుంటాడు. ఒక్కోసారి ఒక రాశిలో ఉండగానే భాద్రపద మాస పితృపక్షం గడిచిపోతుంది. సూర్యుడు కన్యా, తులా రాశులలో సంచారం చేసి వృశ్చిక రాశి ప్రవేశం జరిగేవరకు ప్రేతపురి శూన్యంగా ఉంటుందని శాస్త్ర వచనం. అంచేత కన్య, తులా రాశులలో సూర్య సంచారం జరిగే షుమారు 60 రోజుల కాలమంతయూ... పితృ దేవతలు తమ ప్రేతపురిలో భోజన పానీయాలు లేకుండా ఉంటారు. ఇట్టి సమయంలో వారందరూ కూడా భూ లోకానికి వచ్చి వారి వారి గృహాల చుట్టూ తిరుగుతుంటారని మహా భారత గ్రంధం చాటి చెప్తుంది.

అందుచేతనే మనిషి చనిపోయిన తర్వాత చేసే కర్మ కాండలకు చాల కీలక ప్రాధాన్యత ఏర్పడింది. మానవులు గతించిన తర్వాత శ్రాద్ధ కర్మలు ఆచరించటం మన సంప్రదాయం. కాని ప్రతిఫలం ఆశించకుండా ఇట్టి శ్రాద్ధ కర్మలను ఆచరించాలి. వంద యజ్ఞాలు చేసే కన్నా పితృ దేవతలకు తర్పణాలు అందించటం ఎంతో ముఖ్యమని మన మహర్షులు తెలియచేస్తున్నారు. గతించిన తల్లి తండ్రులకు, ఇతరులకు తద్దినాలు, తర్పణాలు, పిండప్రదానాలు ప్రతి సంవత్సరము వారు మరణించిన రోజున ఆచరిస్తుంటారు.

కొంతమంది అయితే వారు మరణించిన రోజునే అన్నదానం చేసినట్లయితే పితృ దేవతలకు ఉత్తమ గతులు కల్గుతాయనే నమ్మకంతో అన్నదానంతో పాటు విశేష దానాలను చేస్తుంటారు. ఇలా చేసినందున పితృ దేవతల ఆశీస్సులు లభించి సకల శుభాలు కల్గుతాయని విశ్వాసం. కొంత మంది ఆర్ధిక స్తోమత లేనివారు ఇలాంటి విధానానికి బదులుగా ఆలయ అర్చకులకు, లేక సమీపంలో ఉండే పురోహిత పండితులకు దక్షిణ తాంబూలాలతో వారికి స్వయంపాకం సమర్పిస్తుంటారు. పితృ దేవతల ఆత్మకు శాంతి కల్గినప్పుడే ఇహ లోకంలో ఉన్న మనకు కూడా ప్రశాంతత చేకూరి సుఖ సంతోషాలతో వంశాభి వృద్ధి ఉంటుందని ధర్మశాస్త్రాలు తెలియచేస్తున్నాయి.

దానశీలిగా పేరుగాంచిన కర్ణుడు మరణానంతరము స్వర్గ లోకానికి వెళ్తుండగా మార్గ మధ్యంలో ఆకలి, దప్పిక కలగటంతో, తాను సమీపంలోని ఫల వృక్షానికి ఉన్న పండును కోసుకొని.. తినాలనుకునే సమయంలో, ఆ పండు కాస్తా బంగారు పండుగా మారిపోయింది. ఆ విధంగా సమీపంలో ఉన్న ఏ ఫల వృక్షం నుంచి ఫలాన్ని కోసిననూ, అవి కూడా స్వర్ణ ఫలాలుగానే మారిపోతున్నాయి. దప్పిక తీర్చుకుందామని సమీప సెలయేటిలోని నీటిని దోసిలిలో తీసుకున్నప్పటికీ, ఆ నీరు స్వర్ణ జలంగా మారటం జరిగింది. స్వర్గానికి వెళ్ళిన తర్వాత కూడా ఇలాగే పరిస్థితి పునరావృత మైనది.

ఈ విధంగా జరగటానికి ప్రధాన కారణమేమిటని కర్ణుడు వాపోతుంటే... కర్ణా... ధన, కనక, వస్తు, వాహనాలన్నీ దానం చేసావు గాని ఏ ఒక్కరికి కూడా పట్టెడు అన్నం పెట్టి ఆకలి తీర్చలేదు. అందుకే నీకీ స్థితి ప్రాప్తించింది అని అశరీరవాణి పలుకులు వినిపించాయి. వెంటనే కర్ణుడు తన తండ్రి అయిన సూర్యదేవుని ప్రాధేయ పూర్వకంగా ప్రార్ధించగా, సూర్య దేవుని యొక్క అనుగ్రహం మేరకు ఇంద్రుడు ఓ అపురూపమైన అవకాశాన్ని కర్ణునికి ఇచ్చాడు.

అదేమిటంటే తక్షణమే భూ లోకానికి వెళ్లి అక్కడ వారందరికీ అన్న పానీయాలను అందచేసి, మాతా పితరులందరికీ తర్పణాలు వదిలి తిరిగి స్వర్గానికి రావటము. ఇంద్రుని అవకాశం మేరకు కర్ణుడు భాద్రపద మాసంలో బహుళ పాడ్యమి రోజున భూలోకానికి రావటము, ఇక్కడ పేదలకు అన్న సంతర్పణలు, పితరులకు తర్పణ, పిండ ప్రదానాలు వదిలి తిరిగి భాద్రపద అమావాస్య రోజున స్వర్గానికి వెళ్ళాడు. ఇట్టి అన్న సంతర్పణలు, పితృ తర్పణాలు చేసినందున స్వర్గ లోకంలో కర్ణుడు సుఖంగా ఉండటానికి అవకాశం లభించింది.

కర్ణుడు భూలోకానికి వచ్చి, ఇక్కడ కొద్ది రోజులు ఉండి తిరిగి స్వర్గానికి వెళ్ళిన ఈ పక్షం రోజులకే మహాలయ పక్షమని పేరు. ఈ మహాలయ పక్షంలోని చివరి రోజునే మహాలయ అమావాస్య అంటారు.

ప్రస్తుత యాంత్రిక యుగంలో పితృ దేవతలకు శ్రాద్ధ కర్మలు (తద్దినాలు) పెట్టటము మానుతున్నారు. సమయం లేక కొంతమంది, బ్రాహ్మణులు దొరకక ఇంకొంతమంది, గృహంలో అనారోగ్య కారణాలచే శుచితో (మడి) వంట చేసేవారు లేక అలాగే వంట వారు దొరకక, మరికొన్ని సందర్భాలలో శ్రాద్ధ కర్మలు ఆచరిస్తే పితృ దేవతలకు చేరతాయా అనే హాస్యాస్పద ధోరణితో.... ప్రస్తుత కాలంలో తద్దినాలు తగ్గిపోతున్నాయి. ఈ కారణాల వలన వంశాభివృద్ధి జరగటంలేదనేది అక్షర సత్యము.

ఆచార వ్యవహారాల మీద మహా విశ్వాసం ఉన్న వారికి కూడా, తమ తమ ఉద్యోగ వ్యాపారాల వలన కాని ఇతర అనారోగ్యాల వలన కాని ఒక్కోసారి సమయం దొరక్క, ఆ రోజున వారి పితృ దేవతలను స్మరిస్తూ, ఆ యా రోజులలో కొన్ని పుణ్యక్షేత్రాలలోని నిత్యాన్నదాన సత్రాలలో తమ పెద్దల పేరుతో, తమ శక్తికి తగినట్లుగా అన్నసంతర్పణ గావిస్తున్నారు. ఏమి చేయలేని ఆర్ధిక దుస్థితి లో ఉన్నవారు... సమీపంలో ఉన్న వృక్ష సముదాయాల దగ్గరకు వెళ్లి, ఆ వృక్షాన్ని హత్తుకొని పితరులను ఉద్దేశించి కన్నీరైన కార్చవలెనని ధర్మ శాస్త్రం తెలియచేస్తుంది.

వైదిక పరమైన ఆచారాలు, సంప్రదాయాల మీద నమ్మకం లేని వారు కూడా సంవత్సరంలో ఒక్కరోజైనా చనిపోయిన వారిని తలుచుకొని పేదలకు వస్త్ర, ధన, అన్నదానాలు చేస్తూ ఉంటారు. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. వస్త్ర దానం గాని, ధన దానం గాని చేసిన తర్వాత స్వీకరించిన వారు పూర్తిగా తృప్తి పడలేరు. ఎందుకంటే బాగా ధనవంతులుగా ఉన్నారుగా ! మరికొంత ఎక్కువ ధనం  ఇస్తే బాగుండేది అనుకుంటారు, అలా కాకుండా వారిని కూర్చోపెట్టి కడుపునిండా... తృప్తి పడేలా అన్నదానం చేసినప్పుడు వారు... సంతృప్తి తోనే ఇక చాలు అంటారు. అందుకే అన్నీ దానాల కంటే అన్నదానం గొప్పదని శాస్త్ర వచనం.

కనుక పాఠకులు ఈ ఆర్టికల్ ను చదివి మహాలయ పక్షంలో తమ పితరులకు తర్పణ పిండ ప్రదానాదులు ఆచరిస్తూ, పేదలకు తమ శక్త్యానుసారం అన్నదానం చేయగలరని ఆశిస్తూ.. జ్యోతిష శాస్త్ర ప్రకారం భాద్రపద మాస మహాలయ పక్షము సూర్యుడు సింహ, కన్య రాశులలో సంచారం చేసే సమయంలోనే  వస్తుంది. ఈ సమయంలో విధి విధానంతో ఆచరించినప్పటికీ... పితృ కారకుడైన సూర్య గ్రహము ప్రతి సంవత్సరము సెప్టెంబర్ 16 నుంచి నవంబర్ 17 వరకు కన్యా, తులా రాశులలో సంచరిస్తుంటాడు. కనుక ఈ 60 రోజులలో వచ్చే ఇతర  అమావాస్య  రోజులలో కూడా తమ తమ పితరులను ఉద్దేశించి వైదిక క్రియల ద్వారా గాని అన్న సంతర్పణలు గాని ఆచరించవచ్చును.  ఈ పితృ దేవతలను గురించిన విశేష అంశాలు జాతకాలలో ఏ విధంగా అనుకూల, ప్రతికూల ప్రభావాలు చూపిస్తుంటాయో  అంతర్లీన దోషాలు - 1 నుంచి వరుసగా చదవండి . - శ్రీనివాస గార్గేయ

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.