Monday, September 7, 2015

మూల నక్షత్రంలో వర వర్షిని 3, 4

ఈ భూమి మీద ఏ వస్తువు కైనా చలనం కావాలంటే శక్తి అంటూ అవసరం. సకలమైన జీవరాశులకు ఇట్టి శక్తిని సూర్య భగవానుడే ప్రత్యక్షంగాను, పరోక్షంగాను అందిస్తున్నాడు. ఈ సమస్త ప్రకృతి అంటా శక్తిమయమే. పంచభూతాలైనటువంటి భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం... ఇవన్నీ వివిధ శక్తి స్వరూపాలే.

ఓ చిన్న విత్తనం భూమిలోనుంచి మొలకెత్తాలంటే దానికి పృథ్వి శక్తి అవసరము. జల శక్తిని తోడుగా చేసుకొని భూమిలోనుంచి మొలకెత్తుతుంది. ఆపైన రెపరెపలాడాలంటే వాయు శక్తి అవసరం. తదుపరి నుంచి మొక్క ఎదుగుదలకు తోడ్పడేది అగ్ని, ఆకాశములు. అంటే సూర్యరశ్మి మరియు ఆకాశ తత్వము. అదే విధంగానే ఈ మనుడికి కూడా అద్భుతమైన మేధాశక్తి ఉన్నప్పటికీ అది సక్రమంగా పని చేయాలంటే... తన శరీరంలో ఉన్న శక్తి కేంద్రాలన్నీ సహకారం అందించాలి. అందుకే మానవ శరీరంలో కొన్ని సున్నితమైన కేంద్రాలు ఉన్నాయి. శరీరములోని ఈ కేంద్రాలన్నీ ఉత్తేజితమైతే, శరీరంలో అవిరామంగా మహా శక్తి ఉత్పన్నమవుతుందని పతంజలి మహర్షే యోగ సూత్రాలలో తెలియచేశాడు.

అదే విషయాన్ని శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలో మానవ శక్తి కేంద్రాలైన షట్చక్రాల రూపంలో, మానవ శరీరంలో ఆవరించి ఉన్న పరాశక్తి  స్వరూపాన్నే అనేక శ్లోకాలలో స్తుతించటం జరిగింది. ఈ ఆరు చక్రాలకు మహా సామ్రాజ్ఞిగా పరిపాలించే ఏడవ చక్రమే సహస్రారము. కనుక మన శరీరంలో మూలాధార చక్రము, స్వాధిష్టాన చక్రము, మణిపూర చక్రము, అనాహత చక్రము, విశుద్ధ చక్రము, ఆజ్ఞా చక్రము, సహస్రార చక్రము ఉంటాయి. ఈ చక్రాలు భౌతికంగా మానవ శరీరంలో అనేక జీవ ప్రక్రియలను నిర్దేశిస్తాయి. శరీరంలోని పలు అవయవాల విధులను ఈ షట్చక్రాలు నియంత్రిస్తుంటాయి.

ఈ పరంపరలో ప్రతి శక్తి కేంద్రము మెదడులోని ప్రత్యేక అవయవాలకు సంబంధించిన భాగాలతో అనుసంధానం గావించబడుతుంది. ఈ విధంగా ప్రతి చక్రంలో స్రవాలు ద్రవిస్తుంటాయి. కొందరికి సక్రమంగాను, ఇంకొందరికి అధికంగాను, మరికొందరికి అల్పంగాను ద్రవిస్తుంటాయి. ఈ స్రవించే ద్రవాల క్రమ పద్ధతి ద్వారా ఆరోగ్యకర వాతావరణం కనపడుతుంది. అల్పంగా స్రవించినందున పరిస్థితులు అనుకూలంగా ఉండవు. అలాగే అధికంగా ద్రవాలు స్రవించినందున విపరీత వ్యతిరేకంగా ఫలితాలు వస్తుంటాయి. కనుక మనలో ఉన్న సమస్యలను తెలుసుకుంటూ, అవి ఏ శక్తి కేంద్రానికి సంబంధించినవో గమనిస్తూ, ఆ శక్తి కేంద్రాన్ని సక్రమమైన రీతిలో ఉత్తేజం చేయగల్గినప్పుడు విశేషమైన వస్తుంటాయి. కనుకనే ఆ శక్తి కేంద్రాల కథా కమామీషుతో పాటు, మానవ జీవనక్రమంలో సరియైన సమయంలో ఎలాంటి ఆహారాలను దైవీ, దేవతలకు నివేదించి, ఆ ప్రసాదాన్ని మనం స్వీకరించాలో చెప్పే ఓ చిన్ని ప్రయత్నమే ఈ దిగువ ఉన్న వీడియోలు.

కనుక లలితా సహస్రనామ స్తోత్రంలో ఈ చక్రాలకు సంబంధించిన దేవతలకు ఏ నివేదన అందించాలి స్పష్టంగా ఉంది. ఈ చక్రాల ఆదిస్థాన గ్రహ వారాలలో... ఆ నివేదించిన ప్రసాదాలను మనం స్వీకరిస్తే పరోక్షంగా విశేష లబ్ధి కల్గుతుంది. అంతే కాదు ఒక్కో నక్షత్రం రోజున ఎలాంటి ఆహారం తీసుకోవాలి... నక్షత్ర  అధిపతి, వారాధిపతి, ఆనాడు ఏర్పడిన తిథిని బట్టి మానవాళి ఆస్వాదించాల్సిన ఆహార విహార వివరాలను పురాతన జ్యోతిష శాస్త్రం స్పష్టం చేసింది. కనుక రాబోయే రోజులలో తిథి, నక్షత్ర, వారాలతో పాటు భుజించవలసిన వివరాలను తెలుసుకుంటే రుగ్మతలకు దూరంగా ఉండటమే కాకుండా, ఉపయుక్తమైన విజ్ఞాన పరంపరను పొందగలమని చెప్పుటలో అతిశయోక్తి ఎంత మాత్రము లేదు. - శ్రీనివాస గార్గేయ 




No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.