Thursday, January 13, 2011

దశాబ్దాల తరువాత అరుదైన భోగి


ప్రతి సంవత్సరం ఆంగ్ల నెలల ప్రకారం జనవరి నెలలోనూ, తెలుగు నెలల ప్రకారం పుష్య మాసంలోనూ శ్రద్ధతో ఆచరించే పెద్దల పండుగగా పేరొందిన పెద్ద పండగే మకర సంక్రాంతి. దక్షిణాయనానికి ఆఖరి రోజు, ధనుర్మాసానికి ఆఖరిరోజు, మకర సంక్రాంతి కి ముందు రోజు భోగి పండుగ. నిఘంటువు ప్రకారం భోగి అంటే తొలిరోజు అని అర్ధం. పెద్ద పండుగగా పిలువబడే మూడు రోజుల సంబరాల సంక్రాంతికి తొలిరోజును భోగిగా పిలుస్తారు.

వ్యవసాయ పనుల రద్దీ తగ్గి అన్నదాతలు సుఖంగా కాలక్షేపం చేయటానికి, చేతికందిన పంటను అనుభవానికి తెచ్చుకొని భోగభాగ్యాలు అనుభవించటానికి వీలు కలిగించే పండుగ భోగి పండుగ అని పెద్దలు అంటారు. భోగి రోజున రైతులందరూ సంవత్సరం పొడవునా వ్యవసాయ పనులు చేయగా వచ్చిన చెత్త చెదారం అంతా ఈరోజు వేకువజామునే మంటలుగా వేసుకుంటారు.

గృహంలో వున్న పాత కర్ర సామాను, పనికిరాని వస్తువులు అన్నింటిని మంటలలో వేస్తారు. పరోక్షంగా ఈ మంటలనే వరుణయాగాలుగా పిలవాలసి వుంటుంది. ఎందుకంటే వరుణ దేవుని కరుణ కటాక్షాలతో అన్నదాతల ముంగిళ్ళలోకి దాన్యం రావటం, ఆనందంతో వుండటం, తరువాత సంవత్సరం కూడా ఎలాంటి సమస్యలు లేకుండా వ్యవసాయానికి వరుణుడు అనుగ్రహించాలనే దృక్పదంతో ఈ మంటలను వేయటం అంతర్గత రహస్యం. మేఘాలకు అధిపతైన వరుణ దేవుడిని గ్రామీణులు మంటల రూపంలో ప్రార్ధిస్తారు. ద్వాపర యుగంలో ఈ భోగి పండుగరోజు వేసే మంటలు మేఘాదిపతిని ప్రార్ధించటానికని పురాణాలు చెబుతున్నాయి.

ఈ 2011 సంవత్సరంలో అరుదైన భోగి రానున్నది. శుక్రవారం భోగి పండుగ రావటం విశేషమేమికాదు కానీ శుక్రగ్రహ నక్షత్రమైన భరణి నక్షత్రంతోనూ, శుక్ర గ్రహ వారమైన శుక్రవారంతోనూ భోగి రావటంమాత్రం అత్యంత అరుదైనది. పదమూడు దశాబ్దాల క్రితం అంటే 130 సంవత్సరాల క్రితం శుక్రవారం భరణి నక్షత్రంలో భోగి పండుగ వచ్చింది. తిరిగి ఇంత కాలానికి ఈ జనవరి 14 శుక్రవారం భరణి నక్షత్రంతో భోగి పండుగ రానున్నది. ఈ భరణి నక్షత్ర శుక్రవారంతో కూడిన భోగి రోజున మహాలక్ష్మి దేవిని మనసారా భక్తితో కొలిస్తే భోగభాగ్యాలతో తులతూగుతారని పెద్దలు చెబుతారు.

గృహాలలో శ్రీ చక్ర మేరు వున్నవారు ఈ భరణి నక్షత్ర భోగి రోజున ఈ క్రింది మంత్రంతో మహాలక్ష్మిని ఆరాధించండి.

ఓం శ్రీం హ్రీం ధ్ర్రాం క్లీం ధన్యే ధనవర్ధిని సుమేరు మధ్య శృంగస్తా శ్రీమన్నగరనాయికా నమః ( లలితా సహస్రనామ స్తోత్రంలో 22 వ సంఖ్యలో వున్న రెండు పంక్తులలో మొదటి పంక్తి ) అంటూ 108 పర్యాయములు జపించి తీపి పదార్ధ నివేదనతో శ్రీమహాలక్ష్మిని సేవించాలి.

భూ ప్రస్తార మేరు వున్నవారు ఈ భరణి నక్షత్ర భోగి రోజున ఈ క్రింది మంత్రంతో మహాలక్ష్మిని ఆరాధించండి.

ఓం శ్రీం హ్రీం ధ్ర్రాం క్లీం ధన్యే ధనవర్ధిని ధరాధరసుతా ధన్యా ధర్మిణీ ధర్మవర్ధినీ నమః ( లలితా సహస్రనామ స్తోత్రంలో 176 వ సంఖ్యలో వున్న రెండు పంక్తులలో మొదటి పంక్తి ) అంటూ 108 పర్యాయములు జపించి తీపి పదార్ధ నివేదనతో శ్రీమహాలక్ష్మిని సేవించాలి.

శ్రీ చక్ర మేరు, భా ప్రస్తారములు లేనివారు మహాలక్ష్మి దేవి చిత్రపటాన్ని వుంచి ఓం శ్రీం హ్రీం ధ్ర్రాం క్లీం ధన్యే ధనవర్ధిని శ్రీమహాలక్ష్మి దేవతాభ్యో నమః అంటూ 108 పర్యాయములు జపించి తీపి పదార్ధ నివేదనతో శ్రీమహాలక్ష్మిని సేవించాలి.

Friday, November 5, 2010

అర్దరాత్రి లక్ష్మీ పూజ ఉత్తమోత్తమం

శ్రీ వికృతి నామ సంవత్సర ఆశ్వీయుజ అమావాశ్య 5 డిసెంబర్ 2010 శుక్రవారం నాడు జరుపుకుంటున్నాం. చిత్త, స్వాతి నక్షత్రాలలోనే దీపావళి పర్వదినం వస్తూ వుంటుంది. స్వాతి కార్తెలో, స్వాతి నక్షత్రంలో, శుక్రవారం నాడు అరుదుగా దీపావళి వస్తూ వుంటుంది. కొంతమంది 6 వ తేదీ దీపావళి అనుకుంటున్నారు. ధర్మశాస్త్రాల నిర్ణయానుసారం 5 వ తేదే దీపావళి.

ఈరోజున జరిగే లక్షీ పూజ సమయం విషయంలో కొంతమంది ప్రసార మాధ్యమాలలో అర్దరాత్రి సమయం చేయకూడదని, సాయంకాలమే చేయవలెనని తెలియచేస్తున్నారు. వర్షక్రియా కౌముది, నిర్ణయ సింధు, భవిష్య పురాణం మొదలైన గ్రంధాల ప్రకారం సాయంకాల సమయంలో లక్ష్మీ పూజ ఆచరించిననూ తప్పు కాదు. కానీ అర్దరాత్రి సమయంలో లక్ష్మీ పూజ ఆచరించినచో ఉత్తమోత్తమం అని శాస్త్ర వచనం. ఈ రోజు రాత్రి కర్కాటక లగ్న సమయంలో 11 .30 నిమిషాల నుంచి 12 గంటల వరకు లక్ష్మీ పూజను ఆచరించి, జ్యేష్టా దేవినీ తరిమికొట్టండి. భవిష్య పురాణం ప్రకారం చేట మీద చప్పుల్లతోనూ, డక్కా వాయుద్యంతోనూ దరిద్ర దేవతను తరమాలని వచనం. లక్ష్మీ దేవి చంచల మనస్కురాలు. చంచలత్వానికి కారకుడు చంద్రుడు. కనుకనే జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఆశ్వీయుజ అమావాశ్య కర్కాటక లగ్నమే అర్దరాత్రి అవుతుంది. ఈ లగ్నానికి చతుర్ధం అనే తులా రాశి గృహస్థానం అవుతుంది. అలాగే ఏకాదశమైన తులారాశి లాభ స్థానమవుతుంది. ఈ రెండు రాశులకు అధిపతి శుక్రగ్రహము. బంగారు ఆభరణాలకు, అష్టైశ్వర్యములకు ప్రతీక శుక్రుడు. కనుక ఆ శుక్రుని అనుగ్రహం కూడా కలగటానికి కర్కాటక లగ్నాన్ని మనం స్వీకరించాలి.

నువ్వుల నూనెలో లక్ష్మీదేవి నివాసమని శాస్త్ర వచనం. కనుక ఈ రోజు నువ్వుల నూనె వెలిగించిన జ్యోతితో లక్ష్మీదేవిని ఆరాధిస్తూ, మధుర పదార్ధాన్నిఆ తల్లికి నివేదించాలి. ఈ మధుర పదార్ధాలలో ముఖ్యంగా తెల్ల నువ్వులు, బెల్లము, పాలు, నెయ్యి, బియ్యం అను వాటితో పొంగలిని (శ్వేత తిల ఘ్రుత పాయసాన్నం) నివేదన చేయండి. అర్దరాత్రి లక్ష్మీ దేవినీ ఆరాధించకూడదు అని చెప్పే శాస్త్ర వచనాలు లేవు. తెలిసీ తెలియని వారు ప్రసార మాధ్యమాల ద్వారా చెప్పటంతో చాలా మంది అయోమయంలో పడుతున్నారు.

కేదార వ్రతాన్ని నూతనంగా ఆచరించేవారు స్వాతి కార్తె స్వాతి నక్షత్ర అమావాశ్య రోజున వ్రతాన్ని ఆచరించాలి. ఈ విధంగా 3 లేక 4 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే స్వాతి కార్తె స్వాతి నక్షత్ర అమావాశ్య వస్తుంటుంది. ఎప్పటినుంచో కేదార వ్రతాన్ని ఆచరించేవాళ్ళు ఈరోజూ చేయవచ్చు అలాగే రేపూ ఆచరించవచ్చు. నిబంధన లేదు. దీపావళి రోజున మాష పాత్ర భక్షణము చేయవలెనని శాస్త్ర నిర్దేశము. మాష పత్రమనగా మినప ఆకు. నవధాన్యాలలో రాహు గ్రహ సంబంధిత ధాన్యమే మినుములు. దీపావళి రాహు నక్షత్రమైన స్వాతిలో వచ్చిన రోజున మినప ఆకులను తింటే శుక్ర లోపములు పూర్తిగా పోగలవని శాస్త్ర వచనం.

ఉగాదికి వేప పూవు పచ్చడి, శ్రీరామనవమి ముందు రోజు ఆశోకాష్టమికి ఆశోక చెట్టు మొగ్గలు, ఆషాడ మాసంలో మునగాకు కూర, ఏకాదశి వెళ్ళిన ద్వాదశి పారణంలో అవిశాకు కూర, అలాగే దీపావళిన మినపాకు సేవించవలెనని శాస్త్ర వచనాలు ఉన్నవి.

Saturday, October 23, 2010

అక్టోబర్ 29 శుక్రవారం బంగారం కొనవద్దు

అక్షయ తదియ రాగానే బంగారం కొనుగోలు చేయటం గత దశాబ్ద కాలంగా ఆనవాయితీ అయింది. అక్షయ తదియ రోజున బంగారం కొంటే, సంవత్సరం అంతా బంగారం ఎక్కువగా కొంటారనే ఉద్దేశ్యంతో వ్యాపార సంస్థలు భారీ ప్రకటనలతో చాటటం మనకి తెలిసిన విషయమే. ఆనాడు బంగారం కొని, తదుపరి రోజులలో అప్పుల పాలై, కొన్న బంగారంతో పాటు అంతకుముందున్న బంగారాన్ని కూడా అమ్మివేసిన వారు ఎంతో మంది వున్నారు. అక్షయ తదియ నాడు బంగారం కొనుగోలు చేయాలని చెప్పే శాస్త్ర ప్రమాణాలు లేనేలేవు. ఇది ఒక సెంటిమెంటల్ గోల్డ్ ఫెస్టివల్. కానీ ఇందుకు భిన్నంగా నేను చెప్పబోతున్న మరొక అంశం ఏమిటంటే.....

2010 అక్టోబర్ 29 శుక్రవారం రోజున బంగారము, పట్టు, సిల్క్ ఇతర వస్త్రాలు, గృహాలంకరణ వస్తువులు, సౌందర్యాలంకరణ సామగ్రి, టెలివిజన్, సెల్ ఫోన్, కంప్యూటర్ తదితర ఎలక్ట్రానిక్ ఉపకరణములను కొనుగోలు చేయకండి. ఆరోజు కొనుగోలు చేయాలనుకున్నవారు ముందు రోజైన 28 గురువారం లేక తరువాత రోజు 30 శనివారం గానీ కొనుగోలు చేయండి. 29 శుక్రవారం మాత్రం వద్దు.

అక్షయ తదియ నాడు కొనుగోలు చేయమని చెప్పే శాస్త్ర ప్రమాణాలు లేవు కదా ! మరి 29 కొనుగోలు వద్దని చెప్పే కారణాలు ఏమిటని అనుకోవచ్చు. ఆశ్వీజ పూర్ణిమ నుంచి అమావాశ్య వరకు కన్యా, తుల, వృశ్చిక, ధను రాశులపై షడ్గ్రహ, సప్తగ్రహ ఆచ్చాదనలుండి, శుక్రుడికి మౌద్యమి సంభవించిన తదుపరి వచ్చే మొదటి శుక్రవారం నాడే ఓ గ్రహస్థితి వుంది. అదేమంటే అసలే వక్ర శుక్రుడు. దానికి తోడు మౌద్యమి. పైగా రాహు నక్షత్రమైన స్వాతిలో ఒకే బిందువులో నీచ రవితో శుక్ర కలయిక, కించిత్ వైరమున్న వక్ర గురువు యొక్క దిన నక్షత్రం పునర్వషు... ఇన్నింటి కారణంగా శుక్ర గ్రహ సంబంధమైనవి కొనుగోలు చేయకూడదు. కొనుగోలు చేస్తే సమస్యలు రాగల అవకాశాలు చాలా వున్నవి. కనుక జ్యోతిశ్శాస్త్రంపై విశ్వాసం వున్నవారు దయచేసి కొనుగోలు చేయకండి. బంగారం ధర తగ్గితే కొందామని కూడా అనుకోకండి.

Tuesday, September 28, 2010

కుజదోషంపై నిజానిజాలు - 2

కుజదోషం అని పండితులు చెప్పగానే వధూవరుల తల్లితండ్రులు కుమిలి కుమిలి పోతుంటారు. అలా బాధపడే వారందరూ సంతోషంగా ఉండాలనే ఉద్దేశ్యంతోనే..."కుజదోషంపై నిజానిజాలు" రెండవ భాగమును ఇవ్వటము జరిగింది

జాతకాలలో కుజగ్రహం జన్మలగ్నము నుంచి 2, 4, 7, 8, స్థానాలలో వుంటే కుజదోషముండునని మొదటి భాగం లో తెలుసుకున్నాము. మరి ఈ కుజదోషం కొందరికి వర్తించదని శాస్త్రాలు చెబుతున్నాయి. ఎవరెవరికి ఈ కుజదోషం వర్తించదో ముందు తెలుసుకుందాం.

జ్యోతిశ్శాస్త్రం ప్రకారం కుజగ్రహం తన నీచస్థానమైన కర్కాటక రాశిలో వుండి వుంటే, అట్టివారికి కుజదోషం వర్తించదని భావం. అలాగే కుజుడికి తన స్వక్షేత్రములైన మేష వృశ్చిక రాశులలో గానీ, ఆయా లగ్నాలలో గానీ జన్మించి వుంటే కుజదోషం వర్తించదు. కుజగ్రహానికి మిత్రులైన రవి గురుల రాశులైన సింహ, ధనుస్సు, మీన రాశులలో గానీ, లగ్నాలలో గానే జన్మించివుంటే కుజదోషము వర్తించదు. కుజగ్రహానికి ఉచ్చస్థానమైన మకరరాశి యందు లేక మకరలగ్న మందు జన్మించిన వారికి కుజదోషము వర్తించదు.

మేష, వృశ్చిక, కర్కాటక, సింహ, ధనుస్సు, మకర, మీన రాశులలో గానీ, లగ్నాలలో జన్మించిన వారికి కుజదోషం భంగమగునని, భయపడవలసిన అవసరం లేదని........ పైన పేర్కొన్న పేరా సారాంశం. మొత్తం 12 రాశులలో 7 రాశుల జాతకులు పోనూ..... మిగిలిన అయిదు రాశుల జాతకులకు కుజదోషం వుంటే భంగం కాదనే కదా సారాంశం. మరి ఆ రాశులు ఏమిటంటే... వృషభ, మిధున, కన్య, తుల, కుంభ రాశులు... మరి ఈ రాశులలో మాత్రమే గాక మొత్తం 12 రాశులలో ఏ రాశివారికైన కుజదోషం వుండి వుంటే, వారి జాతకంలో కుజుడిని, గురుగ్రహం విశేష దృష్టులతో చూస్తూవుండిననూ కుజదోషం వర్తించదనే శాస్త్ర నిర్ణయములున్నవి.

పై నిర్ణయములు గాక రెండవ స్థానంలో కుజుడు దోషరూపంలో వుండి... వారు మిధున కన్యారాశులలో గానీ, మిధున కన్యాలగ్నాలలోవుండిన కుజదోషం వర్తించదనే శాస్త్రప్రమాణమున్నది. అనగా 4, 7, 8 స్థానాల దోషం భంగపడదు. కేవలం రెండవ స్థాన దోషం భంగమగునని ఉద్దేశ్యం. మరి ఈ విషయం 2 వ స్థాన దోషం వారికి ఊరట నిచ్చే మాట.

నాల్గవ స్థాన కుజదోషం వున్నవారు మేష వృశ్చిక రాశులలో గానీ, మేష వృశ్చిక లగ్నాలలో గానీ జన్మించి వుంటే కుజదోషం వర్తించదు. అంటే 2, 7, 8 స్థానాల లోపం ఉంటుందని భావం. అలాగే సప్తమ స్థానంలో కుజదోషం వున్నవారు మకర కర్కాటక రాశులలో గానీ, మకర కర్కాటక లగ్నాల యందు గానీ జన్మించి వుంటే 7 వ స్థాన కుజదోషం భంగమగునని, రెండు, నాలుగు, ఎనిమిది స్థానాలలో భంగం కాదని శాస్త్ర నిర్దేశం.

ఇక అష్టమ స్థాన కుజదోషం వున్నవారు ..... ధను, మీన రాశులలో లేక లగ్నాలలో జన్మించి వుంటే.... వారికి అష్టమ స్థాన కుజదోషం వర్తించదు. ఈ కుజదోషమనేది జన్మ లగ్నం నుంచే వుంటుంది. జనం లగ్నం నుంచే లెక్కించాలి. చంద్రుడు ఉన్న రాశి నుంచి, శుక్రుడు ఉన్న రాశి నుంచి, కుజ దోష స్థానాన్ని చూడవలసిన అవసరం లేదు. ఆ విధంగా చూస్తే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి జన్మ లగ్నం నుంచి, చంద్రుడి నుంచి శుక్రుడి నుంచి కుజదోషం వుండి తీరుతుంది. ఇది సరియిన సక్రమమైన వివరం కాదు. కేవలం జన్మ లగ్నం నుంచి మాత్రమే కుజదోషాన్ని లెక్కించాలి. అశ్విని, మృగశిర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, ఉత్తర, స్వాతి, అనూరాధ, పూర్వాషాడ, ఉత్తరాషాడ, శ్రవణం, ఉత్తరాభాద్ర, రేవతి అను పదమూడు నక్షత్రములలో జన్మించిన వారికి కుజగ్రహం... ఏ స్థానంలో ఉన్ననూ.. కుజదోషం ఉండదని శాస్త్ర నిర్దేశము. ఇరవై ఏడు నక్షత్రాలలో జన్మించిన ఏ ఒక్కరూ కుజదోషం గురించి బెంగ పడాల్సిన అవసరం లేనేలేదు. కుజదోషం ఉన్ననూ.. దైర్యంగా వుండండి... ఎలా ఉంటాము దైర్యంగా ? అని అనుకుంటున్నారా.... నిజమే మరి అసలుసిసలైన వాస్తవాలను తదుపరి కుజదోషంపై నిజానిజాలు - 3 అను పోస్టింగ్ కొరకు వేచి చూడండి... నగ్న సత్యాలను తెలుసుకోండి.

Tuesday, September 21, 2010

కుజదోషంపై నిజానిజాలు - 1


వివాహ ప్రయత్నాలు ఆలశ్యమవుతున్నా, వివాహమైన తదుపరి సమస్యలు తలెత్తుతున్నా, అందరికీ వెంటనే గోచరించేది కుజదోషం. కుజదోషం వున్నవారు కుజదోషం వున్న వారినే వివాహమాడాలని అంటాము. మరి ఈ కుజదోషం ఎవరెవరికి వుంటుంది ? నిజంగా కుజదోషమున్నవారికి లేదని, కోజదోషం లేనివారికి వున్నదని చెప్పే పండితులు కూడా ఈమధ్యకాలంలో సిద్ధమవుతున్నారు. ఏ చిన్నపాటి సమస్యకైనా, ఓ పండితుడిని దంపతులు గానీ, దంపతుల తల్లితండ్రులు గానీ విచారించగానే, ముందుగా ఆ పండితుల వారు సెలవిచ్చేది కుజదోషం వుందని లేక కాలసర్పదోషముందని, ఈ కుజదోషం వలన భార్య భర్తలలో ఒకరికి మరణం త్వరలో వుందని, భయభ్రాంతులయ్యే సంభాషణలతో పండితుడు చెప్పగానే, ఆ మాటలు విన్న దంపతులకో లేక వారి తల్లితండ్రులకో ప్రాణాలు అప్పుడే గాలిలో కలిసిపోయే విధంగా వుంటాయి.


ఈ కుజదోషం గురించిన సంపూర్ణ చరిత్రను గురించి తెలుసుకుంటే ఎవరు... ఏ మాట చెప్పినా భయపడాల్సిన అవసరము వుండదు. రాశి చక్రములో మేష, వృశ్చిక రాశులకు అధిపతి కుజుడు. అగ్నితేజో సంపన్నుడు. ఇట్టి కుజుడు జాతక చక్రములో జన్మ లగ్నము నుంచి 2, 4, 7, 8, 12 స్థానాలలో వుంటే కుజదోషం వుందని భావం. మరి 2 వ స్థానంలో కుజుడు వుంటే... కుటుంబ ధన సంపత్తులు కొన్ని కొన్ని కారణాల వలన హరించుకుపోతాయని భావం. ఇక 4 వ స్థానంలో కుజుడు వుంటే గృహలక్ష్మి భాగ్యములు దెబ్బతినటం, వాహన సంభందిత ప్రమాదములు, ఆరోగ్య లోపములు ఏర్పడునని గ్రహించాలి. 7 వ స్థానంలో కుజుడు వుంటే కళత్ర సుఖ భోగ భాగ్యములు తగ్గిపోవునని, భార్యాభర్తల మధ్య భేదాభిప్రాయములు ప్రారంభమగునని భావం. 8 వ స్థానంలో కుజుడుంటే ఆయుర్భాగ్యం తగ్గునని, పూర్ణ ఆయుర్దాయమునకు దూరమని భావం. 12 వ స్థానంలో కుజుడు వుంటే మోక్షలక్ష్మీ భాగ్యములు అంతరించి పోతాయని విశ్వసించాలి. కుజుడు ఆయా స్థానాలలో వుండిన పురుషునికి భార్య వియోగము, భార్యకు భర్త వియోగము కల్గును.


ఈ వియోగం ఎప్పుడు కలుగుతుంది ? వివాహం కాగానేనా ? లేక కొన్ని సంవత్సరాలు దాంపత్యం జరిగిన తదుపరా ? ఖచ్చితమైన సమాధానం ఏమిటంటే... ఏ జాతకులైన కుజదోషం వుంటే.... దాని ప్రభావం, కుజ మహాదశ జరిగే సమయంలోనే సమస్యలు వస్తాయి. ముందు రానే రావు. ఈ నగ్న సత్యాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా వుందని మొట్ట మొదట గ్రహించాలి. ఇక 27 నక్షత్రాలలో జన్మించిన వారి వివరాలలోకి వెడితే అందరికీ తెలియని ఆసక్తికర అంశాలెన్నో రేపటి రెండవ భాగంలో తెలుసుకుందాము.