Monday, January 4, 2010

ఆంధ్రప్రదేశ్ పై జన్మశని ప్రభావం

1 నవంబర్ 1956 దుర్ముఖి నామ సంవత్సరం ఆశ్వీయుజ బ. చతుర్దశి రోజున చిత్రా నక్షత్రంలో ఆంధ్రప్రదేశ్ అవతరణ జరిగినది. ఆంధ్రప్రదేశ్ జన్మ నక్షత్రం చిత్రానక్షత్రం కన్యా రాశి. 2007 జూలై నుంచి ఏలినాటి శని జరుగుచూ 2014 నవంబర్ తో ముగియనుంది. ఈ ఏలినాటి శని మూడు భాగాలు మొదటి భాగాన్ని ద్వాదశ శని లేక వ్యయ శని అంటారు. ఇది 2009 ఆగస్టు చివరితో ముగుసిపోయింది. 2009 సెప్టెంబర్ నుంచి 2012 ఆగస్టు వరకు జన్మ శని భాగం జరుగుతున్నది. మూడవ భాగ శని సెప్టెంబర్ 2012 నుంచి నవంబర్ 2014 వరకు జరుగును.

ప్రస్తుతం ఏలినాటి శని రెండవ భాగం జరుగుచున్న ఈ రోజులలో తెలంగాణా ఉద్యమం అధికమైంది. ప్రజలలో ప్రస్తుతం ఒక వినికిడి వుంది. అది ఏమంటే... రాజశేఖరరెడ్డి బ్రతికుంటే...... కే.సి.ఆర్ ఇలా విజృంభించే వాడు కాదని. కానీ జ్యోతిష్యపరంగా వారి ఆలోచన మాత్రం తప్పు. ఎందుచేతనంటే... కే.సి.ఆర్ ఆశ్లేష నక్షత్ర కర్కాటక రాశి జాతకుడు. వారికి 2002 జూన్ నుంచి 2009 ఆగస్టు వరకు ఏలినాటిశని భాగం జరిగింది. మూడు భాగాల శని పూర్తి చేసుకొని కే.సి.ఆర్ దేనికైనా సిద్ధంగా వున్నాడు.

కే.సి.ఆర్ కు ఏలినాటిశని పూర్తి అయిన ఘడియ నుంచే ఆంధ్రప్రదేశ్ జన్మశని భాగం మొదలైంది. అందుచేతనే ... సెప్టెంబర్ లో ముఖ్యమంత్రిని కోల్పోవటం, తరువాత జరిగిన వరుస పరిణామాలను చూస్తూనే ఉన్నాము.

ఇక్కడ ఒక విషయం గమనించాలి. కే.సి.ఆర్ కు జన్మ రాశిలోనికి కుజుడు 5 అక్టోబర్ నుంచి ప్రవేశించి 2010 మే 26 వరకు 234 రోజులు స్తంభించటం జరిగినది. అందుచేత కే.సి.ఆర్ కు లగ్నంలో నీచ కుజ స్తంభన ఉండటంచే ప్రత్యేక తెలంగాణా కోసం, గతం కంటే ఇంకా హడావిడి చేయటం జరుగుచున్నది. మే 26 తదుపరి కుజుడు కే.సి.ఆర్ కు వాక్ స్థానంలోకి ప్రవేశించి జూలై 20 వరకు ఉంటాడు. గనుక 5 అక్టోబర్ 2009 నుంచి 20 జూలై 2010 వరకు కే.సి.ఆర్ విజృంభణతో రాష్ట్రంలో శాంతి భద్రతలు మరికొంత దెబ్బతినే అవకాశముంది.

ప్రస్తుతం ఒక విషయం గమనించాలి. ఆంధ్రప్రదేశ్ జన్మ నక్షత్రం చిత్ర. చిత్రా నక్షత్రానికి అధిపతి కుజుడు. జరిగేది జన్మ శని. పైగా ఈ సంవత్సరం లో 20 జూలై నుంచి 31 ఆగస్టు వరకు ఆంధ్రప్రదేశ్ జన్మ రాశి కన్యలో కుజగ్రహం, శనిగ్రహం కలయికలు జరుగుచున్నవి. అందువలన శాంతిభద్రతలు ఇంకా విషమించే అవకాశం వున్నది.

దీనికితోడు చిదంబరం గారు డిశంబర్ 9 తేదీన మొదటి స్టేట్మెంట్ ఇచ్చారు. కుజ సంఖ్య అయిన తొమ్మిదవ తేదీన, తొమ్మిదవ తిది అయిన నవమిలో రాత్రి సమయములో స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ సమయములో వున్న గ్రహస్థితి ఎవరికీ అనుకూలం కానేకాదు. ఇక రేపటి రోజున 5 జనవరి మంగళవారం రోజున డిల్లీలో ఎనిమిది రాజకీయ పార్టీలతో చర్చలకు ఆహ్వానించారు. రేపటి రోజు కుజవారం. 8 సంఖ్య శనికి సంబంధం. శని కుజులు పరస్పర శత్రువులు. రేపటి నక్షత్రం ఆంధ్రప్రదేశ్ జన్మ నక్షత్రమైన చిత్రకు నైధనతార ( ప్రమాద తార ) అవుతున్నది. దీనినిబట్టి రేపటి చర్చలు పూర్తిగా విఫలమై, శాంతిభద్రతలు ఘోరంగా దెబ్బతిననున్నవి. దీనికి తోడు జనవరి 1 నుంచి జనవరి 15 వరకు గ్రహ సంచారరీత్యా రవాణా రాకపోకలకు పూర్తి అంతరాయాలుంటాయి. ఆంధ్రప్రదేశ్లోనే కాక దేశవ్యాప్తంగా విమాన సర్వీసులు కూడా మంచు కారణంచే ఆగిపోతున్నవి.

రాజశేఖరరెడ్డి గారు మరణించకుండా ఉన్నప్పటికీ, ఆంధ్రప్రదేశ్ యొక్క పరిస్థితి ఇలానే కొనసాగుతుంటుంది. కే.సి.ఆర్ గారికి ప్రస్తుతం అష్టమ స్థానంలో గురువు సంచారం చేస్తూ, కుజునిచే అష్టమ వీక్షణ ఉన్నందున ఆరోగ్య విషయాలపై కే.సి.ఆర్ దృష్టి ఉంచాల్సిన అవసరం వుంది.

ఆంధ్రప్రదేశ్ కు జన్మషని ప్రభావం 2009 సెప్టంబర్ నుంచి 2012 ఆగస్టు వరకు కొనసాగుతుంది. గనుక పైసమయంలో ప్రజలందరూ సంయమనం పాటిస్తూ, భగవతారాధనకు అధిక సమయం కేటాయించాలి.

Saturday, January 2, 2010

ఖగోళంలో షష్టాష్టక చతుష్టయం

వందల సంవత్సరాల తరువాత ఏర్పడే ఖగోళ గ్రహస్థితే షష్టాష్టక చతుష్టయము. అరిష్ట యోగములతో ఈ షష్టాష్టకం ద్వాదశ రాశులపై ప్రభావము చూపుతున్నది. గ్రహ సంబంధ షష్టాష్టకములు మూడు, గ్రహణ షష్టాష్టకము ఒకటి కలిసి మొత్తం నాలుగు షష్టాష్టక స్థితులు ఏర్పడినవి.

1. 2009 నవంబర్ 2సోమవారం నాడు రాహువు ధనుస్సు రాశి ప్రవేశం చేయడంతో, కర్కాటక రాశిలో నీచ స్థితి లో ఉన్న కుజ గ్రహంతో షష్టాష్టకము ఏర్పడినది. అంటే కర్కాటక కుజునికి ఆరవ స్థానమైన ధనస్సులో రహువుండటము, రాహువుకు ఎనిమిదవ స్థానమైన కర్కాటకంలో కుజుడుండటము మొదటి షష్టాష్టక గ్రహస్థితిగా పేర్కొనాలి.

2. 2009 డిశంబర్ 20ఆదివారం నాడు గురుగ్రహము కుంభరాశి ప్రవేశము చేయటంతో, కన్యా రాశి లో ఉన్న శని గ్రహంతో, షష్టాష్టకము ఏర్పడినది. అంటే కన్యా రాశిలోని శని గ్రహానికి ఆరవ స్థానమైన కుంభ రాశిలో గురువుండటము, కుంభ రాశికి ఎనిమిదవ స్థానమైన కన్యలో శని సంచారం చేయటము రెండవ షష్టాష్టకము.

3. 2009 డిసంబర్ 20ఆదివారం నుంచే గురుగ్రహం, కుజ గ్రహం మధ్య షష్టాష్టకము ఏర్పడినది. ఏవిధంగానంటే, కుంభ రాశిలోని గురుగ్రహానికి ఆరవ రాశియైన కర్కాటకలోని కుజుడు, అలాగే కుజ గ్రహానికి ఎనిమిదవ రాశిలో గురుగ్రహం ఉండటము మూడవ షష్టాష్టక గ్రహస్థితి.

ఇంతవరకు గ్రహాల సంచారంలో మూడు షష్టాష్టకములు ఏర్పడ్డాయి. గ్రహాలు కాక గ్రహణాలలో కూడా మరో షష్టాష్టకం ఏర్పడనున్నది.....ఎప్పుడు ? ఎక్కడ ?

4. మిధున రాశిలో భారత కాల మాన తేది ప్రకారం 2010జనవరి 1న పుష్య పూర్ణిమన ఆరుద్రా నక్షత్రంలో పాక్షిక చంద్ర గ్రహణం ఏర్పడినది. జనవరి 15పుష్య అమావాస్య రోజున మకర రాశిలో ఉత్తరాషాడ నక్షత్రంలో కంకణ సూర్య గ్రహణం ఏర్పడనుంది. మకర రాశికి మిధున రాశి ఆరవ రాశి. మిధున రాశికి మకర రాశి అష్టమ రాశి. అనగా షష్టాష్టక రాశులలో గ్రహణాలు ఏర్పడుతున్నాయి. ఇది నాల్గవ షష్టాష్టకం.

జనవరి 15తో నాల్గవ షష్టాష్టక అవయోగం ప్రారంభం కానున్నది. దీని ప్రభావం దాదాపు నాలుగు మాసాలు కొనసాగుతుంది. కానీ గ్రహాల నడుమ ఏర్పడిన షష్టాష్టకములు 25 మే 2010 వరకు కొనసాగుతుంది.
దాదాపు నాలుగు నెలలకు పైగా వుండే షష్టాష్టక చతుష్టయ ప్రభావములు ఎలా వుంటాయి అనే ఆసక్తికర వివరాలు తదుపరి పోస్టింగ్ లో తెలుసుకుందాం.... శ్రీనివాస గార్గేయ

Thursday, December 31, 2009

12 దశాబ్దాల తదుపరి జనవరి 1న గ్రహణం


1889 జనవరి 1 వ తేదీన సంపూర్ణ సూర్య గ్రహణం సంభవించింది. అప్పటినుంచి ఇప్పటివరకు జనవరి 1 న సూర్య చంద్ర గ్రహణాలు ఏమీ రాలేదు. 121 సంవత్సరాల తదుపరి 1.1.2010 న ఖగోళంలో పాక్షిక చంద్ర గ్రహణం సంభవిస్తున్నది. ఈ గ్రహణం మిధున రాశిలో ఆరుద్రా నక్షత్రంలో కేతుగ్రస్తంగా భారతకాలమాన ప్రకారం 1 వ తేదీ సూర్యోదయానికి పూర్వం (31 వ తేదీ అర్ధరాత్రి ) 12 గంటల 23 నిమిషముల నుంచి 1 గంట 23 నిమిషముల వరకు 60 నిముషాల పాటు పాక్షికంగా చంద్రుడికి గ్రహణం ఆపాదించును. చంద్రుడు గ్రహణానికి ముందు 45 నిముషాల నుంచి ప్రచ్చాయలో ఉన్నందున తేజోవంతమైన కాంతి తగ్గును. 12.23 నుంచి గ్రహణస్పర్శతో మొదలై 1 గంట 23 నిముషాలకు గ్రహణం పూర్తగును. తిరిగి తేజోవంతమైన కాంతి పుంజుకొనుటకు మరో .40నిముషాల కాలము పట్టును. కనుక గర్భవతులు రాత్రి 11.30 నుంచి 2 గంటల వరకు దాదాపుగా 150 నిముషాలసేపు చంద్రుని కాంతి సోకని ప్రదేశములలో విశ్రాంతి తీసుకోవాలి. ఈ సమయములో మల, మూత్ర విసర్జనములు చేయవచ్చును. ఆరుద్ర, స్వాతి, శతభిషా నక్షత్ర జాతకులతో పాటు ప్రస్తుత రాహుమహాదశ జరుగుతున్న జాతకులపై గ్రహణ ప్రభావం స్వల్పం. ఆహార పదార్ధాలపై దర్భగానీ, నువ్వులుగానీ వేయవలెనని ధర్మ శాస్త్రమైన నిర్ణయసింధు పేర్కొంది. గ్రహణ పట్టుస్నానం, మోక్షస్నానం ఆచరించాలి. స్నానం ఆచరించే సమయములో ఎట్టి మంత్రాలనుగానీ, భగవత్ నామాలను గానే పఠించరాదు. స్నానమైన పిదపనే మంత్రములను, స్తోత్రములను మననం చేయవచ్చును. గ్రహణ సమయంలో పట్టు స్నానాంతరం జపించే మంత్రములకు సంఖ్యాబలం పెరుగును.

ధర్మ శాస్త్రమైన నిర్ణయసింధు నిర్ణయములు :

1. గ్రహణ సమయంలో చేసే స్నానాలలో మంత్రాలు జపించకూడదు.
2. ముత్తైదువులు పట్టుస్నానంలో శిరస్సు తడవకుండా స్నానం చేయాలి.
3. వైధవ్య స్త్రీలు పట్టుస్నానంలో శిరస్సు తడిపి స్నానం చేయాలి.
4. గ్రహణం ముగిసిన తదుపరి సర్వులు శిరస్సు తడిపి స్నానం చేయాలి.
5 .గ్రహణ సమయంలో ఆహారపదార్ధాలపై నువ్వులుగానీ, దర్భగానీ ఉంచాలి.
6. గ్రహణం ముగిసిన తదుపరి యజ్ఞోపవీతమును మార్చాలి.

ఈ గ్రహణ ప్రభావం జ్యోతిష్య శాస్త్ర రీత్యా మేషరాశి వారికి సోదర స్థానంలోనూ, వృషభ రాశి వారికి ఆర్ధిక స్థితి గతులపైన, మిధున రాశి వారికి వ్యక్తిగత విషయాలలోనూ, కర్కాటక రాశి వారికి ఖర్చు విషయాలపై, సింహరాశి వారికి లాభార్జనలపై, కన్యా రాశి వారికి నిత్య పరిపాలనా విషయాలపై, తులా రాశి వారికి పితృ స్థాన విషయాలపై వృశ్చిక రాశి వారికి ఆయుస్థాన సంబంధితములపై, ధనుస్సు రాశి వారికి కళత్ర విషయాలపై, మకర రాశి వారికి ఋణ, రోగ, శత్రు సంబంధితములపై, కుంభ రాశి వారికి సంతాన విషయాలలోనూ, చివరగా మీన రాశి వారికి వృత్తి, వ్యాపార, విద్య, ఉద్యోగ, ఆరోగ్య, గృహ, మాతృ స్థానములపై ప్రభావం ఉండును గనుక ఆయా రాశుల వారు పై విషయాలలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

Tuesday, December 29, 2009

చూడండి గ్రహబలం

భారత కాలమాన ప్రకారం ప్రతిరోజు ఉదయం 7.30 గంటలకు జాతకపరంగా సమస్యలకు, సందేహాలకు ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు సమాధానములు భక్తి టివిలో కేంద్ర ప్రభుత్వ ఆమోద గణిత పంచాంగ కర్త, మహాశక్తి ఉపాసకులు, కుర్తాళం సిద్దేశ్వరి ఆస్థాన సిద్దాంతవర్యులు, ద్విశతాధిక ప్రతిష్టాచార్య, త్రిస్వర్ణ ఘంటా కంకణ గ్రహీత, త్రికాలజ్ఞాన విభూషణ, ఓంకార మహాశక్తి పీఠ ధర్మాధికారి దైవజ్ఞ పొన్నలూరి శ్రీనివాసగార్గేయ గారిచే లైవ్ కార్యక్రమం వుండును.

Saturday, August 22, 2009

సర్వవిఘ్నోప శాంతయే!

సాక్షి దినపత్రిక సౌజన్యంతో...