Friday, March 19, 2010

శ్రీ వికృతి నామ సంవత్సర లఘు ఫలితాలు - 2

ఆహారధాన్యాల దిగుబడులలో క్రమబద్దీకరణ ఉందును. సాఫ్ట్వేర్ రంగానికి స్వల్పంగా ఆశలు చిగురించును. శాహిత్య, విద్య, వైద్య, సినీ రంగాలు ప్రాధాన్యతను సంతరించుకున్నప్పటికీ, ప్రజలు మరువలేని బాధలు సినిమా రంగంలో ఏర్పడు సూచనుంది. వేద, పురాణ, ఉపనిషత్తులకు చక్కని ప్రాధాన్యత కలగే రీతిలో పరిస్థితులు ఉపకరించును.

6 జూన్ ఆదివారం నుంచి 13 ఆదివారం లోపల తొలకరికి అవకాశములేర్పడును. తొలకరి ప్రారంభమైనప్పటికీ నైరుతి ఋతుపవనాలు ప్రజలకు ఆలస్యంగానే పూర్తి ఆశలు చిగురించును.

ఉత్తర భారతంలో వర్షములధికమై నదులు పొంగి ప్రవహించును. మన రాష్ట్రంలో కరువు రాజ్యమేలుతుండును. ఆంధ్రప్రదేశ్లో రైతాంగం తుఫాను కోసం పరితపించే రీతిలో పరిస్థితులు ఉంటాయంటే అతిశయోక్తి కాదు. వికృతి లో ఋతుధర్మానికి వ్యతిరేకంగా వర్షములున్నందున పంటలు ఆలశ్యంగా ఇంటికి చేరును. మినుములు, నువ్వులు, పెసలు పుష్కలంగా పండును. మిరప ఆటుపోట్లకు గురికాగలదు. దక్షిణాయనంలో యందు మిర్చికి అధిక ధరలుండును.

జూలై, ఆగష్టు నెలలలో అధిక ధరలకు కొంత కళ్ళెం పడును. మత్తు పానీయాల తయారీలోనూ, బెల్లం పరిశ్రమపైననూ నిబంధనలు విధించు అవకాశాములున్నవి. టోకు వర్తకులు ప్రజల నుంచి ధాన్యాలను కొనుగోలు చేసి స్వార్ధచిత్తంతో నిల్వవుంచి తద్వారా అధిక రేట్లతో వినియోగదారులను పలు సమస్యలకు గురిచేయుదురు. శుభకార్యాల పరంపరలో బంగారు వినియోగం తగ్గుముఖం చెందును. బంగారు బిస్కెట్ల కుంభకోణం ఆలశ్యంగా వెలుగు చూసే అవకాశముంది. కాస్మోటిక్స్ వ్యాపారాలత్ ప్రజలు మోసపోవుదురు. స్టాక్ మార్కెట్ అనేకమార్లు మదుపరులను నష్టాలబాటలో పయనింపజేయును. నేర ప్రపంచంతో ప్రజలందరూ భీతిల్లుతుందురు.


ఏప్రిల్ 14 నుంచే ఏర్పడే కుంభమేళా పవిత్రామావాస్యపై ఉగ్రవాదుల దుష్టచర్యలు లేకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ప్రభుత్వాలు చేయాల్సి ఉండటమేకాక, ఆరోగ్య సంబంధమైన జాగ్రత్తలతో ప్రజల రక్షణకు బాసటగా నిలవాల్సిన అవసరం వుంది. 2010 లో రాజధాని ఢిల్లీలో కామన్వెల్త్ క్రీడలకు వచ్చే క్రీడాకారులతో సమస్యలు రాగల అవకాశం వుంది. ప్రభుత్వం ముందు చూపుగా చర్యలు గైకోనేది. లేనిచో సమస్య జటిలమగును.


భారత్, పాక్ సరిహద్దులలో స్వల్పంగా కాల్పులు ఉందునేగానీ యుద్ధం రాదు. అయిననూ పాకిస్తాన్ నుంచి ఘర్షణ ఎక్కువగా ఉండును. బంగ్లాదేశ్, ఇరాన్, ఇరాక్,భారత్లలో కారుబామ్బులు అధికమగును. అమెరికా, బ్రిటన్ దేశాలపై రసాయన ఆయుధాలతో సరిక్రొత్త పోకడలతో గురిపెట్టు సూచన వుంది. పాలస్తీనాలో శాంతి మార్గం కరువగును. చైనాకు చెందినా ఓ మత ధర్మాచార్యుని పెత్తనం శ్రుతిమించుతుంది. భారత్ చైనాల మధ్య ఈ ధర్మాచార్యుతో వివాదాలు వచ్చి నష్టంవాటిల్లే సూచనుంది. నేపాల్లో మావోయిష్టు మారణకాండ శ్రుతిమించును.


శ్రీ విరోధిలో దక్షిణాయనం ప్రారంభమైన 7 వరోజునే సంపూర్ణ సూర్యగ్రహణం గోచరించగా, శ్రీ విక్రుతిలో ఆదివారం అమావాస్య సంపూర్ణ సూర్యగ్రహణం జరిగిన 7 వరోజునే దక్షిణాయనం ప్రారంభమవుతున్నది. విక్రుతిలో 2 సార్లు, ఒకే చాంద్రమాన మాసంలో పూర్ణిమ,అమావాస్యకు సంపూర్ణ సూర్యగ్రహణం - మార్గాశిరంలో పూర్ణిమకు సంపూర్ణ చంద్రగ్రహణం, అమావాస్యకు పాక్షిక సూర్యగ్రహణం జరగనున్నవి. ఈ నాల్గు గ్రహణాలు దనూ, మిధున రాశులలో సంభవించనున్నవి. మార్గాశిరంలో సంభవించనున్న పూర్ణిమ, అమావాస్య గ్రహణాలు రెండూనూ మంగళవారాలే వస్తూ, రెండూ గ్రహణాల మధ్యన ధనుస్సు రాశిలో కుజ, రాహువుల కలయిక జరుగుచూ, కన్యారాశి నుంచి ధనస్సువరకు 4 రాశులలో సప్తగ్రహ ఆచ్చాదన ఉండటంచే ప్రపంచ వ్యాప్తంగా ప్రకృతి వైపరీత్యాలకు హేతువగుచున్నది.


జూన్ 5 శనివారం నుంచి 12 శనివారం వరకు, జూన్ 22 మంగళవారం నుంచి 29 మంగళవారం వరకు, జూలై 6 మంగలవ్చారం నుంచి 13 మంగళవారం వరకు ప్రకృతి వైపరిత్యములు జరుగు అవకాశాములున్నవి. సముద్ర సంబంధ కంపనములు అధికముగా ఉండును. సముద్ర కెరటములు విపరీతముగా ఎగిసిపడే సూచనున్నందున, జాలర్లు, విహార యాత్రికులు సముద్ర చెంతకు వెళ్ళవద్దని సలహా ఇవ్వటమైనది.


27 జూలై 2010 మంగళవారం నుంచి 3 ఆగస్టు మంగళవారం వరకు 8 రోజులు ప్రపంచ ప్రజలు అప్రమత్తులై వుండాలి. వైమానిక సంబంధంగా, రాజకీయ సంబంధంగా, ప్రకృతి వైపరీత్యా సంబంధంగా, ఉగ్రవాద సంబంధంగా, సమస్య ఏదైననూ ప్రభుత్వాలు కట్టుదిట్టమైన ఏర్పాట్లలో ఉండాల్సిన అవసరముందని తెలియజేస్తున్నాను.


2010 నవంబర్ 10 నుంచి 20 వరకు పలుచోట్ల ప్రేలుడు పదార్ధాలను విస్పోటనాలకు ఉపయోగించగా, ప్రేలకుండా ఉన్నవాటిని కనుగొను సూచన. 2010 డిశెంబర్ 16 గురువారం నుంచి 23గురువారం వరకు ధనస్సులో రవి, బుధ, రాహు, కుజులు చాతుర్గః కూతమిచే తూర్పు ఆశియా, ఫసిఫిక్, యూరప్ మరియు భారత్ కు ఈశాన్య ప్రాంతాలలో భూ మరియు సముద్ర కంపనముల తీవ్రత వున్నది. 2010 జనవరి 3,4,5 తేదీలలో ధనస్సులో రాహు, కుజ, బుధ, చంద్రుల చాతుర్గ్రహ కూతమిచే ప్రకృతి వైపరిత్యములకు తావు కలదు. ప్రజలు భయపడవలసిన అవసరం లేదు.


నవమేఘ నిర్ణయానుసారం పుష్కర నామమేఘం మేరు పర్వతమునకు ఈశాన్య భాగంలో ఉద్భవించుటచే, ఈ సంవత్సరంలో 2 భాగములు వర్షము, 4 భాగములు గాలి ఉండును. సముద్రములపై 10 భాగముల వర్షము, పర్వతములపై 7 భాగముల వర్షము, భూమిపై కేవలం 2 భాగములే వర్షించును. అందుచేత ఆంధ్రరాష్టంలోని ప్రతి గ్రామ శివాలయాలలో ధూప, దీప, నైవేద్య, కర్పూర హారతులను, సక్రమముగా చేయులాగున ప్రతి ఒక్కరూ పాటుపడేది. అంతేకాక పుష్యమి, ఆశ్లేష, ఉత్తరాషాడ, శ్రవణం, ధనిష్ఠ, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రములు పూర్తిగా వున్న సమయములలోనే వరుణ సంబంధ జపములుగానీ, యాగములుగానీ చేయులాగున ప్రయత్నించేది. భూమిపై 2 భాగములే వర్షమున్నదని పంచాంగాలలో వుంటే వరుణయాగాలు చేస్తే వర్షం పెరుగుతుందా? అనే ఆలోచనలో ఎంతోమంది ఉండవచ్చు. ఆ 2 భాగాల వర్షమే... స్వల్ప, స్వల్పంగా సంవత్సరమంతా వర్షించకుండా... అన్నదాతకు అవసరమైన సమయంలోనే వర్షిస్తే .... చాలు. ఇందుకోసమే ఋతుధర్మానుసారం వర్షించాలనే విశ్వాసంతో వరుణ సంబంధ జపాలు, యాగాలను దక్షిణ సంబంధ ఫలాపేక్ష లేకుండా చేసేది.


ప్రజలందరూ యజ్ఞయాగాది శాంతి క్రతువులు ఆచరిస్తూ, ఎనలేని సంయనంతో, ఓర్పుతో, మానవతాదృష్టితో ఉండాలని భగవంతుని కోరుకుంటూ.. సర్వేజనా సుఖినోభవంతు సమస్త సన్మంగళాని భవంతు ... శ్రీనివాస గార్గేయ



Tuesday, March 16, 2010

శ్రీ వికృతి నామ సంవత్సర లఘు ఫలితాలు

శ్వేతవరాహకల్పము నందలి ఏడవదైన వైవస్వత మన్వంతరము నందలి 28వ మహా యుగములోని కలియుగ ప్రధమ పాదములో 5111 వది, ప్రభవాది 60 సంవత్సరములలో 24 దైన, ఈ సంవత్సరమునకు చాంద్రమానముచే " శ్రీ వికృతి " నామ సంవత్సరమని పేరు. త్వష్ట్ర ( విశ్వకర్మ ) దేవతాధీన పంచయుగాంతర్గత, ' ప్రజాపతి' దేవతాధీన 'అనువత్సర'మను నాల్గవదే శ్రీ వికృతి .

శ్లో : వికృతౌ ప్రకృతిర్యాతి వికృతిం వికృతి స్తథా
తథాపిమోదతేలోక శ్చాస్మి వికృతివత్సరే

శ్రీ వికృతి సంవత్సరంలో ప్రకృతి వికృతి అగును. వికృతి ప్రకృతి అగును. అయిననూ ప్రజలు సంతోషంతో వుండురని భావము. ఋతుధర్మాలకు వ్యతిరేకంగా స్థితిగతులు ఉండగలవని యోచించాలి. శ్రీ వికృతి సంవత్సరంలో రాజ్యాధిపత్యము, సేనాధిపత్యము, అర్ఘాదిపత్యము, మేఘాదిపత్యమను నాలుగు ఆదిపత్యములు కుజ గ్రహానికి రాగా, మంత్రిత్వము బుధ గ్రహానికి, దాన్యాదిపత్యము గురు గ్రహానికి, సస్య, నీరసాదిపత్యములు శుక్ర గ్రహానికి, రాసాదిపత్యము సూర్యునికి వచ్చి ఈ ఖగోళ రాజ్యాన్ని పాలించుటకు సంవత్సరాది నుండి కుజ, బుధ, గురు, శుక్ర, రావులు సంసిద్ధులగుచున్నారు. శని గ్రహం మరియు చంద్రులకు ఏఒక్క ఆధిపత్యము లభించలేదు.

గ్రహస్థితులను పరిశీలించగా అధిక వైశాఖ మాసముతో 384రోజులు జరిగే శ్రీ వికృతి సంవత్సరానికి రాజు కుజుడు. సంవత్సర ప్రారంభంలోనే నీచ సంచారంతో 72రోజులు, కార్తిక మాసం నుంచి అస్తమయ స్థితిలో 132రోజులు, కన్యా రాశిలో శత్రుగ్రహ శనితో సంఘర్షణ 43 రోజులు పోగా,రాజైన కుజునకు వికృతి సంవత్సర పరిపాలనకు అర్హత కలిగిన రోజులు కేవలం 137మాత్రమె. గణాంకాలు ఇలా వుంటే రాజ్యాదిపత్యం కైవసం చేసుకొన్న రోజు నుంచే శత్రుగ్రహ నక్షత్రమైన పుష్యమిలో కుజుడు ఉండి, సంవత్సరాంతంలో కూడా శత్రుగ్రహ నక్షత్రమైన ఉత్తరాభాద్రలో సంచారం చేయటం గమనార్హం.శత్రు నక్షత్రంలో నీచ స్థితిలో పదవిని అలంకరించి, మధ్యలో శత్రువుతోనే పోరాడి, అధిక కాలం అస్తమయదశలో శత్రు నక్షత్రంతోనే సంవత్సరం ముగియటం అనేది అరుదుగా జరిగే గ్రహస్థితి.

వికృతి సంవత్సర రాజు కుజుని పరిపాలనచే రాష్ట్రాల నడుమ, దేశాల నడుమ విరోధాలు అధికమగును. వింత రోగాలు ప్రబలి, అగ్నిభయములుండి, వ్యవసాయ రంగం తిరోగామనములో ఉంటూ ఉగ్రవాద చర్యలు మితిమీరుతూ అధిక ప్రాంతాలలో అనావృష్టి రాజ్యమేలుతూ, ఋతుధర్మ మార్పులతో ప్రజలకు అసౌకర్యముంటూ ప్రజలు భయపడే అవకాశం వుంది.

నిజ నేరస్తులు రాజాలుగా పల్లకిలో ఊరేగుదురు. హోంశాఖ ఉన్నతాధికారులు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేయుదురు. దేశ వ్యాప్త సచివాలయాలలో అవినీతిమయముతో లొసుగులు ఏర్పడి పాలకుల గుట్టురట్టగును. ప్రజల అవసరాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి సమన్వయపాత్ర పోషించే ప్రసార మాద్యమాలపై దాడులు జరిగే అవకాసం కలదు. ప్రభత్వ ప్రజాకర్షక పధకాలు సక్రమంగా ప్రజలకు అందనందున సరిక్రొత్త ప్రభువుల కొరకు ప్రజలందరూ వెంపర్లాడుతుండురు.

పాలకులు దైర్య సాహసాలతో పరిపాలన పరమైన నిర్ణయాలను తీసుకోనలేరు. రాజకీయ అస్తిరతలు యేర్పడును. పరిపాలనలో బుద్ధిబలమును ఉపయోగించిననూ శత్రువులను పాలకులు ఎడుర్కొనలేరు. దేశ వ్యాప్త రాజకీయాలలో స్త్రీలకు ఉగ్రవాదుల నుంచి ముప్పు వాటిల్లే అవకాశము వున్నది. భారీ వ్యాపార రంగములు అనుకోకుండా ఆటుపోటులను ఎదుర్కొనటంతో, దాని ప్రభావంతో కొన్ని రాష్ట్రాల భవితవ్యం బీటలువారును.

తరువాయి భాగం మరు పోస్టింగ్ లో

Monday, January 11, 2010

గురు కుజుల రెండవ షష్టాష్టక ప్రభావము

షష్టాష్టక చతుష్టయములో రెండవ షష్టాష్టకం గురుగ్రహము కుజగ్రహము మధ్య ఏర్పడినది. ఈ రెండు గ్రహాలూ -5 అక్టోబర్ 2009 నుంచి 20 డిశంబర్ 2009 వరకు, వాటి వాటి నీచ స్థానాల నుంచి ఎదురెదురు వీక్షణలు కల్గి వున్నాయి. ఇలా ఎదురెదురు వీక్షనలనే సమసప్తక స్థితి అంటారు. ప్రస్తుతం ఈ సమసప్తక స్థితి షష్టాష్టకస్థితి కానున్నది.

మేష వృశ్చిక రాశులకు, చిత్త, ధనిష్ఠ, మృగశిర నక్షత్రాల అధిపతి కుజుడు 2009 అక్టోబర్ 5 న తన నీచ స్థానమైన కర్కాటక రాశిలోనికి ప్రవేశించటం జరుగుతుంది. అలాగే ధనూ మీనా రాశులకు , పునర్వషు, విశాఖ, పూర్వాభాద్ర నక్షత్రాలకు అధిపతి గురువు 20 డిశంబర్ 2009 న కుంభ రాశిలోనికి ప్రవేశం జరుగుతుంది.

ఈ రెండవ షష్టాష్టకం కుజ గురుల మధ్య 156 రోజుల పాటు కొనసాగుచున్నది. ఈ 156 రోజులలో జంట గ్రహణాలు ఆయాస్థానాలకు వ్యయ ( 12 ) స్థానంలో రావటం విశేషం. డిశంబర్ 20 నుంచి షష్టాష్టకం ప్రారంభం కాగానే, డిశంబర్ 22 నుంచి మార్చి 9 వరకు వక్ర స్థితిలో కుజుడు ఉండటము, వక్ర ప్రారంభపు రోజు, వక్ర త్యాగమైన రోజు, రెండు కూడా మంగళవారాలే రావటము గమనించతగిన అంశము.

ఈ కుజ గురు షష్టాష్టక ప్రభావము మృగశిర, చిత్త, ధనిష్ఠ, పునర్వషు, విశాఖ, పూర్వాభాద్ర నక్షత్ర జాతకులపైననూ, ప్రస్తుతం కుజ మహర్దశ, గురు మహర్దశ జరిగే జాతకులపై ప్రభావం పరోక్షంగా ఉండుటకు అవకాశం వున్నది.

మృగశిర 1,2 పాదాల వృషభ రాశి జాతకులు సోదర సోదరి విషయాలపై శ్రద్ధ తీసుకోవాలి. భూ సంబంధ లావాదేవీలలో జాగ్రత్తలు వుండాలి. నిత్యం వున్న దినచర్యలో జాగ్రత్తగా మార్పులు చేసుకుంటూ వుండాలి. తొందరపాటు నిర్ణయాలు వద్దు.

మృగశిర 3,4 పాదాలు, పునర్వశు 1,2,3 పాదాల మిధున రాశి జాతకులు ఆర్ధిక లావాదేవీలు, కళత్ర విషయాలపై దృష్టి ఎక్కువగా ఉంచాలి. నేత్ర సంబంధ రుగ్మతలకు వకాశామున్నది. ఎదుటి వారితో సంభాషించే ముందు సంయమనం పాటించాలి. దుర్భాష మాట్లాడుట తగ్గించుకోవాలి. పితృ సంబంధ విషయాలపై ఆలోచనలను అధికం చేయండి.

పునర్వసు నక్షత్ర 4 వ పాద కర్కాటక రాశి జాతకులు వ్యక్తిగత విషయాలపై తొందరపడి నిర్ణయాలు తీసుకోనవద్దు. మీ వ్యక్తిగత విషయాలపై ఇతరులతో చర్చించవద్దు. ప్రాణ భయం వెంటాడే అవకాశం ఉండును. దిగులు చెందవద్దు.

చిత్త నక్షత్ర 1,2 పాదాల కన్యారాశి జాతకులు రుణ విషయాలలో ఆలోచనలకు పదును పెట్టాలి. శత్రు భయం పెరిగే అవకాశం వుంది. కొన్ని రుగ్మతలచే అనారోగ్య వ్యాప్తి నొందవచ్చు. దాచుకున్న డబ్బుకు గండం కలిగే అవకాశముంది. లాభ సంబంధ లావాదేవీలు నష్టాల బాటన నడిచే అవకాశముంది.

చిత్తా నక్షత్ర 3,4 పాదాలు, విశాఖ 1,2,3 పాదాల తులా రాశి జాతకులు సంతాన విషయాలలో ఆలోచనలను కట్టుదిట్టం చేయాలి. దినచర్యలో మార్పులను గమనించాలి. వ్యత్రేకంగా వుండే పరిస్థితులలో నిర్ణయాలు తీసుకోనవద్దు. విశాఖ నక్షత్ర 4 వ పాద వృశ్చిక రాశి జాతకులు వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వాహన, ఆరోగ్య విషయాలలో అధిక జాగ్రత్తలు తీసుకుంటూ, లాభ సంబంధ లావాదేవీలపై ఓ దృష్టి ఉంచుతూ మాతృమూర్తి విషయాన్ని కూడా ఆలోచిస్తూ శ్రద్ధ తీసుకోనాలి.పితృ నిర్ణయాలలో తొందరపాటు వద్దు.

ధనిష్టా నక్షత్ర 1,2 పాదాల మకర రాశి జాతకులకు ఆర్ధిక లావాదేవీలు, కళత్ర విషయాలపై దృష్టి ఎక్కువగా ఉంచాలి. నేత్ర సంబంధ రుగ్మతలకు అవకాశమున్నది. ఎదుటివారితో సంభాషించే ముందు సంయమనం పాటించాలి. దుర్భాష మాట్లాడుట తగ్గించాలి. కళత్ర విషయాలలో ప్రతికూలతలు ఉండగలవు, బేధాబిప్రాయములు ఉండగలవు. వ్యక్తిగత విషయాలపై తొందరపడి నిర్ణయాలు తీసుకోనవద్దు. మీ వ్యక్తిగత విషయాలపై ఇతరులతో చర్చించవద్దు. దాచుకున్న డబ్బుకు గండం కలిగే అవకాశముంది.
పూర్వాబాద్రా నక్షత్ర 4 వ పాద మీనా రాశి జాతకులకు సంతాన విషయాలలో ఆలోచనలు చేయాలి.ముఖ్య నిర్ణయాలు కట్టుదిట్టం చేయాలి. అనవసర ఖర్చు పెరిగే అవకాశం వుంది. పొదుపును పాటించండి. లోభత్వాన్ని అలవాటు చేసుకోండి.

ఈ షష్టాష్టక ప్రభావము వలన ఫలితాలు తెలుసుకోనటమే గాక, కొన్ని జాగ్రత్తలు తీసుకోనాల్సి వుంటుంది. గ్రహ సంబంధమైన శాంతి పరిహారములను కూడా ఆచరించేది. ఈ శాంతి పరిహారములు తగిన రీతిలో తగిన సమయములో మా ఓంకార మహాశక్తి పీఠంలో వేద క్రియల ద్వారా శాంతి పరిహారములు జరుపబడును. వేద క్రియలు జనవరి 25 తదుపరి మాత్రమే జరుపుకోనాలి. అలాంటి వివరాలు కూడా తదుపరి పోస్టింగ్ లలో చెప్పగలము.

Wednesday, January 6, 2010

కుజ రాహువుల మొదటి షష్టాష్టక ప్రభావము

2009 నవంబర్ 2 న ధనూరాశిలోకి రాహుప్రవేశం జరిగింది. దీనికి ముందు నుంచే 5 అక్టోబర్ 2009 న కుజగ్రహము తన నీచ స్థానమైన కర్కాటక రాశిలోనికి ప్రవేశించటం జరిగింది. నవంబర్ 2 నుంచి రాహు ధనూప్రవేశంతో కుజ రాహువుల మధ్య షష్టాష్టక స్థితి ఏర్పడినది. అంటే అంతకు ముందు 2009 ఆగస్టు 16 ఆదివారం నుంచి 5 అక్టోబర్ వరకు 51 రోజుల పాటు రాహు కుజుల షస్టాష్టక స్థితి ఏర్పడినది. ఈ సమయములోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఘోర ప్రమాదంలో మరణించటం, ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సంక్షోభం ఏర్పడటానికి 51 రోజుల షష్టాష్టక స్థితి ప్రధాన కారణమైంది.

కేవలం పై ఒక్క షష్టాష్టక స్థితి మాత్రమే గాక, దీనికితోడు 22 జూలై కర్కాటక రాశిలో జరిగిన సంపూర్ణ సూర్య గ్రహణం రాజశేఖరరెడ్డి జన్మ రాశి ధనస్సుకు, అష్టమ స్థానం కావటం కూడా గమనార్హం. ఈ విషంపై హైదరాబాద్ నుంచి మహా టీవీలో గ్రహణం పై చర్చ జరిగినప్పుడు, రాజశేఖరరెడ్డికి అష్టమ స్థానంలో ( ప్రాణ స్థానం ) గ్రహణం జరగనుంది. గనుక వాహన సంబంధంగా అనేక జాగ్రత్తలు తీసుకోనవలసి ఉంటుందని లైవ్ లో చెప్పటం జరిగింది.

ప్రస్తుతం షష్టాష్టక చతుష్టయంలో మొదటిదైన కుజ రాహువుల ప్రధమ షష్టాష్టకం 2009 నవంబర్ 2 నుంచి 2010 మే 26 వరకు 206 కొనసాగుతుంది. ఈ 206 రోజులలో జంట గ్రహణాలు రావటము జరిగినది. కర్కాటక రాశి కుజ గ్రహానికి నీచ స్థితి. ఈ కర్కాటకంలో కుజుడు డిసెంబర్ 22 నుంచి మార్చి 2 వరకు వక్ర స్థితిలో వుండటం విశేషం. వక్ర ప్రారంభపు రోజైన డిసెంబర్ 22, వక్ర త్యాగమైనా రోజు మార్చి 9 , రెండూను మంగళ వారాలే కావటం గమనించతగిన అంశం. కుజ రాహువుల షష్టాష్టక ప్రభావం వలన చిత్ర, ధనిష్ఠ, మృగశిర, ఆరుద్ర, స్వాతి, శతభిషం నక్షత్ర జాతకులపై పరోక్షంగా వుంటుంది. ఎందుచేతనంటే కుజగ్రహ నక్షత్రాలు చిత్ర, ధనిష్ఠ, మృగశిర. రాహు గ్రహ నక్షత్రాలు ఆరుద్ర, స్వాతి, శతభిషం. పై ఆరు నక్షత జాతకులే గాక, ప్రస్తుతం కుజ మహర్దశ, రాహు మహర్దశ జరిగే జాతకులపై ప్రభావం పరోక్షంగా వుంటుంది.

మృగశిర నక్షత 1,2 పాదాల వృషభ రాశి జాతకులు సోదర సోదరి విషయాలపై శ్రద్ధ తీసుకోనాలి. భూ సంబంధ లావాదేవీలలో జాగ్రత్తలు వుండాలి. ప్రాణ సంబంధ భయం వెంటాడే అవకాశం ఉండును.

మృగశిర నక్షత్ర 3,4 పాదాలు మరియు ఆరుద్రా నక్షత్ర జాతకులు ఆర్ధిక లావాదేవీలు, కళత్ర విషయాలపై దృష్టి ఎక్కువగా ఉంచాలి. నేత్ర సంబంధ రుగ్మతలకు అవకాశమున్నది. ఎదుటివారితో సంభాషించే ముందు సంయమనం పాటించాలి. దుర్భాష మాట్లాడుట తగ్గించాలి. కళత్ర విషయాలలో ప్రతికూలతలు ఉండగలవు, బెదాబిప్రాయములు ఉండగలవు.

చిత్ర నక్షత్ర 1,2 పాదాల కన్యా రాశి జాతకులు వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వాహన, ఆరోగ్య విషయాలలో అధిక జాగ్రత్తలు తీసుకుంటూ, లాభ సంబంధ లావాదేవీలపై ఓ దృష్టి ఉంచుతూ మాతృమూర్తి విషయాన్ని కూడా ఆలోచిస్తూ శ్రద్ధ తీసుకోనాలి. లాభ విషయాలలో పదే పదే ఆలోచనలు చేయాలి.

చిత్ర నక్షత్ర 3,4 పాదాలు, స్వాతి నక్షత్ర తులారాశి జాతకులు భూ లావాదేవీలలో జాగ్రత్తగా వుండాలి. భూమి కొనుగోలు అమ్మకాలలో కొంత సమయం ఆగాల్సి వుంటుంది. సోదర, సోదరిలతో తొందరపాటు వద్దు. మీ దినచర్యలో అనుకోకుండా అవాంతరాలు ఏర్పడటానికి అవకాశాలు వుంటాయి. మనసును అదుపులో వుంచుకొని గుండె దిటవు చేసుకోవాలి. తోదరపాటు నిర్ణయాలు వద్దు.

ధనిష్టా నక్షత్ర 1,2 పాదాల మకర రాశి జాతకులు దాంపత్య విషయాలలో తొందరపాటు చర్యలు వద్దు. ప్రేమికుల మధ్య అభిప్రాయ బేధాలు ఉండగలవు. అనవసర ఖర్చు పెరిగే అవకాశం వుంది. వివాహ నిర్ణయ విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి. కళత్ర వర్గం ద్వారా సమస్యలు జటిలమయ్యే అవకాశాలున్నవి.

ధనిష్టా నక్షత్ర 3,4 పాదాలు, శతభిషా నక్షత్ర కుంభ రాశి జాతకులు ఋణ విషయాలలో ఆలోచనలకు పదును పెట్టాలి. శత్రు భయం పెరిగే అవకాశం వుంది. కొన్ని రుగ్మతలచే అనారోగ్య వ్యాప్తి నొందవచ్చు. దాచుకున్న డబ్బుకు గండం కలిగే అవకాశముంది. లాభ సంబంధ లావాదేవీలు నష్టాల బాటన నడిచే అవకాశముంది.

మృగశిర, ధనిష్ఠ, చిత్ర నక్షత్ర జాతకులకు రెండవ షష్టాష్టకమైన గురు కుజుల వలన కూడా సమస్యలు రాగల సూచనలున్నవి. గనుక గురు కుజుల రెండవ షష్టాష్టక ప్రభావము అని మరో శీర్షిక త్వరలో పోస్టింగ్ కానున్నది. అంచేత దానిలోని ఫలితాలు కూడా చదవగలరు.

ఈ షష్టాష్టక ప్రభావము వలన ఫలితాలు తెలుసుకోనటమే గాక, కొన్ని జాగ్రత్తలు తీసుకోనాల్సి వుంటుంది. గ్రహ సంబంధమైన శాంతి పరిహారములను కూడా ఆచరించేది. ఈ శాంతి పరిహారములు తగిన రీతిలో తగిన సమయములో మా ఓంకార మహాశక్తి పీఠంలో వేద క్రియల ద్వారా శాంతి పరిహారములు జరుపబడును. వేద క్రియలు జనవరి 25 తదుపరి మాత్రమే జరుపుకోనాలి. అలాంటి వివరాలు కూడా తదుపరి పోస్టింగ్ లలో చెప్పగలము.

Monday, January 4, 2010

సప్త అమాసంక్రాంతుల మాలిక

ప్రతినెలా ఓ అమావాస్య వస్తుంటుంది. అలాగే ప్రతినెలా ఓ సంక్రమణం జరుగుతూ వుంటుంది. సంక్రమణం అంటే సూర్యుడు ఒక రాశిలోకి ప్రవేశించటం. దీనినే సంక్రాంతి అని కూడా పిలుస్తారు. మకర రాశిలోనికి సూర్య ప్రవేశాన్ని మకర సంక్రమణం లేక మకర సంక్రాంతి అంటాము. మరి ఈ సంక్రమణం ఏదో ఒక తిధి లో జరుగుతూ వుంటుంది.

మరి సంక్రమణం అమావాశ్య తిధిలో జరిగితే ఎలా వుంటుంది ? ఒకసారి కాదు, రెండుసార్లు కాదు. వరుసగా ఏడు నెలలపాటు అమావాశ్య తిదిలోనే రవి రాశిప్రవేశాలు చేయటం జరిగినది. మరి ఇలా ఏడు సార్లు రాశిప్రవేశాలు అమావాస్యన జరిగితే అరిష్టమా? అదృష్టమా?

వివరాలలోకి వెళితే గత 2009 సంవత్సరంలో ఆశ్వీయుజ అమావాశ్య శనివారం తే 17.10.2009 దిన దీపావళి పర్వదినం జరుపుకున్నాము. ఆరోజే రవి తన నీచ స్థానమైన తులారాశిలోకి సంక్రమించాడు. దీనిని తులా సంక్రాంతి అంటారు. అమావాస్య తిధిలో సంక్రమణం జరిగిన మాలికలో ఇది మొదటిది.

తదుపరి కార్తిక అమావాశ్య సోమవారం తే 16.11.2009 దిన రవి వృశ్చిక రాశిలోనికి సంక్రమించాడు. దీనిని వృశ్చిక సంక్రాంతి అంటారు. దీనిని రెండవ అమాసంక్రాంతి దినముగా పరిగణించాలి. ఆ తరువాత మూడవదైన మార్గశిర అమావాస్య తే 15.12.2009 దిన మంగళవారం రాత్రి రవి ధనస్సులోనికి ప్రవేశించుటచే ధనుర్మాసం ఏర్పడినది. ఈ ధనుర్మాసం కూడా అమావాశ్య తిధిలో వచ్చినది. దీనినే ధనుస్సంక్రాంతి అంటారు. ఇక నాల్గవదైన పుష్య అమావాస్య తే 14.01.2010 గురువారం మకరరాశిలోకి రవి సంక్రమణం చెందాడు. దీనితో మకర సంక్రమణ ఉత్తరాయణ పుణ్య కాలం ప్రారంభమైనట్లు. ఇది కూడా అమావాస్య తిదిలోనే జరిగినది.

పిదప రాబోవు ఫిబ్రవరిలో మాఘ అమావాస్య తే 13.2.2010 ది రోజున కుంభ సంక్రాంతి జరుపుకొనబోతున్నాము. ఇది 5 వ అమావాస్య తో కూడిన సంక్రాంతి అన్నమాట. ఆ తదుపరి తే 15.3.2010 దిన పాల్గుణ అమావాస్య రోజున మీనా సంక్రాంతి జరుపుకోవాలి. ఇది ఆరవ అమావాస్య తిదితో కూడిన సంక్రాంతి. ఇక మాలికలో చివరిదైన ఎదవా అమావాస్య. స్వస్తిశ్రీ వికృతి సంవత్సర చైత్ర అమావాస్య తే 14.4.2010 రానుంది. ఆరోజే మేష సంక్రమణం జరుగుచూ మహా కుంభ మేలా హరిద్వార్ లో జరగనున్నది.

వరుసగా ఏడు అమావాస్య తిధులలో సంక్రమణాలు జరగాతము మహా అరుదుగా వచ్చీ ఘట్టం. ఇంత అరుదుగా వచ్చే ఘట్టానికి మధ్య బిందువు అంటే 4 వ అమావాస్య తిధిలో సంక్రమణం. మకర సంక్రమణం జరిగిన ఈ పుష్య అమావాశ్య తిధిలో కనకన సూర్య గ్రహణం జరగటం అత్యంత అరుదైన మహోన్నత ఘట్టం.

ఇక ఈ జనవరి 15 కనుమ పండుగ రోజున మకర సంక్రమణం వచ్చిన అమావాస్య, దానికి తోడు గ్రహణం జరగనున్నవి. అమావాశ్య తిధిలో పితృదేవతలకు తర్పణాదులు ఇస్తాము. దీనికి సంక్రమణం కలిసి, గ్రహణం కలిస్తే, ఎంతటి అదృష్టమో ఆలోచించండి. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇదే రోజు మహా కుంభ మేలా రెండవ పవిత్ర స్నానం కావటం మహద్భాగ్యం. మహాద్భాగ్యమైన మహోన్నత రోజున పితృదేవతలకు పిండ ప్రదానాదులను, తర్పణాదులను ఇవ్వాల్సి వుంటుంది. అవకాశం వున్నవారు సముద్రస్నానం ఆచరించవచ్చు. మకర రాశిలో జరిగే గ్రహణం ఒక అరిష్ట యోగంలో భాగామైనప్పటికీ, దాని ప్రభావం గూర్చి ప్రస్తుతం మనం ఆలోచించటం లేదు. గ్రహణం జరిగే రోజును మహా పవిత్రదినంగా హైందవ జాతి అంతా కొనియాడి తీరాలి.

మహా కుంభ మేళా పవిత్రస్నాన వివరాలు :

శ్రీ విరోధి నామ సంవత్సరంలో గురు గ్రహము 19 డిశంబర్ 2009 రాత్రి 1 గం. 08 ని.లకు కుంభరాశి ప్రవేశం చేయును. అలాగే శ్రీ సూర్య భగవానుడు రాబోవు వికృతి నామ సంవత్సరంలో 14 ఏప్రిల్ 2010 న మేష రాశిలోకి ప్రవేశించును. ఈ కారణంగా హరిద్వార్ లోని గంగానదిలో పవిత్ర స్నానాలతో మహా కుంభ మేళా జరుగును.

ఈ పవిత్ర స్నానాలకు దేశ విదేశాల నుంచి యోగిణులు, యోగులు, సాధువులు, ఇతరులు, కలిసి దాదాపు 60 మిలియన్ల మంది స్నానమాచారిన్చేదారు. ఈ పరంపరలో 2010లో జనవరి 14 మకర సంక్రాంతి రోజున ప్రధమ పవిత్ర సంక్రమణ స్నానముండును. ఈరోజే పుష్య అమావాశ్య పవిత్ర స్నానం కూడా. (స్నానానికి అమావాశ్య నిశీధిలో వుండాలి. ) జనవరి 15 సంపూర్ణ సూర్య గ్రహణం రోజున ద్వితీయ పవిత్ర స్నానముండును. జనవరి 20 వసంత పంచమి రోజున తృతీయ పవిత్ర స్నానముండును. జనవరి 30 మాఘ పూర్ణిమ రోజున చతుర్ధ పవిత్ర స్నానముండును. ఫిబ్రవరి 12 మహా శివరాత్రి రోజున పంచమ పవిత్ర స్నానముండును. ఫిబ్రవరి 13 మాఘ అమావాశ్య రోజున షష్టమ పవిత్ర స్నానముండును. ఏప్రిల్ 14 మేష సంక్రమణం రోజున చిట్టచివరిదైన మహా కుంభ మేలా పవిత్ర సంక్రమణ స్నానంతో హరిద్వార్ మహా కుంభ మేళా ముగియును.