Sunday, March 25, 2012

మార్చి 26 రాత్రి వినువీధిలో గురు, శుక్ర, చంద్రులతో సపర్షిమండలావిష్కరణ

2012  మార్చ్ 23 శుక్రవారం నాడు శ్రీ నందన నామ సంవత్సరం ప్రారంభమైంది. ఈ నందనకు రాజు శుక్రుడు. అలాగే శ్రీ నందన సంవత్సరానికి భాను దేవత అధిపతి. ఈ దేవత సింహ వాహనంపై కూర్చొని 5 శిరస్సులు పది భుజములతో దేదీప్యమైన వెలుగుతో ఉంటుంది. అలాగే శుక్రుడు రాజు, మరియు మంత్రి కావటం విశేషం. ఈ శుక్రుడు వినువీధిలో 5 కోణాలతో ఉన్న మండలానికి అధిపతి (పంచ కోణాకార మండలాధీశుడు ). భాను దేవతకు ఉన్న 5 శిరస్సులను శుక్ర మండలానికి ఉన్న 5 కోణాలుగా అన్వయించుకొంటే అత్యంత అరుదుగా రాజు మరియు మంత్రితో శ్రీ నందన ఉగాది రావటం, నాల్గవ రోజునే గణేశ దమనపూజ పర్వదినాన, శుక్ర నక్షత్రమైన భరణిలోనే చంద్రుడు ఉండటం, పైగా ఈ చంద్రుడు శ్రీ నందన రాజైన శుక్రుడు, గురువుతో కలసిన సప్తర్షిమండలం ఏర్పడటం వందలాది సంవత్సరాల తర్వాత వస్తున్న అపూర్వ ఘట్టం.

కనుక 26 మార్చ్ సోమవారం నాడు సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత ఆకాశంలో పడమర దిశలో, దిగువన శ్రీ నందన సేనాధిపతి గురు గ్రహము, దానికి ఎగువన మహా కాంతితో శ్రీ నందన రాజు శుక్రుడు, శుక్రునకి స్వల్ప ఎగువగా చవితి చంద్రుడు దర్శనమిస్తారు. ఈ మూడు గ్రహాలను కలపగా వచ్చిన ఆకారమే సప్తర్షిమండలంగా భావించాలి. ఈ కలియుగము నాల్గు లక్షల ముఫై రెండు వేల సంవత్సరాలు. ప్రస్తుతం శ్వేతవరాహ కల్పములో, వైవస్వత మన్వంతరము జరుగుచున్నది. మొత్తం మన్వంతరాలు 14 . ఇందులో 7 వ దిన వైవస్వత మన్వంతరానికి ఋషులే సప్తర్షులు.

 1. వసిష్ట 2. అత్రి 3. గౌతమ 4. కశ్యప 5. భరద్వాజ 6. జమదగ్ని 7. విశ్వామిత్రుడు 

పైన పేర్కొన్న సప్తర్షులను మనసులో తలచుకుంటూ సోమవారం నాటి రాత్రి కనపడే 3 గ్రహాలను దర్శిస్తూ, ఆ 3 గ్రహాలలో ఈ సప్తర్షులున్నారని భావిస్తూ, ఈ దిగువ తెల్పిన లలితాసహస్ర నామాలలోని 77 వ నామాన్ని వీలైనన్ని సార్లు భక్తితో చదువుకోండి.
 

ఓం శ్రీ కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీగణేశ్వరాయై నమః  
 

లేదా ఎవరికీ వారు వారి వారి ఇష్ట దైవాలను ప్రార్దించుకోండి. ఈ సమయంలో గృహంలోని పూజా మందిరంలో మీ ఇష్ట దైవానికి రెండు వైపులా దీపారాధనలను చేయండి. ఒక ప్రమిదలో మధ్యలో ఒక కుంభవత్తి, రెండు వాలు వత్తులను వేసి వెలిగించండి. రెండవ వైపున మరో ప్రమిదలో మధ్యలో ఒక కుంభవత్తి, రెండు వాలు వత్తులను వేసి వెలిగించండి. ఏనూనెతో అయినను వెలిగించండి. భక్తి , విశ్వాసము ముఖ్యము. ఉపవాసములు లేవు. సాయంత్రం చీకటి పడిన తర్వాత, 3 గ్రహాలూ కనపడుతున్నాయని తెలుసుకొని లేక చూసి ఆపై భక్తితో విశ్వాసంతో, పూజ మందిరంలో దీపారాధన చేసి, ఆ అగ్ని దేవునకు భక్తి తో నమస్కరించి, ఆపై బయటకు వచ్చి పశ్చిమదిశలో కనపడే 3 గ్రహాలను ఒకసారి దర్శించుకొని, అందులో మీ ఇష్ట దైవాలను ధ్యానించుకోండి. లేదా శ్రీ లలితా దేవిని ధ్యానించుకుంటూ  ఈ నామాలను గ్రహాలను దర్శిస్తూ కనీసం 7 పర్యాయాలు  పఠి౦చి ఆపై లోనికి వెళ్లి, మీ పూజ మందిరంలో కూడా 7 సార్లు  పఠి౦చి మీకు తోచిన నైవేద్యాన్ని నివేదించండి.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.