Thursday, October 26, 2017

ధనస్సులోకి శని ప్రవేశించాడు భాగం - 1

శ్రీ హేమలంబ నామ సంవత్సర కార్తిక మాసం శుక్ల సప్తమి గురువారం తేదీ 26 అక్టోబర్ 2017 మధ్యాహ్నం 3 గంటల 28 నిముషాలకు మూల నక్షత్ర 1వ పాదమైన ధనుస్సు రాశిలోకి శని గ్రహం ప్రవేశించాడు. తిరిగి ధనుస్సు నుంచి 2020 జనవరి 24 వ తేదీ తదుపరి రాశియైన మకరంలోకి ప్రవేశించనున్నాడు. 821 రోజుల పాటు ధనుస్సు రాశిలో సంచారం చేస్తున్నాడన్నమాట. అయితే ఆయుష్కారకుడైన శని ధనుస్సు రాశి ప్రవేశం చేయగానే, మేష రాశివారికి అష్టమ శని, సింహరాశి వారికి అర్ధాష్టమ శని, తులా రాశి వారికి ఏలినాటి శని తొలగిపోయిందన్నమాట.

వృషభ రాశివారికి అష్టమ శని, కన్యా రాశి వారికి అర్ధాష్టమ శని, మకర రాశి వారికి ఏలినాటి శని, ప్రారంభం కాగా వృశ్చిక రాశి వారికి చివరిభాగ (మూడవ భాగం ) ఏలినాటి శని, ధనుస్సు రాశి వారికి మధ్య భాగం (రెండవ భాగం) ఇదే సమయం నుంచే ప్రారంభమయ్యాయి. ఏలినాటి అష్టమ, అర్ధాష్టమ శని అనగానే నూటికి 99 మందికి వెన్నులో చలి  పుడుతుంది. ఇంకేముంది శని గ్రహం వచ్చి పడింది. ఇక ఏమి చేసినా పీడ ఏర్పడుతుంది అని భావించే వారి సంఖ్య చాలా ఎక్కువ. కనుక అలాంటిదేమి ఉండదని ధైర్యంగా ఉంటూ శని ఆయుష్కారకుడని తెలుసుకుని, అంతర్గత శత్రుత్వ పోకడలు ఎక్కడెక్కడ ఉన్నాయో గమనించి వాటిని అడ్డుకొనగలిగితే సర్వకాల సర్వావస్థలలో విజయకేతనం ఎగరవేయగలరు.

జ్యోతిష శాస్త్ర నిర్ణయం ప్రకారంగా ఆయుష్కారకుడైన శని మకర, కుంభ రాశులకు అధిపతిగా ఉంటూ, ద్వాదశ రాశులు కలిగిన ఈ ఖగోళ మండలాన్ని చుట్టి రావటానికి 30 సంవత్సరాల సమయం పడుతుంది. అయితే ఈ ఖగోళ మండలాన్ని చంద్రుడు చుట్టి రావటానికి 29 రోజుల 12 గంటల 44 నిముషాల 3 సెకన్ల కాలం పట్టును. అంటే ఎంత వేగంగా 12 రాశులను తిరిగి వస్తున్నాడో.. ఈ వేగాన్ని చూస్తే అర్ధమవుతుంది.

జ్యోతిష శాస్త్ర ప్రకారంగా చంద్రుడు కర్కాటక రాశికి అధిపతి, మనః కారకుడు, శనికి అంతర్గత శత్రువు. ఇట్టి చంద్రుడు, జన్మించిన సమయానికి ఏ నక్షత్రంలో సంచారం ఉండునో ఆ నక్షత్రమే మనకు జన్మ నక్షత్రం అవుతుంది. ఈ జన్మ నక్షత్రం ఏ రాశిలో ఉంటుందో ఆ రాశిని మనం జన్మ రాశిగా పిలుచుకుంటుంటాం. ఇది అసలు కథ.

ప్రణతి టెలివిజన్ ఛానల్ లో ధనుస్సు రాశి శని ప్రవేశం గురించి ఉపోద్ఘాతము మరియు 12 రాశుల వారికి ఫలితాలు, సలహాలు, పరిహారాలు అనేవి చిన్న వీడియోలలో ఇవ్వటం జరిగింది. కానీ ఒక్కో రాశి వారు తెలుసుకోవాల్సిన సమాచారం ఎంతెంతో ఉంది. కారణమేమంటే శనికి అంతర్గత శత్రువైన చంద్రుడు సంచారం చేసే నక్షత్రంలోనే మనం జన్మించాం. మన జన్మ నక్షత్ర జన్మ రాశికి తగినట్లుగా పక్షం పక్షం, మాసం మాసం ఫలితం ఇవ్వాలంటే ఒక్కోసారి సమయాన్ని అత్యధికంగా కేటాయించాలి. అందుకోసంగా  ఈ  821 రోజుల సంచారంలో ఏ ఏ రాశికి శని ఎంత దూరంలో ఉంటున్నాడు, ఏమి చేయబోతున్నాడు, చేస్తే ఏమి ఇస్తాడు, ఇస్తే ఉంచుతాడా తిరిగి తీసుకుంటాడా అనే ఆసక్తికరమైన అంశాలు ఎన్నెన్నో ఉన్నాయి.  కళ్ళకు కట్టినట్లుగా రాశుల వారీగా నక్షత్రాల వారీగా సమయానుకూలంగా తెలియచేస్తుంటే తగిన నిర్ణయాలతో పాఠకులు ముందుకు విజయ పంథాలో వెళ్లగలరనే ఆలోచన నా మదిలో మెదిలింది.

ఈ  పరంపరలో ఈ 821 రోజుల ధనూరాశి సమాచారంలో భాగంగా ఆయన ఒక్కొక్క రాశికి ఒక్కో మూర్తిత్వంతో (వేష ధారణతో), ,అనుకూలంగాను ప్రతికూలంగాను ఉంటుంటాడు. జ్యోతిష పరంగా జన్మ రాశి నుంచి 3వ లేక 6వ లేక 11వ స్థానాలలో ఉంటే విశేషతలను ఇస్తాడనేది మొదటి మాట. అంటే జన్మ రాశి నుంచి 1,2,4,5,7,8,9,10,12 వ రాశులలో ఉంటే ఫలితాలు ఏమి ఇవ్వడని నిర్ణయం.

ఈయన సంచారం చేసినంత కాలం 4 రకాల మూర్తిత్వాలతో ఉంటుంటాడు. అవి సువర్ణ మూర్తి, రజత మూర్తి, తామ్ర మూర్తి, లోహ మూర్తి అని పేర్లు. అనుకూలంగా ఉన్న స్థానాలలో సువర్ణ, రజత మూర్తులుగా ఉంటే విశేష ఫలితాలను మరింతగా ఇస్తాడని భావము. అలా కాక అనుకూల ఫలితాలు ఇచ్చే 3, 6 , 11 స్థానాలలో లోహ మూర్తిగా లేక తామ్ర మూర్తిగా ఉంటే ఫలితాలు అనుకూలంగా ఇవ్వడని భావము. అలా కాక వ్యతిరేక స్థానాలలో సువర్ణ, రజత వేష ధారణలు కల్గి ఉంటే అనుకూలంగా ఫలితాలను ఇస్తాడు. ఈ వ్యతిరేక స్థానాలలోనే లోహ తామ్ర మూర్తిత్వాలు ఉన్నాయనుకుంటే ఇంకా వ్యతిరేకతలని అర్థం. ఇప్పుడు చెప్పినదంతా రెండవ మాటగా భావించాలి.

ఇక 3వ మాట ఏమిటంటే స్థానమేదైనా కానీ, రూపం ఏదైనా కానీ ఫలితం అనుకూలంగా వస్తున్నా సమయంలో ఇతర గ్రహాలు ఏవైనా అడ్డు తగిలితే ఫలితం ఆగిపోతుంది. ఒకవేళ చెడు ఫలితాలు వచ్చే సమయంలో అడ్డు తగిలితే... చెడు ఫలితాలు ఉండవు. అలా కాక మంచి ఫలితాలు వచ్చే సమయంలో అడ్డు తగిలితే మనం కొంచెం బాధపడాలి. దీనికి ఒక చిన్న ఉదాహరణ తెలియచేస్తాను. సినిమాలలో ఒక వ్యక్తిని తరుముకుంటూ మరో వ్యక్తి కార్ లో వెంబడిస్తుంటాడు. ఇంతలో రైల్వే గేట్ వచ్చింది. మొదటి వ్యక్తి దాటగానే గేట్ పడిపోయింది. తరుముకుంటూ వచ్చే వ్యక్తి గేట్ దగ్గర ఆగిపోయాడు. ఇదే చక్కని ఉదాహరణ. అంటే ప్రతికూలత వెంటాడుతున్న సమయంలో ఆ రైలు గేట్ రక్షణగా కాపాడింది అనుకోవాలి. దీనినే జ్యోతిష పరిభాషలో వేధ అంటారు.

కనుక శని గ్రహం నుంచి అనుకూలతలు మనకు వస్తున్న సందర్భాలలో వేధలు (రైల్వే గేట్ ) లేకుండా ఉంటే బావుండు అనుకుంటారు. అలాగే వ్యతిరేకతలు వచ్చే సందర్భాలలో వేధ ఉంటే బావుండు అనుకుంటారు (ఎందుకనంటే సమస్యల నుంచి బయటపడవచ్చు అనే ఆలోచన అన్నమాట ). కనుక శని గ్రహ అనుగ్రహం గురించి 821 రోజులలో ద్వాదశ రాశులకు ఏయే విధంగా పరిస్థితులు ఉంటాయో అనుకూలతలు ఎలా ఉంటాయో, ప్రతికూలతలు ఎలా ఉంటాయో, ఎలాంటి పరిహారాలు చేయాలో, ధారావాహిక పోస్టింగ్ లలో ఉంచగలను. కనుక ఈ ధారావాహికలు వరుసగా చదవటానికి ప్రయత్నం చేయండి. ప్రపంచవ్యాప్త జ్యోతిష చరిత్రలో ప్రప్రధమంగా మరింత లోతైన విశ్లేషణతో ప్రతి నెలలో ఉన్న తేదీలతో పాటుగా మరిన్ని అంశాలన్నింటినీ మీకందించబోతున్నాను. ఈ రోజే శని ప్రవేశించాడు, పరిహారం రేపే చేయాలి అని తొందర పడవద్దు. నవంబర్ 17 నుంచి ద్వాదశ రాశుల వారు పరిహారాలు చేయవలసి ఉంటుంది. కనుక నిదానంగా చదవండి, ఆకళింపు చేసుకొని పాటించండి. భయపెట్టే వారిని దూరంగా ఉంచండి.

ఈ విశ్లేషణను నా బ్లాగ్ నుంచి తస్కరించి ముందు మాటలు వెనుక, వెనుక మాటలు ముందు పెట్టి తమ తమ పాండిత్యాన్నంతా ప్రదర్శించే ఘనా పాటీలు ఈ దేశంలో ఎంతో మంది ఉన్నారు. కనుక గమనించవలసినదిగా కోరుతున్నాను. - దైవజ్ఞ శ్రీనివాస గార్గేయ

Saturday, September 9, 2017

వేలాది సంవత్సరాల తర్వాత రానున్న అద్భుత మాలికా యోగం

2017 సెప్టెంబర్ 27 స్వస్తిశ్రీ హేమలంబ నామ సంవత్సర ఆశ్వీజ శుక్ల సప్తమి బుధవారం ఉదయం 9.59 నిముషాలకు మూల నక్షత్రం ప్రారంభం కావటంతో విశేషమైన అరుదైన అద్భుత యోగం ప్రారంభం కానున్నది. ఇక వివరాలలోకి వెళితే ఛాయా గ్రహాలైన రాహువు కర్కాటక రాశిలో ఉండగా కేతువు మకర రాశిలో ఉన్నాడు. సరిగ్గా పై సమయానికి ఖగోళంలో ఉన్న గ్రహ స్థితిని పరిశీలిస్తే ఓ గ్రహ మాలికా యోగం 27 ఉదయం 9.59 నిముషాలకు మూల నక్షత్రంతో ప్రారంభమైనది. సింహరాశిలో కుజ శుక్రులు, కన్యా రాశిలో రవి బుధులు, తులా రాశిలో గురువు, వృశ్చిక రాశిలో శని ఉండగా, చంద్రుడు ఆనాటి ఉదయం 9.59 నిముషాల నుంచి 29 రాత్రి 10.28 నిముషాల వరకు ధనుస్సు రాశిని ఆక్రమించి ఉంటాడు. అంటే దాదాపుగా రెండున్నర రోజుల పాటు ఈ  గ్రహమాలిక యోగము కర్కాటక రాశి నుంచి మకర రాశి వరకు వ్యాపించింది.

ఖగోళంలో గ్రహమాలికా యోగాలు అప్పుడప్పుడు వస్తుంటాయి. (ఇదేమి కొంతమంది చెప్పే కాలసర్ప దోషము కాదు) దేవి నవరాత్రులలో మూల  నక్షత్రంతో భాసిల్లే సరస్వతి ఆవాహనం దగ్గర నుంచి దుర్గాష్టమి, మహర్నవమి పర్వదినాలు ఈ గ్రహమాలికా యోగంలో ఉండటమనేది అత్యంత అరుదైన విశేషం. ముఖ్యంగా శుభ గ్రహమైన గురువు 7 రాశులలో విరాజిల్లే గ్రహమాలికా యోగానికి మధ్యలో ఉన్న తులా రాశిలో ఉండటం న భూతో న భవిష్యతి.

తులా రాశికి సంకేతం త్రాసు. ఇట్టి త్రాసు ఉన్న రాశిలోనే గురువు ఉండి, అటు 3 రాశులు, ఇటు 3 రాశులకు మధ్యన ఉండటం అద్భుతాలను అందించి న్యాయ నిర్ణేతగా ఉండి తీర్పు ఇవ్వనున్నాడా అన్న చందాన గురువు ఉన్నాడు. ఇక ప్రకృతి రాశి కన్యా రాశిలోకి బుద్ధి కారకుడైన బుధుడు, యోగానికి కొద్దీ  గంటల ముందే విచ్చేసి మహాద్భుతమైన బుధాదిత్య అనే లక్ష్మీ యోగాన్ని అందించటానికి సిద్ధంగా ఉన్నాడు. ఇది కూడా ఒక విశేషమే.

సెప్టెంబర్ 27వ తేదీ బుధవారం ఉదయం 9.59 నిముషాల నుంచి 29వ తేదీ శుక్రవారం రాత్రి 10.28 నిముషాల వరకు 7 రాశులలో జరిగే గ్రహ మాలికా యోగం పరోక్షంగా ఆర్ధిక అంశాలపైనా ప్రభావాన్ని చూపిస్తుంది. గురు గ్రహం 7 రాశుల మధ్యలో ఉంటూ బుధాదిత్య యోగంతో భాసిల్లే గ్రహమాలికా యోగం మూలా నక్షత్రంతో ప్రారంభమై సరస్వతి పూజ, దుర్గాష్టమి, మహార్నవమనే మూడు పర్వదినాలలో వ్యాపించి ఉన్న సందర్భంగా ద్వాదశ రాశుల వారు దిగువన చెప్పే మహా యోగ తంత్రాన్ని ఆచరించండి. ఏదో గ్రహ సంచారం వస్తున్నది, సమస్యలు తెస్తున్నదని భావించి పరిహారంగా పాటించాలేమో అని అనుకోవద్దు.

ధర్మ శాస్త్ర నిర్ణయాల ప్రకారం మహర్నవమి పర్వదినాన యజ్ఞ యాగాది క్రతువులు ఆచరించేవారు శ్వేత తిల ఘృత పాయసాన్నమును బలిహరణముగా వైదిక క్రతువులో చేస్తారు. శ్వేత తిలలు అంటే తెల్ల నువ్వులు. ఘృతము అంటే నెయ్యి. పాయసం చేయాలి అంటే దానికి బియ్యం (తండులాలు) అవసరం. ఈ పాయసం పాలు, సుగంధ ద్రవ్యాలు, బెల్లము తో చేస్తారు. ఇక గ్రహమాలిక యోగంలో మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిలను ఆరాధించే ఈ మూడు రోజులలో శ్వేత తిల మహాయోగ తంత్రాన్ని ప్రతివారు ఆచరిస్తే ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ముగురమ్మల మూలపుటమ్మ అనుగ్రహాన్ని పొందుతూ ఆర్ధిక పటిష్టతకు అవసరమయ్యే ఆలోచనలను పొందుతారని చెప్పటంలో సందేహం ఏ మాత్రం లేదు.

నువ్వులు శని గ్రహానికి ప్రతీకలు. జ్యోతిష రీత్యా చంద్రుడు శనికి అంతర్గత శత్రువు. ప్రతివారు తమ తమ మనోభావాలతోనే జీవన పథంలో అభివృద్ధి చెందుతుంటారు. అధః పాతాళానికి కూరుకుంటుంటారు. ప్రతివారికి మనస్సే చాలా ముఖ్యమైనది. ఇట్టి మనః కారకుడైన చంద్రుడు, శని ఎలాంటి శత్రుత్వాలు లేకుండా దేవి నవరాత్రులలో, ఆర్ధికంగా ఎదగటానికి అవసరమైన మానసిక శక్తిని అందించే యోగ తంత్రమే ఈ గ్రహ మాలికా యోగంలో ఎంతో ఉపయోగపడనుంది.

కనుక శ్రీ హేమలంబ నామ సంవత్సర దేవి నవరాత్రులలో శ్వేత తిల యోగ తంత్రాన్ని ప్రతి వారు రెండు పద్దతులలో ఆచరించవచ్చు. ముందుగానే ఓ 50 గ్రాములు తెల్ల నువ్వులను కొనండి. కొద్ది నెయ్యితో దోరగా తెల్ల నువ్వులను వేయించండి.

ఇక 27వ తేదీ బుధవారం సరస్వతి పూజ రోజున మధ్యాహ్నం 12 గంటల నుంచి 1.30 వరకు గల రాహుకాలంలోనూ, మరియు 28 గురువారం దుర్గాష్టమి మధ్యాహ్నం 1.30 నుంచి 3.00 వరకు ఉన్న రాహుకాలంలోనూ, మరియు 29 శుక్రవారం మహర్నవమి రోజున 10.30 నుంచి 12.00 గంటల లోపల ప్రతివారు దోరగా వేయించిన తెల్ల నువ్వులను కుడి చేతిలో  ఉంచుకొని సూర్య కాంతి చూపించి (సూర్యుని వైపు చూడాల్సిన అవసరం లేదు) మహా ప్రసాదంగా స్వీకరించండి. 

 ఇక రెండవ పద్దతిగా తెల్ల నువ్వులు, బియ్యము, నెయ్యి, బెల్లము, సుగంధ ద్రవ్యాలతో పాయసం చేసుకొని, మీ మీ పూజ మందిరంలోని దేవతలకు నివేదించి, పైన చెప్పిన రాహుకాల సమయాలలో జగన్మాత ప్రసాదంగా స్వీకరించండి. (ఏ సమయంలో నివేదించినను, ఈ రాహుకాల సమయంలో మాత్రమే ప్రసాదంగా స్వీకరించండి) దుర్గాష్టమి గురువారం నాడు భోజనం ముందు చేసినప్పటికీ , రాహుకాలంలోనే ప్రసాదాన్ని తీసుకొనండి.

దక్షిణాయనం ప్రారంభమయ్యే కర్కాటక రాశి నుంచి, ఉత్తరాయణం ప్రారంభమయ్యే మకర రాశి వరకు 7 రాశులలో మధ్య స్థాన శుభగ్రహ గురువుతో, బుధాదిత్య యోగంతో, మూల నక్షత్ర ప్రారంభంతో, సరస్వతి పూజ, దుర్గాష్టమి, మహర్నవమి రోజులతో వచ్చే ఈ యోగం కొన్ని వేలాది సంవత్సరాల తర్వాత వచ్చినదని చెప్పుకోవటంలో అతిశయోక్తి  ఏ మాత్రం లేదు.

ఇట్టి గ్రహ మాలికా యోగ పరంపరలో మహాయోగ తంత్రంగా చెప్పుకొనే శ్వేత తిలల ద్వారా జగన్మాత అనుగ్రహాన్ని పొందటానికి అందరూ ప్రయత్నించండి. -దైవజ్ఞ పొన్నలూరి శ్రీనివాస గార్గేయ

Friday, September 8, 2017

గురు గ్రహ గోచార ప్రవేశం - మూర్తి నిర్ణయం విశేషాలు

ఈ 2017 సెప్టెంబర్ 12 ఉదయం 6 గంటల 51 నిముషాలకు గురు గ్రహం తులారాశి ప్రవేశం చేయటంతో గోచారపరంగా ద్వాదశ రాశులకు ఫలితాలు మూర్తి నిర్ణయంపై ఆధారపడి ఉంటాయి. ఈ పరంపరలో అనుకూలంగా గోచారంలో ఫలితాలు ఉండి గురు ప్రవేశ సమయ నిర్ణయం ప్రకారం గురు గ్రహ మూర్తి నిర్ణయం లోహ మూర్తి, తామ్రమూర్తిగా ఉన్నప్పుడు అనుకూల ఫలితాలు బదులుగా, వ్యతిరేక ఫలితాలు  ఉంటాయి. అలాగే గోచారంలో వ్యతిరేక ఫలితాలు ఇవ్వవలసిన సందర్భంలో గురువు మూర్తి నిర్ణయం సువర్ణ లేక రజత మూర్తి మూర్తి రూపాలలో ప్రవేశం ఉంటే సంపూర్ణ అనుకూలతలు కలుగుతాయి.

అయితే అనుకూల ఫలితాలు  వచ్చే సందర్భాలలోనూ, ప్రతికూల ఫలితాలు వచ్చే సందర్భాలలోనూ గురు గ్రహ సంచారానికి ఇతర గ్రహాల వేధలు ఉండవచ్చు. ఇలాంటి వేధలు ఉన్న సమయాలలో ఫలితాలు ఆగిపోతాయి. వ్యతిరేక ఫలితాలు వచ్చే సమయంలో వేధ తగిలితే ఒక విధంగా మంచిదిగానే భావించాలి, ఎందుకంటే వ్యతిరేకతలు ఉండవు కనుక. అదే అనుకూల ఫలితాలు వచ్చే సందర్భంలో వేధ కలిగితే, అనుకూలం ఆగిపోతుందని భావము.

మేష రాశి వారికి సప్తమ స్దాన గురు ప్రవేశం గోచారంలో అనుకూలమై  రజత మూర్తి నిర్ణయం వలన పూర్తి అనుకూలతలు ఉంటాయి. వృషభ రాశి జాతకులకు 6వ స్దాన గోచార ప్రవేశం అశుభమైనప్పటికీ సువర్ణ మూర్తి రూపం కారణంగా మెరుగైన పరిస్థితులు  పొందగలరు. మిధున రాశి వారికి గురువు పంచమ స్దాన  ప్రవేశం అనుకూలంలో ఉన్ననూ, లోహ మూర్తి కారణంగా వ్యతిరేకతలు వచ్చును. కర్కాటక రాశి జాతకులకు చతుర్థ స్దాన ప్రవేశం గోచరంలో వ్యతిరేకంగా ఉన్నప్పటికీ సువర్ణ మూర్తి ప్రవేశమైనందున, అంతా సజావుతో సాగిపోతారు.

ఇక సింహరాశి జాతకులకు తృతీయ గురు ప్రవేశం వ్యతిరేకం కావటం దానికి తోడు, తామ్రమూర్తిత్వంతో ప్రవేశం చేయటంతో మరింత వ్యతిరేకతలు పొందగలరు. కన్యా రాశి జాతకులకు గురు ప్రవేశం గోచరంలో ద్వితీయ స్థానం కావటం అనుకూలము. దీనితో పాటు రజత మూర్తి ప్రవేశం కావటం మరింత మేలైన పరిస్థితి అని భావము. తులారాశి లోకి గురు ప్రవేశం వ్యతిరేకంగా ఫలితాలను ఇస్తాడు. దీనికి తోడు లోహమూర్తి ప్రవేశం కావటం మరింత వ్యతిరేకతలకు స్వాగతం పలికినట్లగును. వృశ్చికరాశి వారికి గోచారంలో 12వ స్దాన ప్రవేశం అశుభం, పైగా తామ్ర మూర్తితో ప్రవేశ నిర్ణయం కావటం మరింత వ్యతిరేకంగా ఫలితాలుండునని భావించాలి. ధనుస్సు  రాశి జాతకులకు 11వ స్థాన ప్రవేశం శుభఫలితాలనే ఇవ్వాలి. పైగా మూర్తి రూపం చూస్తే సువర్ణ మూర్తి. ఇంకా మెరుగైన ఫలితాలు వస్తాయని ఆశించాలి. మకర రాశి జాతకులకు దశమ స్దాన గురు గోచారం వ్యతిరేకం. మూర్తి రూపం చూస్తే రజత మూర్తి కనుక కొంత అనుకూలాన్ని అందిస్తాడు. కుంభ రాశి జాతకులకు నవమ గురువు మరింత మేలైన ఫలితాలను ఇచ్చే సందర్భంలో లోహ మూర్తిగా పదవిని అలంకరించినందున పూర్తి వ్యతిరేకతలతో గురు సంచారం ఉండును. చివరగా మీన రాశివారికి గురువు అష్టమంలో కష్టాలు తెచ్చే విధంగా సంచారమున్న సందర్భంలో తామ్ర మూర్తి ప్రవేశం మరిన్ని సమస్యలను తెచ్చే విధంగా పరిస్థితులు ఉత్పన్నమవుతాయి.

చదివారు కదా ఇంతవరకు, కానీ నిశ్చింతగా ఉండండి. ఎందుకంటే అనుకూల ఫలితాలు కానీ, ప్రతికూల ఫలితాలు కానీ వచ్చే సమయాలలో ఆటంకాలు పరిచే వేధ గ్రహాల గురించి పైన చెప్పలేదు. కనుక ఆటంకాలు వచ్చే రాశులవారు వేధ ఉంటే బాగుండునేమో  అనుకుంటారు. కారణమేమంటే ఆటంకాలు రావని. అలాగే అనుకూల ఫలితాలు వచ్చే రాశుల వారు కూడా వేధ గ్రహాలు రాకుండా ఉండాలని కోరుకుంటారు. ఎందుకంటే వారి అనుకూలతలు ఎక్కడ భంగం కలుగుతుందో అనే ఆలోచనతో. కానీ 12 రాశులకు 395 రోజులలో ఎక్కడెక్కడ వేధలు కల్గుచున్నాయో, వాటి వలన అనుకూలతలు ప్రతికూలతలు ఎలా ఉంటున్నాయో, ఫలితాలు ఎలా ఉంటాయో చెప్పే 12 వీడియోలు ఈ దిగువన ఉన్నాయి. .ఇక మరో రెండు రోజులలో పరిహారాలు చెప్పే మరిన్ని వీడియోలు కూడా అందించబోతున్నాను. వాటిపై కూడా దృష్టి ఉంచటానికి ప్రయత్నించండి. - దైవజ్ఞ శ్రీనివాస గార్గేయ 

 

Saturday, September 2, 2017

తులారాశి ప్రవేశ సమయంతో తారుమారు కానున్న గురు గోచార ఫలితాలు

2017 సెప్టెంబర్ 12 ఉదయం 6.51 నిముషాలకు గురు గ్రహం తులారాశిలోకి ప్రవేశం చేయును. సహజంగా గోచార రీత్యా 5 రాశుల వారికి అనుకూల ఫలితాలు, 7 రాశుల వారికి ప్రతికూల ఫలితాలు ఉంటాయి. మరికొంత లోతులకి వెళితే ప్రవేశం చేసే సమయానికి ఉన్న గురు స్వరూపాన్ని బట్టి అనుకూల ఫలితాలు వ్యతిరేకం కావచ్చు, వ్యతిరేక ఫలితాలు అనుకూలం కావచ్చు. అనుకూలం గా గాని, వ్యతిరేకంగా గాని గురువు ఫలితాలను ఇచ్చే సందర్భంలో ఏవైనా ఆటంకాలు (గ్రహ వేధలు) కలిగినప్పుడు అనుకూలము ఆగిపోతాయి, ప్రతికూలము ఆగిపోతాయి. అనుకూలం ఆగితే కించిత్ బాధపడతాము. అదే ప్రతికూలం ఆగిపోతే ఎంతో ఆనందపడతాము. కనుక క్రింది వీడియో ద్వారా ఉపోద్గాతము వినండి. తదుపరి వీడియో లలో 12 రాశులకు ఏ ఏ తేదీలలో అనుకూలమా, ప్రతికూలమా తెలుసుకుంటూ, ఒకవేళ అనుకూలమే ఆగిపోతే పరిహారము ఏమి చేయాలి ? ప్రతికూలమే ఆగిపోతే సంతోషంతోనే ఉంటూ అనుకూలం కలగటానికి ఎలాంటి పరిహారాలు చేయాలి అనేవి వరుస వీడియోలలో తెలుసుకుందాం.
ఇక ఉపోద్గాత వీడియోని చూడండి. - దైవజ్ఞ పొన్నలూరి శ్రీనివాస గార్గేయ

Saturday, August 26, 2017

తులారాశిలో 395 రోజుల సంచారానికి విచ్చేస్తున్న దేవగురువు

శ్రీ హేమలంబ నామ సంవత్సర భాద్రపదమాసం బహుళ సప్తమి మంగళవారం సరియగు తేదీ 12 సెప్టెంబర్ 2017 న భారత కాలమానప్రకారం ఉదయం 6 గంటల 51 నిముషాలకు గురుగ్రహం చిత్రా నక్షత్ర మూడవ పాదమైన తులా రాశిలోకి ప్రవేశం జరుగును. గురు గ్రహం తులా రాశి ప్రవేశంతో సార్థ త్రికోటి తీర్థ సహిత  కావేరినదికి పుష్కరాలు ప్రారంభమై, సెప్టెంబర్ 28వ తేదీతో ముగియును. కావేరి నదినే దక్షిణ గంగగా పిలుస్తారు. కావేరీ నదీ తీర పుణ్య క్షేత్రాలలో తమిళనాడులో చిదంబరం, శ్రీరంగం, తంజావూరు, కుంభకోణాలు పేరెన్నిక గన్నవి. సెప్టెంబర్ 29 వరకు తర్పణ పిండప్రదానాదులు ఆచరించవచ్చును.

ఇక వివరాలలోకి వెళితే తులా రాశిలో 395 రోజులపాటు గురు గ్రహం సంచారం చేయబోతున్నాడు. ఈ సమయంలో కొద్దిరోజులు మౌఢ్యమితోను, మరికొద్దిరోజులు వక్రంతోను ఉంటూ, ఈసారి రెండు పర్యాయములు నీచ స్థితిలో ఉన్న రవి చెంతన ఉండబోతున్నాడు. ఈ 395 రోజులలో ఆయన ఏయే రోజులలో ఏయే నక్షత్రాలలో ప్రవేశం చేయబోతున్నాడో తెలుసుకుందాం.

2017 సెప్టెంబర్ 28 చిత్రా నక్షత్ర 4వ పాదంలోకి, అక్టోబర్ 14న స్వాతి 1వ పాదంలోకి, అక్టోబర్ 29న స్వాతి రెండవ పాదంలోకి, నవంబర్ 13న స్వాతి 3వ పాదంలోకి, నవంబర్ 29 న స్వాతి 4వ పాదంలోకి సంచార నిమిత్తమై బయలుదేరతారు. డిసెంబర్ 15వ తేదీ ధనుర్మాస ప్రారంభం కాగానే రెండవ రోజున అంటే డిసెంబర్ 16న తన స్వనక్షత్రమైన విశాఖ నక్షత్ర 1వ పాదంలోకి ప్రవేశం జరగటం, తిరిగి 2018 జనవరి 4 విశాఖ 2వ పాదంలోకి జనవరి 27న విశాఖ 3వ పాదంలోకి ప్రవేశ నిమిత్తమై సిద్దమవుతుంటాడు. ఇంతలో 2018 మార్చి 9 ఉదయం 10 గంటల 19 నిముషాలకి గురువుకి వక్రారంభం మొదలుకావటం, అక్కడ నుంచి వెనుకకు నడవటం ప్రారంభమై తిరిగి 2018 ఆగష్టు 2న రుజు మార్గంతో విశాఖ 1వ పాదంలోకి ప్రవేశిస్తాడు. 2018 సెప్టెంబర్ 3 న విశాఖ 2వ పాదంలోనికి, 2018 సెప్టెంబర్ 23న విశాఖ 3వ పాదంలోనికి ప్రవేశిస్తూ.. ఆ పిమ్మట 2018 అక్టోబర్ 11 శ్రీ విళంబి నామ సంవత్సర ఆశ్వయిజ శుక్ల తదియ గురువారం రాత్రి 7గంటల 20నిముషాలకి వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తాడు. .

మొత్తం 395 రోజుల కాలగమనంలో కొన్ని రాశుల వారికి మంచి అవకాశాలను ఇవ్వటానికి సిద్ధపడతాడు. కొన్ని రాశుల వారికి సహాయం చేస్తానని వాగ్దానం ఇచ్చి వెళ్ళిపోతాడు. కొందరకు ఇస్తానని చెప్పలేడు.. ఇవ్వనని అనలేడు, మౌనంతోనే ముందుకు వెళ్ళిపోతాడు. ఇంకొందరకు అడగకముందే అన్ని వివరాలను తెలుసుకుని, ఏదో అందించినట్లుగా భ్రాంతి కనపరుస్తూ ఏమి లేకుండానే ప్రక్క రాశిలోకి వెళ్ళిపోతాడు. ఇది సౌర మండలంలో ఉన్న గురు గ్రహ తులా రాశి గమన చరిత్ర. ఇంతకీ తులా రాశి విషయానికి వస్తే గురు గ్రహానికి కించిత్ వైరమున్న స్థానము. ఈ స్థానంలో తన ప్రతిభను చూపిస్తాడా? చూపడా ? అనే ఆలోచనలు ప్రతి వారికీ ఉదయిస్తుంటాయి. ఒకటీ రెండు రోజులు కాకపోయే 395 రోజులు ఆ రాశిలో సంచారం చేయాలి... మరి ఎవరెవరికి ఏమి అందిస్తాడు? ఏమి అందించడు? ఏమి అడుగుతాడు? ఏమి అడగడు? ఎవరెవరికి మౌనంతోనే ముడిపెడతాడు.. కను సైగలతో ఇస్తానని ఆశ చూపిస్తాడు? తన వీక్షణాలతో ఏ విధంగా శుభాశుభాలను అందిస్తాడో చాలా వివరాతి వివరంగా తదుపరి పోస్టింగ్ లలో రాశుల వారీగా గ్రహభూమి బ్లాగ్ లో
(grahabhumi.blogspot.com) తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. - దైవజ్ఞ పొన్నలూరి శ్రీనివాస గార్గేయ

Sunday, August 20, 2017

2017 ఆగష్టు 21 సోమవారం ఉత్తర అమెరికాలో సంపూర్ణ సూర్యగ్రహణం

ఈ సూర్యగ్రహణం మఖ నక్షత్ర రాహు గ్రస్తంగా సంభవిస్తున్నప్పటికీ రాహువు మాత్రం సింహరాశిలో కాకుండా కర్కాటక రాశిలో ఆశ్లేష నక్షత్రంలో ఉండటం ఈ గ్రహణ ప్రత్యేకత. ఈ సంపూర్ణ సూర్య గ్రహణం భారతదేశంలో కనపడదు. భారత దేశంలో కనపడని కారణంగా ఇక్కడ గర్భవతులు హాయిగా గాలి పీల్చుకోవచ్చును. సంపూర్ణ సూర్య గ్రహణం జరిగే సమయంలో భారతదేశంలో రాత్రి సమయంలో ఉంటుంది. ఇక సంపూర్ణ సూర్యగ్రహణం ఉత్తర అమెరికాలోని కాలమాన ప్రకారంగా వివిధ ప్రాంతాలలో పాక్షిక గ్రహణంగాను, కొలంబియా మరియు కెంచుకి ప్రాంతాలలో అను రెండు ప్రాంతాలలో సంపూర్ణ సూర్యగ్రహణం గాను కనపడును. సూర్యునికి వాయువ్య భాగంలో గ్రహణం ప్రారంభమై, తూర్పు దిశలో మోక్షం కల్గును.

ఉత్తర అమెరికాలోని కెంచుకి కాలమాన ప్రకారం గ్రహణ సమయాలు
వాయువ్యాన గ్రహణ స్పర్శ - మధ్యాహ్నం 11 గం.56 ని.లు 
సంపూర్ణ స్థితికి గ్రహణ రాక - మధ్యాహ్నం 1 గం.25 ని.లు 
గ్రహణ మధ్య కాలం - మధ్యాహ్నం 1 గం.26 ని.లు 
సంపూర్ణం నుంచి విడుపు ప్రారంభం - మధ్యాహ్నం 1 గం.27 ని.లు
గ్రహణ మోక్షకాలం - మధ్యాహ్నం 2 గం.52 ని.లు   
ఆద్యంతం పుణ్యకాలం - 176 నిముషాలు
సంపూర్ణ గ్రహణ బింబదర్శన సమయం - 2 నిముషాలు మాత్రమే.

కొలంబియాలోని సౌత్ కెరొలినా కాలమాన ప్రకారం గ్రహణ సమయాలు
వాయువ్యాన గ్రహణ స్పర్శ - మధ్యాహ్నం 1 గం.13 ని.లు 
సంపూర్ణ స్థితికి గ్రహణ రాక - మధ్యాహ్నం 2 గం.42 ని.లు 
గ్రహణ మధ్య కాలం - మధ్యాహ్నం 2 గం.43 ని.లు 
సంపూర్ణం నుంచి విడుపు ప్రారంభం - మధ్యాహ్నం 2గం.44 ని.లు
గ్రహణ మోక్షకాలం - సాయంత్రం 4 గం.06 ని.లు   
ఆద్యంతం పుణ్యకాలం - 173 నిముషాలు
సంపూర్ణ గ్రహణ బింబదర్శన సమయం - 2 నిముషాలు మాత్రమే.

ఉత్తర అమెరికాలోని వివిధ ప్రాంతాలలో పాక్షిక గ్రహణ సమయాలు
అట్లాంటా - మ 1.06 - సా 4.02
ఆస్టిన్ - మ 11.41 - 2.39
బర్మింగ్ హమ్ - మ12.01 - 2.58
బోస్టన్ - మ 1.29 - 3.59
చికాగో - మ 11.54 - 2.43
డల్లాస్ - మ 11.40 - 2.39
డెన్వర్ - ఉ 10.23 - మ 1.15
డెట్రాయిట్ - మ 1.04 - మ 3.48
హౌస్టన్ - మ 11.47 - 2.46
జాక్సన్విల్లే - మ 1.16 - సా 4.12
న్యూజెర్సీ - మ 1.23 - సా 4.01
లాస్ వేగాస్ - ఉ 9.09- మ 11.53
లాస్ ఏంజెల్స్ - ఉ 9.06 - 11.45
లూయిస్ విల్లే - మ 12.59- 3.52
మెల్బోర్న్ - మ 1.22 - సా 4.17
మియామి - మ 1.28 - సా 4.21
న్యూయార్క్ - మ 1.23 - సా 4.01
ఓక్లాండ్ - ఉ 9.02- మ 11.37
ఫిలడెల్ఫియా -  మ 1.21 - సా 4.01
ఫోనిక్స్ -  ఉ 9.14- మ 12.00
పిట్స్ బర్గ్ - మ 1.11 - 3.55
పోర్ట్ ల్యాండ్ - ఉ 9.06- మ 11.38
రిచ్ మాండ్ - మ 1.18 - సా 4.04
శాన్ఫ్రాన్సిస్కో -  ఉ 9.02- మ 11.37
స్ప్రింగ్ ఫీల్డ్ - మ 11.51 - 2.43
సెయింట్ లూయిస్ - మ 11.50 - 2.44
వాషింగ్టన్ - మ 11.51 - 2.42
వాషింగ్టన్ డి. సి - మ 1.18 - సా 4.02


గతంలో శ్రీ సిద్ధార్ది నామ సంవత్సరం శ్రావణ మాసం అమావాస్య బుధవారం సరియగు తేదీ 22 ఆగష్టు 1979 న సింహరాశిలోనే మఖ నక్షత్రంలోనే సంపూర్ణ సూర్యగ్రహణం రాహు గ్రస్తంగా జరగటం ఆ గ్రహణంతోపాటే శని, శుక్రులు ఉండటం, పైగా ఆ సంపూర్ణ గ్రహణం చివరికి కంకణ గ్రహణంగా రూపాంతరం చెందింది. ఆ గ్రహణం తరువాత, దాదాపు 38 సంవత్సరాలకు అదే శ్రావణమాస అమావాస్యను సింహరాశిలో రాహు గ్రస్తంగా మఖ నక్షత్రంలో గ్రహణం సంభవిస్తున్నది. ఈ గ్రహణం గత గ్రహణంతో పోలిస్తే అతి పెద్ద గ్రహణంగా భావించాలి. ఇందుకోసంగా ప్రజలెవ్వరూ ఆందోళనలు చెందవలసిన అవసరం లేదు.

ముఖ్యంగా పైన పేర్కొన్న ప్రాంతాలలో ఉన్న ఎంతో మంది తెలుగువారు ఉన్నారు. వారిలో గర్భవతులు కూడా ఉండవచ్చును. కనుక వారి జాగ్రత్త కొరకై సమయాలతో ఇవ్వటం జరిగింది. అయితే హైద్రాబాద్లో ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో పరోక్షంగా నన్ను కామెంట్ చేస్తూ, ప్రజలను భయ భ్రాంతులకు గురిచేస్తున్నానని ఏదేదో అవాకులు చెవాకులు పేలుతున్నారు. ఇతర దేశాలలో గ్రహణం పడితే మనకు ప్రభావం ఉండదని అనుకోవటం కేవలం వారి అజ్ఞానానికి పరాకాష్ట.


కొన్ని కొన్ని సంవత్సరాలలో మకర రాశిలోకి సూర్య ప్రవేశం అనేది రాత్రి సమయాలలో జరుగుతుంటుంది. అంటే ఆ సమయంలో భారత దేశంలో సూర్యుడు కనపడడు. కానీ రెండవ రోజున మకర సంక్రమణ పుణ్య కాలంగా భావించి తర్పణ, పిండ ప్రదానాదులు పితృదేవతలకు అందిస్తుంటారు. ఇది వైదిక వృత్తిలో ఉన్న ప్రతివారికి తెలుసు. అలాగే గురు గ్రహము రాత్రి సమయంలో ఒకరాశి నుంచి మరొక రాశికి ప్రవేశం జరిగినప్పుడు, భారత దేశంలో పుష్కరాలు రెండవ రోజు సూర్యోదయం నుంచే ప్రారంభమవుతాయి. ఇలాంటి అంశాలు జ్యోతిష శాస్త్రంలో ఎన్నో ఉంటాయి. రవి మహర్దశలు, రవి అంతర్దశలు జరిగే వారు ఉంటారు. గోచార స్థితిలో గ్రహణం వ్యాప్తి చెందినప్పుడు దాని ప్రభావం మరికొంత కాలం విశ్వంపై ఉంటుందనే ఆలోచన అజ్ఞాన సిద్ధాంతులు తెలుసుకుంటే మంచిది. కేవలం నాలుగు ముక్కలు నేర్చుకుని యూటుబ్లో పుంఖాను పుంఖాలుగా వీడియోలు పెట్టటం అనేది ఒక గొప్ప విషయం కానీ కాదు. ధైర్యముండి, జ్ఞానముండి , గణితం మీద పట్టు ఉంటే నా ఎదురుగా కూర్చుని గ్రహణం చేయమను. ఇలాంటి వాటికి బహు దూరంగా ఉంటారు. నా గ్రహభూమి  అంతర్జాతీయ  పంచాంగంలో గ్రహణ సమయాలను దాదాపు ఎప్పుడో ఇవ్వటం జరిగింది. కనీసం మన తెలుగువారు ఇతర దేశాలలో ఉన్నారని, వారికి గ్రహణ సమయాలకు కనీసం తెలియచేస్తే మంచిదనే ఆలోచన  లేకపోవటం శోచనీయం. కనుక పాఠక మహాశయులు సోషల్ మీడియాలో వచ్చే చెత్త అంశాలను నమ్మి మీ మీ సమయాలను వృధా చేసుకోవద్దు.

మా కాలచక్రం పంచాంగంలో పేజీ నంబర్ 28 మరియు 30 పేజీలలో, గ్రహభూమి పంచాంగం 15వ పేజీలో (grahabhumi panchangam) భూకంప వివరాలను తేదీలలో సంవత్సరం క్రితమే ఇవ్వటం జరిగింది. అలాగే గత 2016 మార్చి 1న విజయవాడ ప్రెస్ మీట్ లో ఇండోనేషియా లో భూకంపం రిక్టర్ స్కేల్ పై 7.8 గా వస్తుందని తీవ్రతతో తేదీని ప్రకటించగా విజయవాడలోని స్థానిక వార్త  పత్రికలన్నీ ప్రకటించాయి. (http://grahabhumi.blogspot.in/2016/04/blog-post.html) వాటిని చూసి రెండవ రోజున ప్రజలను నేనేదో భయ భ్రాంతులకు గురి చేస్తానని టీవీ 9 మరియు యన్ టీవీ వారు కెమెరాలు పట్టుకుని దాదాపుగా 30 నిముషాల పాటు రికార్డ్ చేసి, ఆ వివరాలను రాత్రికి ప్రసారం చేస్తామని వెళ్లారు. వారు వెళ్లిన అరగంటలోనే ఇండోనేషియా లో భారీ భూకంపం రిక్టర్ స్కేల్ పై 7.8 గా నమోదు కావటం, వీరు రికార్డ్ చేసిన కార్యక్రమాన్ని ప్రసారం చేయకుండా ఆపటం జరిగింది. ఇది ఎందుకు చెబుతున్నాను అంటే 40 సంవత్సరాల జ్యోతిష శాస్త్ర అనుభవంతో పరిశోధనలు చేసి చెబుతున్న అంశాలు  అనేకం ఉన్నాయి. కానీ కొన్నింటిని మాత్రమే నేను తెలియచేస్తున్నాను.

కనుక దాదాపుగా వేయి అంశాలకు ఎక్కడో ఒక అంశం పొరపాటుగా దారి తప్పటం మానవ సహజం, దానిని పట్టుకుని హేతువాదులు మాట్లాడటం విడ్డూరం. ప్రతి మీడియా ఛానల్ జ్యోతిష అంశాలతోనే వారి వారి రేటింగ్లను పెంచుకుంటుంటారు. జ్యోతిష కార్యక్రమాలతో వచ్చే డబ్బుతో జీతాలను ఉద్యోగులకి ఇస్తుంటారు. కానీ ఇంత చేస్తూ కూడా హేతువాదులు కూర్చోపెట్టి వెకిలిగా ప్రశ్నలను వేయటం సహించరాని తప్పు. మెరుగైన సమాజం కోసం అంటూ చెప్పుకునే కొంతమంది రత్నాన్ని ధరించటం అవివేకం అంటారు. కానీ రాత్రి 11 గంటల సమయంలో ఆ రత్నాల కంపెనీ వారిచ్చే సొమ్ముతో పబ్బం గడుపుకుంటారు. ఇది అందరికి తెలిసిన నగ్న సత్యమే. అందుకే కొన్ని కొన్ని విలువలకు లోబడి దూరంగా ఉండాలనే కోరుకుంటున్నాను. అయితే పుంఖాను పుంఖాలుగా వచ్చే ఈ అజ్ఞానులు సోషల్ మీడియాలో పెట్టె విషపు బీజాలను నమ్మి జీవితాలను నాశనం చేసుకోవద్దని మనః పూర్వకంగా కోరుతున్నాను.

ఈ గ్రహణం కోసంగా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటే చాలు. అంతేతప్ప ఏదో వచ్చి పడిపోతుందని అనుకోవద్దు. మంచి పనులు చేయాలన్న మన మనస్సే, చెడు పనులు చేయాలన్న మన మనస్సే. ఈ మనః కారకుడే చంద్రుడు. ఈ చంద్రుడే గ్రహణ సమయంలో సూర్యుడితో ఆలింగనంలో ఉంటాడు. అంటే సూర్యుని డిస్క్ తో చంద్రుని డిస్క్ కలిసిపోతుంది. అందువలన దాని ప్రభావం విశ్వ వ్యాప్తంగా ఉంటుందని గమనించాలి. కేవలం నా మీద అక్కసుగా వీడియోలు పెడుతున్నందుకు నేనేమి బాధపడటం లేదు. వాస్తవాలు తెలియచేస్తున్నాను. ఈ క్రింది వీడియోలను వీక్షించండి.
  - దైవజ్ఞ పొన్నలూరి శ్రీనివాస గార్గేయ


Sunday, August 6, 2017

ధనిష్ఠలో కేతువు ఉండి, శ్రవణంలో చంద్రునికి పాక్షిక గ్రహణం

శ్రీ హేమలంబ శ్రావణ పూర్ణిమ 7 ఆగష్టు 2017 సోమవారం రాత్రి 10 గంటల 53 నిముషాలకు చంద్రునికి వాయువ్య భాగంలో గ్రహణం స్పర్శించి రాత్రి 12 గంటల 48 నిముషాలకు పాక్షిక గ్రహణంగా ముగియును. అంటే 115 నిముషాల పాటు పుణ్యకాలం ఉన్నదని భావము. ఇది రాత్రి నిద్రించే సమయం కనుక సహజంగా ఎవరూ దీనిని వీక్షించాలని కుతూహల పడరు. గర్భవతులు మాత్రం గ్రహణానికి ముందు 1 గంట, గ్రహణం తదుపరి 1 గంట పాటు తమ తమ గృహాలలోనే ఉండవలెను. అంటే ప్రతి ఛాయలో రాత్రి 9 గంటల 53 నిముషాలకు చంద్రుని కాంతి హీనదశకు చేరటాన్ని ప్రతి ఛాయా అంటారు. 10 గంటల 53 నిముషాలకి కేతు ఛాయ ఏర్పడి గ్రహణం ప్రారంభమవుతుంది. అర్థరాత్రి తదుపరి 12.48 నిముషాలకు గ్రహణం పూర్తి కాగానే, ప్రతి ఛాయలో తేజోహీనంగా ఉన్న చంద్రుడు తేజస్సు రూపంలోకి 1 గంట 48 నిముషాలకు వచ్చును. కనుక గర్భవతులు తేజస్సు తగ్గటం ప్రారంభమైన దగ్గర నుంచి తిరిగి తేజస్సు వచ్చేంతవరకు గృహాలలోనే ఉండటం శ్రేయోదాయకం. గ్రహణ సమయంలో గర్భవతులు మల, మూత్ర విసర్జనకు కూడా వెళ్లకూడదని.. కదలకుండా ఒకే చోటనే పరుండాలని చెప్పే అంశాలన్నీ అసత్యములు. కనుక వారు నిర్వర్తించవలసిన కార్యక్రమములన్నీ చక్కగా అటు ఇటు తిరుగుతూ చేసుకోవచ్చును. భౌతికంగా మాత్రం గ్రహణాన్ని చూడవద్దు. ఆ సమయంలో టీవీలలో ప్రసారమయ్యే గ్రహణ దృశ్యాలను చూసిననూ తప్పు లేదు.

ఇక భారతీయ సనాతన సంప్రదాయాల ప్రకారం గ్రహణ సమయంలో ఆహారం లేకుండా ఖాళీ కడుపుతో ఉండటం ఆరోగ్యానికి ఎంతో మంచిది. అందుకోసమే గ్రహణ ప్రారంభ సమయానికి 3 గంటల ముందే ఆహారాన్ని స్వీకరిస్తే గ్రహణ సమయానికి పూర్తిగా జీర్ణమైపోతుందని భావన. అయితే ఈ విషయంలో కొంత ఆలోచన అవసరము. ఏమిటంటే కొంతమందికి తిన్న ఆహారం జీర్ణం కావటానికి ఎక్కువ సమయం పట్టవచ్చు, మరికొంత మందికి వెంటనే జీర్ణం అయిపోయే పరిస్థితి ఉండవచ్చు. అందుకోసంగా ఎవరికి  వారు వారి వారి శరీర తత్వాలకు తగినట్లుగా ముందే ఆహారాన్ని స్వీకరించి గ్రహణ సమయానికల్లా ఖాళీ కడుపుతో ఉండటం అనేది శాస్త్రీయము.

పట్టు స్నానం, విడుపు స్నానం అందరూ ఆచరించాలనే నియమమేమి లేదు. కేవలం జపానుష్టానం చేసే వారు మాత్రమే ఈ స్నానాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. వృద్ధులను అనారోగ్యంగా ఉండే వారిని ఈ స్నానాల వంకతో ఇబ్బందులకు గురి చేయడం తగదు. ఇక్కడ మరో విషయాన్ని గమనించాలి. చంటి పిల్లలు ఉన్నవారు పాలను ఆహారంగా తీసుకుంటూ ఉంటుంటారు. కొంతమంది ఒకేసారి తాగకుండా తరచుగా కొద్ది కొద్దిగా త్రాగే అలవాటు ఉండే చిన్నారులు ఉండటం కూడా సహజం. ఈ నేపథ్యంలో గ్రహణ సమయంలో పాల కోసం ఏడిస్తే, గ్రహణం జరుగుచున్నదని, పాలు త్రాగకూడదని అనుకోవద్దు. అట్టి వారలకు పాలను ఇవ్వటానికి తక్షణం ప్రయత్నించండి. గర్భవతులు గ్రహణ కిరణాలు సోకకుండా ఉండేలాగా గృహాలలో ఉంటారు. ఎందుకని? జన్మించే పిల్లలకు గ్రహణ మొర్రి లాంటిది వస్తుందని. అయితే ఇలాంటి కిరణాలు సోకకుండా ఉండే చిన్నారులు కూడా గృహాలలోనే ఉంటారు కాబట్టి వారికి ఆకలైతే గ్రహణ సమయంలో పాలను తీసుకోవటంలో తప్పేమి కాదు. గ్రహణం జరిగే సమయంలో బయట ఎంతోమంది తిరుగుతూ ఉంటారు. వారి శరీరాలపై గ్రహణ కిరణాలు పడుతుంటాయి. అలాంటి వారు తప్పకుండా ఖాళీ కడుపుతోనే ఉండి తీరాలి. దీనిని శాస్త్రీయంగా అర్ధం చేసుకోవాలంటే కిరణాలు సోకకుండా ఏ వయసులో వారైనా పురుషుడైనా, స్త్రీలైనా గృహాలలోనే బయటికి రాకుండా ఉండేట్లైతే.. చక్కగా భోజనము ఆచరించవచ్చు. కిరణాలు సోకుతాయనే ఉద్దేశ్యంతోనే ఈ నియమం ఉంచారే తప్ప మరొకటి కాదని అర్థం చేసుకోవాలి.

చంద్ర గ్రహణానికి శ్రావణ పూర్ణిమ నాటి రక్షా బంధనానికి సంబంధం లేనే లేదు. కనుక శ్రావణ పూర్ణిమ ఉదయం నుంచే రక్షా బంధనాలు కట్టవచ్చును. అయితే మరింత శాస్త్రీయమైన సమయం కావాలనుకునే వారు 7 సోమవారం మధ్యాహ్నం 11 గంటల 4 నిముషాల నుంచి సాయంత్రం 4 గంటల 1 నిముషం వరకు రక్షా బంధనాన్ని కట్టవచ్చును. ఇక నూతన యజ్ఞోపవీత ధారణమునకు మాత్రం శ్రావణ పూర్ణిమ రోజు నిషిద్ధము.

అన్నిటికంటే ముఖ్యంగా పాఠకులు గమనించాల్సింది మరొకటి ఉన్నది. జపానుష్టానం గ్రహణ సమయంలో చేయటమనేది ఆనవాయితీ. అయితే ఈ గ్రహణము సంపూర్ణ గ్రహణమైతే మరింత శ్రేష్టకరమని, అది కూడా సంపూర్ణ గ్రహణ బింబము అత్యధిక కాలం పాటు నిలబడి ఉంటే, మరింత శ్రేయస్కరమని గమనించాలి. అయితే ఈ గ్రహణానికి అనుకూలమైన విశిష్టతలు లేవు. ఎందుకంటే ఇది పాక్షికము. పైగా గ్రహణము జరిగే చంద్రుడు శ్రవణా నక్షత్రంలో ఉంటే కేతువు తదుపరి నక్షత్రమైన ధనిష్ఠలో .. అది కూడా 3 వ పాదమైన కుంభరాశిలో ఉండటం జరిగింది. కనుక ఆగష్టు నెలలో జరిగే ఇతర గ్రహ సంచారాలను బట్టి, విరుద్ధ గ్రహణాల జంట జరుగుతున్నది కనుక దీనికి అంత ప్రాముఖ్యం వచ్చింది. కనుకనే పరిహార నిమిత్తమై దర్భ కంకణాన్ని ధరించండి అని చెప్పటం జరిగింది. ప్రతి గ్రహణానికి సహజంగా ఆహార పదార్ధాలపైనా  ఏ విధంగా దర్భలను ఉంచుతారో అదేవిధంగానే ఉంచండి. ప్రత్యేక ఆందోళనలకు లోను కావద్దు. గ్రహణ సమయంలో ప్రశాంతమైన చిత్తంతోనే ఉంటూ తమ ఇష్ట దైవాలను మనసారా భక్తితో ప్రార్ధించుకోవటం శ్రేయస్కరం. అంతేతప్ప ఫలానా స్తోత్రమే చదవాలి అనుకోవటం పొరపాటు. పాఠకులు ఈ విశేషాలను దృష్టిలో ఉంచుకొని తగినట్లుగా అనుసరించగలని ఆశిస్తాను.  - దైవజ్ఞ పొన్నలూరి శ్రీనివాస గార్గేయ

Monday, July 31, 2017

ఆగష్టు 7 న నూతన యజ్ఞోపవీతాన్ని ధరించరాదు

2017 ఆగష్టు 7 సోమవారం శ్రావణ పూర్ణిమ సందర్భంగా రోజున శ్రవణా నక్షత్రంలో పాక్షిక చంద్ర గ్రహణం జరుగుచున్న కారణంగా వార్షికంగా యజ్ఞోపవీతం ధరించేవారు మరియు ఉపనయనం జరిగిన నూతన వటువులు ఆగష్టు 7 న నూతన యజ్ఞోపవీతాన్ని ధరించరాదు. వివరములకు వీడియో చూడండి.

Saturday, July 22, 2017

శ్రావణ మాసంలో జరిగే విరుద్ధ జంట గ్రహణాలకై పరిహార విధి విధానం

విరుద్ధ జంట గ్రహణాలకై పరిహారం

2017 ఆగస్టులో శ్రావణ పూర్ణిమ సోమవారం నాడు జరిగే పాక్షిక చంద్రగ్రహణం మకర రాశిలో శ్రవణా నక్షత్రంలో కేతుగ్రస్తంగా భారతదేశంలో కనపడును. తదుపరి శ్రావణ అమావాస్య రోజున సింహరాశిలో మఖా నక్షత్రంలో సంపూర్ణ సూర్యగ్రహణం రాహు గ్రస్తంగా జరగనుంది. ఈ గ్రహణం భారతదేశంలో కనపడదు.

సహజంగా ఒక మాసంలో జంట గ్రహణాలు వస్తుంటే, రాశి చక్రంలో అవి మొదటి గ్రహణం ఏర్పడిన రాశికి 7వ రాశిలో ఉండటం జరుగును. కానీ ఈ ఆగష్టు గ్రహణాలు అలా కాకుండా మకర రాశి నుంచి సింహరాశికి అష్టమ స్థానం కావటము, సింహ రాశి నుంచి మకర రాశికి షష్టమ స్థానం కావటం జరిగింది. అందుకే ఈ రెండు గ్రహణాలను షష్టాష్టక గ్రహణాలు అంటారు.

అంతేకాకుండా శ్రవణా నక్షత్రంలో చంద్రగ్రహణం జరుగుతుంటే మఖ నక్షత్రంలో సూర్యగ్రహణం జరుగుతున్నది. శ్రవణం నుంచి మఖ నక్షత్రానికి తారాబలం లెక్కిస్తే ప్రమాదకరమైన నైధన తారగా జ్యోతిష శాస్త్ర రీత్యా ఉన్నది. ఈ విధంగా ఉండటం వలన ప్రపంచంపై ఈ గ్రహణ ప్రభావాలు కొంత వ్యతిరిక్తంగా ఉందని భావించాలి. సూర్య గ్రహణం జరిగిన రోజు నుంచే శుక్ర రాహువుల కలయికలు ప్రారంభం కావటం, కుజ రాహువుల తీవ్రత అధికంగా ఉండటం, సూర్యునిపై శని యొక్క తీవ్ర వీక్షణ అధికంగా ఉండటం జరుగుతున్నవి.

పైగా శ్రావణ మాసంలో శుక్ల పాడ్యమి, పూర్ణిమ, అమావాస్యలు సోమవారాలే రావటం.. అంతేకాక శ్రావణ మాసం ప్రారంభం చంద్రుని రాశియైన కర్కాటక రాశి నుంచే శని నక్షత్రమైన పుష్యమితో ప్రారంభం కావటం, పుష్యమి నక్షత్ర అధిపతియైన శని గ్రహ రాశిలో (మకర రాశిలో) చంద్రుని నక్షత్రమైన శ్రవణా నక్షత్రంలోనే పాక్షిక చంద్ర గ్రహణం కేతు గ్రస్తంగా జరగటం విశేషం.

అంతేకాక ఈ రెండు గ్రహణాలు సంభవించటానికి మూడు రోజుల ముందుగానే రాహు, కేతువులు రాశి మారటం కూడా మరో విశేషం. ఇన్ని కారణాలు ఉన్నందున వీటి ప్రభావ తీవ్రత నుంచి సంరక్షించబడటానికై ద్వాదశ రాశులవారు ఆగష్టు 7 సోమవారం నుంచి 16 సోమవారాల పాటు దర్భ కంకణాన్ని కుడి చేతికి ధరించుట ఎంతెంతో శ్రేయోదాయకం.

ఈ జంట గ్రహణాల ప్రభావ తీవ్రతను తగ్గించటానికి సోమవారమునే ఎందుకు ఎన్నుకోవాలి ? కారణమేమంటే రాహు కేతువుల గ్రస్తంగా జరిగే విరుద్ధ గ్రహణాలు సోమవారం నాడే సంభవిస్తున్న సమయంలో సోమవారాన్ని ప్రాధాన్యంగా తీసుకోవాలి.
అంతేకాకుండా మరో విశేషం కూడా ఉన్నది. అదేమిటంటే ప్రతిరోజూ రాహువుకు సంబంధించిన రాహుకాలం, కేతువుకు సంబంధించిన యమగండకాలము వస్తుంటాయి. ఈ యమగండకాలాన్నే కేతుకాలము అని కూడా అంటారు. పగటి సమయంలో ఉండే ఆరు లగ్నాలలో మొదటి మూడు లగ్నాలలోనే... మధ్యాహ్నంతోనే రాహుకాలం, కేతుకాలం వెళ్లిపోయేది ఒక్క సోమవారం  నాడే. ( ఈ కారణంగా మరెప్పుడైనా భవిష్యత్ లో జంట విరుద్ధ గ్రహణాలు వచ్చి అవి వేరు వేరు వారాలైనప్పుడు కూడా సోమవారాన్ని ప్రాధాన్యతగా తీసుకోవాలి)  సోమవారం రాహుకాలం ఉదయం 7.30 నుంచి 9 గంటల వరకు, 10.30 నుంచి 12.00 గంటల వరకు కేతుకాలము ఉండును (సూర్యుడు నడి నెత్తికి వచ్చు సమయము). ఈ విధంగా ఈ రెండు కాలాలు మధ్యాహ్న సమయంతోనే ముగిసేది ఒక్క సోమవారంతోనే. మిగతా రోజులలో రాహు కాలం ముందు వచ్చి కేతు కాలం తదుపరి ఏర్పడి మధ్యాహ్న సమయంతో ముగియవు. అందుచేతనే సోమవారాన్ని ప్రాధాన్యతగా తీసుకొని దర్భ కంకణాన్ని ధరించి గ్రహణ ప్రభావాల నుంచి ఉపశాంతి పొందవచ్చును. ఈ దర్భ కంకణం అంటే ఏమిటి ? ఎలా తయారు చేసుకోవాలి ? ఎలా వేసుకొవాలి ? అనే విషయాలు మరికొద్ది గంటలలో పోస్టింగ్ చేయబడే వీడియోలో చూడగలరు. - దైవజ్ఞ పొన్నలూరి శ్రీనివాస గార్గేయ

Saturday, July 15, 2017

2017 శ్రావణమాసంలో విరుద్ధ గ్రహణాలు

ఈ శ్రావణమాసంలో 2 గ్రహణాలు ఖగోళంలో సంభవిస్తున్నాయి. ఈనెలలో వచ్చే గ్రహణాలకి, ఇతర మాసాలలో వచ్చే గ్రహణాలకి చాలా  తేడా ఉన్నది. ఇక వివరాలలోకి వెళితే హేమలంబ నామ సంవత్సర శ్రావణ పూర్ణిమ సోమవారం సరియగు తేదీ 7 ఆగష్టు 2017 న మకర రాశిలో శ్రవణా నక్షత్రంలో మేష, వృషభ లగ్నాలలో కేతు గ్రస్తంగా పాక్షిక చంద్రగ్రహణం సంభవిస్తున్నది. చంద్రునికి వాయువ్య భాగంలో స్పర్శించి గ్రహణం పాక్షికంగా ఉండును.

భారత కాలమాన ప్రకారం ఆగష్టు 7 రాత్రి 10 గంటల 53 నిముషాలకు చంద్రునికి గ్రహణం ప్రారంభమై అర్ధరాత్రి 12 గంటల 48 నిముషాలకు ముగియును.. ఇది పాక్షికం మాత్రమే. మొత్తం 115 నిముషాలు గ్రహణము జరుగును. అయితే ఈ గ్రహణం జరిగే సమయంలో చంద్రుడు మకర రాశిలో ఉంటే కేతువు మాత్రం కుంభరాశిలో ఉన్నాడు. ఈ ఇరువురు పక్క పక్కనే లేరు.

అలాగే శ్రావణ అమావాస్యకు అంటే 21 ఆగష్టు 2017 సోమవారం నాడు సింహరాశిలో సంపూర్ణ సూర్య గ్రహణం సంభవిస్తుంది. ఇది భారతదేశంలో కనపడదు. ఈ గ్రహణం రాహు గ్రస్తంగా జరుగుచున్నప్పటికీ రాహువు మాత్రం కర్కాటక రాశిలో ఉన్నాడు. గ్రహణాలు జరిగే సమయాలలో రాహు కేతువులు రవి చంద్రులున్న రాశిలోనే ఉండాలి. కానీ కొద్దీ వ్యత్యాసంతో ప్రక్క రాశులలో ఛాయా గ్రహాలు ఉండటం, చంద్రుడు ఉన్న రాశికి 7వ రాశిలో సూర్య గ్రహణం జరగవలసి ఉండగా 8వ రాశిలో గ్రహణం జరిగింది. అనగా ఈ రెండు గ్రహణాలు ఒకదానికొకటి షష్టాష్టకాలలో ఉన్నాయి.

కనుక ఈ రెండు గ్రహణాలకు జ్యోతిష పరంగా విశేష ప్రాముఖ్యం ఉన్నది. శ్రావణ మాసంలో పాడ్యమి, పూర్ణిమ అమావాస్యలు సోమవారమే రావటము, సూర్య గ్రహణం రోజునుంచే శని, కుజుల పరస్పర వీక్షణలు ప్రారంభం కావటము, ఈ రెండు గ్రహణాల మధ్యనే కుజ రాహువుల కలయికలు జరగటం మొదలైన అనేక ఇతర అంశాలు చోటుచేసుకోనున్నవి. కనుక ఈ రెండు గ్రహణాల ప్రభావం ద్వాదశ రాశులపై ఏ విధంగా ఉంటాయో ఈ క్రింది వీడియోల ద్వారా తెలుసుకొనండి. సంపూర్ణ సూర్య గ్రహణ ప్రభావ ఫలితాలు ఆచరించాల్సిన పరిహార క్రమ వీడియోలు కూడా త్వరలో పోస్టింగ్ జరగబడును. -  శ్రీనివాస గార్గేయ పొన్నలూరి

Wednesday, June 7, 2017

వేప చెట్టు స్పర్శతో లక్ష్మీ అనుగ్రహం

హిందూ సనాతన ధర్మంలో వేప వృక్షానికున్న ప్రాధాన్యం అత్యంత విశేషమైనది.ఎవరైతే పగటిపూట వేప చెట్టు నీడలో విశ్రమిస్తారో, అట్టి వారు ఆరోగ్యవంతంగా అధిక కాలం జీవిస్తారని  ప్రాచీన ఆయుర్వేద గ్రంధంలో చరకుడు తెలియచేశాడు. వేపచెట్టును ఇంటి ఆరోగ్య దేవతగా వైద్య శాస్త్రం అభివర్ణిస్తుంటే భారతీయ పురాణాలు వేపచెట్టును ఓ లక్ష్మీ దేవిగా భావిస్తారు. చాంద్రమానం ప్రకారంగా చైత్ర శుక్ల పాడ్యమి తిథి ఉగాది పండుగతో వసంత ఋతువు ప్రారంభమవుతుంది. ఆనాడు తైలాభ్యంగనము తదుపరి వేప పూత పచ్చడిని ప్రసాదంగా స్వీకరిస్తారు. ఇట్టి వేప చెట్టుతో అనేక ఆధ్యాత్మిక పరంగా ఎన్నెన్నో అద్భుత రహస్యాలు ఉన్నట్లుగా తంత్రశాస్త్ర గ్రంధాలు పేర్కొంటున్నాయి. అలాంటి వాటిలో లక్ష్మి దేవి అనుగ్రహ ప్రాప్తికి శుక్రవారం రాహుకాలంలో ఆచరించే ఓ అద్భుతమైన ప్రక్రియను తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. -  దైవజ్ఞ శ్రీనివాస గార్గేయ 



Sunday, June 4, 2017

మహాసౌరయోగాలు - పరిహారాలు 2వ భాగం

భారతీయ సనాతన సంప్రదాయ ప్రకారంగా వైదికంగా పంచాయతన పూజను నిర్వహిస్తుంటారు.
 

ఆదిత్యామంబికా విష్ణుం గణనాధం మహేశ్వరం
పంచయజ్ఞో కరోన్నిత్యం గృహస్తః పంచ పూజయతే||


ఈ పంచాయతనంలో వైష్ణవం, శైవం, శాక్తేయం, గాణాపత్యం, సౌరం అనునవి ఐదు ప్రధాన అంశాలు. వైష్ణవంతో మహావిష్ణువును, శైవంతో పరమ శివుడిని, గాణాపత్యంతో గణపతిని, శాక్తేయంతో అమ్మవారిని, సౌరంతో సూర్య భగవానుడిని ప్రార్ధించి పూజించే విధానాన్నే పంచాయతనం అంటారు. ఈ పరంపరలో జగద్రక్షకుడైన సూర్య భగవానుని అనుగ్రహ ప్రాప్తికై మరికొన్ని ముఖ్య పర్వదినాలు కూడా భారతీయ సాంప్రదాయంలో ఉన్నాయి.

ప్రతినెలా సూర్య భగవానుడు ఒక్కొక్క రాశిలో ప్రవేశించే రోజును సంక్రమణం లేక సంక్రాంతి అంటారు. మకర రాశిలో ప్రవేశించే రోజున మకర సంక్రాంతిగా పిలుస్తూ సూర్య భగవానుని ప్రార్ధిస్తూ, పితరులకు తర్పణ పిండ ప్రదానాదులు ఆచరిస్తారు. అలాగే మాఘ శుక్ల సప్తమి రోజున (రధసప్తమి) సూర్య జయంతిగా ఆరాధన  జరుగును. వీటితో పాటు సప్తమి తిధి ఆదివారాలలో వస్తే భానుసప్తమిగా,  కృత్తికా నక్షత్రం ఆదివారాలలో వస్తే భాను కృత్తికగా సూర్య భగవానునికి పూజాధికాలు చేస్తుంటాం.

జాతక  లోపాలు ఉన్నప్పుడు కొన్ని సందర్భాలలో సూర్య నమస్కారాలు, అలాగే అరుణ పారాయణాలు చేయటం, ఆదిత్య హృదయ పఠనము కూడా సర్వ సాధారణంగా జరుగుతుంది. వాస్తవానికి  చెప్పాలంటే సూర్య నమస్కారాలు ఎవరైతే ఆచరిస్తారో, వారికి మాత్రమే ఫలితం ఉంటుంది గాని, మనము చేయలేక మరొకరి చేత సూర్య నమస్కారాలు చేయిస్తే ఫలితముండదు. వైదిక క్రియలలో అనేక పద్ధతులు ఉత్తర భారతదేశంలో ఉన్నాయి.  ఇవి అందరికీ తెలిసినటువంటివి. ఇవి కాకుండా ప్రతి నెలలో కూడా మహా సౌరయోగాలు అంటూ ఉంటుంటాయి. ఈ యోగ దినాలలో కూడా సూర్య భగవానుడిని ప్రార్ధిస్తే ప్రారబ్ధ కర్మల ద్వారా వచ్చే వ్యతిరేక ఫలితాలు  కొంతమేర  తగ్గుముఖం పట్టునని పురాతన గ్రంధాలు చెప్తున్నాయి.

ఇంతకీ మహా సౌరయాగం అంటే ఏమిటో తెలుసుకుందాం. సూర్యుడు ఏ నక్షత్రంలో సంచారముండునో, ఆ నక్షత్రానికి 4,6,9,10,13,20  నక్షత్రాలలో చంద్రుడు కనుక సంచారంలో ఉంటే ఆ సమయాన్ని మహా సౌర యోగం అంటారు. ఈ సమయం ఒక్కోసారి రాత్రి, పగలు కూడా ఉంటుంది. రాత్రి సమయంలో సూర్య భగవానుని దర్శనం ఉండదు కనుక, దర్శనం ఇచ్చే పగటి సమయంలో తొలి 10 ఘడియలలోనే విధి విధానమును ఆచరించాలి. మొదటి 5 ఘడియలలో ఆచరించటం ఉత్తమోత్తమం. తదుపరి 3 ఘడియలు ఆచరించటం ఉత్తమం. చివరి రెండు ఘడియలలో ఆచరించటమనేది మధ్యమం. ఒక ఘడియ అనగా 24 నిముషాలు. 5 ఘడియలు అంటే రెండు గంటలన్నమాట.

దీనిని బట్టి సూర్యోదయం తర్వాత తొలి 2 గంటలు విశేష ప్రాధాన్యతతో ఉండును. వైద్య శాస్త్ర ప్రకారం కూడా తొలి రెండు గంటలలోనే సూర్య కిరణాలు ప్రసరించేలా సూర్య కాంతిలో నిలబడితే చక్కని ఆరోగ్యం ఉండునని, శరీరానికి డి విటమిన్ లభించునని వైద్య శాస్త్రం పేర్కొంటుంది. అదేవిధంగా జ్యోతిష శాస్త్రం ద్వారా తొలి రెండు గంటలలో పరిహారమును పాటించినట్లయితే చక్కని అనుకూలతలు పరోక్షంగా కల్గును. ఈ సౌరయోగాలు ప్రతి నెలలో 5 నుంచి 8 వరకు వస్తుంటాయి. ఆ వచ్చే దినాలను సరియైన పంచాంగం ద్వారా తెలుసుకుని పరిహారమును పాటించాలి.

ఈ పరిహారమును పాటించటానికి ముఖ్యముగా కావలసినవి గోధుమపిండి, మంచి కొబ్బరి నూనె, నీరు. గోధుమపిండి అనగానే మార్కెట్లో సిద్ధంగా ఉండే పిండిని తీసుకోవద్దు. ఎవరిపాటికి వారు ఒక కేజీ గోధుమలను తీసుకొని వాటిని పిండి చేయించేది. ఎట్టి పరిస్థితులలోను జల్లించవద్దు. అనగా పిండిలో పొట్టు కలిసి ఉండాలన్నమాట. ఈ సౌరయాగం వచ్చిన రోజులలో షుమారు 50 గ్రాముల పిండిని తీసుకుని అందులో 4,5 చెంచాలు కొబ్బరి నూనెను వేసి.. మరికొద్దిగా నీటిని వేస్తూ ముద్దగా కలపాలి. చిన్న చిన్న రొట్టెలుగా గుండ్రంగా ఉండేలా వత్తుకుని పెనముపై ఏ ఇతర నూనె లేకుండా రొట్టెలుగా కాల్చుకొనేది. ఈ పిండిలో ఉప్పు ఎలాంటి పరిస్థితులలో వేయవద్దు.

ఇలా తయారైన రొట్టెలను ఒక పళ్ళెరములో ఉంచుకొని సౌరయోగం జరిగే రోజున తొలి రెండు గంటలలో సూర్య కాంతి సోకేలా ఓ 5 నిముషాల పాటు పళ్ళెరమును సూర్య కాంతిలో ఉంచేది. పళ్ళెరమును చేతిలోనే పట్టుకొని ఉండవలసిన అవసరం లేదు. తదుపరి ఆయా రొట్టెలను కుటుంబంలో ఉన్నవారు మహా సౌర ప్రసాదంగా భావించి స్వీకరించేది. ఎట్టి పరిస్థితులలో ఆయా రొట్టెలను మిగల్చకుండా కుటుంబ వ్యక్తులే స్వీకరించాలి. చెత్తకుప్పలలో వేయవద్దు.

ప్రతి నెలలో వచ్చే మహాసౌర యోగ రోజులలో పై విధి విధానంగా ఆచరించినచో ప్రారబ్ద దుష్కర్మల ఫలితాలు తగ్గుటకు అవకాశం వచ్చును. ఈ మహాసౌర యోగాలలో జరిగే రోజులలో ఒక్కో నక్షత్రం వస్తుంటుంది. ఆ నక్షత్రం ఎవరిదైనా జన్మ నక్షత్రమైనచో, ఆ రోజును విశేష శుభప్రద మహా సౌరయోగంగా స్వీకరించండి. అలాగే మహా సౌరయోగాలు వచ్చే రోజులలో ఆదివారాలు కలిసి వఛ్చిననూ విశేషంగా భావించాలి.

కృత్తికా, ఉత్తర, ఉత్తరాషాఢ నక్షత్రాలతో కూడిన మహాసౌరయాగం ఉన్నటువంటి రోజులలో, తయారు చేసిన గోధుమ రొట్టెల దిగువన చిక్కుడు ఆకులను ఉంచి మరికొంత అధిక సమయం పాటు సూర్య కాంతిలో ఉంచటానికి ప్రయత్నం చేయండి. పై ప్రకారంగా వయస్సుతో నిమిత్తం లేకుండా బాలల నుంచి వృద్ధుల వరకు స్త్రీ, పురుషులెవరైననూ ఆచరించవచ్చు. స్త్రీలలో రుతుక్రమ అయిన 5వ రోజు తదుపరి మాత్రమే అర్హులు. గర్భవతులకు నియమమేమి లేదు.  జాతాశౌచ, మృతాశౌచ దినాలలో ఆచరించవద్దు. చంద్రగ్రహణం, సూర్యగ్రహణం వచ్చిన రోజులలో సౌర యోగం వచ్చినచో అది నిష్ఫలముగానే భావించి, పై విధి విధానమును ఆచరించవద్దు.

ఈ పరంపరలో 2017 జూన్ నెలలో భారతదేశంలో మహాసౌర యోగములు జూన్ 7 బుధవారం విశాఖ నక్షత్రంలోను, జూన్ 8 గురువారం అనురాధ నక్షత్రంలోను, జూన్ 16 శుక్రవారం శతభిషా నక్షత్రంలోను, జూన్ 27 మంగళవారం ఆశ్లేష నక్షత్రంలోను , జూన్ 29 గురువారం పుబ్బ నక్షత్రంలోను మహాసౌర యోగములున్నవి. కనుక ఈ రోజులలో భక్తి విశ్వాసాలతో రొట్టెలను తయారుచేసి కాలపురుషుని యొక్క దివ్య అనుగ్రహం ద్వారా పూర్వజన్మ కర్మల వ్యతిరేక ఫలితాలను కొంతమేర తగ్గించుకోవటానికి ప్రయత్నం చేయండి. 


పూర్వ జన్మ ప్రారబ్ధ కర్మల ఫలితాలపై మరింత విశ్లేషణాత్మకంగా తదుపరి శీర్షికలో తెలియచేస్తూ 2017 సంవత్సరంలోని మిగిలిన మాసాలలో ఏయే రోజులలో మహాసౌర యోగాలు వస్తాయో తెలియచేస్తాను. అదేవిధంగా ఇతర దేశాలకు కూడా మహాసౌర యోగమున్న తేదీలను కూడా త్వరలో తెలుపగలను. 

- దైవజ్ఞ పొన్నలూరి శ్రీనివాస గార్గేయ 

మహాసౌరయోగాలు - పరిహారాలు 1వ భాగం

కర్మ అనేది ఒక మతానికి సంబంధించిన అంశము కాదు. ఇది ఓ వ్యక్తికి సంబంధించినదిగా భావించాలి. కర్మను గురించి ఒకరు నమ్మినా నమ్మకపోయినా, కర్మ యొక్క నియమాలు, ఫలితాలు సర్వులకు వర్తిస్తుంటాయి. ప్రతివారు జన్మించిన తదుపరి బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము, మరణము జరిగి తిరిగి జననం కొనసాగుతుంటుంది. ఇది క్రమ పద్ధతి. కాలం కూడా అంతే. పగటి తర్వాత రాత్రి, రాత్రి తరువాత పగలు. తిరిగి రాత్రి, తిరిగి పగలు.. ఇలా కాలచక్రం తిరుగుతూ ఉంటుంది.

ప్రతిరోజు మనం నీరు తాగుతూనే ఉంటాము. ఒకరోజు ఒక ప్రాంతంలో నీరు త్రాగవచ్చు, రేపు హైదరాబాద్ లో తాగవచ్చు, మరోరోజు మరో ప్రాంతంలో తాగవచ్చు. ఇంకో రోజు ఇంకో ప్రాంతంలో త్రాగవచ్చు. ఇలానే నిదురించటం కూడా.  అంటే జననం నుంచి మరణం వరకు ప్రతి రోజు ఏదో ఒక ఒక ప్రదేశంలో నీరు త్రాగటమో, ఏదో ఒక ప్రాంతంలో నిదురించటమో జరుగుతుంటుంది. దీనినే ప్రారబ్ద కర్మ అంటారు. ఇది రుణాన్ని బట్టి జరుగుతుంటుంది.

జీవి జన్మించగానే కొన్ని ఋణాలతో జన్మిస్తాడు. ఆ ఋణాలను ఈ జన్మలో తీర్చుకోవాలి. ఈ తీర్చటము అనేది గత జన్మలో చేసిన పాప పుణ్య కార్యాలను బట్టి ఈ జన్మలో శుభాశుభ  ఫలితాలనేవి ఉంటాయి. రామాయణంలోని యుద్ధ కాండలో మండోదరి రావణుడితో ఇలా చెప్పింది. 


శుభకృచ్చ్చుభమాప్నోతి పాపకృత్ పాపమశ్నుతే
విభీషణః సుఖం ప్రాప్తస్త్య ప్రాప్తః పాపమీదృశమ్ || 


ఉత్తమమైన పుణ్య కర్మలు చేసినవారికి ఉత్తమోత్తమ ఫలితాలు ఉంటాయి. పాప కర్మలు చేసిన వారికి దుఃఖం సంభవిస్తుంది, మరి విభీషణుడు తను చేసిన శుభ కర్మల వలన తనకు సుఖం లభించింది. నీవు (రావణుడు) పాపకర్మల చేసిన కారణంగా ఇలాంటి దుఃఖాన్ని అనుభవించాల్సివస్తున్నది అని మండోదరి రావణుడితో చెప్పింది.

కర్మల యొక్క ఫలితాలు అనుభవించేవాడు ఎవరు ? చేసినవాడే అనుభవించాలి. దుష్టమైనటువంటి కర్మలు చేసేవానికి తనకు తానే శత్రువవుతాడు. మంచికర్మలు చేసేవాడు తనకు తానే మిత్రుడవుతాడు. అంటే ప్రతి మనిషి తనకు తానే ఒక శత్రువుగా, మిత్రుడుగా, బంధువుగా, హితుడుగా, సన్నిహితుడుగా వివిధాలుగా ఉంటుంటాడు. వ్యక్తి చేసే శుభాశుభ కర్మలన్నింటికీ కూడా తానే సాక్షీభూతుడు. కాదంటారా ?

ప్రతివారు చేసే కర్మలకు (కార్యములకు) ఫలితాలు ఇలా ఉండాలి అని ఎవరు చెబుతున్నారు ? ఎవరు శాసిస్తున్నారు ? ఈ కర్మకి ఇలాంటి ఫలితం రావాలని ఎవరు ఏర్పాటు చేశారు? ప్రపంచంలో ఉన్న కోటానుకోట్ల మంది చేసే కర్మలన్నింటినీ... ఎవరు, ఎక్కడ నుంచి ఎలా, ఏవిధంగా పర్యవేక్షిస్తున్నారు ? దీనికి నిఘా కెమెరాలు వంటివి ఉన్నాయా ? ఉంటే ఎక్కడ ఉన్నాయి ? ఈ కెమెరాలు తీసే సారాంశమంత ఏ హార్డ్ డిస్క్లో సేవ్ అయింది ? ఈ ప్రశ్నలకు సమాధానాలున్నాయా? ఉన్నాయి మరి. అలాంటి సమాధానాలను వేదంలోని చివరి భాగమైనటువంటి ఉపనిషత్తులు అందిస్తాయి. ఇట్టి ఉపనిషత్తే శ్వేతాశ్వతర ఉపనిషత్తు. అలాగే భగవద్గీతలోని తొమ్మిదవ అధ్యాయంలోని 17 వ శ్లోకంలో గీతాచార్యులు ఏమన్నారంటే...


పితామహస్య జగతో మాతా ధాతా పితామహః
వేద్యం పవిత్రమోంకార ఋక్సామ యజుర్వేద చ ||


ఈ సమస్తమైన విశ్వాన్నంతటినీ నేనే ధరించి ఉన్నాను. ప్రాణులు చేసే కర్మలన్నింటికీ ఫలితాలను నేనే అందిస్తున్నాను. తల్లిని నేనే, తండ్రిని నేనే, తాతను కూడా నేనే. నేనొక పవిత్రుడని, నేను ఓంకారాన్ని, ఋగ్వేద, యజుర్వేద, సామవేద సమూహాన్ని కూడా నేనే అని పరమాత్ముడు తెలియచేశాడు.

మనం జీవితాలలో జరిగే అనేక మార్పులను ఒక్కోసారి ఆపలేమేమోనని పలుమార్లు అనుకుంటుంటాం. ఒక్కోసారి మనం చేసే ఆలోచనలు, నిర్ణయాలు, ఇతరములు అనుకోకుండా తారుమారైపోతుంటాయి. ఆ సమయంలో మన గమనానికి సరియైన నియంత్రణ లేదని భావిస్తుంటాం. అప్పుడు అనుకుంటాం.. ఏమనో తెలుసా ? కాలం కలిసిరాలేదని కొందరు అనుకుంటుంటే, టైం బాగలేదేమో మరికొందరు, బాడ్ లక్ అని ఇంకొందరు అనుకుంటుంటారు. నిజంగా కాలం కలిసి రాలేదా ? నిజమే! ఈ కాలమనేది ఒకరికి కలిసి రాలేదు, ఇంకొకరికి కలిసి వచ్చింది కదా.. మరి కాలాన్ని తప్పు ఎలా పడతాం? నిజం చెప్పాలంటే కాలం కలిసి రాకపోవటం కాదు... ఈ కాల గమనంలో మనం చేసిన కర్మ ఫలితాలు ఒక్కోసారి అనుకూలంగా ఉంటున్నాయి, ఒక్కోసారి ప్రతికూలంగా ఉంటున్నాయి. అంతేగాని కాలాన్ని నిందించకూడదు.

దీనిని బట్టి మన జీవన గమనములో అనేక రకాల ఆలోచనలతో ముందుకు వెళ్తుంటాం. విద్యలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, వృత్తి కావచ్చు. ఇలా తమ తమ వ్యవహారాలతో పాటు గృహము, ఆరోగ్యము, వాహనము, తల్లి తండ్రులు, వివాహము, దాంపత్య జీవనము, సంతానము, సోదర సోదరీమణులు, స్నేహితులు, ఆర్ధిక లావాదేవీలు, శత్రువులు, ప్రమాదాలు, కీర్తి ప్రతిష్టలు, లాభ నష్టాలు ఇలా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. వీటన్నింటిలో ఒడిదుడుకులు లేకుండా సాఫీగా వెళ్లే వారు ఉన్నారు. నిత్యం కుస్తీ పడుతూ సాగేవారున్నారు. ఒక్కోసారి మంచి చెడుగా వెళ్తున్నవారు ఉన్నారు.

మన జాతకాలలో ఏమున్నది ? ఏం రాసి ఉన్నది? భవిష్యత్ జీవనం ఎలా గడవనుంది ? సంప్రదించగలమా లేక దారుణంగా దెబ్బతింటామా అనే భయాలతో కుమిలిపోయే వారు కూడా ఉంటారు. జాతకాలలో పరిస్థితులన్నీ సక్రమంగా ఉండి కూడా బాధపడుతున్న వారు ఎందరెందరో. అలా కాకుండా జాతక లోపాలుండి విజయ కేతనం ఎగరేసేవారు కూడా ఉన్నారు. ఇప్పటిదాకా చదివిన తర్వాత మరి జాతకాలను నమ్మాలా, వద్దా అనే మీమాంసలో పడిపోతారు.

జాతకాలలో అంతర్గతంగా ఉన్న అంశాలను (అదృశ్యంగా ఉన్నవి ) తేటతెల్లం చేసి చెప్పే పండితులు ఉన్నప్పుడు మాత్రమే మీకు సరియైన అవగాహనతో ముందుకు వెళ్ళటానికి సలహాలను అందిస్తారు. అలాంటి పండితులు లేనప్పుడు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే. ఈ పరంపరలో జాతకాలలో ఎన్నో సమస్యలు, ఎన్నో లోపాలు, ఎన్నో దోషాలు ఉంటాయి. వీటిని చూసి కుమిలిపోరాదు. వీలైనంతవరకు చేతనైన రీతిలో పరిహారాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నప్పుడు మాత్రమే... లబ్ది పొందే అవకాశాలు వస్తుంటాయి.


మనం ఈ జన్మలో చేసే కర్యములన్నిటికి మనమే సాక్షిభూతుడుగా ఉన్నప్పటికీ... మనం గత జన్మలో చేసిన కార్యాల ఫలితాల ఆధారంగా ఈ జన్మలో ఓ టైం టేబుల్ లాగా నిత్యం  మనచేకర్మలను ఆచరింప చేస్తూ వాటి ఫలితాలను కూడా  అందించే ఓ పెద్ద మనిషి ఉన్నాడనే విషయాన్నీ మరువకూడదు. ఆ పెద్ద మనిషే కాలపురుషుడు. జగద్రక్షకుడు, ఈ విశాల విశ్వమంతటికీ వెలుగును ప్రసాదించి మన జీవితాలను పోషిస్తూ,  దైవంగా భాసిల్లే గ్రహారాజే శ్రీ సూర్యనారాయణుడు. 


అట్టి శ్రీ సూర్య భగవానుని గురించి తైత్తిరారణ్యకములోని ప్రధమ పాఠంలోనే ( వేదం ) 32 అనువాకలతో అరుణం అనే పేరుతో మంత్రభాగం ఉంటుంది.  దీనినే మహా సౌరం, నమస్కార ప్రశ్న అని కూడా అంటారు. నిత్యం భాసిల్లే సూర్య భగవానుని కిరణ ప్రసారంతో మన జీవిత గమ్యాలను ఓ క్రమబద్ధంగా మార్చుకోవటానికి మన మనస్సును , బుద్ధిని ప్రేరేపించాలి. ఈ విధంగా ప్రేరేపించటానికి అనేకానేక పద్ధతులు ఉన్నాయి. ఇందులో అందరూ సూక్ష్మంగా తెలుసుకొని పాటించటానికి జ్యోతిష శాస్త్ర రీత్యా మహాసౌర యోగాలు ఉపయోగపడతాయి.

ఈ మహాసౌర యోగాలు ప్రతినెలలో కొన్ని కొన్ని రోజులలో వస్తుంటాయి. ఆయా రోజులలో ఎలా ఎలా ఆచరిస్తే కొంతవరకు మనం విజయ బాటకు చేరువ కావటానికి అవకాశాలు ఉంటాయని పురాతన గ్రంధాలన్నీ చెబుతున్నాయి. ఈ పరంపరలో మహా సౌరయోగాలు - పరిహారాలు రెండవ భాగంలో మరికొంత వివరంగా పరిహారాలను తెలుసుకుందాం. (కొద్దిగంటలలో పోస్టింగ్ ఉండును) 

- దైవజ్ఞ శ్రీనివాస గార్గేయ

Monday, March 27, 2017

మార్చి 28 మంగళవారమే శ్రీ హేమలంబ ఉగాది

స్వస్తిశ్రీ హేమలంబ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని మార్చి 28 ఏ ఆచరించుకోవాలి. 29 బుధవారం ఆచరించటం శాస్త్రీయం కానీ కాదు. నాచే రచింపబడిన కాలచక్ర పంచాంగంతో పాటు, కంచి కామకోటి పీఠ పంచాంగం (లక్కావజ్జల సిద్ధాంతి గారు), పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, కుప్పం ద్రవిడ యూనివర్సిటీ, సంస్కృత విద్యా పీఠ్ (ఢిల్లీ, వారణాసి, తిరుపతి), శ్రీ కాళహస్తి దేవస్థాన పంచాంగం (ములుగు సిద్ధాంతి గారు), ఆంధ్రజ్యోతి పంచాంగ, ఆంధ్రభూమి పంచాంగం, పిడపర్తి వారి పంచాంగం, హనుమంత వజ్జల సుబ్రమణ్య శర్మ గారి పంచాంగం, ద్విభాష్యం సుబ్రమణ్య శర్మగారి పంచాంగం, ముక్తేవి శశికాంత్ గారి పంచాంగం, అనపర్తి కృష్ణశర్మ గారి భాస్కర పంచాంగం, చిత్రాల గురుమూర్తి గుప్త గారి పంచాంగం, గొర్తి పట్టాభి శాస్త్రి గారు, ఉపద్రష్ట కృష్ణమూర్తి గారు, బిజుమల్ల బింధుమాధవ శర్మ గారు , కారుపర్తి కోటేశ్వర రావు గారు , కాలెపు భీమేశ్వర రావు గారు ,  పిచుక గిరిరాజు సిద్ధాంతి  గారు, పల్లావజ్జల రామకృష్ణ శర్మ గార్ల పంచాంగాలు...వీరు కాక మరో 40 మంది దృగ్గణిత పంచాంగ కర్తలు మరియు కేంద్ర ప్రభుత్వంచే ప్రతి సంవత్సరము విడుదలయ్యే రాష్ట్రీయ పంచాంగాలలో మార్చి 28న ఉగాది గా ప్రకటించారు. 

వీరు కాక గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ప్రభుత్వాలు మార్చి 28 మంగళవారమే ఉగాదిగా ప్రకటించాయి. 2016 ఆగష్టు నెలలో కంచి పీఠం వారు నిర్వహించిన సదస్సులో తిరుమల సిద్ధాంతి తంగిరాల వారు పాల్గొని మార్చి 28న ఉగాది ఒప్పుకొని సంతకం చేసి సన్మానించుకొని, బయటకు వెళ్లిన తదుపరి పండిత ధిక్కారంతో మార్చి 29 శ్రీ హేమలంబి ఉగాదిగా ప్రకటించటంతోనే అయోమయం ప్రారంభమైనది. 

కనుక తెలుగు ప్రజలందరూ శాస్త్రీయమైన, ప్రామాణికమైన కంటికి ప్రత్యక్షంగా రుజువునకు సిద్ధపడే దృక్ పంచాంగాన్నే పాటించి మార్చి 28 మంగళవారం ఉగాదిగా ఆచరించేది. - పొన్నలూరి శ్రీనివాస గార్గేయ 

Sunday, March 12, 2017

శ్రీ హేమలంబ ఉగాది 2017 మార్చి 28నా లేక 29?

శ్రీ హేమలంబ ఉగాది 2017 మార్చి 28 ? మార్చి 29.. ఏ రోజు ఆచరించాలి. కంచి పీఠం వారు మార్చి 28 శ్రీ హేమలంబ గా ప్రకటించారు. శృంగేరి వారు మార్చి 29 శ్రీ హేమలంబగా ప్రకటించారు. తిరుమల తిరుపతి వారు శృంగేరి గణితమే మా పంచాంగం అంటూ మార్చి 29 ఉగాది అంటూనే పేరు మాత్రం శ్రీ హేమలంబి అన్నారు. అలాగే తెలంగాణలో ఉండే పలువురు పండితులు శృంగేరి వారి నిర్ణయమే శిరోధార్యం అంటూనే, వారి పంచాంగాలలో మార్చి 29 ఉగాదిగా తెలియచేస్తూ, సంవత్సర పేరు మాత్రం శ్రీ హేవిళంబి అన్నారు. ఎవరిని నమ్మాలి ? ఏమిటీ అయోమయం.. ఈ అయోమయానికి కారణమే టీటీడీ. 

దాదాపు దశాబ్దాల నుంచి వస్తున్న ఈ వివాదానికి అడ్డుకట్ట వేసి తగిన పరిష్కారం చేయాలనే ఒక ఉద్దేశ్యంతో 1955లో ఆనాటి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రు గారు ఒక పంచాంగ సంస్కరణల కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ వారు దేశవ్యాప్తంగా సిద్దాంతులందరినీ ఆహ్వానించి ఆరు మాసాలపాటు పండిత చర్చలు చేయించారు. 

ఈ చర్చల అనంతరం ప్రత్యక్ష ఋజువునకు ప్రామాణికంగా నిలిచేది దృగ్గణితమని పూర్వగణితం కాదని తీర్మానించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు కేంద్రప్రభుత్వం వారు అనేక భాషలలో రాష్ట్రీయ పంచాంగము అను పేరుతో ప్రతి సంవత్సరం పంచాంగాన్ని ముద్రిస్తున్నారు. ఈ పంచాంగంలో ఇచ్చిన సమయాలకు, ఖగోళ గ్రహ సంచారాలకు ఖచ్చితంగా సరిపోవును. దీనినే దృగ్గణితము అంటారు.

వాస్తవానికి పంచాంగం గణితం చేయటానికి మూల గ్రంధము సూర్యసిద్ధాంతము. కానీ సిద్ధాంతము ఒక్కటైనప్పటికీ వ్యక్తుల మధ్య ఉన్న భేదాభిప్రాయాల వలన రెండు విధాలుగా గణితం చేస్తున్నారు. ఈ రెండు విధాల గణితం వలనే సమస్యలు వస్తున్నాయి. 

సూర్యుడికి చంద్రుడికి మధ్య ఉండే దూరాన్ని తిధి అంటారు. చంద్రుని యొక్క సంచార స్థితిని నక్షత్రముగా నిర్వచిస్తారు. అమావాస్య అనగా సూర్యుడు చంద్రుడు ఒకే బిందువులో కలిసిపోవటము. పూర్ణిమ అనగా సూర్యునికెదురుగా  చంద్రుడు ఉండటం. ఈ నేపథ్యంలో అమావాస్య పూర్తి కాగానే చంద్రుడు ప్రక్కకు రావటంతో పాడ్యమి తిధి మొదలవుతుంది. అంటే అంతటితో అమావాస్య పూర్తయిందని భావము. ఈ శుక్ల పాడ్యమి తిథి ప్రారంభం దగ్గరే రెండు గణితాల వారికి వివాదముంది. 

2017 మార్చి 28 మంగళవారం ఉదయం అమావాస్య తిధి 8గంటల 26నిముషాల వరకు ఉండి తదుపరి చైత్ర శుక్ల పాడ్యమి తిధి ప్రారంభమైనది. ఈ తిధి మరునాడు 29 బుధవారం  సూర్యోదయానికి పూర్వము 5 గంటల 44 నిముషాల తో వెళ్ళిపోతుంది. సూర్యోదయం వరకు తిధి ఉండదు. ఇది ఖచ్చితంగా ఖగోళంలో చంద్ర సూర్యుల సంచారానికి జరిగే సమయం. దీనినే దృగ్గణితము అంటారు. ఈ గణితం ప్రకారంగా మార్చి 28 ఉగాదిగా ప్రకటించారు. 

కానీ రెండవ గణితమైన పూర్వపద్ధతి ప్రకారం 29వ తేదీ ఉదయం దాదాపు 6గంటల 50 నిముషాల వరకు పాడ్యమి తిధి ఉన్నందున, వారు 29 ఉగాది అని తెలియచేశారు. ఇక ధర్మ శాస్త్ర విషయాన్ని ప్రక్కన పెట్టి సూర్యోదయంలో తిధి ఉన్నది గనుక 29 ఉగాది అని అడ్డంగా వాదించటం మొదలుపెట్టారు పూర్వగణితం వారు. ఒక్కసారి వారి మాటలు వారికే అప్పచెబితే.. గతంలో జీయర్ పీఠం మరియు యాద్రాది దేవస్థాన ఆస్థాన సిద్ధాంతి గారు మరియు పుష్పగిరి పీఠం ఆస్థాన సిద్ధాంతి గారు 2007 మార్చి 20వ తేదీన సూర్యోదయం తర్వాత దాదాపు అరగంట వరకు పాడ్యమి తిధి ఉన్నప్పటికీ, ఆరోజు ఉగాదిగా ప్రకటించకుండా 2007 మార్చి 19 శ్రీ సర్వజిత్ ఉగాదిగా ప్రకటించారు ఇదే పూర్వగణితం వారు. అంటే రెండు నాల్కల ధోరణిలో మాట్లాడుతున్నారన్నమాట. 

అయితే ధర్మ శాస్త్రాలు చెప్పిన వివరాల ప్రకారంగా పరిశీలిస్తే (గణితం ఏదైనా) రెండవ రోజు సూర్యోదయం తర్వాత 3 ముహూర్తాల ప్రమాణం శుక్ల పాడ్యమి తిధి వ్యాప్తి ఉంటేనే రెండవ రోజు ఉగాది చేయాలని ధర్మశాస్త్ర నిర్ణయం. ఒక ముహూర్తం అంటే 48 నిముషాలు. మూడు ముహుర్తాలు అంటే 144 నిముషాలు లేదా 2 గంటల 24 నిముషాలన్నమాట. కనుక ఇంతసేపు తిథి రెండవ రోజు ఉంటేనే భారత దేశ వ్యాప్తంగా అన్నీ ప్రాంతాలవారికి, వారి వారి సూర్యోదయాల తర్వాత తిధి ఉంటుందని అర్ధము. ఈ విషయం పూర్వగణిత పంచాంగ కర్తలకి తెలుసు.. కానీ నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంటారు. 

2007 మార్చి 19 శ్రీ సర్వజిత్ ఉగాది గా దృక్ పద్ధతి ప్రకారం వచ్చింది. మార్చి 20గా పూర్వపద్ధతి ప్రకారం వచ్చింది. ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు. ఈ పంచాంగ వివాదం తేల్చటానికి నలుగురు ఐ.ఏ.యస్ అధికారులు కమిటీగా ఏర్పరిచారు. వారే 1. శ్రీ సుందరకుమార్ గారు, 2. శ్రీ కె.వి.రమణాచారి గారు  3. శ్రీ ఐ.వి.సుబ్బారావు గారు  4. పి.వి.ఆర్.కె.ప్రసాద్ గారు ఈ నలుగురు అధికారుల ముందు నాతో పాటు మరికొంతమంది దృగ్గణిత పంచాంగ కర్తలు, ఆనాటి తిరుమల దేవస్థాన సిద్ధాంతి తంగిరాల ప్రభాకర పూర్ణయ్య (ప్రస్తుతం కీర్తి శేషులయ్యారు) గారు చర్చలలో పాల్గొన్నాము. 

దాదాపు ఒకరోజు జరిగిన ఈ చర్చల అనంతరం దృగ్గణిత ప్రకారంగా మార్చి 19వ తేదీగా ప్రభుత్వం ప్రకటించి ఒకరోజు ముందుకు ఉగాదిని మార్చటం జరిగింది. కానీ ఈ సంవత్సరం మేము ప్రభుత్వానికి ఈ విషయంపై విన్నవించుకోదల్చుకోలేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖలో ఉన్న తిరుమల దేవస్థాన పంచాంగం ఎప్పుడైతే పూర్వపద్ధతి నుంచి దృక్ పద్ధతిలోకి మారుతుందో, ఆనాడే తెలుగు పండగలకి వ్యత్యాసాలు రావు.  ఇంతకాలానికి ప్రజలు చైతన్యవంతులైనారు. చక్కని అవగాహనతోటి ఉన్నారు. ప్రతివారి చేతిలో ఆండ్రాయిడ్ ఫోన్లు ఉంటున్న ఈ  తరుణంలో, తిధి ఎంతవరకు ఉందని స్పష్టంగా తెలుసుకోవచ్చు. నిదానంగా కాలమే నిర్ణయించబోతున్నది. ఈ పూర్వగణితము నుంచి రచయితలు.. వారంతట వారే నిదానంగా నిష్క్రమించబోయే రోజులు సమీపిస్తున్నాయి. 

తిరుమల, శ్రీశైల దేవస్థానాల పంచాంగాలు రెండూను పూర్వపద్ధతివే, ఈ రెండింటిలో తిధి సమయాలు, నక్షత్ర సమయాలు ఒక్కటిగా ఉంటాయి. కానీ పుష్కర ప్రారంభాలు మాత్రం వారం రోజులు తేడా ఉంటాయి. మరి ఇలా ఎందుకు అని అడిగేవారే లేరు. అసలు విషయం ఏమిటంటే దేశవ్యాప్తంగా పుష్కరాలు జరిగే సమయం కేంద్రప్రభుత్వం నిర్ణయించిన రాష్ట్రీయ పంచాంగం ప్రకారం ఉంటాయి. ఇదే తేదీని తిరుమల సిద్ధాంతి తమ పంచాంగంలో ఇస్తారు. కానీ శ్రీశైల సిద్ధాంతి వారి గణితం ప్రకారం వచ్చిన వేరే తేదీని ఇస్తారు. ఈ తేదీని తిరుమల వారు ఎందుకు ఇవ్వరంటే... దేశం అంతా పుష్కరాల తేదీ ఒకటిగా ఉండి తిరుమల పంచాంగంలో మరొక తేదీగా ఉంటే వారి పదవికి ముప్పు వాటిల్లే అవకాశం ఉందని గ్రహించి గుట్టుచప్పుడు కాకుండా కేంద్రప్రభుత్వ నిర్ణయం తేదీని తమ పంచాంగంలో ఇస్తారు.  

అలాగే పూర్వాపద్ధతి ప్రకారంగా సూర్య చంద్ర గ్రహణాలు రానే రావు. దృక్పద్దతి ప్రకారమే గ్రహణ సమయాలు ఖచ్చితంగా వస్తాయి. తిరుమల సిద్ధాంతి వారి పూర్వ పద్ధతి ప్రకారంగా గ్రహణాలు ఇస్తే, ఆ సమయానికి కనపడవు గనుక, అందరూ ప్రశ్నిస్తారనే భయంతో తిధి, నక్షత్రాలను పూర్వ పద్ధతి అని, గ్రహణ గ్రహ ప్రవేశాలను దృక్పద్దతి అని సూర్యసిద్ధాంతంలో లేని కొత్త దానిని తీసుకొచ్చారు. కొసమెరుపు ఏమిటంటే తిధి అనగా సూర్య చంద్రుల మధ్య దూరము. సూర్య చంద్రులిద్దరూ గ్రహాలే కదా! తిరుమల పంచాంగ కర్తకు ఈ విషయం తెలియదేమో. గ్రహ ప్రవేశాలు దృక్పద్దతి ప్రకారం అన్నప్పుడు, ఈ రెండింటి మధ్యగల దూరము తిధి కూడా ఖచ్చితంగా ఉండాలి. కానీ వారి దానిలో అలా ఉండదు. చెప్పుకుంటూ పోతే ఇలాంటివి ఎన్నో ఎన్నెన్నో. 

ఇంత జరిగినా అసలు సిసలైన శాస్త్రీయమైన ప్రామాణికమైన దృక్పద్దతి ప్రకారం పంచాంగం వేయటం వారికి కష్టసాధ్యమేమి కాదు.. కానీ వేయరు. ఎందుకంటే ఇంతవరకు వేసిన పంచాంగములు తప్పని పరోక్షంగా ఒప్పుకున్నట్లేగా. అది అసలు కధ. కనుకనే వారి వారి గృహాలలో అధునాతన పరికరాలతో జాతకాలు చెబుతుంటారు. కానీ తప్పు గణితాలతో పంచాంగాలు ముద్రించి ప్రజలను గందరగోళంలోకి నెట్టేస్తారు. ప్రజలు బాగా తెలుసుకున్నారు. పంచాంగ ప్రతుల అమ్మకం ఎప్పుడైతే పూర్తిగా పడిపోతూ వస్తుందో ముద్రించే పబ్లిషర్స్ కూడా లేకుండా పోతారో ఆనాడే తమ తప్పులను తెలుసుకొంటారు. ఆరోజులు సమీపంలోనే ఉన్నాయి.

రాజమండ్రిలో పంచాంగాలను అచ్చు వేసే మోహన్ పబ్లికేషన్స్ రెండు రకాల పంచాంగాలను మొదటినుంచి ముద్రిస్తున్నారు. తర్వాత రోజులలో పూర్వగణిత పంచాంగం సరికాదని తెలుసుకొని, ఈ తప్పు పంచాంగాల వలన ప్రజలకు నష్టం వాటిల్లుతున్నదని గ్రహించిన మోహన్ పబ్లికేషన్స్ వారు గత నాలుగు సంవత్సరాల నుంచి తమకు ఆదాయం తగ్గినా ఫర్వాలేదు అనుకొని పూర్వగణిత పంచాంగ ముద్రణకు స్వస్తి పలికిన ధన్య జీవులు. ఇప్పుడు కేవలం మోహన్ పబ్లికేషన్స్ వారు శాస్త్రీయమైన ప్రామాణికమైన ప్రత్యక్ష రుజువుకు నిలబడే పంచాంగాలను ముద్రిస్తున్నారు. వీరి బాటలోనే మిగిలిన పబ్లిషర్స్ కూడా అచిరకాలంలోనే రాబోతున్నట్లుగా వినికిడి. ఎందుకంటే ప్రజలకు జరిగే కష్ట నష్టాలను తెలుసుకొని ఆ కష్ట నష్టాలు తమవిగా భావించుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతున్నది. 

చివరగా చెప్పేది ఏమిటంటే శాస్త్రీయమైన ఉగాది మార్చి 28 మాత్రమే. కేంద్రప్రభుత్వం మార్చి 28 నే సెలవుదినంగా ప్రకటించారు కూడా. తెలుగు రాష్ట్రాలలో మాత్రం మార్చి  29 గా సెలవుంది. కనుక తెలుగు ప్రజలు శాస్త్రీయమైన ఉగాదిని మార్చి 28నే జరుపుకోవాలని తెలియచేస్తున్నాను. 

Wednesday, January 25, 2017

27 జనవరి 2017 అరుదైన మౌని అమావాస్య

2017 జనవరి 27 శుక్రవారం పుష్య అమావాస్య. దీనినే మౌని అమావాస్య అని కూడా పిలుస్తారు. సూర్యుడు, చంద్రుడు ఒకే బిందువులో కలిసినచో ఏర్పడే తిథిని అమావాస్య అంటారు. ప్రతి సంవత్సరం ఉత్తరాయణం ప్రారంభమైన తదుపరి ఈ మౌని అమావాస్య వస్తుంది. అంటే ఉత్తరాషాఢ నక్షత్ర 2వ పాదమైన మకరరాశి లోనికి సూర్యుడు ప్రవేశించటాన్ని ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు. అదే మకరరాశిలోకి తదుపరి చంద్రుడు వచ్చి సూర్యునితో కలిస్తే వచ్చే తిధి మౌని అమావాస్య.

మనసుకు కారకుడు చంద్రుడు. శనిగ్రహానికి అంతర్దశ శత్రువు కూడా చంద్రుడే. మకరరాశికి  అధిపతి శనిగ్రహం. జ్యోతిషపరంగా రవి మరియు శనిగ్రహాలు పరస్పర శత్రువులు. ముఖ్యంగా మౌని అమావాస్య పర్వదినాన పుణ్య నదులలోను, సముద్రాలలోను స్నానమాచరించటమే కాక పితరులకు తర్పణ, పిండప్రదానాదులు కూడా ఆచరిస్తుంటారు. కానీ అసలైన అంతర్గత రహస్యం మరొకటి ఉంది. కేవలం స్నానాలు ఆచరించి పిండప్రదానాలు మాత్రమే చేస్తుంటారు తప్ప, రహస్యం తెలుసుకోవటానికి ఎవరూ ప్రయత్నించారు.

ఈ రహస్యం తెలుసుకుని తగిన రీతిలో మౌని అమావాస్య పర్వదినాన ప్రతివారు విధి విధానాలతో ఆచరిస్తుంటే... ప్రతి సంవత్సరం వారి వారి జీవన స్థితిగతులలో కొన్ని అనుకూల మార్పులు వస్తాయని పురాతన గ్రంధాలు తెలియచేస్తున్నాయి. ప్రతి సంవత్సరం వచ్చే మౌని అమావాస్యకు ఈసారి వచ్చే మౌని అమావాస్యకు చాలా వ్యత్యాసం ఉంది. ప్రస్తుతం శనిగ్రహం వృశ్చికరాశిలో సంచారం సాగిస్తూ, ఏదో ఒకరోజున ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ ప్రవేశం అనేది అతిచారంతో ఉండవచ్చు. సహజ గమనంతో ఉండవచ్చు.

చారమంటే నడక, గమనమన్నా నడకే. సహజధోరణిలో మనం అతిగా మాట్లాడవద్దు అని సంబోధిస్తుంటాం. అంటే మాట్లాడవలసిన స్థాయికన్నా అధికంగా మాట్లాడటాన్ని అతి అంటారు. మరొక అర్ధంలో ఎక్కువ అని కూడా అర్ధము. అతిగా తినటము... అతిగా మాట్లాడటము, అతిగా నిద్రపోవటము.. ఈ విధంగా సాధారణ స్థితి కంటే ఎక్కువ చేసే దానిని అతి అంటారు. ఈ విధమైన అతి వలన సమస్యలు కూడా అధికంగా ఉంటాయనే విషయాన్ని సర్వులు గమనించాలి. ఈ అమావాస్యకు శని అతిచార గమనము తోడవుతుంది. 

ప్రస్తుతం వృశ్చికరాశిలో సమాచారం చేస్తున్న శనిగ్రహం సహజ గమనంతో ధనుస్సు రాశిలోనికి 2017 అక్టోబర్ 26న ప్రవేశించవలసి ఉన్నది. కానీ ఈ లోపలే అతి గమనంతో హడావిడిగా 2017 జనవరి 26 రాత్రి 7 గంటల 31 నిముషాలకి ధనుస్సు రాశిలోనికి ప్రవేశిస్తాడు. ఇలా ప్రవేశించిన శని తిరిగి వృశ్చికరాశి లోనికి జూన్ 21వతేదీకి చేరుకుంటాడు. వృశ్చికరాశిలో కొంతకాలం పాటు ఉండి సహజగమనంతో అక్టోబర్ 26న ధనస్సురాశిలోనికి తిరిగి ప్రవేశిస్తాడు.

అయితే 2017 జనవరి 26 న అతిచార ప్రవేశం తదుపరి కొద్ది గంటలకే మౌని అమావాస్య ప్రారంభం. ధనూరాశి ప్రవేశం ప్రతి 30 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అయితే ధనస్సురాశిలో శని ఉన్న రెండున్నర సంవత్సరాల కాలంలో 2 లేక 3 సార్లు మౌని అమావాస్య వస్తుంటుంది. కానీ అతిచార గమనంతో ధనూరాశిలో ప్రవేశ సమయంలో వచ్చే మౌని అమావాస్య మాత్రం అత్యంత అరుదైనది.

మౌని అమావాస్య పర్వదినాన స్నానాలు, తర్పణాలు, పిండ ప్రదానాదులు ఆచరించటం ఆనవాయితీ. ఇక అసలైన రహస్య విషయానికి వస్తే... పురాణగాధలు అనేకం ఉన్నప్పటికీ మౌని అమావాస్య రోజున జ్యోతిషపరంగా ముఖ్యంగా మౌనం వహించటం ప్రధానమైన అంశం. మౌనం ఎందుకు వహించాలి అనే విషయం తెలుసుకోవాలి.  మనసునకు కారకుడు చంద్రుడు. అమావాస్య రోజున చంద్రుడు రవితో కలిసి ఉన్నందున, ప్రకాశాన్ని కోల్పోయి ఉంటాడు. అంతేకాక రవి, చంద్రుల కలయిక శని క్షేత్రంలో జరుగుతుంది.

జ్యోతిషపరంగా శని ఆయుష్కారకుడు. ఆయుష్యు అంటే... కేవలం ఒక వ్యక్తి ప్రాణంతో అధికకాలం జీవించటాన్ని మాత్రమే ఆయుష్యు అనటం కాదు. ఈ ఒక్క జీవించే అంశం కాకుండా బంధుత్వాలకి, బాంధవ్యాలకి, మిత్రత్వాలకి, వస్తువులకి, వ్యవహారాలకి, వ్యాపకాలకి కూడా ఆయుష్యు అనే మాట వర్తిస్తుంది.

ఎలాగంటే ఒక వ్యక్తి మరొక వ్యక్తితో స్నేహితంగా ఉంటున్నాడు. వీరిద్దరి మధ్య ఉన్న స్నేహబంధం ఒకే ఒకమాటతోనే చెదిరిపోయింది. జీవితంలో తిరిగి వీరివురు కలిసి మాట్లాడుకోవటం జరగలేదు. వారిద్దరి బంధాన్ని చెదరగొట్టినది కేవలం ఒక వాక్కు మాత్రమే. ఈ వాక్కుకు వెనక సూత్రధారి, పాత్రధారిగా ఉండే గ్రహం చంద్రుడు. పొరపాటున కావచ్చు, కావాలని కావచ్చు, నోటిద్వారా అన్న మాట ఆ ఇరువురి స్నేహిత బంధం అనే ఆయుష్యుకు గండిపడింది.

ఇలాగే బంధుత్వాలకి, కుటుంబంలో ఒకరినొకరికి, సంఘంలో పలకరించే సన్నిహితులకి... ఈ విధంగా చెప్పుకుంటూ పోతుంటే ఉద్యోగ, వ్యాపార, వ్యవహారాలలో తారసపడే ఎంతోమంది వ్యక్తులతో సంబంధం బాంధవ్యాలు ఉంటూ ఉంటాయి.

పై విధంగా అనివార్య కారణాల వలన ఆయుష్యనే బంధం చెదిరిపోవటానికి వాక్కు తోడ్పడుతుంది. ఇతరులని మంచితనంతో రంజింప చేయాలన్నా, ఇతరులను బాధించే విధంగా తప్పు మాటలు చెప్పినా... కేవలం వాక్కు వలన మాత్రమే సాధ్యం.

ఓ ఖరీదైన కారుని ఓ వ్యక్తి కొన్నాడనుకుందాం. ఆ కారు అనేది ఇనుప వస్తువు. ఈ ఇనుముని శనిగా భావిస్తాం. అంత ఖరీదైన కారు.. తనంతట తానుగా వెళ్లి ప్రమాదానికి గురి కాదు. .దానిని సక్రమంగా నడపక పోతే ప్రమాదం వాటిల్లి, కారు రూపమే చెదిరిపోవును. అంటే వ్యక్తి ఏదో ఆలోచనతో ఉన్నందువలన లేక నిద్ర వలన లేక ఎదురుగా అనాలోచనతో వచ్చిన మరో వాహనం డ్యాష్ ఇచ్చిన కారణంగా ఈ వాహనం దెబ్బతిన్నది. అందుకే శనికి అంతర్గత శత్రువు చంద్రుడయ్యాడు.

కనుక ఉద్యోగ, వ్యాపార, వ్యవహార, వాహన, జీవన, స్నేహిత అనే అనేక రంగాలలో అత్యధిక కాలం ఉండకుండా మధ్యలోనే చెడిపోవటమో, చెదిరిపోవటమో లేక నాశనమవ్వటమో లేక మరణించటమో జరిగితే.. .ఆయుష్యు పోయింది అంటారు. ఇట్టి ఆయుష్యు కారకుడైన శనిని ముప్పు తిప్పలు పెట్టేవాడే చంద్రుడు.

జ్యోతిషపరంగా ఆయుష్యకారకుడైన శని యొక్క క్షేత్రంలో... అంతర్గత శత్రువైన చంద్రుడు, శనికి బద్ధశత్రువైన శనితో కలిసిన మహా పర్వదినమైన మౌని అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు మౌనం వహించినచో ఆ సంవత్సరానికి కొంతమేర సమస్యలు సన్నగిల్లి... మానవాళి మంచి అంశాలతో ముందుకు వెళ్ళటానికి అవకాశాలు ఉంటాయనేదే మౌని అమావాస్య ప్రధాన ఉద్దేశ్యం. 


అయితే ఈ 2017 జనవరి నెలలో వచ్చే మౌని అమావాస్య పర్వదినానే అతిచారంతో వచ్చిన శనిగ్రహం ఉంది గనుక అత్యంత విశ్వాసంతో పగటి సమయమంతా అలా వీలుకానిచో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మౌనం పాటించినవారందరికీ పరోక్ష శుభాలు ఉంటాయి. ఇతర దేశాలలో ఉండే వారు ఈ క్రింది సమయాలలో మౌనం పాటించినచో పరోక్షంగా శుభకర ఫలితాలు ఉంటాయి.

కాలిఫోర్నియా - ఉదయం 10.48 నుంచి మధ్యాహ్నం 12.05 వరకు
న్యూయార్క్ - ఉదయం 10.55 నుంచి మధ్యాహ్నం 12.09 వరకు
టెక్సాస్ - ఉదయం 11.22 నుంచి మధ్యాహ్నం 12.40 వరకు
వాషింగ్టన్ డి. సి - ఉదయం 11.06 నుంచి మధ్యాహ్నం 12.21 వరకు
లండన్ - ఉదయం 11.08 నుంచి మధ్యాహ్నం 12.13 వరకు


దైవజ్ఞ పొన్నలూరి శ్రీనివాస గార్గేయ